Union Budget 2022: డిజిటల్‌ భారతం

ఆర్థిక చక్రం గాడితప్పకుండా.. ఈ పరిస్థితులు ఇలా సాగితే చాలన్న రక్షణాత్మక ధోరణిని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రదర్శించారు. దేశాన్ని డిజిటల్‌ బాట పట్టించేందుకు పలు ప్రతిపాదనలు చేశారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి రూ.39.45 లక్షల కోట్ల అంచనాతో కేంద్ర బడ్జెట్‌ను ఆమె మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. 35% వృద్ధితో రూ.7.5 లక్షల కోట్ల మూలధన వ్యయం చేస్తామని ప్రకటించారు. అందులో రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.లక్ష కోట్ల వడ్డీలేని రుణం సమకూర్చనున్నట్లు భరోసా ఇచ్చారు. వచ్చే ఏడాది ఖర్చుచేయబోయే మొత్తంలో

Published : 02 Feb 2022 05:37 IST

స్పెక్ట్రం వేలంతో అందుబాటులోకి రానున్న 5జీ

వచ్చే ఏడాది నుంచి వర్చువల్‌ డిజిటల్‌ కరెన్సీ

క్రిప్టో లావాదేవీలపై 30% పన్ను

విద్యార్థులకు పాఠాల కోసం 200 టీవీ ఛానళ్లు

కోర్‌ బ్యాంకింగ్‌ పరిధిలోకి లక్షన్నర తపాలా కార్యాలయాలు

దేశమంతటా ఏకీకృత రిజిస్ట్రేషన్‌ విధానం

వ్యవసాయంలో ఎరువులు, రసాయనాల పిచికారీకి డ్రోన్లు

ఆర్థిక వ్యవస్థకు ఏడు చోదక శక్తులు

కొత్తగా 25 వేల కి.మీ. జాతీయ రహదారులు

మూడేళ్లలో 400 వందే భారత్‌ రైళ్లు

వచ్చే ఐదేళ్లలో 60 లక్షల ఉద్యోగాల కల్పన

వృద్ధిరేటు 8-8.5% మధ్య.. ద్రవ్యలోటు 6.4% అని అంచనా

నదుల అనుసంధానానికి అడుగులు

2022-23 కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్‌

ఆదాయపు పన్ను శ్లాబుల్లో మార్పులేదు.. కొత్త పన్నులూ లేవు

ఈనాడు - దిల్లీ

ర్థిక చక్రం గాడితప్పకుండా.. ఈ పరిస్థితులు ఇలా సాగితే చాలన్న రక్షణాత్మక ధోరణిని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రదర్శించారు. దేశాన్ని డిజిటల్‌ బాట పట్టించేందుకు పలు ప్రతిపాదనలు చేశారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి రూ.39.45 లక్షల కోట్ల అంచనాతో కేంద్ర బడ్జెట్‌ను ఆమె మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. 35% వృద్ధితో రూ.7.5 లక్షల కోట్ల మూలధన వ్యయం చేస్తామని ప్రకటించారు. అందులో రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.లక్ష కోట్ల వడ్డీలేని రుణం సమకూర్చనున్నట్లు భరోసా ఇచ్చారు. వచ్చే ఏడాది ఖర్చుచేయబోయే మొత్తంలో దాదాపు 42% మొత్తాన్ని అప్పుల రూపంలోనే సమకూర్చుకోవాల్సి రావడంతో ఆచితూచి అడుగులేశారు. మోదీ హయాంలో నిరుద్యోగం పెరిగిపోయిందని విమర్శల జడివాన కురుస్తుండటంతో విత్తమంత్రి తన ప్రసంగంలో 18 సార్లు ఉపాధి, ఉద్యోగాల కల్పన గురించి ప్రస్తావించారు. ప్రధాని మోదీ పదే పదే చెబుతున్న మౌలిక వసతుల అంశాన్ని 28 సార్లు వల్లెవేశారు. ప్రభుత్వ ప్రధాన నినాదాలైన గతిశక్తి గురించి 13 సార్లు, ఆత్మనిర్భరత గురించి 5 సార్లు ప్రస్తావించి తమ ప్రాధాన్యాలేంటో చెప్పకనే చెప్పారు. రక్షణ రంగానికి అత్యధిక ప్రాధాన్యమిస్తూ.. రూ.5.25 లక్షల కోట్లు (పింఛన్లతో కలిపి) కేటాయించారు. గత సంవత్సరం కేటాయింపు కంటే ఇది దాదాపు 10% అదనం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధిరేటు 9.2% ఉంటుందని అంచనా. వచ్చే ఆర్థిక సంవత్సరానికి అది కొంత తగ్గి 8-8.5% మధ్య ఉండొచ్చని భావిస్తున్నారు. ద్రవ్యలోటు జీడీపీలో 6.9% ఉంది. దాన్ని వచ్చే ఆర్థిక సంవత్సరానికి 6.4%కు, 2025-26 నాటికి 4.5%కు తెస్తామని చెప్పారు. మొత్తమ్మీద ద్రవ్య స్థిరీకరణ కంటే ఆర్థికవ్యవస్థ విస్తరణకే ఈ బడ్జెట్‌ ప్రాధాన్యం ఇచ్చిందన్నది ఆర్థిక నిపుణుల విశ్లేషణ.

అన్ని రంగాలూ డిజిటల్‌ దారిలోనే.. డిజిటలీకరణకు ఆర్థికమంత్రి అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. విద్య, వైద్యం, ఆర్థికం, వ్యవసాయం... ఇలా అన్ని రంగాలనూ డిజిటల్‌ సాంకేతికత దారిలోకి తీసుకెళ్లనున్నట్లు సంకేతమిచ్చారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి వర్చువల్‌ డిజిటల్‌ కరెన్సీని అందుబాటులోకి తెస్తామన్నారు. దేశంలో క్రిప్టో మార్కెట్‌ గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో క్రిప్టోకరెన్సీలు, ఎన్‌ఎఫ్‌టీ (నాన్‌ ఫంజిబుల్‌ టోకెన్లు) లావాదేవీలపై ఏప్రిల్‌ 1 నుంచి 30% పన్ను విధిస్తామన్నారు. అంకుర సంస్థలకు పన్ను విరామం 2023 మార్చి 31 వరకు కొనసాగిస్తామన్నారు. త్వరలో ఈ-పాస్‌పోర్టు విధానం అమలులోకి రానుంది. దేశంలో ఎక్కడి నుంచైనా రిజిస్ట్రేషన్లు చేసుకోవడానికి వీలుగా ఏకీకృత రిజిస్ట్రేషన్‌ పథకం అమలుచేస్తామని ప్రకటించారు. వ్యవసాయంలో ఎరువులు, పురుగుమందుల పిచికారీకి డ్రోన్ల వాడకాన్ని ప్రోత్సహిస్తామని తెలిపారు. ఇంటి వద్దే నాణ్యమైన విద్యను అందించేందుకు డిజిటల్‌ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు. విద్యార్థులకు పాఠాల కోసం 200 టీవీ ఛానళ్లను అందుబాటులోకి తెస్తామన్నారు. కొత్త ఆర్థిక సంవత్సరంలోనే దేశంలో 5జీ టెలికాం సర్వీసులకు శ్రీకారం చుట్టేలా అవసరమైన స్పెక్ట్రం వేలం వేయబోతున్నట్లు వెల్లడించారు. ఉత్పాదక ఆధారిత ప్రోత్సాహకాల వల్ల వచ్చే అయిదేళ్లలో 60 లక్షల ఉద్యోగాలు, రూ.30 లక్షల కోట్ల అదనపు ఉత్పత్తి సాధ్యమవుతుందన్న ఆశలు రేపారు. కేంద్రానికి ప్రధాన ఆదాయ వనరుగా ఇన్నాళ్లూ భావించిన పెట్టుబడుల ఉపసంహరణ ప్రస్తావన ఈ బడ్జెట్‌లో లేకపోవడం ప్రస్తావనార్హం.

ఏడు చోదక శక్తులు

ప్రగతి రథాన్ని పరుగులు పెట్టించేందుకు ఏడు చోదకశక్తుల్ని నిర్మలా సీతారామన్‌ తన ప్రసంగంలో ప్రస్తావించారు. అవి..1.రహదారులు, 2.రైల్వే, 3.విమానాశ్రయాలు, 4.ఓడరేవులు, 5.ప్రజారవాణా, 6.జలమార్గాలు, 7.రవాణా మౌలిక సదుపాయాలు. వీటితో పాటు రానున్న రోజుల్లో చేపట్టబోయే ప్రాధాన్య అంశాల్ని ప్రస్తావించారు. 5జీ స్పెక్ట్రం వేలం, నదుల అనుసంధానం, మూడేళ్లలో 400 వందేభారత్‌ రైళ్ల తయారీ వంటివాటిపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు వివరించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లయిందని.., వందేళ్ల దిశగా వెళ్లేందుకు ఈ బడ్జెట్‌ బాటలు వేస్తుందని చెప్పారు.

దేశ ‘గతి’ మార్చే ‘శక్తి’

దేశ ఆర్థికవృద్ధి, సమీకృత అభివృద్ధి తీరును ‘పీఎం గతిశక్తి జాతీయ మాస్టర్‌ప్లాన్‌’ సమూలంగా మార్చేస్తుందని నిర్మలా సీతారామన్‌ చెప్పారు. ఏడు చోదక శక్తులూ దేశ ఆర్థికవ్యవస్థను ఏక రీతిలో ముందుకు తీసుకెళ్తాయని తెలిపారు. వీటికి విద్యుత్‌ సరఫరా, ఐటీ కమ్యూనికేషన్‌, నీటిసరఫరా - మురుగునీటి పారుదల, సామాజిక మౌలిక వసతులు మద్దతుగా ఉంటాయన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 13,327 కిలోమీటర్ల జాతీయ రహదారులను నిర్మించగా, 2022-23లో 25వేల కిలోమీటర్ల మేర విస్తరిస్తామన్నారు. యువతకు ఉద్యోగ, వాణిజ్య అవకాశాలు కల్పించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ప్రైవేటు రంగం కలిసే ఉంటాయన్నారు.

కొత్త పన్నులు వేయలేదుగా...

పన్నుల్లో మినహాయింపులు ఇస్తారని చూసిన వేతన జీవులకు నిరాశే మిగిలింది. ఆదాయపు పన్ను శ్లాబులను యథాతథంగా ఉంచారు. ఇదే విషయాన్ని విత్తమంత్రి వద్ద విలేకర్లు ప్రస్తావించినప్పుడు, గత సంవత్సరం కంటే పన్నులేవీ పెంచలేదని గుర్తుచేశారు. మహమ్మారి సమయంలో ప్రజల మీద పన్నుల భారం వేసి ఆదాయం పెంచుకోవాలనుకోలేదని చెప్పుకొచ్చారు.


ఎన్నికల రంగు

ఉత్తర్‌ప్రదేశ్‌తో ముడిపడిన కెన్‌-బెత్వా నదుల అనుసంధాన పథకాన్ని రూ.44 వేల కోట్లతో చేపట్టబోతున్నట్లు ప్రకటించి బడ్జెట్‌కు కాస్త ఎన్నికల రంగు పులిమారు. ఇదే తరహాలో మరో అయిదు నదుల అనుసంధాన పథకాలకు ముసాయిదా డీపీఆర్‌లు ఖరారయ్యాయని చెబుతూనే.. వాటికి ఆయా రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం తప్పనిసరి అని చెప్పారు. గుజరాత్‌లోని గిఫ్ట్‌సిటీకి అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కేంద్రం కేటాయించారు. ప్రపంచస్థాయి యూనివర్సిటీలు అక్కడికొచ్చి ఆర్థశాస్త్ర కోర్సులు నిర్వహించుకోవడానికి అనుమతిస్తామని చెప్పారు. ఆర్థికమంత్రి నోట తెలుగు రాష్ట్రాలకు ఒక్క వరమూ జాలువారలేదు. నిర్లక్ష్యాన్ని వీడి, ధర్మబద్ధంగా పాలిస్తూ, ధర్మానికి అనుగుణంగా పన్నులు వసూలుచేస్తూ రాజు ప్రజల యోగక్షేమాలను చూసుకోవాలన్న మహాభారతం శాంతిపర్వంలోని శ్లోకాన్ని చెప్పి... ప్రజల పట్ల తమ ప్రభుత్వానికున్న ఉద్దేశాన్ని చాటుకున్నారు. ఆర్థికమంత్రి ఎలాంటి అలజడుల జోలికి పోలేదు కాబట్టే బడ్జెట్‌ తర్వాత స్టాక్‌మార్కెట్లు పురోగమించాయన్న ఆర్థిక నిపుణుల విశ్లేషణను చూస్తే ఈ కాలం ఇలా గడిచిపోనీ అన్న భావనతో కేంద్రం ముందడుగు వేసినట్లు తేటతెల్లమవుతోంది.


ప్రజాహితం.. ప్రగతిశీలం..!

ఇది ప్రజానుకూల, ప్రగతిశీల బడ్జెట్‌. వందేళ్లలో కనీవినీ ఎరుగని విపత్తు కోరల్లో దేశం చిక్కుకొని ఉన్న తరుణంలో వృద్ధిని ప్రోది చేసేలా ఇది కొత్త ఆశలను రేకెత్తిస్తోంది. మరిన్ని మౌలిక వసతుల కల్పనకు, పెట్టుబడులు, వృద్ధి, ఉద్యోగ కల్పనకు ఈ బడ్జెట్‌ బాటలు పరుస్తోంది. దీనివల్ల అనేక రంగాలకు లబ్ధి చేకూరుతుంది.

- ప్రధాని నరేంద్ర మోదీ


ప్రయోజనం సున్నా

మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీరో బడ్జెట్‌ ఇది. వేతన జీవులు, పేదలు, మధ్య తరగతి ప్రజలు, అణగారిన వర్గాలకు ఏమీ లేదు. యువత, రైతులు, చిన్నతరహా పరిశ్రమలకు ఎలాంటి ప్రయోజనం లేదు. అందరికీ మొండిచెయ్యి చూపింది. 

- రాహుల్‌ గాంధీ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని