AP High Court Judges: ఏపీ హైకోర్టు జడ్జిలుగా ఏడుగురు న్యాయవాదులు

ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుకు ఏడుగురు, ఒడిశా హైకోర్టుకు నలుగురు నూతన న్యాయమూర్తుల నియామకానికి సిఫార్సు చేసింది. వీరంతా న్యాయవాదులే కావడం విశేషం. మధ్యప్రదేశ్‌ హైకోర్టుకు న్యాయవాదుల నుంచి ముగ్గురు, జ్యుడీషియల్‌ అధికారుల నుంచి

Updated : 01 Feb 2022 03:55 IST

సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు

ఈనాడు-దిల్లీ, అమరావతి: ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుకు ఏడుగురు, ఒడిశా హైకోర్టుకు నలుగురు నూతన న్యాయమూర్తుల నియామకానికి సిఫార్సు చేసింది. వీరంతా న్యాయవాదులే కావడం విశేషం. మధ్యప్రదేశ్‌ హైకోర్టుకు న్యాయవాదుల నుంచి ముగ్గురు, జ్యుడీషియల్‌ అధికారుల నుంచి ముగ్గుర్ని న్యాయమూర్తులుగా నియమించాలనీ ప్రతిపాదించింది. ప్రస్తుతం మద్రాస్‌ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా సేవలందిస్తున్న జస్టిస్‌ మునీశ్వర్‌ భండారీకి పదోన్నతి కల్పించి అక్కడే శాశ్వత ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలని సిఫార్సు చేసింది. జనవరి 29న సమావేశమైన కొలీజియం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

ఏపీ హైకోర్టు కొలీజియం.. న్యాయమూర్తుల నియామకానికి గతేడాది న్యాయవాదుల పేర్లను సుప్రీంకోర్టుకు సిఫారసు చేసింది. ఇందులో ఏడుగురిని హైకోర్టు న్యాయమూర్తులుగా నియమించాలని కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు పంపింది. వీరిలో న్యాయవాదులు కొనకంటి శ్రీనివాసరెడ్డి, గన్నమనేని రామకృష్ణప్రసాద్‌, వెంకటేశ్వర్లు నిమ్మగడ్డ, తర్లాడ రాజశేఖర్‌రావు, సత్తి సుబ్బారెడ్డి, రవి చీమలపాటి, వడ్డిబోయిన సుజాత ఉన్నారు. నిరుడు నవంబర్‌ 11న హైకోర్టుకు అడ్వొకేట్‌ విభాగం నుంచి కె.మన్మథరావు, జ్యుడీషియల్‌ ఆఫీసర్ల నుంచి బీఎస్‌ భానుమతి పేర్లను సిఫార్సు చేసిన కొలీజియం ఇప్పుడు ఒకేసారి ఏడుగురు కొత్త న్యాయమూర్తుల నియామకాలకు పచ్చజెండా ఊపడం విశేషం. 37 మంది న్యాయమూర్తులు ఉండాల్సిన ఏపీ హైకోర్టులో ప్రస్తుతం 20 మంది పనిచేస్తున్నారు. తాజా సిఫార్సులకు కేంద్రం ఆమోదముద్ర వేస్తే ఆ సంఖ్య 27కి చేరుతుంది.  

కొనకంటి శ్రీనివాసరెడ్డి
హైదరాబాద్‌లో 1966 జూన్‌ 3న జన్మించారు. తల్లిదండ్రులు రామలక్ష్మి, లక్ష్మిరెడ్డి. శ్రీనివాసరెడ్డి పాఠశాల విద్యాభ్యాసం హైదరాబాద్‌తో పాటు ఇతర జిల్లాల్లో సాగింది. హైదరాబాద్‌లోని నాగార్జున జూనియర్‌ కళాశాలలో ఇంటర్మీడియట్‌ చదివారు. అనంతపురం శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా అందుకున్నారు. 1991 ఆగస్టు 11న న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు. ప్రముఖ న్యాయవాది సి.పద్మనాభరెడ్డి వద్ద జూనియర్‌గా చేరి న్యాయవాద వృత్తిలో, ముఖ్యంగా క్రిమినల్‌ విభాగంలో మెలకువలు నేర్చుకున్నారు. తర్వాత పలు కీలక కేసుల్లో వాదనలు వినిపించారు. ప్రస్తుతం హైకోర్టులో రాష్ట్ర పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ (పీపీ)గా పనిచేస్తున్నారు.

తర్లాడ రాజశేఖరరావు
1967 ఆగస్టు 3న శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలం, మూలసవలాపురంలో కల్యాణి, సురన్నాయుడు దంపతులకు జన్మించారు. ఎన్‌బీఎం కళాశాలలో న్యాయశాస్త్రాన్ని అభ్యసించారు. 1993 ఆగస్టు 4న న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు. హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ వీవీఎస్‌ రావు న్యాయవాదిగా ఉన్న సమయంలో ఆయన వద్ద జూనియర్‌గా చేరారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుతో పాటు, ప్రస్తుతం ఏపీ హైకోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్నారు. ప్రజాహిత వ్యాజ్యాలతో పాటు క్రిమినల్‌, సివిల్‌ కేసులు వాదించిన అనుభవం ఉంది. దివంగత జస్టిస్‌ టీసీహెచ్‌ సూర్యారావు.. రాజశేఖరరావుకు బంధువు.

చీమలపాటి రవి
విశాఖపట్నంలో 1967 డిసెంబర్‌ 4న జన్మించారు. బీకాం, బీఎల్‌ ఆంధ్ర యూనివర్సిటీ నుంచి పూర్తి చేశారు. 1995లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు. విశాఖ జిల్లా కోర్టులో సీనియర్‌ న్యాయవాదిగా ఉన్న తండ్రి శ్రీరామమూర్తితో కలిసి అక్కడే వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. సోదరుడూ న్యాయవాదే. ఏడాదిన్నర తర్వాత హైదరాబాద్‌లోని ఉమ్మడి హైకోర్టుకు ప్రాక్టీసు మార్చుకున్నారు. సివిల్‌, క్రిమినల్‌, రెవెన్యూ, రాజ్యాంగ సంబంధ వ్యాజ్యాల్లో న్యాయవాదిగా పేరుగడించారు. మూడేళ్లపాటు పంచాయతీరాజ్‌ స్టాండింగ్‌ కౌన్సిల్‌గా పనిచేశారు. 2019లో ఏపీ హైకోర్టుకు ప్రాక్టీసు మార్చారు. వివిధ ప్రభుత్వ రంగ సంస్థలకు, విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌కు స్టాండింగ్‌ కౌన్సిల్‌గా పనిచేస్తున్నారు. న్యాయవాదిగా పాతికేళ్లకు పైగా అనుభవంతో వివిధ చట్టాలపై అపార అనుభవం సాధించారు.

నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు
గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం ఫణిదం గ్రామంలో అంజమ్మ, రామకృష్ణారావు దంపతులకు 1967 జులై 1న జన్మించారు. నాగార్జున యూనివర్సిటీ నుంచి బీకాం చదివారు. అనంతపురం శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. విశాఖలోని ఆంధ్రా యూనివర్సిటీలో ఎంఎల్‌ పూర్తి చేశారు. 1992 జూన్‌ 30న న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు. ఉమ్మడి హైకోర్టు, అమరావతి హైకోర్టులో న్యాయవాదిగా మొత్తం 26 ఏళ్ల అనుభవం గడించారు. సివిల్‌, క్రిమినల్‌, సర్వీసు సంబంధ తదితర విభాగాలకు సంబంధించిన కేసుల్లో కీలక వాదనలు వినిపించారు. 2014 డిసెంబర్‌ నుంచి 2019 జూన్‌ వరకు ఆంధ్రా ప్రాంత మున్సిపాలిటీలకు స్టాండింగ్‌ కౌన్సిల్‌గా సేవలందించారు. 2015-16లో భారత వైద్యమండలికి స్టాండింగ్‌ కౌన్సిల్‌గా పనిచేశారు.  

సత్తి సుబ్బారెడ్డి
పశ్చిమగోదావరి జిల్లా ఆరవల్లిలో 1970లో సుబ్బారెడ్డి జన్మించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి 1986-89లో బీఏ చదివారు. అక్కడి నుంచే 1993లో ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసి పట్టా అందుకున్నారు. ఐఆర్‌పీఎంలో పీజీ డిప్లొమా పొందారు. 1994 జూన్‌ 22న న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు. 1997 వరకు పశ్చిమ గోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెం న్యాయస్థానంలో న్యాయవాదిగా ప్రాక్టీసు చేశారు. సీనియర్‌ న్యాయవాది వీఎల్‌ఎన్‌ గోపాలకృష్ణమూర్తి వద్ద జూనియర్‌గా పనిచేశారు. హైకోర్టులో క్రిమినల్‌, రాజ్యాంగ, సర్వీసు సంబంధ కేసులతోపాటు ముఖ్యంగా సివిల్‌ కేసుల్లో అనుభవం గడించారు. తిరుపతి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథార్టీకి స్టాండింగ్‌ కౌన్సిల్‌గా సేవలందించారు.

వడ్డిబోయిన సుజాత
1966 సెప్టెంబర్‌ 10న సుజాత జన్మించారు. స్వస్థలం గుంటూరు. తండ్రి వాయుసేన ఉద్యోగి కావడంతో దిల్లీ కేంద్రీయ విద్యాలయంలో పాఠశాల విద్య పూర్తి చేశారు. ఎంఏ, ఎల్‌ఎల్‌ఎం విద్యార్హతలు సాధించారు. 1998లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు. సీనియర్‌ న్యాయవాదులు ఏవీ శివయ్య, భాస్కరలక్ష్మి వద్ద జూనియర్‌గా పనిచేశారు. రాజ్యాంగ సంబంధ కేసుల్లో పేరుగడించారు. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ ప్యానల్‌ న్యాయవాదిగా పనిచేశారు. హైకోర్టు లీగల్‌ సర్వీసెస్‌ అథార్టీకి న్యాయవాదిగా వ్యవహరించారు. ఏపీ హైకోర్టులో ప్రస్తుతం ప్రభుత్వ న్యాయవాది (జీపీ)గా పనిచేస్తున్నారు.  

గన్నమనేని రామకృష్ణ ప్రసాద్‌
ప్రకాశం జిల్లా పూనూరులో విజయలక్ష్మి, గాంధీ చౌదరి దంపతులకు జన్మించారు. ప్రాథమిక విద్యాభ్యాసం గుంటూరు నల్లపాడు లయోలా పబ్లిక్‌స్కూల్‌లో జరిగింది. బీకాం చదివి, గుంటూరు ఆంధ్రా క్రిస్టియన్‌ కాలేజీలో ఎల్‌ఎల్‌బీ, నాగార్జున యూనివర్శిటీలో ఎల్‌ఎల్‌ఎం చేశారు. 1991 ఆగస్టు 27న న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు. 1996 నుంచి సుప్రీంకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్‌ చేస్తున్నారు. 2000లో సుప్రీంకోర్టులో అడ్వొకేట్‌ ఆన్‌ రికార్డ్‌ హోదా పొందారు. 2017 నుంచి సుప్రీంకోర్టు, దిల్లీ హైకోర్టుల్లో రాజ్యసభ సెక్రటేరియట్‌, రాజ్యసభ టీవీ స్టాండింగ్‌ కౌన్సిల్‌గా సేవలందిస్తున్నారు. వివిధ కేసుల్లో ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు తరఫున సుప్రీంకోర్టు ముందు వాదనలు వినిపించారు. కేంద్ర ప్రభుత్వం తరఫున అఫిషియల్‌ లిక్విడేటర్‌గానూ వ్యవహరించారు. నాగాలాండ్‌- అసోంల సరిహద్దు వివాదంపై సుప్రీంకోర్టులో జరిగిన విచారణలో నాగాలాండ్‌ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాదిగా సేవలందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు