Omicron: ‘ఒమిక్రాన్‌’ కలకలంతో అప్రమత్తం

‘ఒమిక్రాన్‌’ కలకలం ప్రపంచ దేశాల్ని పరుగులు పెట్టిస్తోంది. సత్వర కార్యాచరణకు ఉసిగొల్పుతోంది. వైరస్‌ వ్యాప్తి భయంతో అనేక దేశాలు ‘కట్టడి’ చర్యల్ని కఠినంగా అమలుచేస్తున్నాయి. ఒమిక్రాన్‌ ప్రభావిత దేశాల నుంచి వచ్చిన వారిపై గట్టి నిఘావేసి.

Updated : 28 Nov 2021 04:12 IST

ఎక్కడికక్కడ విమాన సర్వీసుల నిలిపివేత
దక్షిణాఫ్రికా నుంచి భారత్‌కు వచ్చిన ఇద్దరికి పాజిటివ్‌!
డెల్టావేరియంట్‌గా గుర్తింపు

దిల్లీ, బ్రసెల్స్‌, జొహానెస్‌బర్గ్‌: ‘ఒమిక్రాన్‌’ కలకలం ప్రపంచ దేశాల్ని పరుగులు పెట్టిస్తోంది. సత్వర కార్యాచరణకు ఉసిగొల్పుతోంది. వైరస్‌ వ్యాప్తి భయంతో అనేక దేశాలు ‘కట్టడి’ చర్యల్ని కఠినంగా అమలుచేస్తున్నాయి. ఒమిక్రాన్‌ ప్రభావిత దేశాల నుంచి వచ్చిన వారిపై గట్టి నిఘావేసి.. పాజిటివ్‌గా తేలిన వారిని ఎక్కడిక్కడ క్వారంటైన్‌కు పంపుతున్నాయి. పరీక్షల్ని ముమ్మరం చేశాయి. కొత్త వేరియంట్‌ వెలుగుచూసిన దక్షిణాఫ్రికా, బోట్స్‌వానా తదితర దేశాలపై ప్రయాణ ఆంక్షలు విధిస్తున్నాయి. పలు ఆఫ్రికా దేశాల నుంచి విదేశీయులు రావొద్దని బ్రిటన్‌తో పాటు, అమెరికా, రష్యా, జపాన్‌, ఆస్ట్రేలియాలు కూడా ప్రకటించాయి. విమాన సర్వీసుల్ని ఆపేస్తుండడంతో అనేక ఎయిర్‌పోర్టుల్లో ప్రయాణికులు చిక్కుకుపోతున్నారు. బ్రిటన్‌లో తొలిసారిగా శనివారం రెండు ఒమిక్రాన్‌ కేసులు వెలుగుచూశాయి! దీంతో అంగోలా, మొజాంబిక్‌, మలావీ, జాంబియాల నుంచి కూడా విదేశీయుల రాకపై నిషేధం విధిస్తున్నట్టు బ్రిటన్‌ ప్రకటించింది. జర్మనీలోనూ ఒకరు ఒమిక్రాన్‌ బారిన పడినట్టు అనుమానిస్తున్నారు. దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన బి.1.1.529 వేరియంట్‌ బోట్స్‌వానా, బెల్జియం, ఇజ్రాయెట్‌, హాంకాంగ్‌లకు వ్యాపించింది. అనేక ఉత్పరివర్తనాలు సంతరించుకున్న ఈ వేరియంట్‌ చాలా శక్తిమంతమైనదని... పూర్తిస్థాయిలో టీకా తీసుకున్నవారికి, ఇప్పటికే ఒకసారి కొవిడ్‌ బారిన పడినవారికి కూడా ఇది సోకవచ్చని వైద్య పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

బెంగళూరులో కలకలం
దక్షిణాఫ్రికా నుంచి భారత్‌కు వచ్చిన ఇద్దరికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కావడం తీవ్ర కలకలం రేపింది. అయితే వారికి సోకింది డెల్టా వేరియంట్‌ మాత్రమేనని పరీక్షల్లో తేలడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

దక్షిణాఫ్రికాలో నిలిచిపోయిన కుటుంబాలు
చాలా దేశాలు దక్షిణాఫ్రికా నుంచి రాకపోకలను నిలిపివేశాయి. వందల మంది విదేశీయులు జొహానెస్‌బర్గ్‌, కేప్‌ టౌన్‌ విమానాశ్రయాల్లో చిక్కుకుపోయారు. కొన్నిదేశాలు మాత్రం కేవలం తమ పౌరులు మాత్రమే అక్కడి నుంచి వచ్చేందుకు అనుమతిస్తున్నాయి. భారత్‌ మాత్రం కొవిడ్‌కు ముందు షెడ్యూలైన ప్రయాణికుల విమానాల్లో సగం మాత్రమే దక్షిణాఫ్రికా, బోట్స్‌వానా, హాంకాంగ్‌ నుంచి రాకపోకలు సాగించేలా అనుమతించాలని నిర్ణయించింది. డిసెంబరు 15 నుంచి ఇది అమల్లోకి వస్తుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇప్పటికే ఈ మూడింటిని ‘ఎట్‌-రిస్క్‌’ దేశాలుగా కేంద్ర ఆరోగ్యశాఖ వర్గీకరించింది. కొద్ది రోజుల్లోనే మరిన్ని దేశాలు దక్షిణాఫ్రికా నుంచి రాకపోకలపై నిషేధం విధించవచ్చని ఓ ఎయిర్‌లైన్స్‌ అధికారి తెలిపారు.

నెదర్లాండ్స్‌ చేరుకున్న వారిలో..
జొహానెస్‌బర్గ్‌, కేప్‌ టౌన్‌ విమానాశ్రయాల నుంచి 2 విమానాల్లో నెదర్లాండ్స్‌ చేరుకున్న వారిలో 61 మందికి కొవిడ్‌ పాజిటివ్‌గా తేలింది. వీరిలో ఎవరికైనా ఒమిక్రాన్‌ సోకిందా?అని నిర్ధారించుకునేందుకు పరీక్షలు నిర్వహిస్తున్నారు.

లాక్‌డౌన్‌ దిశగా దక్షిణాఫ్రికా
దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్‌ రామఫోసా శనివారం అత్యవసరంగా ‘నేషనల్‌ కరోనావైరస్‌ కమాండ్‌ కౌన్సిల్‌’ సమావేశం ఏర్పాటుచేశారు. ఒమిక్రాన్‌ తీవ్రత, రాకపోకలపై విదేశాలు ఆంక్షలు విధించడం అంశాలపై చర్చించారు. కొత్త వేరియంట్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు దేశవ్యాప్త లాక్‌డౌన్‌ విధించే అవకాశమున్నట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ప్రపంచ దేశాలు తమపై ప్రయాణ ఆంక్షలు విధించడాన్ని దక్షిణాఫ్రికా తీవ్రంగా పరిగణించింది. ఇది తప్పుడు నిర్ణయమని, డబ్ల్యూహెచ్‌వో నియమావళికి విరుద్ధమని ఆ దేశ ఆరోగ్యశాఖ మంత్రి జోఫాహ్లా వ్యాఖ్యానించారు.  

డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక
‘ఒమిక్రాన్‌’ పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆగ్నేయాసియా దేశాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. ప్రజారోగ్యాన్ని బలోపేతం చేయాలని, కొవిడ్‌ ఆంక్షలను కఠినంగా అమలు పరచాలని, టీకా కార్యక్రమాన్ని ముమ్మరంగా నిర్వహించాలని సూచిస్తూ డబ్ల్యూహెచ్‌వో ప్రాంతీయ డైరెక్టర్‌ డా.పూనమ్‌ ఖేత్రపాల్‌సింగ్‌ శనివారం తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని