‘డీజీపీ పేరిట నకిలీ ఖాతా’పై సమాచారమివ్వలేం

ఆంధ్రప్రదేశ్‌ డీజీపీ పేరిట నకిలీ ట్విటర్‌ ఖాతా కేసుకు సంబంధించి వివరాలివ్వాలని విజయవాడ పోలీసులు పంపిన మెయిల్‌ను ట్విటర్‌ పట్టించుకోలేదు. ఇప్పటికి మూడుసార్లు విజ్ఞప్తి చేసినా స్పందన శూన్యం. ఖాతాదారుల సమాచారాన్ని పంచుకోలేమని నిరాకరించింది...

Updated : 20 Jun 2021 07:49 IST

పోలీసులకు ట్విటర్‌ సమాధానం

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ డీజీపీ పేరిట నకిలీ ట్విటర్‌ ఖాతా కేసుకు సంబంధించి వివరాలివ్వాలని విజయవాడ పోలీసులు పంపిన మెయిల్‌ను ట్విటర్‌ పట్టించుకోలేదు. ఇప్పటికి మూడుసార్లు విజ్ఞప్తి చేసినా స్పందన శూన్యం. ఖాతాదారుల సమాచారాన్ని పంచుకోలేమని నిరాకరించింది. గుర్తుతెలియని వ్యక్తులు ‘డీజీపీ ఆంధ్రప్రదేశ్‌’ అనే పేరుతో మూడు వారాల కిందట ట్విటర్‌లో నకిలీ ఖాతాను తెరిచారు. గౌతంసవాంగ్‌ ఫొటో కూడా పెట్టారు. పోలీసులు దీన్ని ట్విటర్‌ దృష్టికి తీసుకెళ్లడంతో     ఆ ఖాతాను తొలగించారు. ఈ వ్యవహారంపై విజయవాడ సైబర్‌ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదయింది. ఏ ఐపీ చిరునామాతో ఆ నకిలీ ట్విటర్‌ ఖాతాను సృష్టించారు? దీని వెనుక ఎవరున్నారు? ఏదైనా కుట్ర దాగుందా? అన్న కోణాల్లో విచారణ ప్రారంభించారు. కేసు ముందుకు సాగాలంటే ఐపీ చిరునామాకు సంబంధించిన వివరాలు అవసరం. వీటి కోసం  పోలీసులు ట్విటర్‌ను మెయిల్‌ ద్వారా సంప్రదించారు. ఈ సమాచారం ఇవ్వడం సాధ్యం కాదని, తమ ఖాతాదారుల వ్యక్తిగత హక్కులకు భంగం  కలుగుతుందని ఆ సంస్థ ప్రత్యుత్తరమిచ్చింది. దీనిపై పోలీసులు మరో మెయిల్‌ను పంపించినా స్పందన లేదు. దర్యాప్తులో లాగ్స్‌ కీలకమని, ఇవ్వకపోతే  చట్టపరంగా ముందుకెళతామని మూడోసారి   హెచ్చరించినా సమాధానం రాలేదు.

ప్రత్యామ్నాయాలపై అన్వేషణ
కేంద్ర ప్రభుత్వం ట్విటర్‌కు ఇప్పటివరకు ఐటీ చట్టం కింద ఇస్తున్న మినహాయింపులను ఇటీవల తొలగించింది. దీనివల్ల ట్విటర్‌లోని అన్ని అంశాలకు సంస్థ బాధ్యత వహించడమే కాదు.. చట్టపరంగా కేసులనూ ఎదుర్కోవాల్సి ఉంటుంది. కొత్త చట్టం ప్రకారం దర్యాప్తులో భాగంగా ఏదైనా సమాచారం అడిగితే ఇవ్వాలి. ఇప్పటికే దేశంలో పలుచోట్ల వివిధ కేసులకు సంబంధించి పోలీసులు ట్విటర్‌కు నోటీసులిచ్చారు. ఈ నేపథ్యంలో విజయవాడ పోలీసులు కూడా సమాచారాన్ని రాబట్టుకునేందుకు ట్విటర్‌ అధికారికి నోటీసులు ఇవ్వనున్నట్లు తెలిసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని