Petro rates: మేం తగ్గించలేం

పెట్రోలు, డీజిల్‌ ధరల్ని తగ్గించాల్సింది రాష్ట్ర ప్రభుత్వం కాదని.. వాటిపై సెస్సుల రూపంలో లక్షల కోట్లు వసూలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వమే మరింత తగ్గించాలని మంత్రి పేర్ని నాని, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి డిమాండ్‌ చేశారు. భాజపా నాయకులకు నిజాయతీ, నిబద్ధత ఉంటే లీటరుపై రూ.5, రూ.10 కాకుండా మరో రూ.25 తగ్గించాలని ప్రధాని మోదీని అడగాలని, అందుకోసం దిల్లీలోని నార్త్‌ బ్లాక్‌, పార్లమెంటు ముందు ధర్నా

Updated : 09 Nov 2021 14:25 IST

 పెట్రో ధరలను కేంద్రమే రూ.25 తగ్గించాలి: పేర్ని నాని

భాజపా నేతలు దిల్లీలోనే ధర్నా చేయాలని సవాల్‌

భారీగా పెంచి డిస్కౌంట్‌ సేల్‌లా రూ.5, 10 తగ్గిస్తారా?: సజ్జల

కేంద్రంలా తేలిగ్గా నిర్ణయం తీసుకోలేం: బుగ్గన

పేర్ని నాని                   సజ్జల                       బుగ్గన

ఈనాడు డిజిటల్‌, అమరావతి: పెట్రోలు, డీజిల్‌ ధరల్ని తగ్గించాల్సింది రాష్ట్ర ప్రభుత్వం కాదని.. వాటిపై సెస్సుల రూపంలో లక్షల కోట్లు వసూలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వమే మరింత తగ్గించాలని మంత్రి పేర్ని నాని, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి డిమాండ్‌ చేశారు. భాజపా నాయకులకు నిజాయతీ, నిబద్ధత ఉంటే లీటరుపై రూ.5, రూ.10 కాకుండా మరో రూ.25 తగ్గించాలని ప్రధాని మోదీని అడగాలని, అందుకోసం దిల్లీలోని నార్త్‌ బ్లాక్‌, పార్లమెంటు ముందు ధర్నా చేయాలని పేర్ని నాని సవాల్‌ విసిరారు. కావాలంటే తాను కూడా వస్తానన్నారు. వైకాపా కేంద్ర కార్యాలయంలో నాని సోమవారం విలేకర్లతో మాట్లాడారు. ‘రూ.70 ఉండే డీజిల్‌, పెట్రోలు ధరలను రూ.108, రూ.117 వరకూ తీసుకెళ్లిన ఘనులు.. రాష్ట్ర ప్రభుత్వం ధర తగ్గించాలంటూ ఆందోళన చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉప ఎన్నికల్లో దెబ్బపడగానే దిగొచ్చి నాటకాలాడుతున్నారు. గ్యాస్‌పై లాభం గడించట్లేదా? రాష్ట్రంలో 2014 నుంచి పెట్రోలు, డీజిల్‌పై 31 శాతం వ్యాట్‌, అభివృద్ధి కార్యక్రమాలు, ఆర్థిక లోటు పూడ్చేందుకు రూ.4 అదనపు సెస్సు, రహదారుల అభివృద్ధికి రూ.1 సెస్సు వసూలు చేస్తుంటే.. ధరలు తగ్గించాలంటూ ఇప్పుడు భాజపా నేతలు ధర్నా చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కేవలం ఎక్సైజ్‌ డ్యూటీ మాత్రమే తగ్గించింది. ఏటా సెస్సుల రూపంలో వసూలు చేస్తున్న రూ.2.87 లక్షల కోట్లలో పైసా తగ్గించలేదు. ఆదాయంలో రాష్ట్రాలకు వాటా ఇవ్వాల్సి వస్తుందని సెస్సుల పేరుతో భారం మోపుతోంది’ అని నాని ధ్వజమెత్తారు. వాస్తవాలు చెప్పేందుకు ప్రకటనలివ్వడం ప్రజాధనం దుర్వినియోగమా అని ప్రశ్నించారు. ‘రోడ్లకు మరమ్మతులు చేస్తే అయిదేళ్లయినా బాగుంటాయి. మేం అధికారంలోకొచ్చిన ఏడాదికే రోడ్లు పాడయ్యాయంటే అర్థమేంటి? తెదేపా హయాంలో రహదారులు వేయకుండా డబ్బు తినేసి ఉండాలి లేదా నాసిరకంగా వేసి ఉండాలి’ అని వ్యాఖ్యానించారు.

ఆదాయం మీకు.. భారం మాపైనా?

కేంద్ర ప్రభుత్వం పెట్రోలు, డీజిల్‌పై వచ్చిన ఆదాయంలో వాటా ఇవ్వకపోగా కొవిడ్‌తో ఇబ్బందిపడుతున్న రాష్ట్రాల్ని ధర తగ్గించాలని కోరడం ఘోరమని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. దాదాపు 90 శాతంపైగా ఆదాయంలో రాష్ట్రాలకు వాటా ఇవ్వలేదన్నారు. ‘ఇంధన ధరలు భారీగా పెంచి డిస్కౌంట్‌ సేల్‌ మాదిరి రూ.5, రూ.10 తగ్గించారు. కేంద్రం పెట్రోలు, డీజిల్‌పై రూ.3.35 లక్షల కోట్లు పన్నుల ద్వారా వసూలు చేసింది. ఎక్సైజ్‌ డ్యూటీ ద్వారా వచ్చిన రూ.47,500 కోట్ల ఆదాయాన్నే రాష్ట్రాలకు పంచింది. మిగిలిన రూ.3.15 లక్షల కోట్లు కేంద్రం ఖాతాలోకే వెళ్లాయి. పెట్రోలు, డీజిల్‌ ధరల్ని మరింత తగ్గించాల్సిన బాధ్యత కేంద్రానిదే’ అని చెప్పారు. వైకాపా కేంద్ర కార్యాలయంలో సజ్జల సోమవారం విలేకర్లతో మాట్లాడారు. ‘రాష్ట్ర ప్రభుత్వం పెట్రోలుపై వ్యాట్‌ తగ్గించాలంటూ భాజపా ఎంపీ జీవీఎల్‌ నరసింహరావు విచిత్ర వాదన తెచ్చారు. అన్ని రాష్ట్రాలకు వ్యాట్‌ ద్వారా రూ.2.21 లక్షల కోట్లు వచ్చిందన్నారు. కేంద్రానికి సెస్సుల రూపంలో వచ్చినవి పంచలేదని అడిగితే.. రాష్ట్రాలకు వచ్చిన ఆదాయాన్ని చూపించడం తప్పుదోవ పట్టించడం కాదా?  రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంధన ధర తగ్గించాలని ధర్నాలు చేస్తామని చంద్రబాబు అంటున్నారు. ఇది తెదేపా హయాంలో చేసిన పాపాల్ని కప్పిపుచ్చుకోవడానికే’ అని విమర్శించారు.

ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి

అన్ని పన్నులు జీఎస్టీ పరిధిలో ఉన్నందున రాష్ట్రాలకు ఎక్సైజ్‌, పెట్రో ఉత్పత్తులపై పన్నులు మాత్రమే ఆదాయ వనరులుగా ఉన్నాయని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఆయన దిల్లీలో విలేకర్లతో మాట్లాడుతూ.. పన్నులపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్నంత సులభంగా తాము నిర్ణయాలు తీసుకోలేమని చెప్పారు. దీనిపై ఆచితూచి నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ఓ ప్రశ్నకు బదులిచ్చారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని