CM Jagan: వచ్చే ఎన్నికల్లో 175కి 175 స్థానాలు ఎందుకు రావు?

‘ఇన్ని బటన్లు నొక్కి ఈ మూడేళ్లలో రూ.1.37లక్షల కోట్లను ఇచ్చాం. ఈ ఏడాది రూ.55 వేల కోట్లు... వచ్చే ఏడాది మరో రూ.55వేల కోట్లు ఇవ్వనున్నాం. అంటే మొత్తంగా దాదాపు రూ.2.50లక్షల కోట్లవుతుంది. ఇంత గొప్పగా చేసిన తర్వాత కూడా

Updated : 11 Aug 2022 14:37 IST

ఇప్పటికే రూ.1.37లక్షల కోట్లిచ్చాం
రానున్న రెండేళ్లలో మరో రూ.లక్ష కోట్లు ఇస్తాం
ఎమ్మెల్యేల గ్రాఫ్‌ పెంచుకునేందుకే మే 10 నుంచి ‘గడప గడపకు’
మంత్రులు, వైకాపా ప్రాంతీయ సమన్వయకర్తలు, పార్టీ జిల్లా అధ్యక్షుల సమావేశంలో సీఎం జగన్‌
సర్వేల్లో సీఎంకు 65% .. ఎమ్మెల్యేలకు 45% మద్దతు: కొడాలి నాని

ఈనాడు, అమరావతి: ‘ఇన్ని బటన్లు నొక్కి ఈ మూడేళ్లలో రూ.1.37లక్షల కోట్లను ఇచ్చాం. ఈ ఏడాది రూ.55 వేల కోట్లు... వచ్చే ఏడాది మరో రూ.55వేల కోట్లు ఇవ్వనున్నాం. అంటే మొత్తంగా దాదాపు రూ.2.50లక్షల కోట్లవుతుంది. ఇంత గొప్పగా చేసిన తర్వాత కూడా గతంలో వచ్చిన 151 సీట్లకు ఇప్పుడు తగ్గకూడదు కదా! 151 ఎందుకు? మొత్తం 175కి 175 స్థానాలూ ఎందుకు రాకూడదు...’అని వైకాపా అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ వ్యాఖ్యానించారు. ‘గత ఎన్నికలకు వచ్చే ఎన్నికలకు తేడా లేదా? గత ఎన్నికల్లో కుప్పం మనకు రాలేదు. ఇప్పుడు కుప్పం మునిసిపాలిటీతో సహా అక్కడ స్థానిక సంస్థలను గెలిచాం.

పార్టీ పరంగా జరగాల్సినవి, ప్రభుత్వ పరంగా మనం చేసిన మంచిని సమర్థంగా ప్రజల్లోకి తీసుకువెళ్లి వారిని చైతన్యపరచడమనేది సరిగా చేస్తే 175 స్థానాలు ఎందుకు రావు...’అని ఆయన పేర్కొన్నారు. బుధవారం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మంత్రులు, వైకాపా ప్రాంతీయ సమన్వయకర్తలు, జిల్లా అధ్యక్షుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘లంచం, అవినీతి, వివక్ష లేకుండా బటన్‌ నొక్కి ఇచ్చేస్తున్నాం. రాష్ట్ర, దేశ చరిత్రలో వెతికినా ఇలాంటిది కనిపించదు. 151 స్థానాలకు తగ్గరాదు. 175 స్థానాలు సాధించేలా మంత్రులు, సమన్వయకర్తలు, జిల్లా అధ్యక్షులు బాధ్యత తీసుకోవాలి....’అని సీఎం జగన్‌ స్పష్టం చేశారు. ఆయన ఇంకా ఏమన్నారంటే...

పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తలు, జిల్లా అధ్యక్షులే మీ కంటే ఎక్కువ అనే విషయాన్ని మంత్రులు గుర్తు పెట్టుకోవాలి. అధ్యక్షులు సుప్రీమ్‌. పార్టీనే బాస్‌. ఆ తర్వాతనే మీరు. జిల్లా అధ్యక్షులను మీరు (మంత్రులు) గౌరవించాలి, మీరు గౌరవిస్తేనే జిల్లా యంత్రాంగం వారికి సహకరిస్తుంది. పార్టీనిగెలిపిస్తే జిల్లా అధ్యక్షులేరేపు మంత్రులు అవుతారు. త్వరలోనే వారిని జిల్లా అభివృద్ధి మండళ్లకు ఛైర్మన్లను చేసి... వారికి కేబినెట్‌ హోదా ఇవ్వనున్నాం. ఎమ్మెల్యేల్లాగానే మంత్రులూ గడప గడపకు వెళ్లాలి.

మే నుంచి గేర్‌ మారుస్తున్నాం

కళ్లు మూసుకుని తెరిచేసరికి రెండేళ్లు పూర్తవుతుంది. ఆ తర్వాత జరిగే ఎన్నికలకు ఇప్పటి నుంచే సరైన అడుగులేస్తేనే మనం అధికారంలో కొనసాగుతాం. గత ఎన్నికల కంటే మెరుగైన ఫలితాలు వచ్చేలా పనిచేయాలి. నమ్మకమే వాస్తవం కంటే ఎప్పుడూ శక్తిమంతమైనదంటారు. ఇప్పుడు వాస్తవాన్నే శక్తిమంతమైనదిగా మనం సృష్టించి ఎన్నికలకు వెళుతున్నాం. మేనిఫెస్టోలో 95 శాతం హామీలను నెరవేర్చి, నెరవేరుస్తూ ఎన్నికలకు వెళుతున్నాం. వివిధ పథకాలకు ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) పంపిణీ చేశాం. గతంలో రాష్ట్రంలో లేదా దేశంలో ఈ స్థాయిలో చేశారా అన్నది నాకు అనుమానమే. మే నుంచి గేర్‌ మారుస్తున్నాం. ఈ మూడేళ్లలో మనం ఏం చేశామన్నది ప్రజల్లోకి వెళ్లి చెప్పేందుకే ‘గడప గడపకు’ వెళ్లే కార్యక్రమాన్ని మే 10 నుంచి చేపట్టాలి. ఇది పూర్తయ్యేందుకు కనీసం 8 నుంచి 9 నెలలు పడుతుంది. ఇది అధికారిక కార్యక్రమమే. పని తీరులో కొంతమంది ఎమ్మెల్యేలే ముందంజలో ఉన్నారు. చాలా మంది మధ్య స్థాయిలో, 10-15 శాతం మంది తక్కువ స్థాయిలో ఉన్నారు. తక్కువ, మధ్య స్థాయి ఎమ్మెల్యేలు ‘గడప గడపకు’ పూర్తిగా తిరగడం ద్వారా వారి గ్రాఫ్‌ను పెంచుకోవాలి. వారందరికీ ఇదో అవకాశం. అప్పటికీ మార్చుకోకపోతే చేసేదేమీ ఉండదు.

ఇంటింటికీ మూడు కరపత్రాలు, ఒక లేఖ

ఎమ్మెల్యేలు ‘గడప గడపకు’ కార్యక్రమంలో ప్రతీ ఇంటికి వెళ్లి ఆ ఇంట్లో వారితో మాట్లాడాలి. ఆ ఇంట్లోని వారికి ప్రభుత్వం ఈ మూడేళ్లలో ఏయే పథకాలను ఇచ్చిందో వివరించడంతో పాటు వచ్చే రెండేళ్లూ ఇవి ఇస్తామని చెప్పి.. ఆశీర్వదించాలని కోరాలి. ఇంటింటికీ జరిగిన లబ్ధిపై సీఎం లేఖను వారికివ్వాలి. అలాగే పార్టీ మేనిఫెస్టో ఒక పత్రం, అందులో ఏమేమి పూర్తి చేశామనే వివరాలతో కూడిన రెండో పత్రం, నాడు-నేడు అని ..గత ప్రభుత్వంలో ఏం జరిగింది, ప్రస్తుతం ప్రభుత్వంలో ఎలా ఉందనే విషయమై పలు అంశాలపై వారినే (ప్రజలు) టిక్‌లు పెట్టమని అడిగేలా మరో పత్రం... ఇలా మూడు కరపత్రాలను ఇవ్వాలి. ప్రతీ ఎమ్మెల్యే నెలకు 10 గ్రామ/వార్డు సచివాలయాలను సందర్శించాలి. ఒక్కో సచివాలయం పరిధిలో రెండు రోజులు ఉండాలి.

మన పార్టీ, ప్రభుత్వ ప్రచారానికి సాక్షి పత్రిక, టీవీని వాడుకోవాలి

తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాలి. మన పార్టీ, ప్రభుత్వ ప్రచారానికి సాక్షి పత్రిక, టీవీని వాడుకోవాలి. సామాజిక మాధ్యమాన్ని విస్తృతంగా వినియోగించాలి. గ్రామ స్థాయిలోనూ మనకు సామాజిక మాధ్యమ కార్యకర్తలు ఉండాలి. ‘గడప గడపకు’ పూర్తయ్యేలోగా ఈ సామాజిక మాధ్యమ కార్యకర్తలు అందుబాటులోకి రావాలి. ఈ మూడు సంవత్సరాల్లో పెద్ద వ్యవస్థనే సృష్టించాం. కొత్త కార్పొరేషన్లను ఏర్పాటు చేశాం. వాటికి, పాత కార్పొరేషన్లకు ఛైర్మన్లు, డైరెక్టర్లను నియమించాం. వారితో పాటు స్థానిక సంస్థల ప్రతినిధులందరినీ క్రియాశీలకంగా ఉంచాలి. అది జిల్లా అధ్యక్షుల బాధ్యత. జిల్లా కమిటీల నుంచి గ్రామ స్థాయి కమిటీల నియామకాల వరకు జిల్లా అధ్యక్షులు భాగస్వాములు కావాలి. ఇవన్నీ జులై 8న నిర్వహించనున్న పార్టీ ప్లీనరీ నాటికి పూర్తి చేయాలి’ అని సీఎం జగన్‌ వివరించారు.

శ్రేణుల్లో జోష్‌ తెచ్చేలా నిధుల కేటాయింపు

పథకాల అమలులో ప్రాతినిధ్యం లేకపోగా క్షేత్రస్థాయిలో చేసిన పనులకు బిల్లులు రాక పార్టీ శ్రేణులంతా నిరుత్సాహంగా ఉన్నారని ఈ సమావేశంలో పలువురు నేతలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీనిపై ముఖ్యమంత్రి జగన్‌ స్పందిస్తూ.. ‘ఎమ్మెల్యేలకు రూ.2 కోట్ల చొప్పున ఇచ్చిన నిధులను గ్రామాలకు వెళ్లినప్పుడు వాడుకోండి. అంతేకాకుండా మే 10లోగా 14, 15వ ఆర్థిక సంఘం నిధులనుపంచాయతీలకు సెటిల్‌ చేస్తాం. ఉపాధి హామీ పనుల బిల్లులనూ క్లియర్‌ చేయిస్తాం. ఇవన్నీ అందితే శ్రేణుల్లో జోష్‌ వస్తుంది...’అని వెల్లడించినట్లు సమాచారం.

సర్వేల్లో సీఎంకు 65శాతం..ఎమ్మెల్యేలకు 45% మద్దతు: మాజీ మంత్రి కొడాలి నాని

జగనే ముఖ్యమంత్రిగా ఉండాలని రాష్ట్రంలో 65శాతం మంది కోరుకుంటున్నట్లు సర్వేల్లో వెల్లడైంది. అయితే ఎమ్మెల్యేల విషయంలోనే 40 నుంచి 50 శాతం వరకు ఉంది. ఎమ్మెల్యేలు చాలా మంది ప్రజలకు దూరంగా ఉంటున్నారు. ఈ రెండేళ్లు ప్రజల్లోకి వెళ్లకపోతే వారి గ్రాఫ్‌ మరింత పడిపోతుంది. అప్పుడు వాళ్లని సీఎం మార్చి కొత్త వాళ్లను పెడతారు. రాజకీయపార్టీల్లో ఓడిపోయే వారికి సీట్లిస్తారా? ఇవ్వలేరు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని