Andhra News: సీఎంవో ఆదేశిస్తే.. మంత్రులు పాటించారంతే

‘దేవుడు ఆదేశిస్తాడు... అరుణాచలం పాటిస్తాడు’... రజనీకాంత్‌ సినిమాలోని ఈ డైలాగ్‌ను.. ‘సీఎంవో ఆదేశిస్తుంది... మంత్రులు పాటిస్తారు’ అని కాస్త మార్చితే చాలు, జగన్‌ మంత్రివర్గంలో మూడేళ్లుగా కొలువుతీరిన

Updated : 10 Apr 2022 06:42 IST

సొంత నిర్ణయాలకు అవకాశమూ లేదు.. ఆ చొరవా చూపలేదు

సీఎంను పొగిడి.. విపక్షాలపై దుమ్మెత్తిపోయడం

అత్యధిక మంది మంత్రులకు అదే పని

- ఈనాడు, అమరావతి

‘దేవుడు ఆదేశిస్తాడు... అరుణాచలం పాటిస్తాడు’... రజనీకాంత్‌ సినిమాలోని ఈ డైలాగ్‌ను.. ‘సీఎంవో ఆదేశిస్తుంది... మంత్రులు పాటిస్తారు’ అని కాస్త మార్చితే చాలు, జగన్‌ మంత్రివర్గంలో మూడేళ్లుగా కొలువుతీరిన పలువురు అమాత్యులకు అతికినట్టు సరిపోతుంది..! రాష్ట్ర మంత్రుల్లో ఈ మూడేళ్లలో స్వతంత్రంగా వ్యవహరించినవారిని, సొంత నిర్ణయాలు తీసుకున్నవారిని, దీర్ఘకాల సమస్యల పరిష్కారానికి ఎంతో కొంత చొరవ చూపినవారు అతి కొద్ది మందే! మూడేళ్లు పదవిలో ఉన్నా చాలా మంది తమ శాఖపై కనీసం పట్టు సాధించకుండానే, ఎలాంటి ముద్రా వేయకుండానే మాజీలైపోతున్నారు. మంత్రి పదవి ఇచ్చినప్పుడే.. ఆ భోగం రెండున్నరేళ్లేనని అధినేత జగన్‌ తేల్చిచెప్పడంతోనే వారిని సగం నీరసం, నిర్లిప్తత ఆవరించాయి. కొందరు చివరి వరకు అదే నిర్లిప్తతతో, అంటీముట్టనట్టు వ్యవహరించారు. పదవిలో చేరని కొన్నాళ్లకే తమకున్న స్వతంత్రత ఏపాటిదో తెలిసిపోవడం, పేరుకే తాము మంత్రులమని, నడిపేది, నడిపించేది అంతా సీఎంవోనే అని తేలిపోవడంతో.. తమ పరిమితులేంటో గుర్తెరిగి నడుచుకోవడం మొదలుపెట్టారు. స్వతంత్రించి శాఖాపరమైన సమీక్షలు చేస్తే పైవాళ్లకు కోపం వస్తుందేమో అన్నట్టుగా భయభక్తులతో వ్యవహరించారు. దాదాపు మూడేళ్ల పదవీకాలంలోనూ గత ప్రభుత్వంపై విమర్శలకే పరిమితమయ్యారు. ఎంత సీనియర్‌ నాయకుడైనా, గతంలో పలు పదవులు నిర్వహించిన అనుభవం ఉన్నా... శాఖాపరమైనా నిర్ణయాలు తీసుకోవాలన్నా, విలేకర్ల సమావేశంలో మాట్లాడాలన్నా ‘స్క్రిప్ట్‌’ సీఎంవో నుంచి రావాల్సిందే. ఉన్నంతలోనే స్వతంత్రంగా వ్యవహరిస్తూ, అధికారులకు దిశానిర్దేశం చేసినవారు కొద్దిమందే. ఏ పని చేయాలన్నా నిధుల కొరత అడ్డంకిగా మారడం, కరోనా మహమ్మారి కూడా మంత్రుల పనితీరును ప్రభావితం చేశాయి. మూడేళ్ల పదవీకాలంలో అన్ని జిల్లాలకు వెళ్లినవారిని, అక్కడ సమీక్షలు నిర్వహించినవారిని వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. అందుకే ఫలానా శాఖ మంత్రి ఎవరంటే, చాలామంది పేర్లు టక్కున గుర్తుకురాని పరిస్థితి నెలకొందంటే అతిశయోక్తి కాదేమో..!


అధిక అప్పులు.. ఆర్థిక భాష్యాలే..!

ఆర్థికాంశాలకు తనదైన భాష్యం చెప్పడం.. సిద్ధాంతీకరించడం.. సూత్రాలు వల్లించడం.. నిధుల సమీకరణకు దిల్లీ చుట్టూ తిరగడం! మూడేళ్లలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి పనితీరులో ప్రధానాంశాలివే. గతంలో ఎన్నడూ లేనంత ఆర్థిక భారాన్ని తన హయాంలోనే ఆంధ్రప్రదేశ్‌పై మోపి చరిత్రలో నిలిచిపోయారన్న ఘనతను సొంతం చేసుకున్నారు. ఏళ్ల తరబడి రూ.వేల కోట్ల బిల్లులు పెండింగులో ఉండిపోయాయి. న్యాయస్థానాల్లో ఎన్నో కేసులు ఎదుర్కోవడం, ఆర్థికశాఖ అధికారులు కోర్టుకెళ్లి పదేపదే సమాధానం చెప్పాల్సి రావడమూ బుగ్గన హయాంలో జరిగినట్లు ముందెన్నడూ లేదు. కొన్ని అంశాల్లో రెవెన్యూ ఖర్చులను మూలధన వ్యయంగా చూపుతున్నారంటూ కాగ్‌ తప్పుపట్టడం గమనార్హం. బడ్జెట్‌లో చూపని అప్పులపై ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నోసార్లు విమర్శలు గుప్పించిన బుగ్గన.. తన హయాంలోనూ అదే బాట పట్టడం గమనార్హం. కార్పొరేషన్లకు ప్రభుత్వ గ్యారంటీలపైనా ఆయన పొంతన లేకుండా మాట్లాడటం విమర్శలకు దారితీసింది.


అత్యధిక పన్నులు వేయించిన అమాత్యుడు

పురపాలకశాఖలో వ్యవహారాల కన్నా రాజకీయాలకే ప్రాధాన్యం, ఆరోపణలు, విమర్శలను తిప్పికొట్టడమే పని.. ఇవీ బొత్స పనితీరుపై ప్రజల్లో ఉన్న అభిప్రాయాలు. ప్రజలపై అత్యధిక పన్నులు వేయించిన మంత్రిగా విమర్శలు ఎదుర్కొన్నారు. చెత్త పన్ను వసూళ్లు, ఆస్తి మూల ధన విలువ ఆధారంగా పన్ను విధింపు, ఆస్తిపన్ను ఏటా 15 శాతం పెంపు వంటి నిర్ణయాలతో ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. రివర్స్‌ టెండర్ల పేరుతో హడావుడి చేసినా టిడ్కో ఇళ్లకు కేవలం రంగులు మాత్రమే వేయించగలిగారు. అమరావతి ప్రాంతాన్ని శ్మశాన ప్రాంతమని వ్యాఖ్యానించి ప్రజాగ్రహాన్ని ఎదుర్కొన్నారు. అమృత్‌, స్మార్ట్‌ సిటీ ప్రాజెక్టుల్లో పురోగతి సాధించలేకపోయారు. విజయవాడలో వరదనీటి కాలువలు, గుంటూరులో భూగర్భ మురుగునీటి వ్యవస్థ పనులు పూర్తి చేయించలేదు. సీఎఫ్‌ఎంఎస్‌ నుంచి పట్టణ స్థానిక సంస్థలకు మినహాయింపు ఇప్పిస్తామన్న మంత్రి హామీ నెరవేరలేదు. దీంతో గుత్తేదారులకు బిల్లులు అందక, కొత్త పనులకు టెండర్లు వేసేవారు కరవయ్యారు.


ప్రాజెక్టులను కూడా చూడని జలవనరుల మంత్రి

జలవనరులశాఖ మంత్రి అనిల్‌కుమార్‌ ప్రతిపక్షంపై సవాళ్లు విసరడం తప్ప ప్రాజెక్టుల నిర్మాణాన్ని సవాలుగా తీసుకోలేదు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంపై వచ్చిన విమర్శలను తిప్పికొట్టేందుకు ఇచ్చిన ప్రాధాన్యంలో ఒక్క వంతు కూడా వాటిని పూర్తి చేయించడంపై చూపలేదన్న విమర్శ ఉంది. పోలవరం, వెలిగొండ సహా ప్రధాన ప్రాజెక్టులను ఇదిగో పూర్తి చేసేస్తున్నామన్న ఆర్బాటపు ప్రకటనలే తప్ప.. సొంత జిల్లాలో అప్పటికే కొలిక్కి వచ్చిన నెల్లూరు, సంగం బ్యారేజీలనూ కూడా పూర్తి చేయించలేకపోయారు. వైకాపా కార్యాలయంలో విలేకర్ల సమావేశాలకే పరిమితమయ్యారనే విమర్శలు మూటకట్టుకున్నారు. అధికారులతో సమీక్షలు నిర్వహించినా నామమాత్రమే. సమావేశంలో తీసుకునే నిర్ణయాల అమలుపై చిత్తశుద్ధి చూపలేదు. రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టుల్నీ కనీసం చూడకుండానే పదవీకాలం పూర్తయిన జలవనరుల మంత్రిగా అనిల్‌ను పేర్కొనవచ్చు.


చెప్పగలిగే స్థాయి ఉన్నా.. తప్పులు సరిదిద్దని ‘పెద్దా’యన!  

రాష్ట్ర మంత్రివర్గంలో పెద్దాయనగా పేరు, కీలక విధాన నిర్ణయాల్లో మంచి చెడ్డలను ముందే చెప్పగలిగే స్థాయి, ప్రాధాన్యం ఉన్నా.. ప్రజల ఇబ్బందులు తీర్చలేకపోయారు. ఏపీఎండీసీ ద్వారా ఇసుక అమ్మకాల్లో అక్రమాలు చోటు చేసుకున్నా, ఇప్పుడు జేపీ సంస్థ తీరుపైనా ప్రజల్లో అసంతృప్తి ఉన్నా.. వాటిని చక్కదిద్దలేకపోయారనే విమర్శలున్నాయి. ఇసుక ధర ప్రజలపై పెనుభారంగా మారినా అడ్డుచెప్పలేకపోయారు. పంచాయతీరాజ్‌శాఖలో, ఇంజినీరింగ్‌ విభాగంలో విశ్రాంత అధికారులను తీసుకువచ్చి కీలకస్థానాల్లో కూర్చోబెట్టి, సర్వీసులో ఉన్న అధికారుల అవకాశాలు దెబ్బతీశారనే అసంతృప్తి ఆ శాఖలో ఉంది. నరేగాలో నిధులు భవన నిర్మాణాలకు కేటాయించి రహదారుల నిర్మాణాన్ని అశ్రద్ధ చేశారని,  గత ప్రభుత్వం హయాంలో చేసిన నరేగా పనులకు బిల్లులు చెల్లించకుండా రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడ్డారనే విమర్శలున్నాయి.  


అంతా సీఎంవో ‘ధర్మాన’

ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్‌ కీలకమైన రెవెన్యూ శాఖపై పట్టు సాధించలేకపోయారనే విమర్శ ఉంది. సచివాలయానికి నామమాత్రంగా వచ్చేవారు. ఎలాంటి సమీక్షలు నిర్వహించేవారు కాదు. రీ-సర్వే పురోగతిని సమీక్షించేందుకు ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం సమావేశాల్లో మాత్రం కనిపించేవారు. రాష్ట్రంలో భూవివాదాల పరిష్కారానికి అంతకుముందున్న మంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ స్థాయిలో చొరవ చూపలేదనే విమర్శ ఎదుర్కొన్నారు. చుక్కల భూములు, సాదాబైనామా, ఇనాం భూములు, ఇతర రకరకాల భూ వివాదాల్లోనూ ధర్మానపై ఇదే అభిప్రాయం ఉంది. రీ సర్వేతో పాటు ఆయా అంశాలన్నీ అధికారులు, సీఎంవోయే చూసుకుంటుందనే ధోరణిలోనే వ్యవహరించేవారు. ఈయనకు తెలియకుండానే స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ శాఖను ఆర్థికశాఖలోకి మార్చి మళ్లీ యథాస్థితికి తెచ్చారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ శాఖలో సబ్‌రిజిస్ట్రార్లు, ఇతర అధికారుల బదిలీలు దుమారాన్ని రేకెత్తించాయి. రెవెన్యూ శాఖలో అవినీతి ఎక్కువగా ఉందని ఏసీబీ నివేదికలు, ప్రభుత్వ కమిటీ పేర్కొన్నా.. నియంత్రించేందుకు ఉపముఖ్యమంత్రిగా ఎలాంటి చొరవ చూపలేదు.


వైద్య మంత్రి ఆళ్ల.. చికిత్స సీఎంవోదే!

ఆళ్ల నాని పేరుకే వైద్య మంత్రి.. పాలన, సమీక్షలు నిర్ణయాలన్నీ ముఖ్యమంత్రి కార్యాలయం, అధికారులే నిర్వహించారన్న భావన ఉంది.. కొవిడ్‌ ప్రభావం, నాడు-నేడు, ఆరోగ్యశ్రీ, నియామకాలు, కొత్త వైద్య కళాశాలల ఏర్పాటు గురించి సీఎం స్థాయిలోనే నిర్ణయాలు జరిగేవి. వాటిపై చర్చించడం కాదు కదా కనీసం ఆ నిర్ణయాల గురించి ప్రకటన చేసే సాహసం కూడా చేసేవారు కాదు. కొవిడ్‌ నివారణ చర్యలపై వైద్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ రోజూ మీడియాతో మాట్లాడినా మంత్రి దూరంగానే ఉండేవారు. కొవిడ్‌ తీవ్రంగా ఉన్నప్పుడు మాత్రం జిల్లాల పర్యటన, సమీక్షా సమావేశాలు నిర్వహించి ఉనికిని చాటుకునే ప్రయత్నం చేశారు. సొంత నియోజకవర్గం ఏలూరులో అంతుచిక్కని వ్యాధితో వందల మంది అస్వస్థులైనా దానికి కారణాలను తేల్చడంలో చొరవ చూపలేకపోయారనే విమర్శ ఉంది. సొంత జిల్లా జంగారెడ్డిగూడెంలో నాటుసారా తాగి పలువురు చనిపోయినప్పుడూ వైద్యమంత్రిగా నామమాత్రపు స్పందనే కనబరిచారు.


విమర్శల్లో దూకుడు.. పౌరసరఫరాల్లో లేదు

సొంతశాఖలో ఏం జరుగుతోందో తెలుసుకునేందుకూ ఏనాడూ ఆసక్తి చూపని కొడాలి నాని.. ప్రతిపక్ష నేతను అసభ్య పదజాలంతో దూషించడంలో మాత్రం అగ్రస్థానంలో నిలిచారు. గుడివాడలో క్యాసినో నిర్వహణలో మంత్రి పాత్రపై దుమారం రేగింది. రేషన్‌ కార్డుదారులకు సెనగలిస్తున్నారో.. కందిపప్పు పంచుతున్నారో చెప్పలేని స్థితి ఆయనదని అధికారులే చెబుతుంటారు. మంత్రివర్గ ఉపసంఘం సమావేశాలు, సీఎం సమక్షంలో ధాన్యం కొనుగోలుపై జరిగే సమీక్షలకు మంత్రి పరిమితమయ్యేవారు. కొడాలి హయాంలోనే కందిపప్పుపై 67.5%, పంచదారపై 70% చొప్పున ధరల్ని పెంచి ఏడాదికి పేదలపై రూ.550 కోట్ల భారం మోపారు. ఇంటింటికీ బియ్యం పంపిణీ కోసం రూ.538 కోట్ల వ్యయంతో 9,260 డోర్‌ డెలివరీ వాహనాల కొనుగోలుపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. వైకాపా పథకాలన్నింటిలోనూ అత్యంత ఘోరంగా విఫలమైన పథకం ఇదేనని ఆ పార్టీ నేతలు, అధికారులే చెబుతున్నారు. ఖరీఫ్‌, రబీ ధాన్యం కొనుగోలులో మిల్లర్ల దోపిడీ, నగదు చెల్లింపుల్లో జాప్యంపైనా పర్యవేక్షణ శూన్యమే.


‘ఇల్లు’ చక్కబెట్టుకోలేకపోయారు..  

దిశ చట్టమే అమల్లోకి రాకపోయినా ఆ చట్టం కింద అనేక మందికి శిక్షలు వేయించామంటూ హోం మంత్రి సుచరిత పదేపదే చెప్పడం.. ఆ శాఖపై ఆమెకున్న పట్టుకు నిదర్శనం. ఇది పెద్ద వివాదమై తెదేపా దిశ పోలీసుస్టేషన్లు ముట్టడించే పరిస్థితి వచ్చింది. దీంతో ఈ బిల్లు ఇంకా ఆమోదం పొందలేదని డీజీపీయే స్వయంగా వివరణ ఇవ్వవలసి వచ్చింది. మహిళలపై వేధింపులు, ప్రేమోన్మాదుల దాడులు, ఎస్సీలపై వేధింపులు, దాడులు, శిరోముండనం, ఎస్సీలపైనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టంలోని సెక్షన్ల కింద కేసులు నమోదు చేయటం వంటి ఘటనలు అనేకం వెలుగు చూసినా సుచరిత స్పందన నామమాత్రం. సీఎంవో ఆదేశాలను పాటించటం, విలేకరుల సమావేశాలు నిర్వహించడానికే పరిమితమయ్యారు. అత్యధిక నేరాలు రేటున్న రాష్ట్రాల జాబితాలో 2018 నాటికి 13వ స్థానంలో ఉన్న ఏపీ.. 2020 నాటికి ఆరో స్థానానికి ఎగబాకింది. అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి క్షేత్రస్థాయిలో ఎస్సైలు, ఇన్‌స్పెక్టర్లు తమను తప్పుడు కేసుల్లో ఇరికిస్తున్నారని, వేధిస్తున్నారని పేర్కొంటూ అనేక మంది బలవన్మరణాలకు పాల్పడినా స్పందించలేదు.


