Andhra News: మేలుకోకుంటే మనకూ శ్రీలంక గతే

చరిత్రలో ఎన్నడూ చూడనంత ఆర్థిక సంక్షోభాన్ని శ్రీలంక ఎదుర్కొంటోంది. అక్కడి ప్రజలు పెట్రోలు, వంట గ్యాస్‌, నిత్యావసరాల కోసం అనేక గంటలపాటు బారులు తీరి నిల్చోవాల్సి వస్తోంది. సుదీర్ఘ సమయం విద్యుత్తు కోతలతో దేశమంతా అల్లాడిపోతోంది. అంతర్జాతీయ ద్రవ్య మారక నిల్వలు పడిపోవడంతో 51 బిలియన్‌ డాలర్ల విదేశీ రుణాలను చెల్లించే పరిస్థితి లేదని శ్రీలంక ప్రభుత్వం ప్రకటించింది. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ వద్ద బెయిల్‌ అవుట్‌ దరఖాస్తు పెండింగులో ఉంది. 2021లో ఆ దేశ రుణం వారి స్థూల జాతీయ ఉత్పత్తికి మించిపోయి, 102.8 శాతానికి చేరుకుంది. మన దేశంలోనూ కొన్ని రాష్ట్రాలు తమ అప్పులను తగ్గించుకోకపోతే రాబోయే కొన్నేళ్లలో శ్రీలంకలోని పరిస్థితులనే ఎదుర్కోవాల్సి ఉంటుందన్న భయాలు వ్యక్తమవుతున్నాయి.

Updated : 19 Apr 2022 05:01 IST

5 రాష్ట్రాల అప్పుల పరిస్థితి ఆందోళనకరం
అందులో నాలుగో స్థానంలో ఆంధ్రప్రదేశ్‌
‘ది ప్రింట్‌’ వెబ్‌సైట్‌ సంచలనాత్మక కథనం
రాష్ట్రంలో అధికారిక అప్పుల ఆధారంగా ఆ కథనం
కార్పొరేషన్ల రుణాలు, వాస్తవ లెక్కలు, ఇతర భారాలు లెక్కిస్తే మనదే మొదటిస్థానం
ఈనాడు - అమరావతి

చరిత్రలో ఎన్నడూ చూడనంత ఆర్థిక సంక్షోభాన్ని శ్రీలంక ఎదుర్కొంటోంది. అక్కడి ప్రజలు పెట్రోలు, వంట గ్యాస్‌, నిత్యావసరాల కోసం అనేక గంటలపాటు బారులు తీరి నిల్చోవాల్సి వస్తోంది. సుదీర్ఘ సమయం విద్యుత్తు కోతలతో దేశమంతా అల్లాడిపోతోంది. అంతర్జాతీయ ద్రవ్య మారక నిల్వలు పడిపోవడంతో 51 బిలియన్‌ డాలర్ల విదేశీ రుణాలను చెల్లించే పరిస్థితి లేదని శ్రీలంక ప్రభుత్వం ప్రకటించింది. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ వద్ద బెయిల్‌ అవుట్‌ దరఖాస్తు పెండింగులో ఉంది. 2021లో ఆ దేశ రుణం వారి స్థూల జాతీయ ఉత్పత్తికి మించిపోయి, 102.8 శాతానికి చేరుకుంది. మన దేశంలోనూ కొన్ని రాష్ట్రాలు తమ అప్పులను తగ్గించుకోకపోతే రాబోయే కొన్నేళ్లలో శ్రీలంకలోని పరిస్థితులనే ఎదుర్కోవాల్సి ఉంటుందన్న భయాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రాల అప్పులపై కఠిన ఆంక్షలు విధిస్తే వారు తమ ప్రస్తుత రుణాలను కూడా తిరిగి చెల్లించలేని పరిస్థితులు తలెత్తుతాయి’ అంటూ ప్రముఖ వెబ్‌సైట్‌ ‘ది ప్రింట్‌’ కథనం వెలువరించింది. ఏప్రిల్‌ 16 నాటి ఎడిషన్‌లో శుభం బాత్రా రాసిన కథనంలో ఈ మేరకు ఆందోళన వెలిబుచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ

కేంద్ర ప్రభుత్వ అధికారులతో ఇటీవల నిర్వహించిన సమావేశంలో దేశంలో కొన్ని రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులు దిగజారిన వైనమూ ప్రధాన ఎజెండా అంశంగా చర్చించారని ఆ కథనంలో ప్రస్తావించారు. ఆయా రాష్ట్రాలు తమ ఆర్థిక పరిస్థితులను సరిదిద్దుకోకుండా ఇదే రీతిలో ఉచిత పథకాలు అమలు చేస్తే శ్రీలంక పరిస్థితులు ఏర్పడే అవకాశమూ ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారంటూ ప్రింట్‌ కథనం ఉదహరించింది. ‘శ్రీలంక ఆర్థిక సంక్షోభం నుంచి పంజాబ్‌, బిహార్‌, రాజస్థాన్‌, ఆంధ్రప్రదేశ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రాలు ఎందుకు మేల్కోవాలి? ఉచిత పథకాలు, అప్పులకు ఎందుకు కోత పెట్టాలి?’ అనే శీర్షికన ఈ కథనం ప్రచురించింది. ఈ 5 రాష్ట్రాల్లోని ఆర్థిక పరిస్థితులను ప్రస్తావిస్తూ సాగిన ది ప్రింట్‌ కథన సారాంశమిదీ..

ఎందుకీ సమస్యలు?

దేశంలోని అనేక రాష్ట్రాల అధిక అప్పులకు ప్రాథమికంగా కొవిడ్‌ పరిస్థితులు కారణం. నిజానికి కరోనా కన్నా రెండేళ్ల ముందు అంటే 2018-19 ఆర్థిక సంవత్సరం నుంచే పలు రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులు దిగజారసాగాయి. రాష్ట్రాల సొంత రెవెన్యూ రాబడులు తగ్గిపోవడంతో వారు అప్పులపై అధికంగా ఆధారపడాల్సి వస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఉజ్వల్‌ సెంటర్‌ డిస్కం ఎస్యూరెన్సు యోజన కూడా ఈ పరిస్థితులకు మరో కారణం. ఆయా రాష్ట్రాల్లో కొన్ని ఇతర అంశాలూ వాటి ఆర్థిక పరిస్థితి దిగజారడానికి కారణమయ్యాయి.
* 14వ ఆర్థిక సంఘం కాలపరిమితి ముగిశాక రాష్ట్రాలు తమ ఆదాయాలను ఖర్చు చేసే విషయంలో మరింత వెసులుబాటు లభించిందని బెంగళూరులోని బీఆర్‌ అంబేడ్కర్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ వైస్‌ ఛాన్స్‌లర్‌ ఎన్‌.ఆర్‌.భానుమూర్తి అన్నారు. చాలా రాష్ట్రాలు ప్రజాకర్షక పథకాలపైనే ఎక్కువ ఖర్చు చేయడం వల్ల రెవెన్యూ రాబడుల్లో పెరుగుదల తగ్గిపోయిందని ఆయన అభిప్రాయపడ్డారు.
* రాష్ట్రాలు అనుసరిస్తున్న ఈ విధానాల వల్లే జీఎస్‌డీపీలో వారి రుణాల వాటా అధికమవుతోంది.  
* దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో గత అయిదేళ్లలో రెవెన్యూ రాబడుల్లో పెరుగుదల కన్నా వడ్డీ చెల్లింపుల్లో పెరుగుదల ఎక్కువగా ఉందని కాగ్‌ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఇది ఆయా రాష్ట్రాలు అప్పుల ఊబిలో చిక్కుకుపోయి, వాటిని తీర్చలేని పరిస్థితి తీసుకొస్తోంది.  
* తాజాగా ఎన్నికలు జరిగిన పంజాబ్‌, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల్లో అనేక ప్రజాకర్షక పథకాలు ప్రకటించారు. ప్రస్తుత అప్పులకు అవి కూడా తోడయితే వాటి పరిస్థితి మరింత దయనీయంగా తయారవుతుంది.
* అదృష్టం కొద్దీ గత నాలుగేళ్లలో పంజాబ్‌లో రెవెన్యూ రాబడుల్లో పెరుగుదల రేటు 9శాతం ఉండగా వడ్డీ చెల్లింపు రేటు 3 శాతమే పెరిగింది. జీఎస్‌డీపీలో 53 శాతం అప్పులు చేసిన పంజాబ్‌ పరిస్థితి దేశంలోని అన్ని రాష్ట్రాల కన్నా అత్యంత దారుణంగా ఉంది.
* భాజపా పాలిస్తున్న ఉత్తరప్రదేశ్‌లో తాజా ఎన్నికల్లో ఉచిత గ్యాస్‌ సిలిండర్లు ఇస్తామని హామీ ఇచ్చింది. ఆ రాష్ట్ర రెవెన్యూ రాబడుల్లో గత అయిదేళ్లలో 5 శాతం పెరుగుదల ఉంటే.. వడ్డీ చెల్లింపుల్లో పెరుగుదల రేటు 6 శాతానికి పెరిగిందని కాగ్‌ లెక్కలు చెబుతున్నాయి.
* ఆంధ్రప్రదేశ్‌, బిహార్‌, రాజస్థాన్‌ వంటి రాష్ట్రాల అప్పుల పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో 2021-22 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి మొత్తం రుణం రూ.3.89 లక్షల కోట్లకు చేరింది. అంతకుముందు ఏడాదితో పోల్చితే ఇది రూ.40 వేల కోట్లు ఎక్కువ. ఏపీ జీఎస్‌డీపీలో అప్పు 32.4 శాతానికి చేరుకుంది.
* కేంద్ర ప్రభుత్వ విశ్రాంత రెవెన్యూ కార్యదర్శి ఎన్‌.కె.సింగ్‌ నేతృత్వంలో ఏర్పాటయిన ఎఫ్‌ఆర్‌బీఎం కమిటీ.. రాష్ట్రాల్లో జీఎస్‌డీపీ అప్పుల నిష్పత్తిని 20 శాతానికే పరిమితం చేయాలని సిఫార్సు చేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఈ లక్ష్యం చేరుకోవాల్సి ఉండటం గమనార్హం.
* అన్ని రాష్ట్రాల స్థూల జాతీయోత్పత్తిలో వారి బహిరంగ మార్కెట్‌ రుణం 63.6 శాతానికి చేరుకుందని 2022 మార్చి నాటి లెక్కలను ఉదహరిస్తూ రిజర్వుబ్యాంకు పేర్కొంది.
* ‘కేంద్రం ఎక్కువ అప్పులు చేస్తోంది. జీఎస్టీతో లక్షల కోట్ల ఆదాయం వస్తుండటంతో కేంద్రం దాన్ని చూపించి, రాష్ట్రాల కన్నా అధికంగా అప్పులు చేస్తోంది. అదే సమయంలో రాష్ట్రాలు ఎక్కువ లోటు, ఎక్కువ అప్పులు లేకుండా చూసుకోవాలంటోంది.. ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనలు కేంద్ర, రాష్ట్రాలు రెండింటికీ ఒకేలా వర్తించేలా ఉంటేనే దీర్ఘకాలంలో ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది’ అని నిపుణులు సూచిస్తున్నారు.
* కార్పొరేషన్లకు సొంత వ్యాపారాలు, కార్యకలాపాలు లేవు. వాటి అప్పులు, వడ్డీ భారమూ రాష్ట్ర బడ్జెట్‌పైనే పడుతోంది. కాబట్టి కార్పొరేషన్ల రుణాలను కూడా కలిపి లెక్కించాల్సి వస్తోంది.
* స్టేట్‌ ఫైనాన్షియల్‌ సర్వీస్‌ కార్పొరేషన్‌ వంటి ఇతరత్రా అనేక రూపాల్లో తాజాగా రాష్ట్ర ప్రభుత్వం రుణాలు సేకరిస్తోంది.  
* మూడేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం బకాయిలు చెల్లించడం లేదు. గుత్తేదారులు, సరఫరాదారులు, ప్రభుత్వ ఉద్యోగులకూ కూడా పెద్ద మొత్తంలో బకాయిలు పడింది. ఇవన్నీ ప్రభుత్వ బడ్జెట్‌పై పెండింగులో ఉన్న భారాలే. అసలు ఈ భారం ఎంతనేది ఆర్థికశాఖ అధికారుల వద్దే సమగ్ర లెక్కలు లేవనే విమర్శలు ఉన్నాయి.

జీఎస్‌డీపీలో ఏపీ రుణభారం ఎంత?
* ప్రింట్‌ చెప్పిన లెక్కల ప్రకారం దేశంలోనే అత్యధిక రుణభారం పంజాబ్‌ది. ఆ రాష్ట్ర జీఎస్‌డీపీలో అప్పుల వాటా 53 శాతం.
* ఆంధ్రప్రదేశ్‌కు ఉన్న మొత్తం చెల్లింపుల భారం రూ.7.76 లక్షల కోట్లు కూడా పరిగణనలోకి తీసుకుంటే జీఎస్‌డీపీలో మన భారాల వాటా 76 శాతంగా ఉంటుందనేది నిపుణుల లెక్క. ఈ భారమంతా రాష్ట్ర బడ్జెట్‌ నుంచే భరించాలి. అంటే పంజాబ్‌ కన్నా ఆంధ్రప్రదేశ్‌ పరిస్థితులే దారుణంగా ఉన్నాయని నిపుణుల విశ్లేషణ.
* ఆంధ్రప్రదేశ్‌లో రుణాల తిరిగి చెల్లింపునకు సరైన ప్రణాళికలు లేవు.. అప్పులు తీర్చేందుకు మళ్లీ అప్పులు చేయాల్సిన పరిస్థితి ఉందని ఇప్పటికే కాగ్‌ విమర్శించింది. ఈ పరిస్థితుల్లో అప్పులపై కేంద్రం ఆంక్షలు విధిస్తే రాష్ట్ర పరిస్థితి ఏమిటని నిపుణులు ఆందోళన చెందుతున్నారు.


సంక్షోభం అంచుల్లో ఉన్నాం.. సీఎం మేల్కొనాలి

- రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఎల్‌.వి.సుబ్రహ్మణ్యం

ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక సంక్షోభం అంచుల్లో ఉంది. దగ్గర్లోనే అది నాకు కనిపిస్తోంది. రిజర్వుబ్యాంకు వాళ్లు మన ఖాతాలు స్తంభింపజేసే ప్రమాదం గోచరిస్తోంది. ఆర్థిక అత్యవసర పరిస్థితి కింద గవర్నర్‌ లేదా ఇతర సంస్థలు కొన్ని నిర్ణయాలు తీసుకుంటామని తాఖీదులూ ఇచ్చే పరిస్థితీ రావచ్చు. రాష్ట్రం ఇలా చతికిలపడితే ఆ భారం కేంద్రంపై పడుతుంది. కేంద్ర ఆర్థిక పరిస్థితీ అంతంతమాత్రంగానే ఉంది. ఇప్పటికైనా సీఎం మేల్కొని ఏవో రెండు మూడు కార్యక్రమాలు అమలు చేస్తూ మిగిలినవాటిని తాత్కాలికంగా నిలిపివేస్తేనే మనకు మనుగడ ఉంటుంది.

జీతాలివ్వకుండా, అభివృద్ధి చేయకుండా డబ్బులు పంచేస్తే ఎలా?

జీతాలు ఇవ్వకుండా డబ్బులు పంచి పెడతామంటే ఎవరూ ఊరుకోరు. అందరికీ జీతాలు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. కొవిడ్‌ మళ్లీ వస్తుందని, రాదని భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా రాష్ట్రంలో వైద్య వసతులకు, విద్య, వైద్య ప్రమాణాలు పెంచేందుకు, రవాణా సౌకర్యాలు అభివృద్ధి చేసేందుకు అవసరమైన కార్యక్రమాలు అమలు చేయాలి. ముఖ్యమంత్రి, మంత్రిమండలి, అధికారులు విజ్ఞతతో వ్యవహరిస్తే కొన్నాళ్లు ప్రజలకు సేవ చేయడానికి అవకాశం ఉంటుంది. అలా చేయకపోతే అదీ కోల్పోయే ప్రమాదం కనిపిస్తోంది. ఇక్కడి అవకతవకలు, పరిస్థితులపై చెబుతున్నది కాగ్‌, పబ్లిక్‌ అకౌంట్స్‌ కమిటీ నివేదికలు. పీఏసీకి సలహాలిచ్చేది అకౌంటెంట్‌ జనరల్‌. ఇవన్నీ ఆరోపణలేనని వైకాపా వాళ్లు అంటున్నారు. కానీ అవన్నీ ఇప్పటికే రుజువయ్యాయి. ఏపీలో నిధుల మళ్లింపు జరుగుతోందని సాక్షాత్తూ కేంద్ర మంత్రి.. పార్లమెంటులో ప్రకటించారు. ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనలూ అతిక్రమించారని పేర్కొన్నారు. ఇవన్నీ ఘోర తప్పిదాలు. ఇప్పటికైనా సత్వర చర్యలు తీసుకుంటేనే ఈ ఆర్థిక సంవత్సరంలో కొంత కుదుటపడగలం.

ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థిక పరిస్థితులు ఇంకా ఘోరం!

‘ది ప్రింట్‌ ప్రచురించిన కథనంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి సంబంధించిన అధికారిక లెక్కలనే పరిగణనలోకి తీసుకుంది. ఆ లెక్కలను చూసే మన ఆర్థిక పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేసింది. నిజానికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతకన్నా దారుణంగా ఉంది. అప్పులు అంతకుమించి ఎక్కువగా ఉన్నాయి’ అని నిపుణులు చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని