APSRTC: ఏ క్షణమైనా ఆర్టీసీ రథచక్రాలు నిలిపేస్తాం

‘ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తే కొత్త సౌకర్యాలు, కొత్త పింఛను, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలు వస్తాయని ఆశ పడ్డాం. ఏవీ నెరవేరడం లేదు. అసలు విలీనం

Updated : 29 Jan 2022 04:03 IST

విలీనం ఎందుకు కోరుకున్నామని బాధపడే పరిస్థితి

పాత పింఛను లేని విలీనం ఎందుకు?

ఆర్టీసీ ఉద్యోగ సంఘాల ఐక్యవేదిక నేతలు

ఈనాడు, అమరావతి: ‘ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తే కొత్త సౌకర్యాలు, కొత్త పింఛను, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలు వస్తాయని ఆశ పడ్డాం. ఏవీ నెరవేరడం లేదు. అసలు విలీనం ఎందుకు కోరుకున్నామా? అని బాధపడే పరిస్థితి నెలకొంది. పీఆర్సీ సాధన సమితి పిలుపునిస్తే ఏక్షణమైనా ఎక్కడికక్కడ ఆర్టీసీ రథచక్రాలు నిలిపేయడానికి సిద్ధంగా ఉన్నాం’ అని ప్రజా రవాణాశాఖ (ఆర్టీసీ) ఉద్యోగసంఘాల ఐక్యవేదిక నేతలు తెలిపారు. ఉద్యమానికి మద్దతు తెలిపి, సమ్మెలో పాల్గొనేందుకు వీలుగా ఆర్టీసీ ఉద్యోగ సంఘాలన్నీ ఐక్యవేదికగా ఏర్పడి శుక్రవారం విజయవాడలో రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించాయి. ఈ సందర్భంగా ఆయా సంఘాల నేతలు మాట్లాడారు. ఎంప్లాయీస్‌ యూనియన్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వైవీ రావు, దామోదరరావు మాట్లాడుతూ.. ‘ఆర్టీసీ ఉద్యోగులు ఉద్యమిస్తే ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. ఇప్పటికే చాలీచాలని జీతాలు ఉన్నాయి. ప్రభుత్వ రివర్స్‌ పీఆర్సీ వల్ల ఆర్టీసీ ఉద్యోగులు మరింత నష్టపోతారు. ఆర్టీసీలో నాలుగేళ్లకు పీఆర్సీ ఉండేది. ఇపుడు ప్రభుత్వంలో పదేళ్లకు చేశారు. రెండు పీఆర్సీలను ఆర్టీసీ ఉద్యోగులు కోల్పోయినట్లే. ఉద్యోగుల సెటిల్‌మెంట్లు ఆగిపోయాయి. 2017లో 25% ఫిట్‌మెంట్‌తో మాకు పీఆర్సీ ఇచ్చారు. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు మాకంటే 2% తక్కువ ఫిట్‌మెంట్‌ ఇచ్చారు. ఉద్యోగుల పట్ల సీఎం ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారనే చర్చ జరుగుతోంది’ అని తెలిపారు. ఎన్‌ఎంయూఏ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రమణారెడ్డి, వై.శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ‘ప్రభుత్వ ఉద్యోగులకు 2004కు ముందున్న పాత పింఛను వస్తుందని ఆర్టీసీ ఉద్యోగులు విలీనం కోరుకున్నారు. దీనిపై ఇప్పటివరకు స్పష్టత లేదు. 32వేల మంది రిటైర్డ్‌ ఉద్యోగులకు ప్రతినెలా సాయం అందించే ఎస్‌ఆర్‌బీఎస్‌ను రద్దుచేశారు. రివర్స్‌ పీఆర్సీతో ఆర్టీసీ ఉద్యోగులకు నష్టం కలుగుతోంది. సమ్మెలోకి వెళ్లేలా ఏకగ్రీవ తీర్మానం చేశాం’ అన్నారు. ఎస్‌డబ్ల్యూఎఫ్‌ ప్రధాన కార్యదర్శి సుందరయ్య మాట్లాడుతూ ‘16 రాష్ట్రాల్లో ఆర్టీసీలను ప్రభుత్వం నడుపుతోంది. అక్కడ వారికి పింఛను ఇస్తున్నారు. అయిదు డీఏలు కోల్పోయాం. విలీనం అనంతరం వైద్యసేవలూ నిలిపేశారు’ తెలిపారు. పాత పింఛను మంజూరు మన ప్రధాన డిమాండ్‌ కావాలని కార్మికపరిషత్‌ నేత శ్రీనివాసరావు కోరారు. ఈ ఉద్యమ ఆవశ్యకతను ప్రతిఉద్యోగికి తెలియజేయాలని సూపర్‌వైజర్ల సంఘం నేత విష్ణారెడ్డి తెలిపారు. ఓస్వా నేత థామస్‌ మాట్లాడుతూ పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లు అయిందని చెప్పారు. తమకు చాలీచాలని పింఛను ఉందని, కనీసం తెల్లరేషన్‌ కార్డులు మంజూరు అయ్యేలా చూడాలని రిటైర్డ్‌ ఉద్యోగుల సంఘం నేత ఆంజనేయులు కోరారు.

ఆర్టీసీ ఐకాస ఏర్పాటు: ఈ సమావేశంలో ఆర్టీసీ సంఘాలతో ఐకాస ఏర్పాటుచేశారు. దీనికి కన్వీనర్లుగా వై.శ్రీనివాసరావు, దామోదరరావులను నియమించారు. సీఎస్‌కు, ఆర్టీసీ ఎండీకి వేర్వేరుగా సోమవారం మెమోరాండం ఇవ్వాలని, ఫిబ్రవరి 5, 6 తేదీల్లో అన్ని డిపోల వద్ద గేట్‌ మీటింగ్‌లు పెట్టి ఉద్యోగులను సమ్మెకు కార్యోన్ముఖులను చేయాలని నిర్ణయించారు.సమావేశంలో పీఆర్సీ సాధన సమితి నేతలు బొప్పరాజు వెంకటేశ్వర్లు, సూర్యనారాయణ, వెంకట్రామిరెడ్డి, శివారెడ్డి హాజరై మాట్లాడారు.


ఏపీ ఐకాస అమరావతికి వీఆర్‌ఏల మద్దతు

విజయవాడ సబ్‌కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్ల సాధనకు ఏపీ ఐకాస అమరావతి సంఘం చేపట్టిన ఉద్యమానికి, గ్రామ రెవెన్యూ సహాయకుల (వీఆర్‌ఏల) రాష్ట్ర సంఘం నాయకులు తమ సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈమేరకు విజయవాడలోని రెవెన్యూ భవన్‌లో శుక్రవారం సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గొందిపల్లి జయరాజు, ప్రధాన కార్యదర్శి బళ్ల వెంకట్రావు, ఉపాధ్యక్షుడు వై.అప్పలస్వామి, 13 జిల్లాల ప్రతినిధులు సమావేశమై ఏకగ్రీవంగా తీర్మానించారు. ఉద్యోగుల న్యాయపరమైన డిమాండ్ల సాధన కోసం, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పింఛనుదారుల ఏపీ ఐకాస అమరావతి సంఘానికి తమ మద్దతు తెలియజేశామన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని