Aided Schools: ఎయిడెడ్‌ విలీనంపై భగ్గుమన్న తల్లిదండ్రులు

ఎయిడెడ్‌ పాఠశాలల రద్దుకు నిరసనగా రాష్ట్రంలో తొలిసారిగా విశాఖలో తల్లిదండ్రులు రోడ్డెక్కారు. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినదిస్తూ దాదాపు ఆరుగంటలపాటు ఆందోళన చేశారు. నాణ్యమైన విద్యను అందించకుండా అమ్మఒడి,

Updated : 26 Oct 2021 05:16 IST

విశాఖలో 6గంటలపాటు రాస్తారోకో

విశాఖపట్నం (జ్ఞానాపురం), న్యూస్‌టుడే: ఎయిడెడ్‌ పాఠశాలల రద్దుకు నిరసనగా రాష్ట్రంలో తొలిసారిగా విశాఖలో తల్లిదండ్రులు రోడ్డెక్కారు. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినదిస్తూ దాదాపు ఆరుగంటలపాటు ఆందోళన చేశారు. నాణ్యమైన విద్యను అందించకుండా అమ్మఒడి, ఉచిత పుస్తకాలు, యూనిఫారాలు, బూట్లు ఎందుకని వారు నిలదీశారు. తల్లిదండ్రుల ఆందోళనతో ట్రాఫిక్‌ పెద్దఎత్తున నిలిచిపోయింది. కిలోమీటరు మేర వాహనాలు బారులు తీరాయి. అమ్మఒడి వద్దు.. మా బడి ముద్దు అంటూ ఒక బాలుడు చేసిన నినాదాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి.

విశాఖ నగరం జ్ఞానాపురం సమీపంలోని సేక్రెడ్‌ హార్ట్‌ ఎయిడెడ్‌ బాలికోన్నత పాఠశాలను మూసివేస్తున్నామని, పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని యాజమాన్యం సోమవారం ప్రకటించడంతో తల్లిదండ్రులు భగ్గుమన్నారు. జ్ఞానాపురంలోని నాలుగురోడ్ల కూడలిలో బైఠాయించి రాస్తారోకో చేశారు. సుమారు 1500 మంది బాలికల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఎమ్మెల్యే గణేష్‌కుమార్‌పై ఆగ్రహం

విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌ అక్కడికి రావడంతో తల్లిదండ్రులు ఆయన్ను చుట్టుముట్టి నిలదీశారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి ఎయిడెడ్‌ పాఠశాలల భవనాలను అప్పగించాలని ముఖ్యమంత్రి జగన్‌ పిలుపునిచ్చారని ఎమ్మెల్యే చెప్పారు. మిగతా ఎయిడెడ్‌ పాఠశాలల్లో కంటే క్రిస్టియన్‌ మైనార్టీ సంస్థల పాఠశాలల్లో విద్యార్థులు అధిక సంఖ్యలో చదువుతున్నారన్నారు. ప్రభుత్వం వీటికి ప్రత్యేక వెసులుబాటు కల్పించాలని కోరనున్నట్లు తెలిపారు. సేక్రెడ్‌ హార్ట్‌ ఎయిడెడ్‌ బాలికల పాఠశాలల యాజమాన్యం స్వలాభం తల్లిదండ్రులను ప్రభుత్వంపైకి రెచ్చగొట్టి, నాటకాలాడుతోందని ఎమ్మెల్యే ఆరోపించారు. ఈ సందర్భంగా పలు తీవ్ర పదాలను వినియోగించారు. సేవభావంతో నెలకొల్పిన విద్యా సంస్థలపై వ్యాఖ్యలు చేయడంతో తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

* టీఎన్‌ఎస్‌ఎఫ్‌, జనసేన, ఏఐటీయూసీ, సెయింట్‌ పీటర్స్‌ ఎయిడెడ్‌ పాఠశాల విద్యార్థులు తల్లిదండ్రులకు మద్దతు ప్రకటించారు. ఉదయం 9గంటలకు ప్రారంభమైన ఆందోళన మధ్యాహ్నం 3.30 గంటల వరకు కొనసాగింది. అనంతరం పాఠశాలల యథావిధిగా నడుస్తుందని, ఉపాధ్యాయులు కొనసాగుతారని ముఖ్యమంత్రి కార్యాలయాధికారి తెలిపినట్లు ఆర్‌సీఎం ఎయిడెడ్‌ విద్యాసంస్థల డీజీఎం ఫాదర్‌ రత్నకుమార్‌ ప్రకటించడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన విరమించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని