Andhra News: నీటిమీద కోతలే!

రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం దాదాపు పడకేసింది. రాష్ట్ర విభజన తర్వాత అనేక ఆర్థిక సవాళ్లు ఉన్న పరిస్థితుల్లోనూ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో సాగునీటి ప్రాజెక్టులకు రూ.55,893.71 కోట్లు ఖర్చు చేయగా ప్రస్తుత ప్రభుత్వ హయాంలో

Updated : 18 Apr 2022 10:12 IST

గడిచిన మూడేళ్లలో ఒక్క సాగునీటి ప్రాజెక్టూ పూర్తి కాలేదు

ఎప్పటికప్పుడు గడువు పెంపు

బకాయిలతో పనులు నిలిపేసిన గుత్తేదారులు

ఈనాడు - అమరావతి

రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం దాదాపు పడకేసింది. రాష్ట్ర విభజన తర్వాత అనేక ఆర్థిక సవాళ్లు ఉన్న పరిస్థితుల్లోనూ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో సాగునీటి ప్రాజెక్టులకు రూ.55,893.71 కోట్లు ఖర్చు చేయగా ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఈ మూడేళ్లలో ఖర్చు చేసింది కేవలం రూ.15,786.79 కోట్లే. అప్పట్లో ఏడాదికి సగటున రూ.11,178.74 కోట్లు ఖర్చు చేస్తే ఈ ప్రభుత్వం ఏడాదికి సగటున రూ.5,262 కోట్లే ఖర్చు చేసింది. అప్పటి ప్రభుత్వ హయాంలో నీరు ప్రగతి కింద ఖర్చు చేసిన నిధుల మొత్తాన్ని పరిగణనలోకి తీసుకోకుండా లెక్కిస్తేనే ఈ విధంగా ఉంది. నీరు ప్రగతిని కలిపితే రూ.67,222.51 కోట్లను ఖర్చు చేసింది. ఇక గడిచిన మూడేళ్లల్లో ఒక్క ప్రాజెక్టూ పూర్తి కాలేదు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో నెల్లూరు బ్యారేజి, సంగం బ్యారేజితో పాటు మరో 3 ప్రాజెక్టులు పూర్తి చేస్తామని ప్రభుత్వం పేర్కొన్నా అవీ పూర్తి కాలేదు. జలవనరులశాఖ అధికారులు ముఖ్యమంత్రి వద్ద నిర్వహించే సమీక్ష సమావేశంలో ఎప్పటికప్పుడు వీటి గడువులను నెలలకు నెలలు మారుస్తున్నారు. 2021 మార్చి లోపు పూర్తి కావాల్సినవి కూడా 2022 ఏప్రిల్‌ వచ్చినా ప్రారంభం కాలేదు.

ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసరికి నిర్మాణంలో ఉన్న మొత్తం 49 ప్రాజెక్టుల్లో కేవలం అయిదింటినే 2021 మార్చి నాటికి పూర్తి చేస్తామని ప్రభుత్వం గడువు పేర్కొంది. ఆ అయిదూ పూర్తి కాకపోగా మిగిలిన వాటి పరిస్థితి మరీ దారుణంగా ఉంది. పోలవరం నిర్మాణ గడువును ప్రభుత్వం మార్చిన విషయం తెలిసిందే. ప్రధాన డ్యాం నిర్మాణానికి అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. వాటిని సాంకేతికంగా ఎలా పరిష్కరిస్తారనేది చూడాలి. పాతవి కాకుండా మరో రూ.72,458 కోట్లతో చేపడతామని వైకాపా ప్రభుత్వం ప్రణాళికలు రచించిన ఇతర ప్రాజెక్టుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. మరో పక్క బిల్లులు సక్రమంగా చెల్లించకపోవడం వల్లే పనులు చేయలేకపోతున్నామని గుత్తేదారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం చాలా ప్రాజెక్టుల్లో వారు పనులు చేయడం లేదు. రూ.వేల కోట్లు పెండింగు బిల్లులు ఉండటంతో కీలక గుత్తేదారులు కూడా పనులు దాదాపు నిలిపివేసిన పరిస్థితులు నెలకొన్నాయి.

కరోనా తర్వాత ప్రణాళికలూ అమలు కాలేదు
ఆంధ్రప్రదేశ్‌లో జలవనరులశాఖ అధికారులు 2020 సెప్టెంబర్‌లో సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి సంబంధించి ప్రణాళిక రూపొందించారు. అంతకుముందు ప్రభుత్వం పాలనామోదం ఇచ్చి కనీసం 20శాతం పనులు కూడా పూర్తి కాని వాటిని పూర్తిగా రద్దు చేశారు. వాటిలో కొన్నింటిని మాత్రమే ప్రాధాన్యాలు, అవసరాలు రీత్యా కొనసాగించారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని కొత్త ప్రభుత్వం 2020 సెప్టెంబర్‌లో ప్రాజెక్టుల పూర్తికి ప్రణాళిక రూపొందించింది. ఆ ప్రకారం..

* 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.1,078 కోట్లు ఖర్చు చేసి అయిదు ప్రాజెక్టులు పూర్తి చేయాలని ప్రణాళిక రూపొందించారు. అందులో ఒక్క ప్రాజెక్టు కూడా ఇప్పటికీ పూర్తి కాలేదు. ఆ తర్వాత 2021-22 ఆర్థిక సంవత్సరమూ పూర్తయింది.

* 5 ప్రాజెక్టులు కాకుండా మిగిలిన 49 ప్రాజెక్టులను నాలుగు ప్రాధామ్యాలుగా విభజించారు. అందులో తొలి ప్రాధాన్య ప్రాజెక్టులు 19. వీటిని పూర్తి చేయాలంటే రూ.15,085 కోట్లు కావాలని లెక్కించారు. రెండో ప్రాధాన్య ప్రాజెక్టులుగా తొమ్మిందింటిని తీసుకున్నారు. వీటిని పూర్తి చేసేందుకు రూ.1,104 కోట్లు కావాలని అంచనా వేశారు. మూడో ప్రాధాన్య ప్రాజెక్టులుగా 14 కేటాయించారు. వీటిని పూర్తి చేయాలంటే రూ.4,155 కోట్లు కావాలని లెక్కించారు. నిర్మాణంలో ఉన్న మిగిలిన ప్రాజెక్టులు 12 నాలుగో ప్రాధాన్యంగా తీసుకుని రూ.3,748 కోట్లు కావాలని అంచనా వేశారు. ఈ అన్ని ప్రాజెక్టులకూ కలిపి రూ.25,170 కోట్లు కావాలి. ఇందులో పోలవరాన్ని కలిపి లెక్కించలేదు.

* 2020 సెప్టెంబరులో కరోనా తొలిదశ తర్వాత రూపొందించిన ప్రణాళికలో ఒక్క ఏడాది కాలంలో పూర్తి చేయాలనుకున్న 5 ప్రాజెక్టులే పూర్తి కాలేదు. ఇక మిగిలిన వాటికీ నిధుల కేటాయింపు అంతంత మాత్రమే. నిధులు చాలినంత ఇవ్వక, పెండింగు బిల్లులు చెల్లించక సాగునీటి ప్రాజెక్టుల పనులు నిలిచిపోయాయి.


కొత్త ప్రాజెక్టుల్లోనూ అంతంత మాత్రమే!

ఇవి కాకుండా మరికొన్ని కొత్త ప్రాజెక్టులను కూడా చేపడతామని ప్రభుత్వం ప్రకటించింది. వాటికి రూ.కోట్ల అంచనా వ్యయంతో పాలనామోదమూ ఇచ్చింది. అయిదు ఎస్‌పీవీలు ఏర్పాటు చేసి రుణాలు తీసుకువచ్చి రూ.72,458 కోట్లతో వాటిని పూర్తి చేస్తామని ప్రణాళికలు రూపొందించింది. ఇందులో రాయలసీమ, పల్నాడు కరవు నివారణ, నీటి భద్రతా ప్రాజెక్టు, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, కొల్లేరు ఉప్పునీటి పరిరక్షణ కింద చేపడుతున్న ప్రాజెక్టులను చేరుస్తున్నామని  పేర్కొంది. ఈ ప్రాజెక్టుల నిధుల సేకరణ, రుణ సమీకరణకు సవాళ్లు ఏర్పడ్డాయి. ప్రభుత్వం గ్యారంటీలు ఇచ్చే పరిస్థితి లేకపోవడం, జీఎస్టీ సమస్యల వల్ల అడుగు ముందుకు పడటం లేదు. రాష్ట్రంలో మూడు విడతల కరోనా వల్ల ప్రాజెక్టుల పనులు చేసేందుకు ఇబ్బందులు ఏర్పడ్డాయని ప్రభుత్వం పేర్కొంటోంది. నిజానికి ఈ ప్రణాళికలన్నీ కరోనా తొలిదశ తర్వాత రూపొందించినవే. కరోనా సమయంలో కూడా ప్రత్యేకంగా కూలీలను వేరే రాష్ట్రం నుంచి రప్పించి పోలవరం పనులు చేయించామని అధికారులు చెబుతున్నారు. తద్వారా ఇతర ప్రాజెక్టుల్లోను ఈ తరహాలో పనులు  చేసే ఆస్కారం ఉందని వారు చెప్పక  చెప్పినట్లవుతోంది.


కనీస నిధులూ రాల్చట్లేదు..

నెల్లూరు, సంగం బ్యారేజి, వంశధార నాగావళి అనుసంధానం, వంశధార రెండో దశ పనులు పూర్తి చేసేందుకు రూ.405 కోట్లు ఖర్చు చేస్తే సరిపోతుందని లెక్కించారు. మరో రూ.600 కోట్లు ఖర్చు చేస్తే అవుకు రెండో టన్నెల్‌ నుంచి నీటిని మళ్లించడం, వెలిగొండలో కొంత పని పూర్తి చేసి నీళ్లు ఇవ్వడం వంటి పనులు చేయవచ్చని నిర్ణయించారు. ఆ పనులు ఏవీ ఇప్పటికీ పూర్తి చేయలేదు. ఆయా ప్రాజెక్టులను ప్రారంభించే గడువు ఎప్పటికప్పుడు మారుతూ వస్తోంది. తాజాగా ముఖ్యమంత్రితో నిర్వహించిన సమావేశంలో వీటిని ప్రారంభించే గడువులు మార్చారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని