Fitment:ఫిట్‌మెంట్‌ 23%

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని అధికారుల కమిటీ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ఆర్థిక  పరిస్థితుల్ని, సమస్యల్ని అన్ని కోణాల్లో క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఫిట్‌మెంట్‌పై ఒక వాస్తవిక అంకెను చెప్పింది. 14.29 శాతానికి మించి ఫిట్‌మెంట్‌ ఇవ్వలేమని స్పష్టం చేసింది. కానీ ఉద్యోగుల ఆకాంక్షల్ని, రాష్ట్ర వాస్తవ ఆర్థిక పరిస్థితిని బేరీజు వేసుకుని.

Updated : 08 Jan 2022 12:40 IST

2020 ఏప్రిల్‌ నుంచి వర్తింపు
ఉద్యోగులకు సవరించిన జీతాలు ఈ నెల నుంచి అమల్లోకి
పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంపు
కాంట్రాక్ట్‌, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకూ జనవరి జీతాలతో కొత్త స్కేల్స్‌
ఇకపై కేంద్ర వేతన సవరణ సంఘాల సిఫారసులే అమలు
ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సమావేశంలో సీఎం జగన్‌ ప్రకటన


ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని అధికారుల కమిటీ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ఆర్థిక  పరిస్థితుల్ని, సమస్యల్ని అన్ని కోణాల్లో క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఫిట్‌మెంట్‌పై ఒక వాస్తవిక అంకెను చెప్పింది. 14.29 శాతానికి మించి ఫిట్‌మెంట్‌ ఇవ్వలేమని స్పష్టం చేసింది. కానీ ఉద్యోగుల ఆకాంక్షల్ని, రాష్ట్ర వాస్తవ ఆర్థిక పరిస్థితిని బేరీజు వేసుకుని.. వీలైనంత మంచి చేయాలన్న  తపనతో 23 శాతం ఫిట్‌మెంట్‌ ఇవ్వాలని నిర్ణయించాం.

- ఉద్యోగ సంఘాల నేతలతో సీఎం జగన్‌


ఈనాడు, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు 23 శాతం ఫిట్‌మెంట్‌ ప్రకటించింది. ఉద్యోగుల పదవీ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచింది. ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో శుక్రవారం మధ్యాహ్నం తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి.. ఫిట్‌మెంట్‌ సహా కీలక అంశాలపై ప్రకటన చేశారు. ఇకపై రాష్ట్ర ప్రభుత్వం వేతన సవరణ సంఘాల్ని నియమించబోదని, కేంద్ర వేతన సవరణ సంఘం సిఫారసుల్నే అనుసరిస్తామని, ఉద్యోగులకు కూడా దాని వల్లే ఎక్కువ మేలు జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఉద్యోగులకు ప్రభుత్వం ఇప్పటికే 27 శాతం ఐఆర్‌ అమలు చేస్తోంది. వారికి 14.29 శాతం ఫిట్‌మెంట్‌ ఇవ్వాలని సీఎస్‌ కమిటీ సిఫారసు చేసింది. 55 శాతం ఫిట్‌మెంట్‌ ఇవ్వాలని ఉద్యోగ సంఘాల ఐకాసలు, కనీసం 34 శాతమైనా ఇవ్వాలని సచివాలయ ఉద్యోగుల సంఘం డిమాండ్‌ చేశాయి. వీటన్నింటినీ సమీక్షించిన ప్రభుత్వం 23 శాతం ఫిట్‌మెంట్‌ ఖరారు చేసింది. ‘ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని అధికారుల కమిటీ అన్ని కోణాల్లో క్షుణ్నంగా అధ్యయనం చేసి 14.29 శాతానికి మించి ఫిట్‌మెంట్‌ ఇవ్వలేమని స్పష్టం చేసింది. వీలైనంత మంచి చేయాలన్న తాపత్రయంతో 23 శాతం ఫిట్‌మెంట్‌ ఇవ్వాలని నిర్ణయించాం’ అని ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సీఎం పేర్కొన్నారు. ‘ఒక వ్యక్తి ఆధ్వర్యంలోని కమిటీలు శాస్త్రీయంగా నిర్ణయాలు తీసుకోలేవు. కేంద్ర వేతన సవరణ సంఘాలు విస్తృత ప్రాతిపదికల్ని పరిగణనలోకి తీసుకుని, శాస్త్రీయ పద్ధతుల్లో చేసే ప్రతిపాదనల్ని వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు యథాతథంగా అమలు చేస్తున్నాయి. ఇకపై మన రాష్ట్రంలోనూ అదే పంథా అనుసరించాలని నిర్ణయించాం’ అని ఆయన స్పష్టం చేశారు. పీఆర్సీ అమలు చేస్తూ తీసుకున్న నిర్ణయాల వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై ఏడాదికి రూ.10,247 కోట్లు అదనపు భారం పడుతుందని చెప్పారు. అయినా ఉద్యోగులకు మంచి జరగాలన్న ఉద్దేశంతోనే, ఇంత విపత్కర పరిస్థితుల్లోనూ ఆ బాధ్యత స్వీకరిస్తున్నామని సీఎం పేర్కొన్నారు. అధికారుల కమిటీ చెప్పిన దానికంటే దాదాపు 9 శాతం పెంచి ఫిట్‌మెంట్‌ ఇస్తున్నామని, ఉద్యోగ సోదరులంతా సవినయంగా అర్థÄం చేసుకోవాలని మనవి చేస్తున్నానని ఆయన పేర్కొన్నారు. సీపీఎస్‌పై ఇప్పటికే మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించామని, జూన్‌ 30లోగా దానిపై ఒక మంచి నిర్ణయం తీసుకుంటామని సీఎం వెల్లడించారు.

ఇబ్బందులున్నా ఇస్తున్నాం
‘మీతో గురువారం సమావేశమైన తర్వాత మీరు చెప్పిన అన్ని అంశాలపై అధికారులతో సుదీర్ఘంగా చర్చించాను. మన ఆర్థిక పరిస్థితులు, రాష్ట్ర విభజనతో ఏర్పడ్డ సంక్లిష్టతలు, కొవిడ్‌ వల్ల ఆదాయం తగ్గడం, తాజాగా వచ్చిన ఒమిక్రాన్‌ రాష్ట్ర, దేశ ఆర్థిక పరిస్థితులపై ఎలాంటి ప్రభావం చూపబోతోందో తెలియని సందిగ్ధతను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని గురువారం సమావేశంలోనే చెప్పారు. ఈ ఉదయం అధికారులతో మళ్లీ మాట్లాడాను. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని, ఎట్టి పరిస్థితుల్లోనూ 14.29 శాతానికి మించి ఫిట్‌మెంట్‌ ప్రతిపాదనకు అంగీకరించవద్దని వారు పదే పదే చెప్పారు. ఉద్యోగుల ఆకాంక్షల్ని దృష్టిలో ఉంచుకుని మనం కూడా నాలుగడుగులు అటు వేయాలని సీఎస్‌ తదితరులకు చెప్పాను’ అని సీఎం వివరించారు. ఉద్యోగుల ఇతర డిమాండ్లపై కూడా ఆ సమావేశంలో చర్చించామని, వాటిని కూడా నిర్దిష్ట గడువులోగా పరిష్కరించాలని ఆదేశించానని తెలిపారు. ‘ప్రభుత్వ పాలనలో ఉద్యోగులు ఒక భాగం. ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు సంతృప్తి స్థాయిలో అందాలంటే ఉద్యోగుల సహకారం లేకపోతే సాధ్యం కాదు. మా కుటుంబసభ్యులుగానే మిమ్మల్ని భావిస్తాను. ఇది మీ ప్రభుత్వం, ఈ భరోసా ఎప్పటికీ ఉండాలన్నదే నా భావన కూడా’ అని సీఎం పేర్కొన్నారు.

21 నెలల ముందుగానే..
‘కొత్త పీఆర్సీ ప్రకారం సవరించిన జీతాల్ని 2022 అక్టోబరు నుంచి ఇవ్వాలని సీఎస్‌ కమిటీ ప్రతిపాదించింది. అయితే ఉద్యోగుల ఆకాంక్షల మేరకు.. 21 నెలల ముందుగా, 2020 ఏప్రిల్‌ నుంచే ఇవ్వాలని నిర్ణయించాం’ అని సీఎం ప్రకటించారు. ‘ఈ నెల నుంచే పీఆర్సీ అమలు చేసి, సవరించిన జీతాలివ్వాలని అధికారులను ఆదేశించాను. పెండింగ్‌లో ఉన్న అన్ని డీఏల్ని ఒకేసారి జనవరి జీతంలో కలిపి ఇస్తాం. పీఎఫ్‌, జీఎల్‌ఐ, లీవ్‌ ఎన్‌క్యాష్‌మెంట్‌ వంటి పెండింగ్‌ బకాయిలన్నీ ఏప్రిల్‌ నాటికి చెల్లిస్తాం. రెగ్యులర్‌ ఉద్యోగులతోపాటు, కాంట్రాక్ట్‌, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకూ మేలు చేయాలన్న ఉద్దేశంతో వారికీ కొత్త స్కేల్స్‌ను జనవరి జీతాలతోనే అమలు చేస్తాం’ అని సీఎం వివరించారు. 2018 జులై 1ని పీఆర్‌సీ అమలు తేదీ (నోషనల్‌ బెనిఫిట్‌)గా పరిగణిస్తామన్నారు.

మీ అనుభవాన్ని ఉపయోగించుకోవాలనే..!
ఉద్యోగుల పదవీవిరమణ వయసు 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంపు నిర్ణయం కూడా ఈ నెల ఒకటి నుంచే అమల్లోకి వస్తుందని సీఎం తెలిపారు. ‘మీరు సుదీర్ఘకాలం ప్రజాసేవలో పనిచేశారు. మీకు ఇంకా ఏ విధంగా మంచి చేయగలమని ఆలోచించాను. మీ  అనుభవం రాష్ట్రానికి లభించిన ఆస్తి. రాష్ట్రాభివృద్ధికి మీ అనుభవం ఉపయోగపడాలి. మీ సేవల్ని మరింత మెరుగ్గా ఉపయోగించుకోవాలి, మీకు మరింత మేలు చేయాలన్న ఉద్దేశంతో పదవీ విరమణ వయసు పెంచుతున్నాం’ అని జగన్‌ ప్రకటించారు.

ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సీఎం చెప్పిన మరిన్ని ముఖ్యాంశాలు
* కొవిడ్‌ వల్ల మరణించిన ఉద్యోగుల కుటుంబసభ్యులకు కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇస్తామన్న హామీకి కట్టుబడి ఉన్నాం. జూన్‌ 30లోగా నియామకాలన్నీ పూర్తి చేస్తాం.
ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని మరింత మెరుగుపరచాలని మీ నుంచి పలు సూచనలు, సలహాలు వచ్చాయి. వాటిపై సీఎస్‌ ఆధ్వర్యంలో కమిటీ వేస్తున్నాం. రెండు వారాల్లో సమస్యలన్నీ పరిష్కరించాలని ఇప్పటికే ఆదేశాలిచ్చాం. ఉద్యోగుల ప్రతినిధులతో మాట్లాడి... అత్యుత్తమ విధానం తెమ్మని సీఎస్‌కి చెప్పాను.
* గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ జూన్‌ 30లోగా ప్రొబేషన్‌, కన్ఫర్మేషన్‌ ప్రక్రియ పూర్తి చేస్తాం. సవరించిన రెగ్యులర్‌ జీతాలను ఈ ఏడాది జులై నుంచి ఇస్తాం.  
సొంతిల్లులేని ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఎంఐజీ లేఅవుట్లలోని ఫ్లాట్లలో 10 శాతం రిజర్వు చేస్తాం. నియోజకవర్గం యూనిట్‌గా తీసుకుంటాం. ఉద్యోగులకు 20 శాతం రిబేటుపై స్థలాలు కేటాయిస్తాం. ఏ ఉద్యోగీ సొంతింటి స్థలం లేకుండా ఉండకూడదన్నదే మా లక్ష్యం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని