Azadi Ka Amrit Mahotsav: బ్రిటన్‌ నాజీయిజం

గ్యాస్‌ ఛాంబర్లనగానే ప్రపంచంలో అందరికీ హిట్లర్‌, నాజీయిజం, యూదులు గుర్తుకొస్తారు. కానీ హిట్లర్‌ కంటే దుర్మార్గంగా గ్యాస్‌ ఛాంబర్లను భారతీయులపై....

Updated : 15 Nov 2021 09:11 IST

గ్యాస్‌ ఛాంబర్లనగానే ప్రపంచంలో అందరికీ హిట్లర్‌, నాజీయిజం, యూదులు గుర్తుకొస్తారు. కానీ హిట్లర్‌ కంటే దుర్మార్గంగా గ్యాస్‌ ఛాంబర్లను భారతీయులపై ప్రయోగించింది బ్రిటన్‌! హిట్లర్‌ జాత్యహంకారంతో యూదులను గ్యాస్‌ ఛాంబర్లలోకి నెడితే... తమను నమ్మి వచ్చిన భారతీయ సిపాయిలను విషవాయువుల బారిన పడేసింది విశ్వాసఘాతుక బ్రిటిష్‌ సర్కారు.

ప్రపంచ యుద్ధాలతో నిజానికి భారత్‌కు నేరుగా ఎలాంటి సంబంధమూ లేదు. కానీ భారత్‌ను తన వలస రాజ్యంగా మలచుకున్న బ్రిటన్‌- భారతీయులను తమ ఆస్తిగా భావించింది. తాము యుద్ధం చేస్తే భారత్‌ కూడా చేస్తున్నట్లేనంది. ప్రత్యక్షంగా భారత్‌నూ ప్రపంచయుద్ధాల్లోకి లాగింది. లక్షల మంది మన సిపాయిలను తమ పక్షాన సమరబరిలో దించింది. భారత్‌తో ఎలాంటి విరోధం లేని వివిధ దేశాలతో, ఎన్నడూ కనీవినీ ఎరుగని ప్రాంతాల్లో భారతీయ సిపాయిలు బ్రిటన్‌ జెండాను నిలబెట్టడానికి పోరాడారు. అసువులు బాశారు. ఇదంతా ఒకెత్తయితే...

తమను నమ్మి వచ్చిన భారతీయ సైనికులపై బ్రిటన్‌ పాల్పడిన దురాగతాల్లో అత్యంత హీనమైంది విష వాయువుల ప్రయోగం. యుద్ధంలో ప్రత్యర్థులపై రసాయనాల వినియోగానికి సంబంధించి బ్రిటన్‌ శాస్త్రవేత్తలు చాలాకాలంగా ప్రయోగాలు చేస్తూ వచ్చారు. ఇంగ్లాండ్‌లోని పోర్టన్‌డౌన్‌లో సైన్స్‌ పార్క్‌ బ్రిటన్‌ రక్షణ పరిశోధనల కేంద్రం ఉంది. ఇందులోని శాస్త్రవేత్తలు రెండో ప్రపంచ యుద్ధానికి 10 సంవత్సరాల ముందే అంటే 1930 దశకం ఆరంభంలో రావల్పిండిలోని (ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉంది) రహస్య సైనిక కేంద్రానికి వచ్చారు. దాదాపు పదేళ్లపాటు అక్కడ భారతీయ సైనికులపై విషరసాయనాలను ప్రయోగించారు. ఎంతమోతాదులో రసాయనాలను విడుదల చేస్తే ఎలాంటి ఫలితాలుంటాయో, ప్రత్యర్థిని చంపాలంటే ఎంత మోతాదు అవసరమో... వీరిపై పరీక్షించి చూశారు. లండన్‌ జాతీయ ఆర్కైవ్స్‌ ప్రకారం యుద్ధంలో జపాన్‌పై వాడేందుకు వీటిని పరీక్షించారు. అనేక మంది భారతీయ సిపాయిలను ఇందుకు వాడుకున్నారు.

సైనిక డ్రిల్‌కు ఉపయోగించే నిక్కర్లు, కాటన్‌ చొక్కాలు వేసి వారిని గ్యాస్‌ ఛాంబర్లోకి పంపించి... విషవాయువులను ప్రయోగించేవారు. చాలామందికి చర్మం కాలిపోయిందని, కళ్లు దెబ్బతిన్నాయని ... వారిని మిలిటరీ ఆస్పత్రిలో చేర్పించామని అప్పటి శాస్త్రవేత్తలు రికార్డు చేశారు. మిగిలినవారి పరిస్థితి ఏమైంది? గాయపడ్డవారి తర్వాతి స్థితిగతులేంటనేవి ఎక్కడా లేవు. ఆనాడు ప్రయోగించిన విషవాయువులు... క్యాన్సర్‌ కారకాలనేది ప్రస్తుత పరిశోధకులంటున్న మాట. ఈ పరిశోధనలకు వినియోగించిన సిపాయిలకు సమాచారం ఇవ్వటంగానీ, వారి నుంచి ముందస్తు అనుమతి తీసుకోవటంగానీ చేయలేదని పోర్టన్‌డౌన్‌ పార్క్‌ ప్రతినిధి అంగీకరించటం గమనార్హం.

యూదులపై అమానవీయంగా... విషప్రయోగాలు చేశారని నాటి జర్మన్‌ ఛాన్స్‌లర్‌ హిట్లర్‌పై దుమ్మెత్తిపోసి, నేటికీ ప్రచారం చేస్తున్న బ్రిటన్‌... తానూ ఆ తానులో ముక్కేనని, దురాగతాల్లో నాజీలకు తీసిపోదని చెప్పేందుకు రావల్పిండి ప్రయోగాలే నిదర్శనం!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని