AP News:ఇసుకేస్తే రాలనన్ని లొసుగులు!

కిరాణా కొట్టుకెళ్లి పది రూపాయల బిస్కెట్‌ ప్యాకెట్‌ కొన్నా... ఆన్‌లైన్‌లో చెల్లింపులు జరిపే రోజులివి. కానీ మీకు ఎన్ని వేల రూపాయల ఇసుక కావాలన్నా రీచ్‌ల్లోకో, డిపోల్లోకో వెళ్లి.. నోట్ల కట్టలు చేతిలో పెడితే తప్ప ఇసుక లారీకి ఎక్కదు. ఇదొక్కటే కాదు.. రాష్ట్రంలో ప్రైవేటు సంస్థ ద్వారా జరుగుతున్న ఇసుక తవ్వకాలు, విక్రయాల్లో క్షేత్రస్థాయిలో ఎన్నో లొసుగులు కనిపిస్తున్నాయి.

Updated : 21 Dec 2021 08:11 IST

గుత్తేదారు జేపీ పవర్‌ వెంచర్స్‌ బదులు టర్న్‌కీ సంస్థ ఇసుక తవ్వకాలు
ఇసుక టెండర్లకు కొన్నాళ్ల ముందే పుట్టిన సంస్థ
ఏడు నెలలైనా ఆన్‌లైన్‌ బిల్లుల్లేవు
సొంత వేబిల్లులే జారీ  
బాట ఛార్జీల పేరుతో స్థానిక నేతల దందా
 ఒక్కో రీచ్‌లో ఏడాదికి రూ.2.40 కోట్లపైనే..
వడ్డాది మహేశ్‌, ఉభయ గోదావరి జిల్లాల నుంచి ‘ఈనాడు’ ప్రత్యేక ప్రతినిధి

తూర్పుగోదావరి జిల్లా వేమగిరి రీచ్‌లో భారీగా ఇసుక తవ్వకాలు

కిరాణా కొట్టుకెళ్లి పది రూపాయల బిస్కెట్‌ ప్యాకెట్‌ కొన్నా... ఆన్‌లైన్‌లో చెల్లింపులు జరిపే రోజులివి. కానీ మీకు ఎన్ని వేల రూపాయల ఇసుక కావాలన్నా రీచ్‌ల్లోకో, డిపోల్లోకో వెళ్లి.. నోట్ల కట్టలు చేతిలో పెడితే తప్ప ఇసుక లారీకి ఎక్కదు. ఇదొక్కటే కాదు.. రాష్ట్రంలో ప్రైవేటు సంస్థ ద్వారా జరుగుతున్న ఇసుక తవ్వకాలు, విక్రయాల్లో క్షేత్రస్థాయిలో ఎన్నో లొసుగులు కనిపిస్తున్నాయి. ఉభయగోదావరి జిల్లాల్లోని వేమగిరి, మందపల్లె, అంకంపాలెం, ఊబలంక రీచ్‌ల్లోనూ, గాయత్రి, కోటిలింగాలు, వాడపల్లి, ఔరంగాబాద్‌ పడవ ర్యాంపుల్లోనూ ‘ఈనాడు’ ప్రతినిధులు క్షేత్రస్థాయిలో పరిశీలించినప్పుడు.. సరిహద్దుల్ని స్పష్టంగా నిర్ణయించకుండా ఎడాపెడా ఇసుక తవ్వేయడం, ఆన్‌లైన్‌ బిల్లింగ్‌ లేకపోవడం, సీసీ కెమెరాలు పని చేయకపోవడం వంటి అనేక ఉల్లంఘనలు కనిపించాయి.
రీచ్‌ల్లో ఎంత ఇసుక తవ్వుతున్నారు? ఎంత విక్రయిస్తున్నారు? అని గుత్తేదారు సంస్థ ప్రతినిధులు పుస్తకాల్లో రాసిన లెక్కల్నే గనుల శాఖ అధికారులు పరిగణనలోకి తీసుకుంటున్నారు. నిజమైన లెక్కలన్నీ ఆ సంస్థ పుస్తకాల్లో నమోదు చేస్తుందా అన్నది సందేహమే.
రాష్ట్రంలో ఇసుక తవ్వకం బాధ్యతల్ని ప్రైవేటు సంస్థ చేపట్టి ఏడు నెలలవుతోంది.
నేటికీ కంప్యూటరైజ్డ్‌ వే బిల్లులు ఇవ్వడం లేదు. గుత్తేదారు సంస్థ సొంతంగా ముద్రించుకున్న వేబిల్లులకు రీచ్‌ల్లోని సిబ్బంది చేతిరాతతో సంఖ్యలు కేటాయిస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వానికి అన్ని బిల్లుల లెక్కలూ చూపిస్తున్నారా? అన్న సందేహాలు వ్యక్యమవుతున్నాయి. ఆన్‌లైన్‌ బిల్లులు జారీ చేసేలా సాఫ్ట్‌వేర్‌ రూపొందించామని గనులశాఖ అధికారులు చెప్పి మూణ్నెల్లయినా నేటికీ అమల్లోకి రాలేదు.

తూర్పుగోదావరి జిల్లా మందపల్లి రీచ్‌లో ఇసుక కోసం వరుసలో ఉన్న లారీలు

ఎడాపెడా తవ్వకాలు
అన్ని రీచ్‌ల్లో జియోకోఆర్డినేట్స్‌ ద్వారా సరిహద్దులు నిర్ణయించామని గనుల శాఖ చెబుతోంది. ఆ హద్దులు కనిపించేలా ఏ రీచ్‌లోనూ లీజుదారు జెండాలు ఏర్పాటు చేయలేదు. రీచ్‌కు దగ్గర్లో ఇసుక దొరికినచోటల్లా తవ్వుకుంటూ పోతున్నా అధికారులు పట్టించుకోవట్లేదు.  

పనిచేయని సీసీ కెమెరాలు
గతంలో ఏపీఎండీసీ ద్వారా ఇసుక తవ్వకాలు జరిపినప్పుడు ప్రతి చోటా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, ఆ సంస్థ ప్రధాన కార్యాలయం నుంచి పర్యవేక్షించేవారు. ప్రైవేటు సంస్థ టెండరు దక్కించుకున్నాక అధికారులు సీసీ కెమెరాలను ఆ సంస్థకు అప్పగించి, చేతులు దులిపేసుకున్నారు. ఇప్పుడవి పని చేయడం లేదు. దీంతో ఎన్ని లోడ్లు బయటకు వెళ్తున్నాయనే నిఘా కరవైంది.

బాటఛార్జీ పేరిట బాదుడు
రాష్ట్రంలోని పలు రీచ్‌ల్లో ప్రతి లారీ నుంచి రూ.500 చొప్పున బాటఛార్జీ పేరిట కొందరు స్థానికులు వసూళ్లు చేస్తున్నారు. నిత్యం ఒక్కో రీచ్‌ నుంచి 200 లారీల ఇసుక వెళ్తుంటే బాటఛార్జీల పేరిట దోపిడీ లక్ష వరకూ ఉంటోంది. సగటున నెలకు రూ.30 లక్షలు వసూలు చేస్తున్నారు. వర్షాకాలం నాలుగు నెలలు తవ్వకాలు జరగలేదనుకున్నా.. మిగిలిన 8 నెలలకు సుమారు రూ.2.40 కోట్ల అనధికారిక వసూళ్లకు పాల్పడుతున్నారు. గతంలో ఇసుక లోడింగ్‌ చేసిన కూలీలకు ఇప్పుడు పనులు లేకపోవడంతో వారికి కొంత మొత్తం ఇస్తున్నామని, ఆ ఊరి అవసరాలకు, లారీల రాకపోకలతో గుంతలుపడిన రహదారులు పూడ్చటానికి అవసరమంటూ ఈ దందా కొనసాగిస్తున్నారు. మందపల్లి, ఊబలంక, అంకంపాలెం రీచ్‌ల్లో బాట ఛార్జీల పేరుతో వసూళ్ల దందా ‘ఈనాడు’ పరిశీలనలో బయటపడింది. బాట ఛార్జీ ఇవ్వకపోతే ఇసుక లోడ్‌ చేయరని, అందుకే ఆ భారాన్ని కొనుగోలుదారుపైనే మోపాల్సి వస్తోందని పలువురు లారీడ్రైవర్లు తెలిపారు. బాటఛార్జీలపై కొద్దిరోజుల కిందట రావులపాలెం లారీ యజమాని ఒకరు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు వెనక్కి తీసుకోవాలంటూ అతనిపై తీవ్రంగా ఒత్తిళ్లు వస్తున్నట్లు తెలిసింది.

తూర్పుగోదావరి జిల్లా వేమగిరి రీచ్‌ వద్ద నుంచి ఇసుక లోడ్‌తో బయటకు వెళ్తున్న లారీ, ఆ దృశ్యాలు రికార్డు కాకుండా వెనక్కి తిప్పి ఉన్న సీసీ కెమెరా

ఏడాది వయసైనా లేని సంస్థకు సబ్‌లీజు
రాష్ట్రంలోని మూడు జోన్లలో టెండర్లను దిల్లీకి చెందిన జేపీ పవర్‌ వెంచర్స్‌ దక్కించుకుంది. మే 14న గనులశాఖతో ఒప్పందం చేసుకొని, ఇసుక తవ్వకాలు చేపట్టింది. తర్వాత టర్న్‌కీ ఎంటర్‌ప్రైజెస్‌ అనే సంస్థకు ఉపగుత్తేదారుగా ఇసుక తవ్వకాలు, విక్రయాల బాధ్యతలు అప్పగించింది. టర్న్‌కీ సంస్థ.. రాష్ట్రంలో ఇసుక టెండర్లు నిర్వహించడానికి కొన్ని నెలల ముందే పుట్టింది. చెన్నై కేంద్రంగా 2020 డిసెంబరు 30న ఈ సంస్థ ఏర్పాటైనట్టు రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీస్‌ వెబ్‌సైట్‌లో ఉంది. రీచ్‌ల్లో సిబ్బంది అత్యధికంగా తమిళనాడువారే ఉండటంతో తమ ఉపాధికి గండిపడుతోందని స్థానికులు వాపోతున్నారు.


చెల్లింపులు ఎలాగన్నది గుత్తేదారు ఇష్టం
- వీజీ వెంకటరెడ్డి, గనులశాఖ సంచాలకులు

ఇసుక తవ్వకాలు, విక్రయాల్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. నిబంధనలన్నీ పాటించేలా చూస్తున్నాం. జేపీ పవర్‌ వెంచర్స్‌ సంస్థతో టర్న్‌కీ ఎంటర్‌ప్రైజెస్‌ సంస్థ ఒప్పందం చేసుకుని ఉపగుత్తేదారుగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. త్వరలోనే ఆన్‌లైన్‌లో వేబిల్లులు జారీ అయ్యేలా చూస్తాం. గుత్తేదారు సంస్థ నిత్యం ఇసుక తవ్వకాలు, విక్రయాల వివరాల్ని ఆయా జిల్లాల్లోని గనులశాఖ ఏడీలకు అందజేస్తోంది. డిజిటల్‌ చెల్లింపులను స్వీకరించడం అన్నది గుత్తేదారు సంస్థ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.


నోట్లిస్తేనే లోడింగ్‌

ఇసుక రీచ్‌లు, డిపోల్లో నోట్ల రూపంలో డబ్బు చెల్లిస్తేనే ఇసుక లోడ్‌ చేస్తున్నారు. ఆన్‌లైన్‌ చెల్లింపులకు అంగీకరించవద్దని తమ యాజమాన్యం స్పష్టంగా ఆదేశించిందని అక్కడి సిబ్బంది చెబుతున్నారు. డిజిటల్‌ విధానంలో చెల్లింపులు జరిగితే.. నిత్యం ఎన్ని టన్నుల ఇసుక అమ్మారో అధికారులకు తెలుస్తుంది. అలా తెలియకుండా ఉండేందుకే గుత్తేదారు సంస్థ నగదుగానే ఇవ్వాలని పట్టుబడుతోందన్న అనుమానాలున్నాయి. డిజిటల్‌ చెల్లింపులు జరిగేలా చూస్తామని గనులశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది కొన్నాళ్ల క్రితం ప్రకటించినా ఆచరణకు నోచుకోలేదు.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని