China: అరుణాచల్.. అనాదిగా మాదే
అరుణాచల్ ప్రదేశ్లో 15 ప్రదేశాలకు కొత్త పేర్లు పెట్టడాన్ని చైనా అడ్డగోలుగా సమర్థించుకుంది. అది టిబెట్లోని దక్షిణ ప్రాంతమని, ప్రాచీన కాలం నుంచి అది తమ అంతర్భాగమని వితండవాదం చేసింది.
బీజింగ్: అరుణాచల్ ప్రదేశ్లో 15 ప్రదేశాలకు కొత్త పేర్లు పెట్టడాన్ని చైనా అడ్డగోలుగా సమర్థించుకుంది. అది టిబెట్లోని దక్షిణ ప్రాంతమని, ప్రాచీన కాలం నుంచి అది తమ అంతర్భాగమని వితండవాదం చేసింది. తమ దేశానికి చెందిన ప్రాంతాలకు చైనీస్ పేర్లు పెట్టడాన్ని భారత విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి ఆరిందమ్ బాగ్చి తప్పుబట్టిన సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా స్పందించిన చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఝావో లిజియాన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘జన్గ్నాన్ (అరుణాచల్ ప్రదేశ్).. టిబెట్లోని దక్షిణ భాగం. టిబెటన్ స్వయంప్రతిపత్తి ప్రాంతంలో అంతర్భాగంగా ఉంది. అక్కడ అనేక సంవత్సరాలుగా.. మోయిన్బా, టిబెటన్ జాతులు, చైనాకు చెందిన మైనార్టీ తెగల ప్రజలు నివసిస్తున్నారు. అక్కడి ప్రదేశాలకు భిన్న రకాల పేర్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పేర్లను ప్రామాణీకరించడంలో భాగంగా చైనాలోని సంబంధిత అధికార వ్యవస్థ కొత్త నామకరణ ప్రక్రియను చేపట్టింది. చైనా సార్వభౌమాధికార పరిధిలోనే ఇదంతా జరిగింది’’ అని ఆయన వింత వాదన వినిపించారు. అరుణాచల్ప్రదేశ్లోని 15 ప్రాంతాలకు చైనా సొంత పేర్లు ఇచ్చినా.. ప్రధాని మోదీ మౌనం వహిస్తున్నారని కాంగ్రెస్ ఆరోపించింది.
చైనా ఎంబసీ లేఖలపై ఎంపీ ఆగ్రహం
ప్రవాసంలో ఉన్న టిబెట్ పార్లమెంటు నిర్వహించిన ఒక విందుకు హాజరైన పలువురు ఎంపీలకు దిల్లీలోని చైనా రాయబార కార్యాలయం లేఖలు రాయడంపై భారత్లో తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. గతవారం దిల్లీలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ఆరుగురు ఎంపీలు.. ‘ఆల్ పార్టీ ఇండియన్ పార్లమెంటరీ ఫోరం ఫర్ టిబెట్’ వేదిక తరఫున పాల్గొన్నారు. విందులో పాల్గొనడాన్ని ఆక్షేపిస్తూ ఈ ఫోరంలోని కొందరు ఎంపీలకు చైనా రాయబార కార్యాలయం లేఖలు రాసింది. టిబెటన్ శక్తులకు మద్దతు ఇవ్వరాదని సూచించింది. దీనిపై ఫోరం కన్వీనర్ సుజీత్ కుమార్ స్పందిస్తూ.. ‘‘భారత పార్లమెంటేరియన్కు లేఖ రాసే హక్కు ఎంబసీకి లేదు. ఏదైనా వివాదం ఉంటే విదేశాంగ శాఖకు రాయాల్సింది. ఇది ప్రొటోకాల్ ఉల్లంఘనే’’ అని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్, ముంబయి మ్యాచ్లో నమోదైన రికార్డులివీ..
-
రాశీఖన్నా ‘గోల్డెన్’ మెరుపులు.. అలా చూడొద్దన్న కేతిక.. టీమ్తో కృతి సనన్
-
లీడర్ పిలిస్తే.. జనసేన పార్టీ ప్రచారానికి సిద్ధంగా ఉన్నా: నటి అనసూయ
-
నా దగ్గర అంత డబ్బు లేదు.. అందుకే పోటీ చేయట్లేదు: నిర్మలా సీతారామన్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/03/2024)
-
మాల్దీవుల్లో తాగునీటి కొరత.. టిబెట్ నుంచి 1500 టన్నుల నీరు పంపిన చైనా