ప్రతిపక్షంపై విమర్శలకే ప్రాధాన్యం

మంత్రి కన్నబాబు వ్యవసాయ, ఉద్యాన శాఖల్లో పథకాల అమలు కంటే.. ప్రతిపక్షంపై విమర్శలు గుప్పించడంపైనే అధిక శ్రద్ధ పెట్టారనే విమర్శలను ఎదుర్కొన్నారు. తరచూ శాఖలవారీ సమీక్షలు నిర్వహించినా.. ఫలితాలపై మాత్రం దృష్టి పెట్టలేదు. సొంత జిల్లాలోని సామర్లకోటలో మంజూరైన కేంద్రీయ వాణిజ్య పంటల పరిశోధనా కేంద్రానికి (సీపీసీఆర్‌ఐ) భూముల్ని కూడా ఇప్పించలేకపోయారు. దీంతో కేంద్రం దాని ఏర్పాటునే విరమించుకుంది. రైతుభరోసా పేరుతో నగదు జమకే వ్యవసాయశాఖ పరిమితమైందనే విమర్శలు వచ్చాయి. విత్తనం నుంచి అమ్మకం వరకు అని ఆర్బాటంగా ప్రకటించిన రైతు భరోసా కేంద్రాల్లోనూ అన్నదాతలకు అరకొర సేవలే అందుతున్నాయి. వ్యవసాయశాఖలో సూక్ష్మసేద్యం, భూసారపరీక్షలు, యాంత్రీకరణ పథకాలు అటకెక్కినా పట్టించుకోలేదు. ఉచితంగా ఇచ్చే సూక్ష్మపోషకాలనూ తీసేశారు. మూతపడిన చక్కెర పరిశ్రమల్ని పునరుద్ధరింప చేసే దిశగా ఎలాంటి చొరవ చూపకపోవడం సహకార మంత్రిగా ఆయన పనితీరుకు అపప్రద తెచ్చింది.


చీకట్లు...ఇక్కట్లు మిగిల్చి

బాలినేని హయాంలో విద్యుత్తు ఛార్జీల పెంపుతో రూ.1,400 కోట్లు, ట్రూఅప్‌ ఛార్జీల పేరుతో రూ.2,910 కోట్లు ప్రజలపై భారం పడింది. రాష్ట్రంలో ఏడేళ్ల తర్వాత మళ్లీ విద్యుత్తు కోతలు, పరిశ్రమల్లో పవర్‌ హాలిడేలు ప్రారంభమయ్యాయి. విద్యుత్తు పంపిణీ వ్యవస్థలు అస్తవ్యస్తంగా తయారయ్యాయి. తొలిసారిగా జెన్‌కోపై ఎన్‌పీఏ ముద్ర పడింది. విద్యుత్తుశాఖపై మంత్రికి కనీస అవగాహన లేకపోవడమే ఈ పరిస్థితికి కారణమని విమర్శకులు దుమ్మెత్తిపోస్తున్నారు. మార్కెట్‌లో సౌర విద్యుత్తు యూనిట్‌ రూ.2కు లభిస్తుంటే.. రూ.2.49కు కొంటామని సెకీతో 7వేల మెగావాట్ల ఒప్పందం చేసుకోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. కాలుష్య నియంత్రణ మండలిని విపక్ష నేతల పరిశ్రమలపై కక్ష సాధింపులకు వినియోగించుకున్నారనే విమర్శలు ఉన్నాయి.


రెవెన్యూతో రగడ.. పోలీసులతో గొడవ

పశుసంవర్థక, మత్స్యశాఖ మంత్రిగా సొంత శాఖలో కార్యక్రమాల అమలుపై తనదైన ముద్ర చూపలేకపోయారు. శారదా పీఠానికి సీఎం జగన్‌ వచ్చిన సందర్భంలో ఒక పోలీసు అధికారితో మంత్రి గొడవపడటం తీవ్ర చర్చనీయాంశమైంది. సచివాలయాలకు వచ్చే వీఆర్వోలను సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు తరమాలని ఆయన చేసిన వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా వీఆర్వోలు నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. రాష్ట్రంలో పాడి రంగాన్ని అమూల్‌కు అప్పగించడానికి ఆయనే ప్రత్యక్షసాక్షిగా నిలిచారు. చేపలు, రొయ్యల రైతులకు ధరలు, సౌకర్యాల కల్పనలో ప్రభుత్వం నుంచి పెద్దగా చేయూత ఇవ్వలేకపోయారు. పశువుల దాణా, రొయ్యల దాణా తదితర కొత్త చట్టాలతో రైతులపై భారం పడిందనే విమర్శలున్నాయి.


వివాదాలకు చిరునామా

వెలంపల్లి హయాంలో దేవాదాయశాఖ వివాదాలకు చిరునామాగా మారింది. నెల్లూరు జిల్లాలోనూ, అంతర్వేదిలోనూ రథాల దగ్ధం, ఆలయాల్లో విగ్రహాల ధ్వంసం తీవ్ర వివాదాస్పదమయ్యాయి. ఆయన దగ్గర పనిచేసిన ఓఎస్డీ దేవాదాయభూములకు ఎన్‌వోసీలు ఇప్పించి లబ్ధి పొందారని ప్రతిపక్షాలు ఆరోపించాయి. విజయవాడ శివారులోని ఓ సత్రం స్థలానికి ఎన్వోసీ కోసం ఒత్తిడి చేశారని పొక్కడంతో విధిలేక ఓఎస్డీని మాతృశాఖకు తిప్పి పంపారు. తన కార్యాలయంలో పొరుగుసేవల సిబ్బందికి వివిధ ఆలయాల నుంచి జీతాల కోసం ఒత్తిళ్లు తెచ్చేవారనే ఆరోపణలున్నాయి. సింహాచలం ఆలయం, మాన్సాస్‌ ట్రస్ట్‌లకు ధర్మకర్తగా అశోక్‌గజపతిరాజును నిబంధనలకు విరుద్ధంగా తొలగించిన సందర్భంలో ఆయనపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.


ఆదేశాలన్నీ సీఎంవో నుంచే!

కరోనా తీవ్రంగా ఉన్న సమయంలోనూ పరీక్షలు నిర్వహిస్తామంటూ మొండిపట్టు పట్టడం.. విద్యార్థులు, తల్లిదండ్రుల్లో తీవ్ర అసంతృప్తికి దారి తీసింది. సమీక్షలు నిర్వహించినా మొక్కుబడే. విద్యాశాఖను నేరుగా సీఎంవో అధికారులే పర్యవేక్షిస్తుండటంతో ఆ శాఖ ఉన్నతాధికారులూ మంత్రికి ప్రాధాన్యమిచ్చేవారు కాదన్న విమర్శ ఉంది. సీఎం కార్యాలయం ఆదేశాలను అమలు చేయడం తప్ప.. మంత్రిగా సొంతంగా నిర్ణయాలు తీసుకోలేదన్న విమర్శ ఉంది. మధ్యాహ్న భోజన పథకంలో అందించే చిక్కీల టెండర్లలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. ‘నాడు-నేడు’, ‘విద్యా కానుక’ టెండర్ల నుంచి పంపిణీ వరకు ముఖ్యకార్యదర్శి, సలహాదారుదే తుది నిర్ణయమన్న విమర్శలు ఉన్నాయి.


రాజకీయ అంశాలకే ప్రాధాన్యం

రవాణాశాఖ, ఆర్టీసీ అధికారులతో సమీక్షలు నిర్వహించేవారు. రవాణాశాఖపై తనకు నేరుగా ఎటువంటి ఫిర్యాదులొచ్చినా వెంటనే చర్యలు తీసుకునేవారు. లారీ యజమానుల సంఘం, బస్‌ ట్రావెల్స్‌ సంఘాలకు చెందిన సమస్యల పరిష్కారానికి కొంత ప్రయత్నించారు. గుత్తేదారులకు రూ.30 కోట్లు బకాయి ఉండటంతో.. ఆర్సీలు నెలల తరబడి వాహనదారులకు ఇవ్వని పరిస్థితి కొనసాగింది. లేని ట్యాంకర్లు 120 ఉన్నట్లు రిజిస్ట్రేషన్ల సర్టిఫికెట్లు పుట్టించిన ఘటన ఆయన హయాంలో వెలుగులోకి వచ్చింది. రాజకీయ అంశాలకే ప్రాధాన్యతనిస్తారన్న విమర్శలు ఎదుర్కొన్నారు. ఆయన చేతికి ఆలస్యంగా సినిమాటోగ్రఫీ శాఖను ఇచ్చి.. టికెట్‌ ధరల హెచ్చుతగ్గుల ద్వారా సినీ పరిశ్రమను నియంత్రించేందుకు ప్రభుత్వం సాధనంగా వాడుకుందన్న భావన ఉంది.


జనం గగ్గోలు పెడుతున్నా మౌనమే

రోడ్లపై తట్టమట్టి పోసే పరిస్థితి లేదంటూ జనం గగ్గోలు పెడుతున్నా.. గుంతలతో అల్లాడిపోతున్నామని ఆందోళనలు చేసినా రహదారులు, భవనాలశాఖ మంత్రిగా శంకరనారాయణ స్పందించిందీ లేదు. మరమ్మతులకు చొరవ చూపిందీ లేదు. రహదారులు తీవ్రంగా దెబ్బతిన్నా వాటిని సకాలంలో మరమ్మతులు, ఏటా చేయాల్సిన రెన్యువల్‌ పనులు చేయించడంలో విఫలమయ్యారు. సొంత శాఖపై ఏ మాత్రం పట్టు సాధించలేకపోయారు. ఏడాది ఒకటి, రెండుసార్లు మొక్కుబడిగా సమీక్షలు నిర్వహించారు. పెనుకొండలో తను నివాసం ఉండే ప్రాంతంలో ప్రధాన రహదారి అధ్వానంగా మారినా కూడా మొన్నటి వరకు మరమ్మతులు చేయించలేకపోవడం ఆయన పనితీరుకు మచ్చుతునక.


ఎక్సైజ్‌లో మార్పులకు మౌన సాక్షి!

ఎక్సైజ్‌ మంత్రి నారాయణస్వామి పేరుకే ఆ శాఖకు మంత్రి తప్ప కీలక నిర్ణయాలన్నీ సీఎం కార్యాలయం కనుసన్నల్లోనే జరిగేవి. జంగారెడ్డిగూడెంలో నాటుసారా తాగి 18 మందికి పైగా మృతి చెందితే.. మంత్రిగా కనీసం అక్కడ పర్యటించలేదు. ప్రభుత్వం మద్యం దుకాణాలు ప్రవేశపెట్టడం, ఊరూ పేరూ లేని బ్రాండ్ల అమ్మకం, కొత్త బ్రాండ్లకు అనుమతులు ఇవన్నీ నారాయణస్వామి హయాంలోనే జరిగినా ఆయనది ప్రేక్షకపాత్రే. మద్యం కొనుగోళ్లలో మరో మంత్రి సంబంధీకులదే హవా అన్న ఆరోపణలున్నాయి.


బీసీ సంక్షేమానికి గండి

బీసీల అభ్యున్నతికి ఉపాధి కల్పనా చర్యలను అమలు చేయడంలో మంత్రిగా విఫలమయ్యారు. వెనుకబడిన తరగతులకు ప్రత్యేకంగా కార్పొరేషన్లు ఏర్పాటు చేశామనే ప్రచారమే తప్ప నిధులివ్వలేదు. నవరత్నాలకు నిధులు మళ్లిస్తూ బీసీ సంక్షేమానికి గండికొట్టారు. స్వయం ఉపాధికి రాయితీ రుణాలు ఇప్పించలేకపోయారు.


ముఖ్యమంత్రి భజనకే

శాఖపై కనీస పట్టు లేదు. మంత్రిత్వ వ్యవహారాల్లో ఆమె భర్త ప్రమేయం ఎక్కువగా ఉందనే విమర్శలున్నాయి. ఉపప్రణాళిక నిధులు పక్కదారి పట్టినా చర్యలు తీసుకోలేదనే అపవాదు ఉంది. జగన్‌పై స్వామి భక్తిని ప్రదర్శించడంలో అందరికంటే ముందుంటారనే విమర్శ ఉంది. ఐటీడీఏ పాలకమండలి, గిరిజన సలహా మండలి సమావేశాలు నిర్వహించినా అక్కడ తీసుకున్న నిర్ణయాలకు అతీగతీ లేదు.


సొంత వ్యవహారాల మంత్రి

సొంత వ్యవహారాలు చక్కబెట్టుకోవడం తప్ప శాఖ వ్యవహారాలపై దృష్టి సారించలేదనేది ప్రధాన విమర్శ.  ఈఎస్‌ఐ ఆస్పత్రుల్లో బిల్లుల చెల్లింపుల కోసం మంత్రి కుమారుడు బెంజి కారును కానుకగా పొందినట్లు ప్రతిపక్షాలు ఆరోపించడంతో అప్పటి నుంచి బెంజి మంత్రిగా ముద్రపడింది.


ఉన్నా.. లేనట్లే  

రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీలపై విపరీతంగా దాడులు జరిగినా మంత్రి విశ్వరూప్‌.. వాటి అడ్డుకట్టకు ఎలాంటి ప్రయత్నం చేయలేదనే విమర్శలు ఉన్నాయి. ఎస్సీలపైనే అట్రాసిటీ కేసులు నమోదు చేసినా కిమ్మనలేదు. ఉపప్రణాళిక నిధులు పక్కదారి పట్టిస్తూ ఎస్సీలకు తీరని అన్యాయం జరుగుతున్నా స్పందించలేదు. రాయితీ రుణాల కోసం ఆయా వర్గాలు గగ్గోలు పెట్టినా పట్టించుకున్న పాపాన పోలేదు.


పేరుకే మంత్రి..

శాఖపై కనీస పట్టు లేదు. రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి మహిళలు, చిన్నారుల సమస్యలు పరిష్కరించిన దాఖలాల్లేవు. అంతా మంత్రి పేషీలోని ఓ అధికారి, బంధువులే నడిపించారనే అపవాదు ఉంది. పేషీలోని ఓ అధికారిపై అవినీతి ఆరోపణలు ముసురుకున్నా, తన బంధువు అంగన్‌వాడీ కేంద్రాల వ్యవహారంలో నేరుగా జోక్యం చేసుకుంటున్నా మంత్రి పట్టించుకోలేదన్న విమర్శలు ఉన్నాయి. అంగన్వాడీ కేంద్రాల టెండర్లలో సెటిల్‌మెంట్‌ విధానాన్ని అమలు చేశారని ఆరోపణలు వచ్చాయి.


సమీక్షలే మిగిలాయి!

పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అధికారులతో సమీక్షలకే పరిమితం. ఒక్క కొత్త ప్రాజెక్టు రాలేదు, నిర్మాణంలో ఉన్నవీ పూర్తి కాలేదు. నిధుల కోసం విజయవాడలోని బెర్ము పార్కును కూడా బ్యాంకుకు తనఖా పెట్టారు. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో పర్యాటక ప్రాజెక్టులు వస్తున్నాయని తరచూ మీడియాకు చెప్పడం తప్ప ఒక్కటీ రాలేదు. ఒక్కరోజు సచివాలయానికి- ఆరు రోజులు విశాఖకు పరిమితం. విశాఖనయినా పర్యాటకంగా అభివృద్ధి చేశారా అంటే అదీ లేదు. రుషికొండపై ఎంతో విలువైన ఏపీటీడీసీ రిసార్టు ఈయన హయాంలోనే నేలమట్టమయింది.


మైనార్టీలకు ఏం ఒరిగింది?

మంత్రిగా, ఉపముఖ్యమంత్రిగా అంజద్‌బాషా మైనార్టీలకు ఒరగబెట్టిందేమీ లేదు. మైనార్టీల హక్కులకు భంగం కలిగిన సందర్భాలెన్నో ఉన్నా కనీసం పర్యవేక్షణకు మైనార్టీ కమిషన్‌ను కూడా ఏర్పాటు చేయించలేకపోయారు. నిన్న మొన్నటి వరకు వక్ఫ్‌బోర్డు పాలకవర్గాన్నీ కొలువుదీర్చలేకపోయారు. మసీదులు, దర్గాలకు యాజమాన్య కమిటీల నియామకంలోనూ పర్యవేక్షణ కొరవడింది. దుల్హన్‌, విదేశీవిద్య పథకాలను అమల్లోకి తేవాలన్న ముస్లిం సంఘాల వినతుల్ని పట్టించుకోలేదు.


ఇళ్లు కట్టలేకపోయారు..  

ఏడాదిన్నర ఎలాంటి గృహనిర్మాణ కార్యకలాపాలు లేకపోవడంతో తన పేషీకి, నియోజకవర్గానికే ఎక్కువగా పరిమితమయ్యారు. ఇళ్ల నిర్మాణం మొదలయ్యాక జిల్లాలవారీ సమీక్షలు నిర్వహించారు. 70-80 లేఅవుట్లను సందర్శించారు. మునకకు గురయ్యేవి, చదును లేనివి, లోతట్టు ప్రాంతాలు, గుట్టల్లో ఇళ్ల నిర్మాణానికి స్థలాలు సేకరించి ఇచ్చినా  అడ్డుచెప్పలేదనే అపవాదు ఉంది. ఎప్పుడో కట్టిన ఇళ్లకు ఓటీఎస్‌ పేరుతో వసూళ్లకు ‘ఎస్‌’ అని పేదలపై భారం మోపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని