Andhra News: కరెంటు షాక్‌

ఇళ్లకు వాడే కరెంటు ఛార్జీలు అమాంతం పెంచి.. ప్రభుత్వం వినియోగదారులపై పెనుభారం మోపింది. హఠాత్తుగా వచ్చే నెల నుంచే పెంపు అంటూ.. మండు వేసవిలో ఫ్యాన్‌ వేసుకోవడానికి కూడా

Updated : 31 Mar 2022 05:44 IST

జనంపై ఒక్కసారే రూ.1400 కోట్ల భారం

కనిష్ఠంగా యూనిట్‌కు 45 పైసలు.. గరిష్ఠంగా రూ.1.57

కొత్త ఛార్జీలు ఏప్రిల్‌ నుంచే అమల్లోకి

గోశాలలకు రాయితీ

సామాన్యులపై మోయలేని భారం మోపారని మండిపడ్డ ప్రతిపక్షాలు

ఇళ్లకు వాడే కరెంటు ఛార్జీలు అమాంతం పెంచి.. ప్రభుత్వం వినియోగదారులపై పెనుభారం మోపింది. హఠాత్తుగా వచ్చే నెల నుంచే పెంపు అంటూ.. మండు వేసవిలో ఫ్యాన్‌ వేసుకోవడానికి కూడా జనం భయపడే పరిస్థితి తీసుకొచ్చింది.. 

ఈనాడు - తిరుపతి

గృహ విద్యుత్తు వినియోగదారులకు రాష్ట్ర ప్రభుత్వం షాక్‌ ఇచ్చింది. ఏకంగా ఒక్కసారే రూ.1400 కోట్ల భారాన్ని మోపింది. పైగా ముందు చెప్పినట్లుగా ఆగస్టు నుంచి కాకుండా ఏప్రిల్‌ నుంచే ఛార్జీలను పెంచుతోంది. దీనికి అదనంగా సర్దుబాటు (ట్రూ అప్‌) పేరుతో మరో మోత మోగించనుంది. వాటిని నెలవారీ వాయిదాల్లో అదనంగా వసూలు చేయనుంది. 2022-23 ఆర్థిక సంవత్సర విద్యుత్తు ఛార్జీల వివరాలను బుధవారం తిరుపతిలో ఏపీఈఆర్సీ ఛైర్మన్‌ జస్టిస్‌ సి.వి.నాగార్జునరెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా సభ్యులు టి.రాంసింగ్‌, పి.రాజగోపాల్‌రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. విద్యుత్తు ఛార్జీల పెంపు అనివార్యమని పేర్కొన్నారు. డిస్కంలను బలోపేతం చేయకపోతే వాటి మనుగడ ప్రశ్నార్థకం అవుతుందని చెప్పారు. 20 ఏళ్లుగా వినియోగదారులపై ఎక్కడా భారం మోపలేదని వెల్లడించారు. 75 యూనిట్ల వినియోగ టారిఫ్‌ ఇప్పటికీ సరఫరా వ్యయంలో 50% కంటే తక్కువే ఉందని, పేద వినియోగదారుల కోసం 0-30 యూనిట్ల కొత్త శ్లాబు ప్రవేశపెట్టినట్లు వెల్లడించారు. గృహ వినియోగదారులకు టారిఫ్‌ పెంపుదలతో పంపిణీ సంస్థలకు దాదాపు రూ.1400 కోట్ల అదనపు ఆదాయం లభిస్తుందని వెల్లడించారు. వినియోగదారులకు రూ.11,123 కోట్ల రాయితీని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.

రూ.45,972.70 కోట్ల ఆదాయ అంచనా..
‘మూడు పంపిణీ సంస్థలకు 2022-23 ఆర్థిక సంవత్సరానికి మొత్తం ఆదాయ అవసరం రూ.45,398.66 కోట్లు. ప్రస్తుత ధరలవద్ద రూ.10,932.99 కోట్ల లోటు ఉంటుంది.
గృహ వినియోగదారులకు ఛార్జీల పెంపుతో లోటు రూ.10,045.61 కోట్లకు తగ్గుతుంది. ఈ అంతరాన్ని కాస్ట్‌ టారిఫ్‌ రికవరీలతో భర్తీ చేయాలని పంపిణీ సంస్థలు ప్రతిపాదించాయి. చాలామంది దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో మిగిలిన లోటును భరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. ఇందులో కేటగిరీ-5 వ్యవసాయ-ఎల్‌టీ కింద ఉచిత విద్యుత్తు సరఫరాకు అర్హులైన వినియోగదారులకు రూ.9,513 కోట్ల రాయితీ ఉంది. కేటగిరీ-1 గృహ వినియోగదారులు (డొమెస్టిక్‌)- ఎల్‌టీ రాయితీ ధరల్లో విద్యుత్తు పొందేందుకు రూ.437 కోట్లను ప్రభుత్వం చెల్లించనుంది. రాయితీ/ఉచిత విద్యుత్తు కారణంగా ఉత్పన్నమయ్యే రూ.1588 కోట్లు ఇచ్చేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. రాష్ట్రంలోని 191 లక్షల మంది వినియోగదారుల్లో 20.76 లక్షల మందికి ఏ విధమైన పెంపూ ఉండదు. రైస్‌ మిల్లులు, పల్వరైజింగ్‌ మిల్లులు, గ్రానైట్‌ పరిశ్రమలకు ఎల్‌టీ సరఫరా కింద 150 హెచ్‌పీ వరకు అనుమతించనున్నాం.

విడివిడిగా టారిఫ్‌
132 కేవీ, 220 కేవీ వోల్టేజీ వద్ద అనుసంధానించిన వినియోగదారులకు విడివిడిగా టారిఫ్‌లను నిర్ణయించాం. వీటి మధ్య సర్వీసు ఖర్చులో తేడా లేకున్నా 132 కేవీ వినియోగదారుల కంటే 220 కేవీ వోల్టేజ్‌ వినియోగదారులకు 5 పైసలు తక్కువ టారిఫ్‌ను విధించాం. ఓపెన్‌ యాక్సెస్‌/బల్క్‌ వినియోగదారుల రియల్‌టైం మార్కెట్‌ వినియోగాన్ని పరిమితం చేయాలనే ప్రతిపాదనను తిరస్కరించాం. క్యాప్టివ్‌, కోజెన్‌ ప్లాంట్లపై నెలకు కిలోవాట్‌కు రూ.237.50 గ్రిడ్‌ సపోర్ట్‌ ఛార్జీలను విధించాలని పంపిణీ సంస్థలు ప్రతిపాదించాయి. వీటికి సహేతుకమైన ఛార్జీలతో ప్రతిపాదనను ఆమోదించాం. సంప్రదాయ జనరేటర్లకు నెలకు కిలోవాట్‌కు రూ.50 చెల్లించాలి. వేస్ట్‌ హీట్‌ రికవరీ ప్లాంట్లు, మున్సిపల్‌ ఘనవ్యర్థాల ఆధారిత ప్లాంట్లు, కో-జెన్‌ ప్లాంట్లతో పాటు పునరుత్పాదక ఇంధన ప్లాంట్లు నెలకు కిలోవాట్‌కు రూ.25 చెల్లించాలి. రూఫ్‌టాప్‌ సౌర విద్యుత్తు ప్లాంట్లు నెలకు కిలోవాట్‌కు రూ.15 చెల్లించాలి.

ఆక్వా, పౌల్ట్రీ హేచరీలకు టీఓడీ మినహాయింపు
ఆక్వా, పౌల్ట్రీ హేచరీలు, మిక్సింగ్‌ ప్లాంట్లకు టీఓడీ టారిఫ్‌ నుంచి మినహాయింపు ఇచ్చాం. గోశాలలను మతపరమైన విభాగం కింద కొనసాగిస్తూనే టారిఫ్‌ను రూ.3.85గా నిర్ణయించాం. 2 కిలోవాట్ల కంటే తక్కువ, అంతకంటే ఎక్కువ కనెక్టివ్‌ లోడ్‌ ఉన్న మతపరమైన ప్రదేశాల సబ్‌కేటగిరీలను విలీనం చేసి, టారిఫ్‌ను రూ.4.80 నుంచి రూ.3.85కి తగ్గించాం. కార్పొరేట్ రైతుల నిర్వచనంలో మార్పులు తెచ్చాం. 2013 లేదా ఏదైనా కంపెనీ చట్టం కింద ఏర్పాటుచేసి వ్యవసాయాన్ని ఒక కార్యకలాపంగా చేపట్టే సంస్థ/ భాగస్వామ్య సంస్థ/ రిజిస్టర్డ్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ పర్సన్స్‌/ కో-ఆపరేటివ్‌ సొసైటీలు/ వ్యవసాయం చేసే వ్యక్తుల రిజిస్టర్డ్‌ అసోసియేషన్లను కార్పొరేట్‌ రైతు కింద గుర్తించనున్నాం.

పంపిణీ వ్యాపారం సర్దుబాటు
పంపిణీ వ్యాపారం సర్దుబాటు ఖర్చులను ఏపీఎస్పీడీసీల్‌ కోసం రూ.3,368, ఏపీఈపీడీసీఎల్‌ కోసం రూ.609 కోట్లుగా నిర్ణయించాం. పంపిణీ వ్యాపారం కోసం మొత్తం రూ.3,977.28 కోట్ల సర్దుబాటు మొత్తంలో వ్యవసాయ వినియోగదారుల రాయితీ కింద ప్రభుత్వం రూ.1066.54 కోట్లను భరించాలి. ఇతర వినియోగదారుల నుంచి రూ.2910.74 కోట్లను పంపిణీ సంస్థలు వసూలు చేయాలి. వినియోగదారుల వాస్తవ వినియోగం ఆధారంగా యూనిట్‌కు ఏపీఎస్పీడీసీఎల్‌ 23 పైసలు, ఏపీసీపీడీసీఎల్‌ 22 పైసలు, ఏపీఈపీడీసీఎల్‌ 7 పైసలు వసూలు చేస్తాయి. ఏపీఎస్పీడీసీఎల్‌, ఏపీసీపీడీసీఎల్‌ సర్దుబాటు ఖర్చుల (01-08-2022) నుంచి 36 నెలవారీ వాయిదాల్లో వసూలుకు ఆదేశించాం. ఏపీఈపీడీసీఎల్‌ పరిధిలో 18 నెలవారీ వాయిదాల్లో సర్దుబాటు ఖర్చులను వసూలు చేయనున్నాం. సర్దుబాటు ఖర్చులను 3వ నియంత్రణ కాలానికి రూ.492 కోట్లుగా నిర్ణయించి
ఏపీ ట్రాన్స్‌కోకు లభించే పీవోసీ ఛార్జీల నుంచి దీన్ని సర్దుబాటు చేయాలని ఆదేశించాం.  

న్యాయస్థానం ఆదేశాలతో..
డిస్కంలు కొన్ని ప్రతిపాదనలు పంపినా తర్వాత మారిన పరిస్థితుల దృష్ట్యా అదనపు భారం పడింది. మార్చి 15న న్యాయస్థానం ఇచ్చిన తీర్పు మేరకు ప్రతిపాదించిన దానికంటే రూ.3,330 కోట్లు అదనంగా చెల్లించాల్సి వస్తోంది. సౌర, పవన విద్యుత్తు కొనుగోలుకు డిస్కంలు అంగీకరించిన మేరకు చెల్లించాలని చెప్పారు. అందువల్ల గతంలో మధ్యంతర ఉత్తర్వుల ద్వారా రూ.2.43/రూ.2.44 చెల్లించేది... ఇప్పుడు రూ.4.83/4.84 చెల్లించాల్సి ఉంది. దీనివల్ల డిస్కంలపై అదనపు భారం పడింది. వాటినీ పరిగణనలోకి తీసుకున్నాం.

పరిశ్రమలకు ‘టైమ్‌ ఆఫ్‌ డే’
పరిశ్రమలకు ప్రస్తుతం టైమ్‌ ఆఫ్‌ డే కింద వసూలు చేస్తున్న ఛార్జీలనూ మార్చాం. పీక్‌ సమయంలో విద్యుత్తు వినియోగాన్ని తగ్గించడంతోపాటు... సాధారణ సమయాల్లో వినియోగించడాన్ని ప్రోత్సహించేందుకు అనుగుణంగా తగిన చర్యలు చేపట్టాం. దీనివల్ల నిరంతరం పని చేసే పరిశ్రమలపై కొంత ప్రభావం ఉంటుంది. పగటి పూట పని చేసే పరిశ్రమలు గణనీయంగా ప్రయోజనం పొందుతాయి. ఇందులో భాగంగా పీక్‌ సమయంలో విద్యుత్తు వాడకంపై విధిస్తున్న ఛార్జీలకు అదనంగా యూనిట్‌కు అపరాధ రుసుం వసూలు చేయనున్నాం. ఆఫ్‌పీక్‌ వేళల్లో వినియోగిస్తే అందుకు ప్రోత్సాహకం ఇస్తున్నాం.


ఈ భారం నథింగ్‌

విద్యుత్తు ఛార్జీల పెంపు భారం అని ఎలా అంటారు? 2002లో పెట్రోలు ధర ఎంత.. ఇప్పుడెంత? అది సామాన్యుడికి భారం కాదా? గ్యాస్‌ ధర పెంపు భారం కాదా? ఏ వస్తువు మీద భారం లేదు చెప్పండి. ఏ వస్తువు ధరైనా స్థిరంగా ఉందా? వినియోగదారుడికి అదృష్టం ఏంటంటే.. విద్యుత్తు ఛార్జీలపైనే చర్చ, ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతాయి. పెట్రోలు ధర పెంచుతుంటే మిమ్మల్ని అడుగుతున్నారా? ఇప్పుడూ రూ.1400 కోట్ల నుంచి రూ.1500 కోట్లే పెరుగుతోంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది నథింగ్‌.

- ఏపీఈఆర్సీ ఛైర్మన్‌ జస్టిస్‌ సి.వి.నాగార్జునరెడ్డి


ఛార్జీల పెంపుపై దశలవారీ పోరాటం

విద్యుత్తు ఛార్జీల పెంపుపై దశలవారీగా పోరాడతాం. జగన్‌అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో 7 సార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచి.. ప్రజలపై సుమారు రూ.12వేల కోట్ల భారం భారం మోపారు.  జగన్‌రెడ్డి అసమర్థత, అవినీతివల్లే రాష్ట్రంలో విద్యుత్తు వ్యవస్థ అస్తవ్యస్తమైంది. తెదేపా మళ్లీ అధికారంలోకి వచ్చుంటే విద్యుత్తు ఛార్జీలు తగ్గించి ఉండే వాళ్లం.

- తెదేపా అధినేత చంద్రబాబు


జగనన్న విద్యుత్‌ ఛార్జీల వడ్డన!

‘జగనన్న విద్యుత్‌ ఛార్జీల వడ్డన’ అని పేరు పెట్టలేదేం సీఎం గారూ? విద్యుత్‌ ఛార్జీలను అమాంతంగా పెంచుతూ ఈ ఉగాదిని చెడుగా మిగల్చాలని జగన్‌ భావిస్తున్నట్లుంది. పేదలకూ ఛార్జీలు పెంచి వైకాపా ప్రభుత్వం అమానుషంగా ప్రవర్తిస్తోంది

- భాజపా ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు


ఫ్యాను వేసుకోలేని పరిస్థితి తెచ్చారు

వైకాపా ప్రభుత్వం విద్యుత్తు ఛార్జీలను భారీగా పెంచి ప్రజలను మోసం చేసింది. ఫ్యాను గుర్తుకు ఓటేసినందుకు ఇళ్లల్లో ఫ్యాన్లు వేసుకోలేని పరిస్థితులు తీసుకొచ్చింది.   పెంచిన ఛార్జీలను వెనక్కి తీసుకునేలా ప్రజలతో కలిసి ఆందోళన చేపడతాం.

- జనసేన పీఏసీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌


తగ్గించకపోతే ఆందోళనలు

పెంచిన విద్యుత్తు ఛార్జీలను ప్రభుత్వం తగ్గించకపోతే ఆందోళనలు చేస్తాం.. కరోనా కారణంగా ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని పాత ఛార్జీలనే కొనసాగించాలి. జగన్‌ మూడేళ్ల పాలనలో ఆదాయ, వ్యయాలపై శ్వేతపత్రం విడుదల చేయాలి

- పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని