Union Budget 2022: మళ్లీ దగా..

కేంద్ర బడ్జెట్‌  ప్రవేశపెట్టే రోజు కోసం ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు ఆశగా ఎదురుచూస్తుంటారు.. ఆర్థిక మంత్రి బడ్జెట్‌ ప్రసంగం ముగిసే వరకు టీవీలకు కళ్లప్పగిస్తుంటారు.. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తున్నామనో, విశాఖలో

Updated : 02 Feb 2022 07:57 IST

ఆర్థిక మంత్రి ప్రసంగంలో వినపడని ఏపీ పేరు
ఏడేళ్లుగా నిర్లక్ష్యం

ఈనాడు, అమరావతి: కేంద్ర బడ్జెట్‌  ప్రవేశపెట్టే రోజు కోసం ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు ఆశగా ఎదురుచూస్తుంటారు.. ఆర్థిక మంత్రి బడ్జెట్‌ ప్రసంగం ముగిసే వరకు టీవీలకు కళ్లప్పగిస్తుంటారు.. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తున్నామనో, విశాఖలో రైల్వే జోన్‌ పెడుతున్నామనో, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేందుకు నిధులిస్తున్నామనో ఆర్థిక మంత్రి ఈసారైనా ప్రకటిస్తారేమోనన్న ఆశ వారిలో మిణుకుమిణుకుమంటుంది. వారలా చూస్తుండగానే ఆర్థిక మంత్రి బడ్జెట్‌ ప్రసంగం ముగిసిపోతుంది. ఆంధ్రప్రదేశ్‌కి మళ్లీ మొండిచెయ్యే ఎదురవుతుంది..! మరోసారి దగాపడ్డామని ప్రజలకు అర్థమవుతుంది..! ఏళ్ల తరబడి సాగుతున్న ఈ తంతు ఈ ఏడాదీ కొనసాగింది. కేంద్ర ప్రభుత్వం మరోసారి ఏపీకి తీరని ద్రోహం చేసింది. రాష్ట్ర విభజన జరిగి ఎనిమిదేళ్లవుతున్నా.. ఆ గాయాల నుంచి ఇంకా కోలుకోని ఆంధ్రప్రదేశ్‌పై కనీస కనికరమూ చూపలేదు. పరిశ్రమలు, ఉపాధి అవకాశాల్లేక, ఆర్థిక లోటుతో కునారిల్లుతున్న ఏపీపై మరోసారి అంతులేని నిర్లక్ష్యం ప్రదర్శించింది. మంగళవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రసంగంలో, మాటమాత్రంగానైనా ఆంధ్రప్రదేశ్‌ ప్రస్తావన రాలేదు. ప్రత్యేక హోదా, రామాయపట్నం ఓడరేవు, కడప ఉక్కు కర్మాగారం.. ఇలా విభజన హామీల్లో ఏ ఒక్కటీ ప్రకటించలేదు. బడ్జెట్‌ ప్రసంగంలో చెప్పకపోతే పోయారు.. రాష్ట్రానికి ప్రత్యేక కేటాయింపులేమైనా చేశారేమోనని బడ్జెట్‌ పత్రాలన్నీ దుర్భిణీ వేసి వెతికినా ఎక్కడా ఏమీ కనిపించలేదు. అరకొర కేటాయింపులు, మొక్కుబడి విదిలింపులూ తప్ప రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదు. బడ్జెట్‌లో ప్రకటించకపోయినా, రైల్వే బోర్డు విడుదల చేసే ‘పింక్‌ బుక్‌’లోనైనా రైల్వే జోన్‌ ప్రస్తావన ఉంటుందేమోన్న ఆశ ఒక్కటే ఇక మిగిలింది. అదయినా నెరవేరుతుందో, నిట్టూర్పులే మిగులుతాయో చూడాలి.

ఇంకెన్నాళ్లీ ఎదురుచూపులు?
ఆర్థిక పరిపుష్ఠి, అన్ని వనరులూ ఉన్న రాష్ట్రాలపై ప్రత్యేక ప్రేమ కనబరుస్తున్న కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు మాత్రం ప్రతి బడ్జెట్‌లోనూ మొండి చెయ్యే చూపుతోంది. ఎన్నికలు జరిగే రాష్ట్రాలు, భాజపా పాలిత ప్రాంతాలపై ఎప్పటికప్పుడు వరాలు కురిపిస్తూ...ఏపీకి అన్యాయం చేస్తోంది. గత బడ్జెట్‌లో కూడా రాష్ట్రానికి ప్రత్యేకంగా కేటాయించిన కొత్త ప్రాజెక్టు ఒక్కటీ లేదు. గత బడ్జెట్‌ ప్రసంగంలో ఆర్థిక మంత్రి ఖరగ్‌పూర్‌- విజయవాడ, ఇటార్సీ - విజయవాడ మధ్య ప్రత్యేక రైలు రవాణా కారిడార్లు, చిత్తూరు-తాచ్చూరు జాతీయ రహదారి ప్రాజెక్టుల్ని మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. అవి ఆంధ్రప్రదేశ్‌ మీదుగా వెళతాయి కాబట్టి ఏపీ గురించి ప్రస్తావించారు. ఈసారి కనీసం అలాంటి ప్రాజెక్టు కూడా లేకపోవడంతో ఆమె ప్రసంగంలో ఎక్కడా ఏపీ మాటే వినపడలేదు. గత బడ్జెట్‌లో ప్రకటించిన రెండు రైలు రవాణా కారిడార్ల పనులూ పట్టాలెక్కనేలేదు. విజయవాడ, విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టుల గురించి గానీ, రాష్ట్రంలోని విమానాశ్రయాలకు అంతర్జాతీయ విమాన సర్వీసులు వచ్చేలా చర్యలు తీసుకుంటామని గానీ, రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి, ఉపాధి కల్పన ప్రాజెక్టుల్ని నెలకొల్పే దిశగా చర్యలు తీసుకుంటామని గానీ... ఏ చిన్న వరం కూడా ఆర్థిక మంత్రి బడ్జెట్‌ ప్రసంగంలో దొర్లలేదు.

ఎనిమిదేళ్లలో ఏమిచ్చారు?
ఇంకో రెండేళ్లు గడిస్తే, రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు పూర్తవుతుంది. ఒక రాష్ట్ర అభివృద్ధి ప్రస్థానంలో దశాబ్దమంటే తక్కువ సమయమేమీ కాదు. హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై వంటి ఆర్థికంగా అండగా నిలిచే పెద్ద నగరాలేమీ లేకపోవడం, రాజధాని అమరావతి నిర్మాణం కూడా నిలిచిపోవడంతో.. ఆంధ్రప్రదేశ్‌ ఇప్పటికే బాగా వెనకబడింది. కేంద్రం చూపుతున్న అంతులేని నిర్లక్ష్యం రాష్ట్రాన్ని.. ఇతర దక్షిణాది రాష్ట్రాల కంటే రోజురోజుకీ మరింత వెనక్కిలాగుతోంది. ప్రత్యేక హోదా కలిగిన ఈశాన్య రాష్ట్రాలకు, వెనుకబడిన రాష్ట్రాల్లో పారిశ్రామికాభివృద్ధికి ప్రోత్సాహం కేటగిరీ కింద.. కేంద్ర, ఇంటిగ్రేటెడ్‌ జీఎస్టీని పరిశ్రమలకు తిరిగి చెల్లించేందుకు 2022-23 బడ్జెట్‌లో కేంద్రం రూ.3,631 కోట్లు కేటాయించింది. ఇతర రాయితీల కిందా పలు కేటాయింపులు జరిపింది. ప్రత్యేక హోదా ఇచ్చి ఉంటే ఏపీకి కూడా అలాంటి ప్రోత్సాహకాల్లో కొన్నయినా వచ్చేవి. కనీసం రాష్ట్రంలోని ఏడు వెనుకబడిన జిల్లాలకు విభజన చట్టంలో ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీ నిధుల గురించి కూడా ఈ బడ్జెట్‌లో ప్రస్తావించలేదు.

మెట్రో రైలుకు రెడ్‌ సిగ్నలే!
ఆంధ్రప్రదేశ్‌లో మెట్రో రైలు ప్రాజెక్టులకు కేంద్రం మరోసారి మొండిచెయ్యి చూపింది. విజయవాడ, విశాఖ మెట్రో రైల్‌ ప్రాజెక్టులకు ఎలాంటి కేటాయింపులూ జరపలేదు. కేంద్ర ప్రభుత్వం గత బడ్జెట్‌లో బెంగళూరు, చెన్నై, కోచితో పాటు, మహారాష్ట్రలో నాగపూర్‌, నాసిక్‌ మెట్రో రైలు ప్రాజెక్టులకు భారీ కేటాయింపులు చేసింది. 2021-22 సవరించిన బడ్జెట్‌ అంచనాల్లోనూ మెట్రో ప్రాజెక్టులకు రూ.18,978 కోట్లు కేటాయించినట్లు చూపించింది. ప్రస్తుత బడ్జెట్‌లోనూ వివిధ మెట్రో ప్రాజెక్టులకు రూ.19,130 కోట్ల కేటాయించింది. కానీ విజయవాడ, విశాఖ మెట్రో రైళ్ల గురించి మాటమాత్రంగానైనా ప్రస్తావించలేదు. మెట్రో రైళ్ల విషయంలోనూ రాష్ట్రానికి కేంద్రం మరోసారి అన్యాయం చేసింది.

పోలవరం ఎప్పటికి పూర్తయ్యేను?
విభజన హామీల్లో వేటినీ ప్రకటించకపోగా.. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన పోలవరంపైనా కేంద్రం పాత వైఖరినే కనబరిచింది. కేంద్రం తీరు చూస్తుంటే మరో 20 ఏళ్లయినా పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందా? అన్న సందేహాలు రాష్ట్ర ప్రజల్లో కలుగుతున్నాయి. అనంతపురంలోని కేంద్రీయ విశ్వవిద్యాలయానికి 2021-22 బడ్జెట్‌లో రూ.54.10 కోట్లు కేటాయించి, సవరించిన అంచనాల్లో రూ.14.11 కోట్లు మాత్రమే చూపింది. ఈ బడ్జెట్‌లో రూ.56.66 కోట్లు కేటాయించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ గిరిజన విశ్వవిద్యాలయాలకు గత బడ్జెట్‌లో రూ.50.50 కోట్లు ప్రతిపాదించి, సవరించిన అంచనాల్లో దాన్ని 9.74 కోట్లుగా చూపింది. ఈ బడ్జెట్‌లో రూ.44 కోట్లు ప్రతిపాదించింది. అలాంటివి తప్ప, ఒక్క కేంద్ర ప్రభుత్వ సంస్థను గానీ, విద్యా సంస్థను గానీ రాష్ట్రానికి కొత్తగా ప్రకటించలేదు. అంతేకాదు విభజన హామీల్లో భాగంగా రాష్ట్రానికి ఇది వరకే మంజూరు చేసిన విద్యా సంస్థల్ని వేగంగా పూర్తి చేసేందుకు, పరిపుష్ఠం చేసేందుకు ఈ బడ్జెట్‌లో ప్రత్యేక కేటాయింపులు కూడా లేకపోవడం ఆంధ్రప్రదేశ్‌పై కేంద్రం చూపుతున్న అంతులేని నిర్లక్ష్యానికి నిదర్శనం.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని