Roads: రహదారుణాలు

అవి దారులు కాదు.. నరకానికి నకళ్లు..! ఏ రోడ్డు చూసినా అడుగడుగునా పెద్ద పెద్ద గుంతలు..  వాటిపై ప్రయాణమంటే ప్రమాదం వైపు పయనమే. రెండేళ్లుగా మరమ్మతులు లేకపోవడంతో తారు లేచి, కంకర తేలిన ఆర్‌అండ్‌బీ రహదారులు.. కచ్చా రోడ్ల కంటే దారుణంగా తయారయ్యాయి. ఒక్కో చోట 50 సెం.మీ.లకుపైగా లోతు, ఐదారడుగుల పొడవు, వెడల్పు ఉన్న పెద్ద గోతులు పడ్డాయి.

Updated : 24 Dec 2021 05:37 IST

తారు లేచి, కంకర తేలిన ఆర్‌అండ్‌బీ రోడ్లు
రెండేళ్లుగా రాష్ట్రంలో ప్రజలకు తప్పని దారి కష్టాలు
నిత్యం ప్రమాదాలతో సావాసం
13 జిల్లాల్లో 13 రహదారుల పరిశీలన
287 కి.మీ. మేర ప్రత్యక్షంగా పరిశీలించిన ‘ఈనాడు’

ఈనాడు- న్యూస్‌టుడే యంత్రాంగం

అవి దారులు కాదు.. నరకానికి నకళ్లు..! ఏ రోడ్డు చూసినా అడుగడుగునా పెద్ద పెద్ద గుంతలు..  వాటిపై ప్రయాణమంటే ప్రమాదం వైపు పయనమే. రెండేళ్లుగా మరమ్మతులు లేకపోవడంతో తారు లేచి, కంకర తేలిన ఆర్‌అండ్‌బీ రహదారులు.. కచ్చా రోడ్ల కంటే దారుణంగా తయారయ్యాయి. ఒక్కో చోట 50 సెం.మీ.లకుపైగా లోతు, ఐదారడుగుల పొడవు, వెడల్పు ఉన్న పెద్ద గోతులు పడ్డాయి. అయినా విధిలేని పరిస్థితిలో ప్రజలు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని ప్రయాణం సాగిస్తున్నారు. ఎంత ఖరీదైన కారులోనైనా పది కిలోమీటర్లు వెళ్లేసరికే ఒళ్లు హూనమవుతోంది. ఆర్టీసీ బస్సులు, ఆటోల్లోనూ, ద్విచక్ర వాహనాలపైనా ప్రయాణించేవారి పరిస్థితి అయితే నిత్యం నరకమే.

రోడ్లు కొన్ని చోట్ల ప్రమాదాలకు నెలవుగా మారాయి. కొందరు ప్రాణాలు కోల్పోగా, ఇంకొందరికి కాళ్లు, చేతులు విరిగి, బలమైన గాయాలు తగిలి ఆస్పత్రుల పాలయ్యారు. అవే రోడ్లపై తరచూ ప్రయాణిస్తున్నవారు నడుంనొప్పి వంటి అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ప్రయాణ సమయంతోపాటు, పెట్రోలు, డీజిలు ఖర్చూ పెరిగిపోతోంది.. వాహనాలు గుల్లవుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఆర్‌అండ్‌బీ రహదారుల దుస్థితి, ప్రయాణికుల అవస్థలపై ‘ఈనాడు-న్యూస్‌టుడే’ ప్రతినిధుల బృందాలు క్షేత్ర స్థాయి పరిశీలన జరిపాయి. జిల్లాకి ఒక రహదారిని నమూనాగా ఎంచుకుని, సగటున 22 కి.మీ.ల దూరం పరిశీలించాయి. ప్రతి గుంతనూ చూశాయి. టేప్‌తోనూ, స్కేల్‌తోనూ.. పొడవు, వెడల్పు, లోతుల్నీ కొలిచాయి.
గుంతలు తేలి, దుమ్మూ ధూళి రేగిన దారుల్లో ప్రయాణికులు పడుతున్న కష్టాల్ని కళ్లారా చూసి.. ‘ఈనాడు’ అందిస్తున్న ప్రత్యేక కథనం..  

ఏ రోడ్డు చూసినా అడుగడుగునా గుంతలు.. అవీ అలాంటి ఇలాంటివి కాదు.. వాహనం అందులో పడితే కాలో, చెయ్యో విరిగేంత పెద్దవి. అందుకే ఆంధ్రప్రదేశ్‌లో ఆర్‌అండ్‌బీ రహదారులపై ప్రయాణమంటే ప్రమాదానికి ఎదురెళ్లడమే.. గమ్యస్థానానికి చేరేసరికి ఒళ్లంతా హూనమవుతున్నా, పదేపదే ఆ రహదారుల్లో ప్రయాణంతో వాహనాలు గుల్లవుతున్నా విధిలేని పరిస్థితిలో ప్రజలు ఆ రోడ్లమీదే బండి లాగుతున్నారు. కొన్నేళ్లుగా మరమ్మతులకు నోచక, వర్షాలకు ఏర్పడిన గుంతలను ఎప్పటికప్పుడు పూడ్చక.. రహదారులన్నీ గుల్లయ్యాయి. ఎట్టకేలకు ప్రభుత్వం 8,286 కి.మీ.ల మేర ఆర్‌అండ్‌బీ రోడ్ల పునరుద్ధరణకు నిర్ణయించి, టెండర్లు పిలిచింది. సకాలంలో బిల్లులు చెల్లించరేమోనన్న భయంతో చాలాచోట్ల గుత్తేదారులు పనులు చేయడానికి ముందుకు రావడం లేదు. ఈ నేపథ్యంలో ప్రజలు పడుతున్న అవస్థలపై ఈ నెల 16 నుంచి 18 వరకు ‘ఈనాడు- న్యూస్‌టుడే’ యంత్రాంగం జిల్లాకు ఒక ఆర్‌అండ్‌బీ రహదారిలో కనిష్ఠంగా 17.5 కి.మీ.ల నుంచి గరిష్ఠంగా 36 కి.మీల వరకు ప్రతి అడుగునూ పరిశీలించింది. వాటిలో కర్నూలు జిల్లాలోని కర్నూలు- సుంకేసుల రోడ్డు అత్యంత దారుణంగా ఉంది. మునగాల నుంచి సుంకేసుల వరకూ 22 కి.మీల పరిధిలో 1,080 గుంతలున్నాయి. ఈ రోడ్డులో కిలోమీటరుకు సగటున 49 గుంతలు కనిపించాయి. మిగతా రోడ్లూ దీనితో పోటీపడే స్థాయిలో ఛిద్రమయ్యాయి. రాష్ట్రంలో ఇలాంటి అధ్వాన రహదారులపై ప్రయాణిస్తూ ప్రమాదాల బారినపడినవారిలో ఆప్తుల్ని కోల్పోయినవారున్నారు. తీవ్రంగా గాయపడినవారు, కాళ్లూ, చేతులూ విరిగినవారూ ఎందరో. ‘ఈనాడు- న్యూస్‌టుడే’ బృందం పరిశీలించిన తర్వాత కొన్నిచోట్ల రోడ్లపై గుంతల్ని రోడ్లు భవనాల శాఖ హడావుడిగా పూడ్చి, తాత్కాలిక మరమ్మతులు చేయడం గమనార్హం.


ఆర్‌అండ్‌బీ మంత్రి ఇంటికెళ్లే దారీ అధ్వానమే

అనంతపురం జిల్లాలో పెనుకొండ నియోజకవర్గంలోని రహదారుల పరిస్థితి పరమ అధ్వానంగా ఉంది. పెనుకొండ పట్టణం నుంచి మడకశిర వరకు 36 కి.మీ.ల రహదారి పూర్తిగా ధ్వంసమైంది. అంతర్రాష్ట్ర రవాణాకు కీలకమైన ఈ మార్గంలో 40 నిమిషాల ప్రయాణానికి ఇప్పుడు గంటన్నర పడుతోంది. ఈ మార్గంలో చిన్నవి, పెద్దవి కలిపి 769 గుంతలు ఉన్నాయి. పెనుకొండ పట్టణంలోని ఎన్టీఆర్‌ సర్కిల్‌ నుంచి సాక్షాత్తూ రహదారులు, భవనాల శాఖ మంత్రి శంకరనారాయణ ఇంటి వరకు 400 మీటర్లలో దూరంలో 51 గుంతలు ఉన్నాయి. వాటిలో 10 సెం.మీ.ల కంటే ఎక్కువ లోతున్న గుంతలు 12. వాటిలో ఒక పెద్ద గుంతను ‘ఈనాడు’ పరిశీలన తర్వాత మట్టి, కంకరతో పూడ్చారు. మంత్రి ఇంటి నుంచి రైల్వే గేటు వరకు 84 గుంతలున్నాయి. ఇందులో 46 గుంతలు 10 సెం.మీ.ల కంటే ఎక్కువ లోతున్నవే. అక్కడి నుంచి అడదాకులపల్లి మొదటి క్రాస్‌ వరకు రహదారి పూర్తిగా ధ్వంసమైంది. దాన్నుంచి మడకశిర వరకు 635 గుంతలు పడ్డాయి. ఈ నెల 12న రొద్దం మండలం చోళేమర్రి గ్రామానికి చెందిన జీవితబీమా ఏజెంట్‌ ఉప్పర హనుమంతు (42) ద్విచక్రవాహనంపై వెళ్తూ అదుపుతప్పి పడిపోయి అక్కడికక్కడే మృతి చెందారు.


ప్రాణాలు తీస్తున్న రోడ్లు

* విజయనగరం జిల్లా ఎండభద్ర గ్రామానికి చెందిన గర్భిణి లక్ష్మి నవంబరు 19న పార్వతీపురం ఆసుపత్రికి భర్తతో కలిసి ద్విచక్రవాహనంపై వెళుతుండగా, కొమరాడ మండలం బంగారమ్మపేట వద్ద ఎదురుగా ఉన్న గుంతను తప్పించే ప్రయత్నంలో లక్ష్మి కింద పడిపోయారు. వెనుక వస్తున్న లారీ చక్రం కింద పడి ప్రాణాలు కోల్పోయారు.  
* తాడేపల్లిగూడెం- నిడదవోలు రహదారిపై ఏడాదిగా పలు ప్రమాదాలు జరిగాయి. నాలుగు నెలల క్రితం ద్విచక్రవాహనంపై తాడేపల్లిగూడెం వెళుతున్న వ్యక్తి గోతుల్లో బండి అదుపుతప్పి పడిపోయారు. వెనుక వస్తున్న లారీ అతనిపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే చనిపోయారు.
* విజయవాడ-నూజివీడు మార్గంలో మాదాలవారిగూడెం సమీపంలో ఇటీవల స్కూటీపై వెళుతున్న తల్లీ కూతురు జారి కింద పడిపోయారు. వెనుక నుంచి వస్తున్న టిప్పరు వారి మీదుగా వెళ్లడంతో ప్రాణాలు కోల్పోయారు. ఈ రోడ్డుపై గన్నవరం, ఆగిరిపల్లి మండలాల పరిధిలో గత రెండేళ్లలో 70 ప్రమాదాలు జరిగాయి.
* నరసరావుపేట నంచి కోటప్పకొండకు వెళ్లే మార్గంలో మూణ్నెల్ల కిందట ఎన్‌ఈసీ ఇంజినీరింగ్‌ కళాశాల సమీపంలో గోతిని తప్పించబోయి కోటప్పకొండ యానాదికాలనీకి చెందిన యువకుడు ద్విచక్రవాహనంపై నుంచి పడి మృతి చెందారు.  
* ఇటీవల నెల్లూరు జిల్లా దగదర్తి మండలానికి చెందిన శ్రీనివాసరావు రామచంద్రపురం దాటిన తర్వాత రోడ్డుపై గుంతలో ద్విచక్రవాహనం అదుపుతప్పి కిందపడిపోయారు. తలకు తీవ్రగాయాలవడంతో మెరుగైన వైద్యం కోసం చెన్నైకి తరలించారు.


 


టెండర్లు వేయట్లేదు.. పనులూ చేయట్లేదు

* రాష్ట్రంలో అధ్వానంగా మారిన 8,268 కి.మీ.ల ఆర్‌అండ్‌బీ రహదారుల్ని రూ.2,205 కోట్లతో పునరుద్ధరించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి రూ.2 వేల కోట్ల బ్యాంకు రుణం కూడా మంజూరైంది. గుత్తేదారులకు నేరుగా బ్యాంకు నుంచి బిల్లులు చెల్లించేలా ప్రభుత్వం ఉత్తర్వులూ ఇచ్చింది. మొత్తం 8,268 కి.మీ.ల రహదారుల్ని 1,147 పనులుగా విభజించి రోడ్లు భవనాల శాఖ టెండర్లు పిలిచింది. ఇందులో 400 పనులకే టెండర్లు ఖరారయ్యాయి. వీటిని దక్కించుకున్న గుత్తేదారుల్లోనూ కొందరు రెండు, మూడు నెలలైనా ఒప్పందాలు చేసుకోలేదు. ఒప్పందాలు చేసుకున్నా కొందరు పనులు మొదలుపెట్టలేదు. మిగతా పనులకు ఎన్నిసార్లు టెండర్లు పిలిచినా గుత్తేదారులు స్పందించడం లేదు. న్యూ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ (ఎన్‌డీబీ) ప్రాజెక్ట్‌లో భాగంగా తొలి దశలో రూ.3,013 కోట్లతో రూ.1,243 కి.మీ.విస్తరణ, వంతెనల పునర్నిర్మాణ పనులు దక్కించుకున్న గుత్తేదారులు.. మార్చి, ఏప్రిల్‌లో ఒప్పందం చేసుకున్నారు. ఇప్పటివరకు పూర్తిస్థాయిలో పనులే మొదలుకాలేదు. ఈ ప్రాజెక్టులో ఉన్న రహదారులు సైతం వర్షాలకు చాలాచోట్ల దెబ్బతిన్నాయి.


గుత్తేదారుల పట్టు.. సర్కారు సర్దుబాటు

* నిరుడు వర్షాలకు దెబ్బతిన్న రహదారుల మరమ్మతులు చేసిన గుత్తేదారులకు ఈ ఏడాది మార్చిలోనే రూ.400 కోట్లు చెల్లించాల్సి ఉంది. అవి చెల్లించకపోవడంతో ఈ సీజన్‌లో వర్షాలకు దెబ్బతిన్న రహదారుల మరమ్మతులకు గానీ.. కనీసం తాత్కాలికంగా గుంతలు పూడ్చేందుకు కూడా గుత్తేదారులు ససేమిరా అన్నారు. చివరకు ప్రభుత్వం ఇటీవలే దఫదఫాలుగా రూ.300 కోట్ల వరకు బకాయిలు చెల్లించింది. మిగతావాటి చెల్లింపు ప్రక్రియ కొనసాగుతోంది. ః కేంద్ర రహదారి నిధి (సీఆర్‌ఎఫ్‌) కింద పనులు చేసిన గుత్తేదారులకు రూ.250 కోట్ల వరకు చెల్లించాలి. వీటిని కేంద్రం రీయంబర్స్‌ చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం ముందుగా చెల్లించలేదు. ముఖ్యంగా ఉభయగోదావరి జిల్లాల్లో ఈ పనులు చేసిన గుత్తేదారులే గుత్తేదారులు ఎక్కువగా ఉన్నారు. వీరంతా ఆ బకాయిలిస్తేనే టెండర్లు వేస్తామని పట్టుబడుతున్నారు.


రోడ్లను మించిన గుంతలు

* ప్రకాశం జిల్లా టంగుటూరు-పొదిలి రహదారిలో టంగుటూరు నుంచి కొండపి మధ్య 22 కి.మీ. పరిశీలించగా 971 గుంతలున్నాయి.
* గుంటూరు జిల్లాలో చిలకలూరిపేట బైపాస్‌ నుంచి నరసరావుపేట బైపాస్‌ వరకూ రహదారిని 24 కి.మీ. మేర పరిశీలించగా 925 గుంతలు తేలాయి.
* తూర్పుగోదావరి జిల్లా జి.పెదపూడి నుంచి పొదలాడ వరకు 20 కి.మీ. మార్గంలో మూడు నుంచి నాలుగు అడుగుల పొడవు, వెడల్పుతో గోతులు పడ్డాయి. 20 సెం.మీ.లకు పైగా (దాదాపు ముప్పావు అడుగు) లోతున్న గోతులే 34 ఉండటం గమనార్హం.
* శ్రీకాకుళం జిల్లాలోని పాలకొండ- రాజాం రోడ్డులో 13 చోట్ల రహదారి పూర్తిగా ఛిద్రమైంది. కొన్నిచోట్ల 5-15 మీటర్ల మేర తారు లేచిపోయి పూర్తి మట్టి రోడ్డులా కనిపిస్తోంది.
* కడప జిల్లాలో ఆర్టీపీపీ నుంచి జమ్మలమడుగు వెళ్లే రహదారిలో గోపులాపురం నుంచి సిరిగేపల్లె, సున్నపురాళ్లపల్లె మీదుగా జమ్మలమడుగు వెళ్లే రహదారిలో మొత్తం 86 గుంతలున్నాయి. గోపులాపురం, సిరిగేపల్లె మధ్యలో దాదాపు 6 కి.మీ.లు అత్యంత దారుణంగా ఉంది.
* విశాఖపట్నం జిల్లాలోని నర్సీపట్నం- అడ్డరోడ్డు రహదారి రాళ్లు తేలి ప్రమాదకరంగా మారింది. ఇందేశమ్మవాక గుడి సమీపంలోని ఓ మలుపు వద్ద 30 అడుగుల మేర రహదారి కోతకు గురైంది. తాత్కాలిక మరమ్మతులైనా చేయకుండా ఇసుకబస్తాలు పెట్టి వదిలేశారు. గుడి సమీపంలో అరడుగు లోతు, 5 అడుగుల పొడవు, 8 అడుగుల వెడల్పున భారీ గొయ్యి పడింది.
* పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం- నిడదవోలు రహదారిలోని పత్తిపాడు వైజంక్షన్‌ నుంచి నిడదవోలు మధ్య 19 కి.మీ.ల్లో.. 12 కి.మీ మేర రహదారి అత్యంత దారుణంగా తయారయింది.
* విజయవాడ- నూజివీడు రహదారిలో సూరంపల్లి నుంచి ఆగిరిపల్లి మధ్య17.5 కి.మీ. మేర పరిశీలించగా 5 కి.మీ.మినహా మిగతా రోడ్డంతా తారు ఒక పొర ఛిద్రమైంది.
* నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం నుంచి మలిదేవి- దగదర్తి మధ్య 20 కి.మీ మేర పరిశీలించగా దాదాపు 10 కి.మీ రోడ్డుకు ఇరువైపులా కొట్టుకుపోయింది.
* కర్నూలు-సుంకేసుల రహదారిలో సుంకేసుల పెట్రోలు బంకు నుంచి జి.సింగవరం పొలిమేర వరకూ 6 కి.మీ పరిధిలో రోడ్డంతా తారు లేచి, గుంతలు పడింది.


ప్రాణాలు అరచేతబట్టుకుని ప్రయాణం
-శ్రీనివాసరావు, ప్రైవేటు ఉద్యోగి, చిలకలూరిపేట, గుంటూరు జిల్లా

చిలకలూరిపేట నుంచి రోజూ యడవల్లిలోని గ్రానైట్‌ ఫ్యాక్టరీకి 10 కి.మీ.లు వెళ్లి వస్తుంటా. గ్రానైట్‌ లారీలు ఎదురొచ్చినప్పుడు తప్పించే క్రమంలో రోడ్డుపై ఉన్న గోతుల్లో పడి ప్రమాదాలు జరుగుతున్నాయి. రాత్రివేళ ద్విచక్రవాహనాలపై వెళ్లేవారు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని వెళ్లాల్సి వస్తోంది.  


మరమ్మతులకే నెలకు రూ.4 వేలు
- రాంబాబు, లారీ డ్రైవర్‌, భీమవరం, పశ్చిమగోదావరి జిల్లా

తాడేపల్లిగూడెం- నిడదవోలు రహదారిపై రోజూ లారీ నడుపుతాను. గతంలో రోజుకు రెండుసార్లు తిరిగేవాళ్లం. రోడ్డు బాగాలేక ఇప్పుడు ఒక్కసారి వెళ్లడమే కష్టమవుతోంది. వాహనాలు గుల్లగుల్లవుతున్నాయి. మరమ్మతులకు నెలకు రూ.4 వేల వరకూ ఖర్చవుతోంది. డీజిలు ఖర్చూ బాగా పెరిగింది.


నా జీతం బండి మరమ్మతులకే సరిపోతోంది
- పి.వెంకట్‌, అమెజాన్‌ డెలివరీ సూపర్‌వైజర్‌, కృష్ణా జిల్లా

ఉద్యోగరీత్యా రోజూ విజయవాడ నుంచి ద్విచక్రవాహనంపై వస్తాను. ఈ రోడ్డు దారుణంగా ఉంది. తరచూ పంక్చర్లు అవుతున్నాయి. కొత్త టైర్లు వేస్తే ఏడాది కూడా రావడం లేదు. నా జీతం బండి మరమ్మతులకే సరిపోతోంది. చాలాసార్లు కిందపడి, గాయాలపాలయ్యా.

 


రూ.200 కిరాయికెళితే రూ.వెయ్యి నష్టం
-ఆర్‌.రాము, ఆటోడ్రైవర్‌, పాలకొండ, శ్రీకాకుళం జిల్లా

రూ.200 కిరాయికి సామగ్రి తీసుకెళుతుండగా గుంతల్లోపడి ఆటో చక్రం విరిగిపోయింది. మరమ్మతులకు రూ.వెయ్యి ఖర్చయింది. ఈ దారిలో నాలానే ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు.


ఒక గొయ్యి తప్పిస్తే మరో దానిలో పడుతున్నాం
- నర్సీపట్నం డిపో ఆర్టీసీ డ్రైవర్‌ ఆవేదన

ఇందేశమ్మవాక నుంచి అడ్డురోడ్డు వరకు భారీ గుంతలు పడ్డాయి. ఒక గొయ్యి తప్పిస్తే ఇంకో గోతిలో పడుతున్నాం. ప్రయాణికులు ఎగిరెగిరి పడుతున్నారు. బస్సులు తరచూ పాడవుతున్నాయి.


‘ఈనాడు’ పరిశీలించిన  రహదారుల్లో పనుల పరిస్థితి

* పార్వతీపురం- కూనేరు రహదారి మరమ్మతుల టెండరు దక్కించుకున్న గుత్తేదారు ఇంకా ఒప్పందం చేసుకోలేదు.
* పెనుకొండ-మడకశిర మార్గంలో 18 కి.మీ.మరమ్మతుల టెండరు దక్కించుకున్న గుత్తేదారు మూడు నెలలైనా పనులు ఆరంభించలేదు.
* తాడేపల్లిగూడెం-నిడదవోలు రహదారి మరమ్మతులకు నాలుగుసార్లు,  టంగుటూరు- పొదిలి రహదారిలో కొంతభాగం పునరుద్ధరణకు 5సార్లు టెండర్లు పిలిచినా ఎవరూ రాలేదు.  
* విశాఖ జిల్లాలోని కోటవురట్ల- అడ్డరోడ్డు మార్గంలో కొంత భాగం, నెల్లూరు జిల్లాలోని బుచ్చిరెడ్డిపాళెం- దగదర్తి రహదారి ఎన్‌డీబీ ప్రాజెక్ట్‌ మొదటి దశలో విస్తరణ పనులను గుత్తేదారులు గాలికొదిలేశారు.
* కర్నూలు- సుంకేసుల రహదారి అభివృద్ధి పనులు రూ.24 కోట్లతో చేపట్టారు. గుత్తేదారు 40 శాతం పనులు చేశారు. రూ.7 కోట్ల బిల్లులు రాలేదని గుత్తేదారు రెండేళ్లుగా పనులు ఆపేశారు.  
* చిత్తూరు- అరగొండ రహదారిలో రూ.కోటితో చేపట్టిన మరమ్మతులకు భారీ వర్షాలు ఆటంకంగా మారాయి.  


 గుంటూరు జిల్లా చిలకలూరిపేట బైపాస్‌ నుంచి నరసరావుపేట బైపాస్‌ వరకు 24 కి.మీ. మార్గంలో ఉన్న గుంతలు 925
 కర్నూలు జిల్లాలోని మునగాల నుంచి సుంకేసుల దారిలో 22 కి.మీ. మార్గంలో గుంతలు 1080

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు