Covid: కొవిడ్‌ సాయానికి కొర్రీలెన్నో!

కొవిడ్‌ మృతుల కుటుంబాలు రూ.50వేల ఆర్థికసాయం పొందడానికి విధించిన షరతులతో వ్యయప్రయాసలు తప్పడం లేదు. బాధితులు ఇచ్చే దరఖాస్తుపై స్థానిక ఆశా, ఏఎన్‌ఎం, ప్రాథమిక....

Updated : 12 Nov 2021 05:25 IST

దరఖాస్తుపై సంతకాల కోసం తిప్పలు
వ్యాధి నిర్ధారణ కానివారి విషయంలో ఇబ్బంది
అధికారిక మృతుల కంటే దరఖాస్తులు ఎక్కువ
కొన్ని జిల్లాల్లో ఒక్కోచోటే స్వీకరణ

ఈనాడు, అమరావతి: కొవిడ్‌ మృతుల కుటుంబాలు రూ.50వేల ఆర్థికసాయం పొందడానికి విధించిన షరతులతో వ్యయప్రయాసలు తప్పడం లేదు. బాధితులు ఇచ్చే దరఖాస్తుపై స్థానిక ఆశా, ఏఎన్‌ఎం, ప్రాథమిక ఆరోగ్యకేంద్రం వైద్యుడి సంతకాలు తప్పనిసరి చేయడం ఇబ్బందికరంగా మారింది. కొవిడ్‌ మరణాలు అత్యధికంగా ప్రభుత్వాసుపత్రుల్లోనే నమోదయ్యాయి. ప్రభుత్వ అనుమతి పొందిన ఆసుపత్రుల్లో మరణించినా, ఆ వివరాలూ రికార్డుల్లో ఉంటాయి. అయినా దరఖాస్తుల్లో సంతకాలు తప్పనిసరి చేయడం బాధిత కుటుంబాలకు ఇబ్బంది కలిగిస్తోంది. వైద్యాధికారి సంతకం పెడితేనే కింది స్థాయి సిబ్బంది స్పందిస్తున్నారు. ఇది ఇంకా సమస్యాత్మకం అవుతోంది. కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు పూర్తి కాకముందే ఆసుపత్రుల్లో పలువురు ప్రాణాలు కోల్పోయారు. వీరి కుటుంబాలకు నష్ట పరిహారంపై స్పష్టత లేదు.

వేలల్లో దరఖాస్తులు
వ్యాధి నిర్ధారణ అయినప్పటి నుంచి 30 రోజుల్లో సంభవించిన మరణాన్ని కొవిడ్‌-19 మృతిగా నిర్ధారిస్తున్నారు. రాష్ట్రంలో గురువారం వరకు అధికారికంగా 14,409 మంది కొవిడ్‌తో మరణించారు. 30 రోజుల నిబంధనతో     దరఖాస్తులు వేలల్లో రానున్నాయి. గుంటూరు జిల్లాలో గురువారం వరకు 1,246 మంది   కొవిడ్‌తో మరణించినట్లు ప్రభుత్వ బులెటిన్‌ చెబుతోంది. మరోవైపు జిల్లా కేంద్రంలో   ఏర్పాటుచేసిన ఒకే కేంద్రంలో ఇప్పటివరకు 2,900 దరఖాస్తులు వచ్చాయి. కర్నూలు జిల్లాలో అధికారిక మరణాలు 854 కాగా.. వెయ్యి వరకు దరఖాస్తులు వచ్చాయి.

విజయవాడలోని కొవిడ్‌ కమాండ్‌ కంట్రోల్‌రూంలో కొవిడ్‌ మృతుల కుటుంబాలకు అందించే పరిహారం కోసం దరఖాస్తులిచ్చేందుకు బారులు తీరిన బాధితులు (ఇటీవలి చిత్రం)

గడువు లేదు
దరఖాస్తుల సమర్పణకు గడువు తేదీ గురించి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతుండడంతో బాధిత కుటుంబాల్లో ఆందోళన పెరుగుతోంది. దరఖాస్తుల స్వీకరణకు నిర్దేశిత గడువు ఏమీలేదని విజయవాడ సబ్‌కలెక్టర్‌ ప్రవీణ్‌చంద్‌ తెలిపారు.

ఇలా చేస్తే..
* దరఖాస్తులు ఎక్కడ ఇస్తారో, వాటిని   తిరిగి ఎక్కడ ఇవ్వాలో తెలియక కొందరు అయోమయంలో ఉన్నారు. విజయవాడలోనే జీజీహెచ్‌ నుంచి కలెక్టరేట్‌ వరకు తిరుగుతున్నారు.

* బాధిత కుటుంబాలవారు ఎమ్మార్వో/ గ్రామ, వార్డు సచివాలయాలు జారీచేసిన ఫ్యామిలీ మెంబర్‌ సర్టిఫికెట్‌, బ్యాంకు ఖాతా, ఆధార్‌, డెత్‌ సర్టిఫికెట్‌, ఇతర ఆధారాలను దరఖాస్తుకు జతచేయాలి. దరఖాస్తులో ఆశా, ఏఎన్‌ఎం, మెడికల్‌ ఆఫీసర్‌ సంతకాలే మరీ ఇబ్బంది అవుతున్నాయి.

* ఆర్టీపీసీఆర్‌/ మాలిక్యులర్‌ టెస్ట్‌/ ర్యాపిడ్‌ యాంటీజెన్‌ టెస్ట్‌/ క్లినికల్‌ (సీటీ స్కాన్‌, ఇతర) పరీక్షల్లో కొవిడ్‌ సోకినట్లు చూపాలి. 30 రోజుల నిబంధన ప్రకారం.. ఆసుపత్రుల్లో చికిత్స పొంది డిశ్ఛార్జి అయి ఇంటికెళ్లాక మరణించినా అది కొవిడ్‌తోనే జరిగినట్లు గుర్తిస్తున్నారు.

* బాధిత కుటుంబాల వద్ద పాజిటివ్‌ వచ్చినట్లు సెల్‌ఫోన్లకు వచ్చిన ఎస్‌ఎంఎస్‌ మాత్రమే ఉంది. ఇలాంటి దరఖాస్తులు వస్తే ఐసీఎంఆర్‌, వెబ్‌సైట్‌ నుంచి సిబ్బందే అవసరమైన పత్రాలను డౌన్‌లోడ్‌ చేసుకునే సౌకర్యాన్ని కల్పించాలి.

* కొవిడ్‌ సోకిన వారిలో కొందరు ఇళ్ల (హోం ఐసొలేషన్‌) వద్దే ఉంటూ 30 రోజుల్లోగా చనిపోయారు. ఇలాంటివారి విషయం తమకు తెలియదని వైద్యులు అంటున్నట్లు తెలుస్తోంది.

* పరీక్షలు చేయించకుండానే కొవిడ్‌ లక్షణాలతో చనిపోతే వీఆర్వో నుంచి నిర్ధారణ పత్రాన్ని తేవాలని నెల్లూరు అధికారులు చెబుతున్నారు.


కొవిడ్‌ నిర్ధారణ కాకున్నా...

వ్యాధి నిర్ధారణ కాకుండా కొవిడ్‌ వార్డులో మరణిస్తే దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇస్తున్నామని కృష్ణా జిల్లా జేసీ శివశంకర్‌ తెలిపారు. దరఖాస్తుల స్వీకరణ కేంద్రాలు పెంచుతున్నామన్నారు. అర్హతలు, దరఖాస్తుల వివరాలపై ప్రచారం చేస్తున్నామని వివరించారు.


సమస్యలివీ..

* ఒంగోలు, నెల్లూరు, కాకినాడ, అనంతపురం, కర్నూలులోనే ఆయా జిల్లాలకు దరఖాస్తుల స్వీకరణ కేంద్రాలు ఏర్పాటు చేయడంతో దూరప్రాంతాల వారు వచ్చేందుకు అవస్థలు పడుతున్నారు. విశాఖ, చిత్తూరు, కడప జిల్లాల్లో మాత్రం మండలాల స్థాయిలోనూ దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.
* కృష్ణా జిల్లాకు మచిలీపట్నం, విజయవాడలోని సబ్‌ కలెక్టర్‌ కార్యాలయాలలోనే తొలుత దరఖాస్తులు స్వీకరించారు. తర్వాత గుడివాడ, నూజివీడులోనూ ఏర్పాట్లుచేశారు. విజయవాడ సబ్‌-కలెక్టరేట్‌లోనే ఇప్పటివరకు 700 దరఖాస్తులు వచ్చాయి. ఈ జిల్లాలో అధికారిక మరణాలు 1,441.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని