Amaravathi:అమరావతిలో సీజేఐకి అపూర్వ స్వాగతం

దారి పొడవునా మానవహారం.. అడుగడుగునా పూలవర్షం.. దూరం నుంచే హారతులిస్తూ అభిమానాన్ని చాటుకున్న జనం.. త్రివర్ణ పతకాలు చేతబూని నీరాజనం.. ఇలా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి

Updated : 27 Dec 2021 05:32 IST

సీజేఐ హైకోర్టుకు వచ్చే దారి పొడవునా మానవహారం..

అడుగడుగునా పూలవర్షం

3 కి.మీ. బారులు తీరి స్వాగతించిన రైతులు, ప్రజలు

వాహనంలోనే నిల్చుని అభివాదం చేస్తూ ముందుకు సాగిన సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ

ఈనాడు, అమరావతి, న్యూస్‌టుడే, తుళ్లూరు గ్రామీణం: దారి పొడవునా మానవహారం.. అడుగడుగునా పూలవర్షం.. దూరం నుంచే హారతులిస్తూ అభిమానాన్ని చాటుకున్న జనం.. త్రివర్ణ పతకాలు చేతబూని నీరాజనం.. ఇలా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ ఎన్‌.వి.రమణకు అమరావతి ప్రాంత ప్రజలు, రైతుల నుంచి అపూర్వ స్వాగతం లభించింది. ఆదివారం హైకోర్టు ప్రాంగణంలో జరిగిన కార్యక్రమానికి విచ్చేసిన సీజేఐకి స్వాగతం పలికేందుకు రాజధానిలోని వివిధ గ్రామాల నుంచి ఉదయం 10 గంటలకే రైతులు, ప్రజలు పెద్ద ఎత్తున రాయపూడి, నేలపాడు తదితర ప్రాంతాలకు చేరుకున్నారు. మధ్యాహ్నం 2.45 గంటల జస్టిస్‌ ఎన్‌.వి.రమణ వచ్చేవరకు వేచి ఉండి, రాయపూడి కూడలి నుంచి నేలపాడులోని హైకోర్టు ప్రాంగణం వరకూ దాదాపు మూడు కిలోమీటర్ల మేర రహదారికి ఒకవైపున మానవహారంగా నిలుచుని స్వాగతం పలికారు. సీజేఐ ప్రయాణించే దారి మొత్తం పూల జల్లు కురిపించారు. కొందరు మహిళలు దూరం నుంచే ఆయనకు హారతులిచ్చి అభిమానాన్ని చాటుకున్నారు. ‘తెలుగు జాతి ముద్దుబిడ్డకు స్వాగతం’, ‘రైతు పుత్రుడా.. ధర్మ రక్షకుడా! హక్కులకు దిక్కులేని చోట మీరే న్యాయానికి దిక్సూచి’, ‘తెలుగు తేజమా మీకు వందనం.. తెలుగుజాతి ముద్దు బిడ్డను చూసి మురిసింది ఈ గడ్డ’, ‘రైతు బిడ్డ కష్టం సామాన్యుడికి దక్కుతున్న న్యాయం’ వంటి నినాదాలు, జస్టిస్‌ ఎన్‌.వి.రమణ చిత్రాలతో కూడిన ప్లకార్డులను ప్రదర్శిస్తూ స్వాగతం పలికారు. వెలగపూడికి చెందిన ఒక రైతు.. తన కుటుంబంలోని నాలుగు తరాలవారు పండించిన చెరకు, అరటి, రేగు, జామ, కొబ్బరి పంటలను చేతబూని జస్టిస్‌ ఎన్‌.వి.రమణకు స్వాగతం పలికారు.  ‘తెలుగు జాతి ఔన్నత్యాన్ని చాటి చెప్పి. భారతదేశపు న్యాయవ్యవస్థ అత్యున్నత శిఖరాన్ని అధిరోహించిన తెలుగుజాతి ఆణిముత్యం జస్టిస్‌ నూతలపాటి వెంకటరమణకు వందనం.. అభివందనం’ అంటూ రాజధాని అమరావతి ప్రాంత ప్రజలు పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని