RTPP: సీమ వెలుగులపై చిన్నచూపు

రాయలసీమ వెలుగుదివ్వెగా పేరొందిన కడప జిల్లా ఎర్రగుంట్ల మండలంలోని రాయలసీమ తాప విద్యుదుత్పత్తి కేంద్రం (ఆర్టీపీపీ) భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. మొత్తం ఆరు యూనిట్లున్న సంస్థలో ప్రస్తుతం మూడు యూనిట్లలో మాత్రమే విద్యుదుత్పత్తి చేస్తున్నారు.

Updated : 25 Jan 2022 03:33 IST

ఆర్టీపీపీలో పూర్తిస్థాయి ఉత్పత్తి సాధ్యమేనా?
సంస్థ భవిష్యత్తుపై ఉద్యోగుల ఆందోళన  
ఎర్రగుంట్ల, న్యూస్‌టుడే

రాయలసీమ వెలుగుదివ్వెగా పేరొందిన కడప జిల్లా ఎర్రగుంట్ల మండలంలోని రాయలసీమ తాప విద్యుదుత్పత్తి కేంద్రం (ఆర్టీపీపీ) భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. మొత్తం ఆరు యూనిట్లున్న సంస్థలో ప్రస్తుతం మూడు యూనిట్లలో మాత్రమే విద్యుదుత్పత్తి చేస్తున్నారు. ఏపీ జెన్‌కో పరిధిలోని మిగతా తాప విద్యుత్తు కేంద్రాల్లో సమస్య వస్తేనే ఉన్నతాధికారులు ఇక్కడినుంచి అధిక విద్యుదుత్పత్తిని కోరుకుంటున్నారు. ఇక్కడ ఉత్పత్తి వ్యయం అధికమవుతోందన్న నెపంతో ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపుతోందని కార్మికులు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో సంస్థ మనుగడ, భవితవ్యంపై ఉద్యోగుల్లో క్రమేణా అపనమ్మకం ఏర్పడుతోంది. అనేకమంది ఉద్యోగులు డిప్యుటేషన్‌పై ఇతర ప్రాంతాలకు తరలివెళ్లారు. తాజాగా నెల్లూరు జిల్లాలోని దామోదరం సంజీవయ్య తాప విద్యుదుత్పత్తి కేంద్రాన్ని 25ఏళ్లపాటు ప్రభుత్వం ప్రైవేటుకు అప్పగించడం వారి ఆందోళనకు కారణమవుతోంది.

నాడు ఘనం... నేడు హీనం
రాయలసీమలో ఉపాధి, లోవోల్టోజి సమస్య పరిష్కారమే ధ్యేయంగా తాప విద్యుదుత్పత్తి కేంద్రాన్ని 1988 మార్చి 18న అప్పటి ముఖ్యమంత్రి ఎన్‌టీ రామారావు శంకుస్థాపన చేశారు. ఆ తరువాత 1991లో నిర్మాణ పనులు చేపట్టి 1995లో మొదటి యూనిట్‌లో ఉత్పత్తి ప్రారంభించారు. కేంద్రం క్రమేణా అభివృద్ధి చెందుతూ మొత్తం 4దశల్లో ఏర్పాటుచేసిన ఆరు యూనిట్లలో 1,650 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యానికి చేరింది. ప్రస్తుతం ఉత్పత్తి వ్యయం ఎక్కువగా ఉందన్న నెపంతో వేల కోట్లు వెచ్చించిన ప్రాజెక్టును నామమాత్రంగా వినియోగిస్తున్నారు. ఏపీ జెన్‌కో పరిధిలోని మిగతా థర్మల్‌ కేంద్రాల్లో యూనిట్‌ ధర రూ.4లోపుంటే ఆర్టీపీపీలో రూ.5.50 వరకు ఖర్చవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఆర్టీపీపీలో ఉత్పత్తి వ్యయం ఎక్కువగా ఉన్నందున థర్మల్‌ కేంద్రాల్లో ఉత్పత్తి తగ్గించాల్సి వస్తే మొదటగా ఆర్టీపీపీ వైపే చూస్తున్నారు. దీంతో ఇక్కడ నామమాత్రంగా విద్యుదుత్పత్తి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందుతున్న వేల కుటుంబాలు పరిశ్రమ భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్నాయి. డిమాండ్‌ మేరకు ఉత్పత్తి చేస్తున్నామని కేంద్రం చీఫ్‌ ఇంజినీర్‌ మోహన్‌రావు తెలిపారు.

పూర్తి స్థాయిలో విద్యుదుత్పత్తి చేయాలి
వైకాపా ప్రభుత్వం వచ్చాక రెండున్నరేళ్లలో చాలా తక్కువ రోజులు మాత్రమే పూర్తిస్థాయిలో విద్యుదుత్పత్తి చేశారు. దామోదరం సంజీవయ్య తాప విద్యుదుత్పత్తి కేంద్రాన్ని ప్రైవేటుకు అప్పగించడంతో ఆర్టీపీపీ భవిష్యత్తుపై భయాందోళన పెరిగింది. లాభనష్టాలతో సంబంధం లేకుండా ఆర్టీపీపీలో పూర్తిస్థాయి విద్యుదుత్పత్తి చేయాలి. - రామగోపాల్‌రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు (బీఎంఎస్‌), ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పవర్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని