Ap High Court: వాలంటీర్లతో అధికారిక విధులేంటి? .. లబ్ధిదారుల ఎంపికతో వీరికేమి సంబంధం?

వాలంటీర్ల విధుల విషయంలో తాము కోరిన వివరాలను గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ(సెర్ప్‌) సీఈవో ఇంతియాజ్‌ కోర్టు ముందు ఉంచలేదని హైకోర్టు ఆక్షేపించింది.

Updated : 11 Mar 2023 09:51 IST

సెర్ప్‌ సీఈవో వేసిన అఫిడవిట్‌పై అసంతృప్తి
మెరుగైన అఫిడవిట్‌ వేయాలని హైకోర్టు ఆదేశం

ఈనాడు, అమరావతి: వాలంటీర్ల విధుల విషయంలో తాము కోరిన వివరాలను గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ(సెర్ప్‌) సీఈవో ఇంతియాజ్‌ కోర్టు ముందు ఉంచలేదని హైకోర్టు ఆక్షేపించింది. పూర్తి వివరాలతో మెరుగైన అఫిడవిట్‌ వేయాలని ఆదేశించింది. సామాజిక సేవ కోసం నియమించుకున్న వాలంటీర్ల ద్వారా సంక్షేమ పథకాల లబ్ధిదారుల వివరాలు ఏవిధంగా సేకరిస్తారు, అందుకు ఏ చట్ట నిబంధనలను అనుమతిస్తున్నాయో స్పష్టత ఇవ్వాలని పేర్కొంది. ప్రభుత్వ అధికారులతో చేయించాల్సిన పనులను వీరి ద్వారా చేయిస్తున్నారని ఆక్షేపించింది. లబ్ధిదారుల ఎంపికతో వారికేం సంబంధమని ఘాటుగా వ్యాఖ్యానించింది. వాలంటీర్లకు జవాబుదారీతనం ఏమి ఉంటుందని పునరుద్ఘాటించింది. విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ శుక్రవారం ఈ మేరకు ఆదేశాలిచ్చారు. వైఎస్‌ఆర్‌ చేయూత పథకం కింద గతంలో లబ్ధిదారులుగా ప్రయోజనం పొందామని, రాజకీయ కారణాలతో తమను అర్హతల నుంచి తొలగించారని పేర్కొంటూ గుంటూరు జిల్లా పెదకూరపాడు మండలం గారపాడుకు చెందిన ఆర్‌.వసంతలక్ష్మి మరో 26 మంది హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఇటీవల ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన న్యాయమూర్తి.. వారి విధులపై స్పష్టత ఇస్తూ అఫిడవిట్‌ వేయాలని సెర్ప్‌ సీఈవోను ఆదేశించారు. శుక్రవారం జరిగిన విచారణలో పిటిషనర్ల తరఫున న్యాయవాది జి.అరుణ్‌శౌరి వాదనలు వినిపిస్తూ... న్యాయస్థానం కోరిన వివరాలు సెర్ప్‌ సీఈవో తాజాగా వేసిన అఫిడవిట్‌లో లేవన్నారు. సెర్ప్‌ సీఈవో తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. వాలంటీర్లు సమాచారాన్ని సేకరించి సచివాలయ సిబ్బందికి ఇస్తారని, లబ్ధిదారుల ఎంపికలో వారి పాత్ర ఉండదని చెప్పారు. సీఈవో వేసిన అఫిడవిట్‌పై న్యాయమూర్తి అసంతృప్తి వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని