AP Capital: ఇప్పుడు అమరావతే రాజధాని

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని ఇప్పుడు అమరావతే అని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్‌ స్పష్టంచేశారు. రాష్ట్ర ప్రభుత్వం 2015లోనే దీన్ని ప్రకటించినప్పటికీ, 2020లో మూడు రాజధానుల చట్టాన్ని తీసుకొచ్చి తర్వాత

Updated : 03 Feb 2022 03:59 IST

ఏపీ ప్రభుత్వం అదే విషయం చెప్పింది
‘మూడు రాజధానులు’ ఉపసంహరించుకున్నట్లు తెలిసింది
విభజన సమస్యలపై మాది సమన్వయబాధ్యతే, ఆదేశాలివ్వలేం
కేంద్ర మంత్రి నిత్యానందరాయ్‌ వెల్లడి

ఈ నాడు, దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ రాజధాని ఇప్పుడు అమరావతే అని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్‌ స్పష్టంచేశారు. రాష్ట్ర ప్రభుత్వం 2015లోనే దీన్ని ప్రకటించినప్పటికీ, 2020లో మూడు రాజధానుల చట్టాన్ని తీసుకొచ్చి తర్వాత ