గోరంట్ల వీడియోపై కేంద్ర ల్యాబ్‌లో పరీక్షలు చేయించండి.. అమిత్‌షాకు హైకోర్టు న్యాయవాది లేఖ

అనంతపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌ ఒక మహిళతో నగ్నంగా వీడియోకాల్‌ మాట్లాడినట్లుగా ప్రచారంలో ఉన్న వీడియో క్లిప్‌.. ఫేక్‌, మార్ఫింగ్‌ వీడియో అని అనంతపురం ఎస్పీ ఫక్కీరప్ప

Updated : 13 Aug 2022 10:02 IST

ఫోరెన్సిక్‌ టెస్ట్‌ చేయించి నిజం తేల్చాలి

ప్రజల్ని తప్పుదోవ పట్టించేలా ఎస్పీ ఫక్కీరప్ప ధోరణి

ఈనాడు, అమరావతి: అనంతపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌ ఒక మహిళతో నగ్నంగా వీడియోకాల్‌ మాట్లాడినట్లుగా ప్రచారంలో ఉన్న వీడియో క్లిప్‌.. ఫేక్‌, మార్ఫింగ్‌ వీడియో అని అనంతపురం ఎస్పీ ఫక్కీరప్ప చెప్పడం మహిళా లోకాన్ని విస్మయానికి గురిచేసిందంటూ హైకోర్టు న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు శుక్రవారం లేఖ రాశారు. కోట్లాది మహిళల ఆత్మగౌరవం, భద్రతకు సంబంధించిన అంశాలు ముడిపడి ఉన్నందున ఆ వీడియో క్లిప్‌పై కేంద్ర ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లో పరీక్షలు నిర్వహించి, నిజానిజాలు వెలికితీయాలని అభ్యర్థించారు. రాష్ట్రంలో మహిళలపై యథేచ్ఛగా దాడులు, అఘాయిత్యాలు జరుగుతున్నాయని.. 2019 జూన్‌  2022 జులై మధ్య 777 ఘటనలు నమోదయ్యాయని ఆయన లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రంలో మహిళలకు భద్రత కల్పించడంలో వైకాపా ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. ‘మహిళలపై జరుగుతున్న నేరాల్లో వైకాపా నాయకులు, మద్దతుదారుల ప్రత్యక్ష, పరోక్ష ప్రమేయం ఉంటోంది. వైకాపా తరపున చట్టసభలకు ఎన్నికైన నాయకులు మహిళా ప్రభుత్వ ఉద్యోగుల్ని, ఇతర మహిళల్ని బెదిరించిన సందర్భాలు చాలా ఉన్నాయి. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న వైకాపా నేతల్ని కాపాడేందుకు ఓ వర్గం పోలీసులు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులను చూసి ఏ నాగరిక సమాజమైనా సిగ్గుతో తలదించుకుంటుంది. దిశ అని ప్రత్యేక చట్టం లేకున్నా ఏపీ ప్రభుత్వం ఆ పేరుతో మహిళల్ని మోసం చేస్తోంది. వైకాపా నాయకుల మద్దతు, ప్రోత్సాహంతో అసాంఘిక శక్తులు విధ్వంసం సృష్టిస్తున్నాయి. ఏపీ పోలీసుల నివేదిక ప్రకారం 2020లో మహిళలపై 14,603 నేరాలు జరగ్గా 2021కి అవి 17,736కి (21.45%) పెరిగాయి’ అని లక్ష్మీనారాయణ లేఖలో వివరించారు. ఏపీలో జరుగుతున్న అఘాయిత్యాలపై కేంద్ర హోం శాఖ సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. నేరస్తుల్ని తప్పించడంలో వైకాపా ప్రభుత్వం, పోలీసులు, అధికారుల పాత్రపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఫక్కీరప్పపై శాఖాపరమైన చర్యలు తీసుకోండి
మాధవ్‌ వీడియో క్లిప్‌పై సమగ్ర విచారణ జరిపి, ప్రజలకు వాస్తవాలు వెల్లడించాలని లక్ష్మీనారాయణ డీజీపీకి మరో లేఖ రాశారు. ‘వీడియో క్లిప్‌పై విచారణ జరుగుతుండగానే వాస్తవాల్ని వక్రీకరించి వివరాలు బహిర్గతం చేయడం పోలీసుల ఎథిక్స్‌, స్టాండింగ్‌ ఆర్డర్లకు విరుద్ధం. ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకే ఫక్కీరప్ప ఇదంతా చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఆయనపై శాఖాపరమైన చర్యలు తీసుకోండి’ అని లేఖలో పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని