CPS: సీపీఎస్‌ రద్దు అంత సులభం కాదు

కాంట్రిబ్యూటరీ పింఛన్‌ విధానం (సీపీఎస్‌) రద్దు అనేది అంత సులభమైన అంశం కాదని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. దీనిపై త్వరలో ప్రభుత్వం విధానపరమైన ప్రకటన చేస్తుందని చెప్పారు.

Updated : 23 Mar 2022 04:36 IST

త్వరలో విధానపరమైన ప్రకటన
మండలిలో పీడీఎఫ్‌ ఎమ్మెల్సీల వాయిదా
తీర్మానానికి మంత్రి బుగ్గన సమాధానం
4వ తేదీ నుంచి ఉద్యోగులతో చర్చలు జరపాలన్న సీఎం

ఈనాడు, అమరావతి: కాంట్రిబ్యూటరీ పింఛన్‌ విధానం (సీపీఎస్‌) రద్దు అనేది అంత సులభమైన అంశం కాదని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. దీనిపై త్వరలో ప్రభుత్వం విధానపరమైన ప్రకటన చేస్తుందని చెప్పారు. శాసన మండలిలో పీడీఎఫ్‌ ఎమ్మెల్సీలు ఇచ్చిన వాయిదా తీర్మానంపై మంగళవారం ఆయన మాట్లాడుతూ.. ‘సీపీఎస్‌ విధానంపై ప్రభుత్వ పరిశీలన అడ్వాన్స్‌ దశలో ఉంది. గత నెలన్నరగా దీనిపై ముమ్మరంగా పని చేస్తున్నాం. కాబట్టే సీఎం వారానికి ఒకసారి రివ్యూ చేస్తున్నారు. అంటే అది తుది దశకు చేరినట్లే లెక్క. దీనికి సంబంధించిన అన్ని అంశాలనూ బయటకు చెప్పడం సాధ్యం కాదు. తుది రూపం వచ్చేవరకు..

వివరాలను బయటకు చెబితే వేరే అర్థాలు వచ్చే అవకాశం ఉంది. అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుందని చెప్పగలను.

ఈ రోజు మధ్యాహ్నం కూడా సీఎం దగ్గర సమావేశం ఉంది. ఈ సమావేశం నిన్ననే జరగాల్సింది. ప్రిన్సిపల్‌ ఫైనాన్స్‌ సెక్రటరీ అందుబాటులో లేని కారణంగా ఈ రోజుకు వాయిదా పడింది.  సీపీఎస్‌ రద్దు అనేది మన రాష్ట్రానికే కాదు. ఇతర రాష్ట్రాలకూ పెద్ద సమస్య. ఈ రాష్ట్రంలో భాజపా సభ్యులు సీపీఎస్‌ రద్దుకు మద్దతు తెలుపుతున్నారు. దీనిపై వారి అధిష్ఠానంతో ఒకసారి మాట్లాడి అనుమతి తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే దేశంలో వారి ఆలోచన అలా లేదు. వారు ఇక్కడ ఏ విశ్వాసంతో చెబుతున్నారో అర్థం కావటం లేదు. సీపీఎస్‌ పట్ల ప్రభుత్వం వచ్చిన వెంటనే మంత్రుల కమిటీ ఏర్పాటు చేసింది. టక్కర్‌ కమిటీ నివేదికపై అధ్యయనం చేసి ముందుకు వెళ్తోంది. ఆ తర్వాత మంత్రుల కమిటీ ఇచ్చిన నివేదికను పరిశీలించడానికి అధికారుల కమిటీ ఏర్పాటు చేసింది. గతంలో పలు మార్లు సభలో ఇదే విషయాన్ని చెప్పాను. దురదృష్టవశాత్తు కొవిడ్‌ పరిణామాలతో దీనిపై ముందుకు వెళ్లలేక పోయాం’ అని పేర్కొన్నారు. మంత్రి సమాధానంపై పీడీఎఫ్‌ ఎమ్మెల్సీలు విఠపు బాలసుబ్రమణ్యం, ఇతర ఎమ్మెల్సీలు నిరసన తెలిపారు. విఠపు మాట్లాడుతూ.. ‘ సీపీఎస్‌ను రద్దు చేస్తామని స్పష్టంగా చెప్పటం లేదు. కరోనా వల్ల నిర్ణయం తీసుకోలేదని చెబుతున్నారు. సీపీఎస్‌ రద్దుపై నిర్ణయాన్ని ఆఫీసులో ఉండి తీసుకోవాలి. ఇప్పుడు మంత్రి మాట్లాడుతూ ఇది అంత సులభం కాదు. దేశ వ్యాప్తంగా.. ప్రపంచ వ్యాప్తంగా ఉందని అంటున్నారు. మీరు ఇచ్చిన హామీ కనీసం నమ్మకం కలిగించేలా లేదు. ఇది చాలా బాధాకరం’ అని అన్నారు. మరో ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కూడా సీపీఎస్‌ రద్దు చేస్తామని చెబుతున్నాయని, మూడేళ్లుగా ఎందుకు నిర్ణయాన్ని ప్రకటించలేదని ప్రశ్నించారు.


4 నుంచి సీపీఎస్‌పై ఉద్యోగ సంఘాలతో చర్చలు

కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీంపై (సీపీఎస్‌) ఉద్యోగ సంఘాలతో ఏప్రిల్‌ 4 నుంచి చర్చలు జరపాలని సీఎం జగన్‌ అధికారులకు సూచించారు. సీపీఎస్‌పై మంగళవారం సాయంత్రం సెక్రటేరియట్‌లోని ఒకటో బ్లాక్‌లో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మ, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్‌, ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి, ఇతర సీనియర్‌ అధికారులతో సమావేశమయ్యారు. సీపీఎస్‌కి సంబంధించిన వివరాలతో అధికారులు సీఎంకు ప్రజంటేషన్‌ ఇచ్చారు. సీపీఎస్‌పై నిర్ణయం తీసుకునే ప్రక్రియలో ఉద్యోగ సంఘాలను భాగస్వాములను చేయాలని సీఎం ఆదేశించారు. దీనిపై ఏర్పాటు చేసిన మంత్రుల బృందం, అధికారులు ఉద్యోగ సంఘాలకు వివరించి ఆ తర్వాత వారితో చర్చలు జరపాలని సీఎం అధికారులకు సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు