Farmer:ఏ పంటా మిగల్లేదు..
ఖరీఫ్ పంటల్లో ఒక్కటీ సరిగా చేతికొచ్చే పరిస్థితి లేదు. ఎకరాకు రూ.లక్ష పెట్టుబడిగా పెట్టి మిరప సాగు చేస్తే.. తామర పురుగుతో ఎకరాకు 2, 3 క్వింటాళ్లు దిగుబడి రావడమూ గగనమైంది. గులాబీ పురుగు ధాటికి పత్తిలో ఎకరాకు రూ.15 వేలకు పైగా నష్టం వస్తోంది. వేరుసెనగ వేస్తే.. పశువుల మేతకూ మిగల్లేదు. కంది అయినా బాగుంటుందనుకుంటే..
వేరుసెనగ, వరి, పత్తి, మిరప, కంది.. అన్నీ నష్టాలే
భారీ వర్షాలు, తెగుళ్లు, పురుగుల తాకిడే ప్రధాన కారణం
అన్నదాత నెత్తిన రూ.లక్షల్లో అప్పులు..
పెట్టుబడుల రూపంలోనే రూ.16 వేల కోట్లకు పైగా నష్టం
ఉత్పత్తి నష్టం రూ.20వేల కోట్ల పైనే
ఈనాడు - అమరావతి
ఖరీఫ్ పంటల్లో ఒక్కటీ సరిగా చేతికొచ్చే పరిస్థితి లేదు. ఎకరాకు రూ.లక్ష పెట్టుబడిగా పెట్టి మిరప సాగు చేస్తే.. తామర పురుగుతో ఎకరాకు 2, 3 క్వింటాళ్లు దిగుబడి రావడమూ గగనమైంది. గులాబీ పురుగు ధాటికి పత్తిలో ఎకరాకు రూ.15 వేలకు పైగా నష్టం వస్తోంది. వేరుసెనగ వేస్తే.. పశువుల మేతకూ మిగల్లేదు. కంది అయినా బాగుంటుందనుకుంటే.. వెర్రితెగులు ఆశించి కాయ కనిపించడం లేదు. వరిలో ఎకరాకు 30 బస్తాల పైన వస్తాయనుకుంటే 15 నుంచి 20 బస్తాల దిగుబడీ కనాకష్టమవుతోంది. ఇందులోనూ ఎకరానికి సగటున రూ.15 వేలకు పైనే నష్టం.. ఖరీఫ్లో భారీవర్షాలు, వరదలకు తోడు తెగుళ్లు, పురుగుతాకిడితో ప్రధాన పంటలన్నీ దెబ్బతిన్నాయి. ఒక పంట దెబ్బతింటే మరోదానిలో గట్టెక్కొచ్చనే ఆశలూ పోయి రైతులకు రూ.లక్షల్లో అప్పులు మిగిలాయి. ఖరీఫ్లో వరి, వేరుసెనగ, మిరప, పత్తి, కందితోపాటు మినుము, మొక్కజొన్న తదితర పంటల సాగులో సుమారుగా రూ.16 వేల కోట్ల పెట్టుబడిని కోల్పోతున్నారు. ఉత్పత్తి నష్టం రూ.20 వేల కోట్ల పైనే ఉంటోంది. ఖరీఫ్లో వేసిన మినుము, పెసరతోపాటు మొక్కజొన్న సాగులోనూ నష్టాలు తప్పలేదు. రబీలో వేసిన సెనగనూ నల్లతామర పురుగు ఆశించింది.
పొగాకుకు పేనుబంక వచ్చింది. ఒకే సీజన్లో పంటలన్నీ పోవడం మునుపెన్నడూ చూడలేదని.. దీన్ని విపత్తు అనాలా? ఉత్పాతం అనాలా? మా కర్మ ఇంతే అని సరిపెట్టుకోవాలా? అని రైతులు వాపోతున్నారు. దాదాపు పూర్తిస్థాయిలో పెట్టుబడి పెట్టాక.. పంట చేతికొచ్చే దశలో విపత్తులు విరుచుకుపడ్డాయి. తెగుళ్లు విజృంభించాయి. పురుగుల తాకిడి పెరిగింది. దీంతో అధికశాతం రైతులు పెట్టుబడి మొత్తం నష్టపోయారు. ఎవర్ని కదిల్చినా లక్షల్లో అప్పులపాలయ్యామనే ఆవేదనే వినిపిస్తోంది
85 శాతం పైగా చిన్న, సన్నకారు రైతులే..
సాగుదారుల్లో 85% పైగా చిన్న, సన్నకారు రైతులే ఉన్నారు. వడ్డీ వ్యాపారుల దగ్గర, బ్యాంకుల్లో బంగారం తాకట్టు పెట్టి అప్పులు తెచ్చి పంటలపై పెట్టారు. కౌలురైతులుగా మారిన వ్యవసాయ కూలీలూ.. పనులకు వెళ్లి సంపాదించుకున్న మొత్తాన్నీ పెట్టుబడిగా పెట్టారు. కౌలు కూడా ముందే చెల్లించారు. ఇప్పుడు రూపాయి చేతికొచ్చే పరిస్థితి లేదని, అప్పులు ఎలా తీర్చాలని కుంగిపోతున్నారు.
గులాబీ ‘కత్తి’
తొలకరి ప్రారంభంలోనే పత్తి క్వింటాలు రూ.7వేలకు పైగా చేరింది. అయినా గతేడాది భారీ వర్షాలతో కొందరు రైతులు ఎకరాకు రూ.15 వేల వరకు నష్టపోవడం, గులాబీ పురుగు తాకిడి గుర్తొచ్చి.. 2 లక్షల ఎకరాల సాగు తగ్గించారు. తొలితీత పత్తినే క్వింటాలు రూ.7 వేల వరకు అమ్మారు. అక్టోబరు నెలాఖరు వరకు అంతా బాగుంది. ఎకరాకు 8 నుంచి 10 క్వింటాళ్లు వస్తుందని ఆశించారు. ఇంతలోనే భారీ వర్షాలతో కాపు రాలిపోయింది. కాయలు చెట్టుకే కుళ్లిపోయాయి. అయినా మరో కాపు వస్తుందని భావిస్తుండగా గులాబీ పురుగు విజృంభించి, వచ్చేదంతా పుచ్చుపత్తి అయింది. దిగుబడి ఎకరాకు 2 నుంచి 3 క్వింటాళ్లు దాటలేదు. పెట్టుబడులు కూడా తిరిగిరాని పరిస్థితి తలెత్తింది.
* పంట: పత్తి
* సాగు విస్తీర్ణం: 13,04,557 ఎకరాలు
* దిగుబడి దెబ్బతిన్న విస్తీర్ణం అంచనా: 80%
* ఎకరాకు సగటు దిగుబడి: 10 క్వింటాళ్లు
* ప్రస్తుతం వస్తున్నది: 2-3 క్వింటాళ్లే
* పెట్టుబడి నష్టం: రూ.1,662 కోట్లు అంచనా (మొత్తం పెట్టుబడి ఎకరాకు రూ.30వేలు, నష్టం.. రూ.15,000)
పొలం అమ్మేశా.. ఇప్పుడు మళ్లీ అప్పులయ్యాయి
నాకు తెలిసిన విద్య వ్యవసాయమే అంటున్న ఈ రైతు పేరు కరీముల్లా.. గుంటూరు జిల్లా పుల్లడిగుంటకు చెందిన ఈయన రెండేళ్ల కిందటే వ్యవసాయంలో అప్పులు తీర్చడానికి ఉన్న ఎకరా పొలాన్ని అమ్మేశారు. ఇల్లొక్కటే మిగిలింది. ఈ ఏడాది ఎకరా రూ.40 వేల చొప్పున ఏడెకరాలు కౌలుకు తీసుకుని మిరప, ఎకరా రూ.25 వేల చొప్పున అయిదెకరాలు కౌలుకు తీసుకుని పత్తి వేశారు. మొత్తంగా రూ.10 లక్షల పెట్టుబడి అయింది. ఎకరానికి పది క్వింటాళ్లు వస్తుందనుకున్న పత్తి.. వానలు, గులాబీ పురుగుతో రెండు క్వింటాళ్లకు పడిపోయింది. నల్లతామర దెబ్బకు మిరపలో ఎకరాకు మూడు, నాలుగు క్వింటాళ్లూ కష్టమే. ‘బంగారం పెట్టి కొంత, నూటికి నెలకు రూ.2.50, రూ.2, రూ.1.50 వడ్డీకి మరికొంత అప్పు తెచ్చి పెట్టాం. వాటిని ఎలా తీర్చాలో అర్థం కావట్లేదు’ అని ఆయన కన్నీటి పర్యంతమయ్యారు.
పశువుల మేతకైనా మిగల్లేదు..
ఎకరా వేరుసెనగకు రూ.35 వేల పెట్టుబడి పెడితే.. కిలో కాయ కూడా రాని రైతులు వేలాది మంది ఉన్నారు. వేరుసెనగ కాయ కోశాక మిగిలిన కట్టెను పశువుల మేతగా వేస్తారు. భారీవర్షాలతో కట్టె నల్లగా మారి.. మేతకూ పనికిరాలేదు. పంటకోత ప్రయోగాల లెక్కల ఆధారంగా చూస్తే.. అనంతపురం జిల్లాలో ఎకరాకు 83 కిలోల దిగుబడి మాత్రమే వచ్చింది. నిరుడూ భారీవర్షాలతో వేరుసెనగ దెబ్బతిని, పెద్ద సంఖ్యలో నష్టపోయారు. అయినా పెట్టుబడి రాయితీ కొందరికి మాత్రమే అందిందని రైతులు చెబుతున్నారు. ఈ ఏడాదీ కోలుకోలేని దెబ్బతిన్నామని, సాగు విస్తీర్ణంలో 70% పైనే నష్టం జరిగిందని పేర్కొంటున్నారు.
* పంట: వేరుసెనగ
* సాగు విస్తీర్ణం: 16,47,052 ఎకరాలు
* దెబ్బతిన్న విస్తీర్ణం అంచనా: సుమారు 70%
* నష్టానికి కారణం: భారీ వర్షాలు
* సగటు దిగుబడి: అధికశాతం రైతులకు పంటకు చేతికే రాలేదు
* పెట్టుబడి నష్టం: రూ.2,882 కోట్లు అంచనా (ఎకరాకు రూ.25వేల చొప్పున)
పశువుల మేత కూడా మిగల్లేదు
- పసల రాము, రైతు, మేడాపురం, చెన్నేకొత్తపల్లి మండలం, అనంతపురం జిల్లా
అయిదెకరాల్లో వేరుసెనగకు రూ.2 లక్షల పెట్టుబడి అయింది. ఊడలు దిగినప్పట్నుంచే ఎడతెరిపిలేని వానలు పడ్డాయి. పంట సరిగా రాలేదు. కోత కోశాక 20 రోజులపాటు ఆగకుండా వర్షాలు కురిశాయి. కాసిన కొద్దిపాటి కాయలూ నల్లగా మారి మొలకలొచ్చాయి. కనీసం పశువుల మేత కూడా దక్కలేదు. ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదు.
తామర దెబ్బకు తలకిందులు
మిరపలో ఏటా వైరస్ ప్రభావం ఉంటుంది. ఒక్కోసారి మొక్క దశలోనే ఆశిస్తే.. కొన్నిసార్లు తొలి కాపు తర్వాత, రెండో కాపులో వస్తుంటుంది. దీంతో ఎకరాకు పది క్వింటాళ్ల లోపైనా చేతికొచ్చేది. ఈ ఏడాది రికార్డు స్థాయిలో సాగు చేశారు. డిసెంబర్ నాటికే ఎకరాకు రూ.లక్షకు పైగా పెట్టుబడి పెట్టారు. ఇంతలో జెమిని వైరస్ ఆశించి, కొంత నష్టపరిచింది. దీనికితోడు నల్లతామర పురుగు విజృంభించి మొత్తం పంటనే నాశనం చేసింది. పొలాల్లో పూత అనేదే కనిపించని పరిస్థితి. ఎకరాకు రూ.లక్ష వరకు రైతులు నష్టపోయారు. కౌలు రైతులకు ఎకరాకు రూ.30 వేలకు పైగా అదనపు నష్టం వాటిల్లింది. ఇప్పటికీ పురుగు నివారణ కాలేదు. సాగు చేసిన విస్తీర్ణంలో 80 నుంచి 85 శాతం మిరప దెబ్బతింది. మిరపలో గతేడాదీ వైరస్ ప్రభావంతో దిగుబడి తగ్గింది. ధరలు బాగుండటంతో రైతులు కొంత గట్టెక్కారు.
* పంట: మిరప
* సాగు విస్తీర్ణం: 5,13,000 ఎకరాలు
* దెబ్బతిన్న విస్తీర్ణం: సుమారు 85 శాతం
* ఎకరాకు సగటు దిగుబడి: 10 క్వింటాళ్లు
* ప్రస్తుతం వస్తున్నది: రెండు మూడు క్వింటాళ్లే
* పెట్టుబడి నష్టం: రూ.4,360 కోట్లు (ఎకరాకు రూ.లక్ష) అంచనా
నాలుగెకరాల మిరప.. రూ.5 లక్షల అప్పు
- జాగర్లమూడి శ్రీను, మక్కెనవారిపాలెం, సంతమాగులూరు మండలం, ప్రకాశం జిల్లా
నాలుగెకరాల్లో మిరప వేశాను. నల్లతామర పురుగుతో దెబ్బతింది. రెండెకరాల్లో పంట తీసేసి బెండ, మునగ పెట్టా. మిగిలిన రెండెకరాల్లోనూ.. ఎకరాకు రెండు, మూడు క్వింటాళ్లే వచ్చేట్లు ఉన్నాయి. కౌలుతో కలిపి నాలుగెకరాలకు రూ.6 లక్షల పెట్టుబడి అయింది. కాయలు అమ్మితే రూ.లక్ష వస్తాయేమో.
వెర్రి తెగులొచ్చి.. కంది పోయింది
భారీవర్షాలతో కందిలోనూ పూత రాలింది. మిగిలిన కొద్దిపాటి పూత అయినా నిలిస్తే ఎకరాకు రెండు, మూడు క్వింటాళ్లయినా కందులొస్తాయి అనుకుంటుండగా వెర్రితెగులు విరుచుకుపడి, కాపు అనేదే లేకుండా చేసింది. 70% విస్తీర్ణంలో దిగుబడుల్ని దెబ్బతీసింది. పెట్టిన పెట్టుబడి మొత్తం నష్టపోవాల్సి వస్తోంది. పూత ఎందుకు రావడం లేదో అర్థంకాక.. లీటర్ల కొద్దీ మందులు పిచికారీ చేస్తున్న రైతులకు పెట్టుబడి మరింత పెరుగుతోంది.
* పంట: కంది
* సాగు విస్తీర్ణం: 6,13,885 ఎకరాలు
* తెగులు, వర్షాలతో దెబ్బతిన్న విస్తీర్ణం అంచనా: సుమారు 60 శాతం పైనే
* ఎకరాకు సగటు దిగుబడి: 4 క్వింటాళ్లు
* ఇప్పుడు వస్తున్నది: క్వింటాలు లోపే
* పెట్టుబడి నష్టం: రూ.1,150 కోట్లు (ఎకరాకు రూ.25 వేల చొప్పున) అంచనా
కంది పంట నాశనం
- గాడపర్తి లక్ష్మినారాయణ, రైతు, శివరాంపురం, తాళ్లూరు మండలం, ప్రకాశం జిల్లా
వరిసాగులో నష్టాలొస్తున్నాయని అయిదెకరాల్లో కంది సాగు చేశా. రూ.75 వేల పైనే పెట్టుబడి పెట్టా. అధిక వర్షాలతో కొంత దెబ్బతింది. తెగుళ్లు పెరగడంతో.. ఎన్ని రకాల పురుగుమందులు వాడినా ఉపయోగం లేకపోయింది. మూడెకరాల కందిని గొర్రెల మేతకు ఇచ్చేశా. ఇంకో రెండెకరాల్లో ఉన్న కందికి వెర్రి తెగులు వచ్చింది. కాయ కూడా వచ్చే పరిస్థితి లేదు.
వరి రైతుకు మిగిలింది కన్నీరే
ఖరీఫ్ నుంచి విడవని వర్షాలే. అయినా తట్టుకుని వరి సాగు చేస్తే పంటకోత దశలో వానలు విరుచుకుపడ్డాయి. కొన్నిచోట్ల పంటను తుడిచిపెట్టేశాయి. మరికొన్ని ప్రాంతాల్లో వరిని నేల కరిపించాయి. వచ్చే దిగుబడితో పోలిస్తే.. కోత ఖర్చులే ఎక్కువవడంతో కొంతమంది కోయకుండా వదిలేశారు. కోసి ఆరబెట్టిన ధాన్యమూ తడిసి, నీటిలో నాని, రంగు మారింది. నూక శాతమూ పెరిగింది. మిల్లర్లు కొనడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. ధర వచ్చేవరకు ఎదురుచూద్దామంటే నిల్వ చేసుకునే చోటు లేక, రబీ పెట్టుబడులకు సొమ్ము అవసరమై అడిగిన ధరకు అమ్మాల్సి వస్తోందని వాపోతున్నారు. గతేడాది ఖరీఫ్లోనూ భారీవర్షాలకు రాష్ట్రంలో చాలాచోట్ల వరి దెబ్బతింది. ఈ ఏడాదీ తూర్పు, పశ్చిమగోదావరి, గుంటూరు, కృష్ణా, చిత్తూరు, తదితర జిల్లాల్లో భారీగా పంట వర్షార్పణమైంది.
* పంట: వరి
* సాగు విస్తీర్ణం: 39,15,205 ఎకరాలు
* పూర్తిగా, పాక్షికంగా దెబ్బతిన్న విస్తీర్ణం అంచనా: సుమారు 40%
* ఎకరాకు సగటు దిగుబడి: 35 బస్తాలు
* సగటున వస్తున్నది: 20 బస్తాలు
* పెట్టుబడి నష్టం: రూ.2,250 కోట్లు (ఎకరాకు రూ.15,000) అంచనా
పెట్టుబడి కూడా దక్కదు
-కొప్పినీడి సత్యనారాయణ, కౌలు రైతు, శివకోటి, రాజోలు మండలం, తూర్పుగోదావరి జిల్లా
కౌలుకు మూడెకరాలు సాగు చేశాను. తుపాను, వర్షాలకు చాలా వరకు పంట దెబ్బతినగా 50 బస్తాల ధాన్యం చేతికొచ్చింది. ఎకరాకు 30 వేలు పైనే ఖర్చు చేశాను. పెట్టుబడీ తిరిగివచ్చేలా లేదు. ఇలాంటి పరిస్థితి ఏనాడూ రాలేదు.
అన్ని పంటలకూ నష్టాలే మిగిలాయి
- కేవీవీ ప్రసాద్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఏపీ రైతు సంఘం
సాగు చేసిన మిరపలో 95% వరకు నల్లతామర పురుగుతో దెబ్బతింది. వరి సాగు గిట్టుబాటు కాకపోవడంతో 25% మంది నాట్లే వేయలేదు. వేసిన పంటలోనూ ఎకరాకు 25 బస్తాలు మించి రావడం లేదు. వర్షాలతో కొంత తడిసింది. రంగు మారింది. యంత్రాలతో కోయించడంతో తేమ శాతం పెరిగింది. పత్తిలో గులాబీ పురుగు దెబ్బకు 70% పైనే నష్టం వస్తుంది. వేరుసెనగ 80% పైనే దెబ్బతింది. కందీ, మినుముకూ నష్టాలే. సెనగ, సుబాబుల్, జామాయిల్, సరుగుడులకు ధర లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మాటిస్తివి.. ఏమార్చితివి!
రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు అయిదేళ్ల పాటు అరచేతిలో వైకుంఠం చూపించిన సీఎం జగన్.. తన సొంత ఇలాకా వైయస్ఆర్ జిల్లా ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు పరిశ్రమలను కూడా ఏర్పాటు చేయించలేకపోయారు. -
ముఖ్యమంత్రితో ముఖాముఖిలో వాలంటీరు
రాజకీయ పార్టీల కార్యక్రమాల్లో వాలంటీర్లు పాల్గొనకూడదనే నిబంధన ఉన్నా.. నంద్యాల జిల్లా శిరివెళ్ల మండలంలోని వాలంటీరు వై.లక్ష్మీనారాయణరెడ్డి దాన్ని ఉల్లంఘించారు. -
ఎండలు ముదిరాయి.. సెగ పెరిగింది
రాష్ట్రంలో ఎండలు ముదురుతున్నాయి. సెగ పెరుగుతోంది. గురువారం ఉత్తరకోస్తా, రాయలసీమ ప్రాంతాల్లోని 31 మండలాల్లో వడగాలులు వీచాయి. -
రంగులు తొలగిస్తే ఊరుకోను.. వైకాపా నాయకుడి వీరంగం
తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం కూనవరం పంచాయతీ సర్పంచి గంగాభవాని భర్త, వైకాపా నాయకుడు సుంకర నరసింహారావు తన దుకాణంపై వేసిన పార్టీ రంగులను తొలగిస్తే సహించేది లేదంటూ అధికారులపై విరుచుకుపడ్డారు. -
నారాయణ ఎడ్యుకేషనల్ సొసైటీ బ్యాంకు ఖాతాల స్తంభన
నారాయణ ఎడ్యుకేషనల్ సొసైటీ బ్యాంకు ఖాతాలను పోలీసులు ఫ్రీజ్ చేశారు. నెల్లూరు పోలీసులు లేఖ రాయడంతో.. హైదరాబాద్లోని హిమాయత్నగర్, ఖైరతాబాద్ శాఖల్లో ఉన్న నాలుగు ఖాతాలను స్తంభింపజేసినట్లు తెలిసింది. -
హమ్మయ్య.. జగన్ పర్యటనల నుంచి అవస్థలు తప్పాయి
ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో ముఖ్యమంత్రి జగన్ పర్యటనలు, సభల నుంచి ప్రజలకు అవస్థలు తప్పాయి. గడిచిన నాలుగున్నరేళ్లలో ఆయన ఉమ్మడి కర్నూలు జిల్లాకు వచ్చిన ప్రతిసారీ భద్రత పేరుతో దుకాణాలు మూయించి, వాటికి అడ్డంగా బారికేడ్లు పెట్టేవారు. -
కన్నారా.. ఇది విన్నారా?
ఎన్నికల నియమావళి ఉల్లంఘన విషయంలో వైకాపా నేతల బరితెగింపు తారస్థాయికి చేరింది. కాకినాడ జిల్లా వైకాపా అధ్యక్షుడు, కాకినాడ గ్రామీణ నియోజకవర్గ అభ్యర్థి కురసాల కన్నబాబు ఓ అడుగు ముందుకేసి జిల్లా ఎన్నికల అధికారి ప్రసంగాన్ని రికార్డు చేసి ఊరూవాడా ప్రదర్శిస్తూ వైకాపా ప్రచారానికి తెగ వాడేస్తుండటం వివాదాస్పదంగా మారింది. -
ఇలా అయితే.. విద్యావ్యవస్థ నాశనం
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో బోధనేతర సిబ్బంది (లైబ్రేరియన్లు, ఫిజికల్ డైరెక్టర్లు) ప్రిన్సిపల్స్గా పదోన్నతి పొందేందుకు వీలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో 76 జారీ చేయడంపై హైకోర్టు నిప్పులు చెరిగింది. -
మేనల్లుడికి అత్యున్నతాధికారి నజరానా!
విశ్వవిద్యాలయాలను రాజకీయాలకు కేంద్ర బిందువులుగా మార్చి సీఎం జగన్ భ్రష్టు పట్టిస్తే.. ఆయన ప్రభుత్వంలో అత్యున్నతాధికారి తన మేనల్లుడి కోసం ద్రవిడ విశ్వవిద్యాలయం నిబంధనలనే కాలరాశారు. -
రైతులు, రైతు కూలీలకు రిజర్వేషన్లు కల్పించాలి
‘ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులు, రైతు కూలీల వంటి వర్గాలకు న్యాయం జరగాలంటే వారికి న్యాయవ్యవస్థ సహా వివిధ శాఖల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలి. -
నీ పేరు బయటికి వస్తుందని సీబీఐ దర్యాప్తు వద్దన్నావా?
‘‘మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ను ఎందుకు ఉపసంహరించుకున్నావు? నీ పేరు బయటికి వస్తుందని భయపడ్డావా?’’ అని సీఎం జగన్ను వివేకా కుమార్తె సునీతారెడ్డి నిలదీశారు. -
సర్వం జగన్నామం
గ్రామస్థులతో ముఖాముఖి అన్నారు. ఎవరు ఎలా, ఏం మాట్లాడాలో ముందే ‘సిద్ధం’ చేశారు. తర్వాత ‘రాజు’వారు వచ్చారు. -
బ్రహ్మ రాకాసి!
అలనాడు బ్రహ్మనాయుడు తిరగాడిన నేల అది. ఆ యోధుడు కదనరంగంలో కాలుమోపితే చాలు.. యుద్ధభూమే కంపించిపోయేది.. అంతటి పరాక్రమం బ్రహ్మనాయుడి సొంతం. -
వైకాపా రాక్షస పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకుందాం
పోర్టు ద్వారా గంజాయి వ్యాపారం చేసేందుకే విశాఖను రాజధానిగా చేస్తామంటున్నారు. అందుకే 25 వేల కేజీల మాదక ద్రవ్యాలను అక్కడ దించారు. -
నాడు దర్జా.. నేడు గజగజ!
తాచెడ్డ కోతి వనమంతా పాడు చేసిందని... ఒక్కసారి అవకాశం ఇవ్వండని వేడుకుని, అధికారం దక్కించుకున్న జగన్ రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను దారుణంగా కుప్పకూల్చారు. -
వైకాపా అభ్యర్థి రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ వ్యాజ్యం
వైకాపా తరఫున పోలవరం శాసనసభ (ఎస్టీ) నియోజకవర్గం అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగనున్న తెల్లం రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. -
ఏపీలో రోగులకు ఎన్నికల కష్టాలు
ఎన్నికలు వచ్చాయంటే సామాన్యులకు పండగే అంటారు. కానీ, ఓ విషయంలో మాత్రం వారికి నానా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
సీఎస్, డీజీపీలను బదిలీ చేయండి
‘‘ఆంధ్రప్రదేశ్ సీఎస్ కేఎస్ జవహర్రెడ్డి, డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డి ఆయా హోదాల్లో కొనసాగితే ఎన్నికలు నిష్పక్షపాతంగా, స్వేచ్ఛగా జరగవు. -
వైకాపాకు ప్రచారానికే సలహాదారు ఎత్తుగడ
ఏపీ ఎన్జీఓ సంఘం మాజీ అధ్యక్షుడు, ప్రభుత్వ సలహాదారు చంద్రశేఖరరెడ్డి ఉద్యోగులకు మేలు చేయకపోగా.. వారి జీవితాలను నాశనం చేస్తున్నారని ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ అధ్యక్షుడు పాలంకి సుబ్బరాయన్ ఓ ప్రకటనలో విమర్శించారు. -
తిరుమల నడకదారిలో చిరుత కలకలం
అలిపిరి-తిరుమల నడకదారిలో మరోసారి చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26వ తేదీల్లో తెల్లవారుజామున నడకదారికి 150 మీటర్ల దూరంలో చిరుత సంచరించిందని తితిదే అటవీ శాఖ డీఎఫ్వో శ్రీనివాసులు గురువారం వెల్లడించారు. -
సూపర్ఫాస్ట్ రైలులో ప్రయాణికుల ఉక్కిరిబిక్కిరి!
షాలిమార్ నుంచి సికింద్రాబాద్ వెళ్లే వారాంతపు సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు(22849)లో సాంకేతిక సమస్య తలెత్తి అందులోని ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.