CM Jagan: 50 లక్షల మంది రైతులకు భరోసా

‘రైతు సంక్షేమం, అభివృద్ధిలో తెదేపా ప్రభుత్వానికి.. మనందరి ప్రభుత్వానికి వ్యత్యాసం మీరే గుర్తించి, అందరికీ తెలియజెప్పాలి.. రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుందనే ఉద్దేశంతో ఏడాదికి రూ.13,500 చొప్పున క్రమం తప్పకుండా 50.10 లక్షల మంది రైతులకు సాయం చేస్తున్నాం’....

Updated : 17 May 2022 06:24 IST

ఏలూరు జిల్లా గణపవరం సభలో సీఎం జగన్‌
రైతు భరోసా నగదు ఖాతాల్లో జమ

ఈనాడు డిజిటల్‌, ఏలూరు, న్యూస్‌టుడే, గణపవరం: ‘రైతు సంక్షేమం, అభివృద్ధిలో తెదేపా ప్రభుత్వానికి.. మనందరి ప్రభుత్వానికి వ్యత్యాసం మీరే గుర్తించి, అందరికీ తెలియజెప్పాలి.. రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుందనే ఉద్దేశంతో ఏడాదికి రూ.13,500 చొప్పున క్రమం తప్పకుండా 50.10 లక్షల మంది రైతులకు సాయం చేస్తున్నాం’ అని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. సోమవారం ఏలూరు జిల్లా గణపవరంలో నాలుగో ఏడాది మొదటి విడత రైతు భరోసా నగదు విడుదల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నగదును రైతుల ఖాతాల్లో జమ చేశారు. అంతకు ముందు సభలో మాట్లాడారు. ‘తెదేపా ప్రభుత్వం రైతులను పట్టించుకున్న దాఖలాలు లేవు. రైతులకు ఇచ్చే వడ్డీలేని రుణాలు గత ప్రభుత్వం ఐదేళ్లలో రూ.782

కోట్లు ఇస్తే.. మనందరి

ప్రభుత్వం మూడేళ్లలోనే రూ.1,282 కోట్లు ఇచ్చింది. ఖరీఫ్‌ సీజన్‌, వ్యవసాయ పనులు మొదలు కాకుండానే మొదటి విడత రూ.7,500లో రూ.5,500 చొప్పున రూ.3,758 కోట్లను సరాసరి మీ ఖాతాల్లోకే వేస్తున్నాం. మిగిలిన రూ.2వేల సాయం కేంద్రం పీఎం కిసాన్‌ కింద నెలాఖరుకు జమ చేస్తుంది. అక్టోబరులో పంట కోత సమయంలో రూ.4వేలు జమ చేస్తాం. సంక్రాంతి సమయంలో మరో రూ.2వేలు ఇస్తాం. నాలుగు విడతల్లో క్రమం తప్పకుండా రైతు భరోసా కింద దాదాపు రూ.23,875 కోట్లు అందించాం. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆహారధాన్యాల ఉత్పత్తి 16 లక్షల టన్నులు పెరిగింది. సుభిక్షంగా వర్షాలు కురిసి అనంతపురం లాంటి కరవు జిల్లాలో సైతం భూగర్భ జలాలు రికార్డు స్థాయిలో పెరిగాయి’ అని పేర్కొన్నారు.

ప్రశ్నించలేని దత్తపుత్రుడిని ఏమనాలి

‘తెదేపా పాలనలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను వదిలేశారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పాస్‌బుక్‌, సీసీఆర్‌సీ కార్డు ఉన్న ప్రతి రైతుకూ రూ.7 లక్షల చొప్పున పరిహారం అందిస్తున్నాం. రైతులను ఉద్ధరిస్తానని బయల్దేరిన చంద్రబాబు దత్తపుత్రుడు.. అన్ని అర్హతలుండీ పరిహారం పొందని ఒక్క రైతునూ చూపించలేకపోయాడు. గతంలో తెదేపా మేనిఫెస్టోలో చంద్రబాబుతో పాటు దత్తపుత్రుడి ఫొటో పెట్టారు. వీళ్లందరూ చాలరన్నట్లు మోదీ చిత్రం తగిలించారు. ప్రజలను ఎందుకు మోసం చేశారని ప్రశ్నించలేని దత్తపుత్రుడిని ఏమనాలి?

రైతులకు పరిహారం ఇవ్వలేదు

గత ప్రభుత్వం వైపరీత్యాలతో నష్టపోయిన రైతులకు ఏళ్లు గడిచినా పరిహారం ఇచ్చిన దాఖలాలు లేవు. ప్రస్తుతం పంట నష్టం జరిగిన తర్వాత ఆ పంటకాలం పూర్తయ్యేలోపే పరిహారం జమ చేస్తున్నాం. రైతుల పొలాల్లో మోటార్లు తీసుకుపోవడం, విద్యుత్తు కోతలు.. న్యాయం కోరిన రైతులపై బషీర్‌బాగ్‌లో కాల్పులు జరిపిన తెదేపా పాలనను గుర్తుచేసుకోండి. 2014 ఎన్నికల్లో చంద్రబాబు ఫొటోతో మేనిఫెస్టో విడుదల చేశారు. తర్వాత దాన్ని తెదేపా వెబ్‌సైట్‌ నుంచి తొలగించడంతోనే వారి చిత్తశుద్ధి ఏంటో తెలుస్తోంది’ అని వ్యాఖ్యానించారు.

పదెకరాల్లోపు ఆక్వా రైతులకు రాయితీ

పదెకరాల్లోపు చెరువులున్న ఆక్వా రైతులకు విద్యుత్తు రాయితీ వర్తింపజేయాలని ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు కోరగా దీనికి స్పందించిన ముఖ్యమంత్రి ఆక్వా జోన్‌ పరిధిలో ఉన్న పదెకరాల్లోపు రైతులకు ఈ రాయితీ ఉంటుందని ప్రకటించారు. కొల్లేరు రెగ్యులేటర్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో శాసనమండలి ఛైర్మన్‌ కొయ్యే మోసేనురాజు, ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ, వ్యవసాయ, సహకార మార్కెటింగ్‌శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, రవాణాశాఖ మంత్రి పినిపే విశ్వరూప్‌, పౌర సరఫరాలశాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.                               

చంద్రబాబు.. కరవు కవల పిల్లలు: కాకాణి

సభలో వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘చంద్రబాబు అధికారంలో ఉంటే రాష్ట్రంలో వర్షాలు ఉండవు. కరవు, చంద్రబాబు కవలపిల్లల్లా ఉంటారు. వైకాపా ప్రభుత్వంలో రైతు భరోసా కేంద్రాల్లో విత్తనాల నుంచి ధాన్యం వరకు అన్ని అవసరాలూ తీరుస్తున్నాం. వ్యవసాయ సలహా మండలిని ఏర్పాటు చేస్తాం’ అని పేర్కొన్నారు.

సీఎం సభలో నిరసన

ముఖ్యమంత్రి మాట్లాడుతుండగా పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం ఎన్‌ఆర్‌పీ అగ్రహారానికి చెందిన పలువురు మహిళలు లేచి నిలబడి ‘సీఎం గారూ.. మాకు న్యాయం చేయాలి.. గ్రామంలోనే ఇళ్ల స్థలాలు ఇప్పించండి’ అంటూ రాసిన ఫ్లెక్సీలను ప్రదర్శించారు. పోలీసులు వారి చేతుల్లో నుంచి ఫ్లెక్సీలను లాక్కున్నారు. మహిళా సీఐతో పాటు పలువురు మహిళా కానిస్టేబుళ్లు వారిని గ్యాలరీ నుంచి బయటకు తీసుకొచ్చారు.

ఆంక్షలతో సతమతం

సీఎం పర్యటన నేపథ్యంలో గణపవరంలో పోలీసులు ఆంక్షలు విధించారు. ఆదివారం నుంచే దుకాణాలను మూయించారు. సోమవారం గణపవరంలో వారపు సంత జరగలేదు. దీంతో పరిసర గ్రామాలవారు తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. హెలిప్యాడ్‌ నుంచి సభావేదిక వరకు రహదారికి ఇరువైపులా బారికేడ్లు ఏర్పాటు చేయడంతో సామాన్య ప్రజలు నానా అవస్థలు పడ్డారు. సీఎం హెలిప్యాడ్‌ నుంచి సభా ప్రాంగణానికి కారులో వెళ్లారు. ఆ సమయంలో సుమారు గంటసేపు వాహనాలను నిలిపివేశారు. ఆరోగ్యం బాగాలేదు.. అత్యవసరంగా భీమవరం వెళ్లాలి.. అనుమతివ్వండి’ అని అడిగినా దారి ఇవ్వలేదని నిడమర్రు మండలానికి చెందిన ఒక రోగి బంధువులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం కాన్వాయ్‌ వెళ్లిన సుమారు 20 నిమిషాల తర్వాత ఆ వాహనానికి అనుమతి ఇచ్చారు.


సీఎం ప్రసంగిస్తుండగానే.. బయటకు!

వీక్షకులు కూర్చునేందుకు 16 గ్యాలరీలు ఏర్పాటు చేశారు. ఆర్టీసీ, కళాశాల బస్సులు, ఇతర వాహనాల్లో ప్రజలను భారీగా తరలించారు. ముఖ్యమంత్రి ప్రసంగిస్తున్నప్పుడు సభకు వచ్చినవారు పెద్ద సంఖ్యలో లేచి బయటకు వెళ్లిపోవడం ప్రారంభించారు. వారు బయటకు వెళ్లకుండా పోలీసులు బారికేడ్లను అడ్డుగా ఉంచారు. అయినా సీఎం ప్రసంగం సగం పూర్తయ్యేసరికి 10 గ్యాలరీల్లోని జనం బయటకు వెళ్లిపోయారు. దీంతో వైకాపా నాయకులు మిగతా గ్యాలరీల్లోని జనాల్ని ఖాళీ గ్యాలరీల్లోకి పంపే ఏర్పాటు చేశారు. సభ ప్రారంభానికి గంట ముందు కొద్దిపాటి వర్షం కురిసింది. తర్వాత ఉక్కపోత, వేడితో జనం ఉక్కిరిబిక్కిరి అయ్యారు.


పది నిమిషాలైనా ఉండండి: వెళ్లిపోతున్న మహిళలకు ఎంపీడీవో విజ్ఞప్తి

కార్యక్రమంలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తుండగా గ్యాలరీల నుంచి పెద్ద ఎత్తున మహిళలు బయటకు వెళ్లిపోయేందుకు ప్రయత్నించారు. ఈ సమయంలో పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేయగా అక్కడే ఉన్న గణపవరం ఎంపీడీవో జి.జ్యోతిర్మయి మహిళలు వెళ్లకుండా బారికేడ్లు అడ్డుపెట్టాలని సిబ్బందికి సూచించారు. కనీసం 10 నిమిషాలైనా సభలో ఉండాలని ఎంపీడీవో చెబుతున్న మాటలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

* ముఖ్యమంత్రికి తన గోడు విన్నవించుకునేందుకు ఓ మహిళ హెలిప్యాడ్‌ నుంచి సభా ప్రాంగణానికి వస్తున్న సీఎం కాన్వాయ్‌కి అడ్డుపడ్డారు. దీంతో ఆమెను సభా ప్రాంగణానికి తీసుకురావాలని పోలీసులకు ముఖ్యమంత్రి సూచించినట్లు చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని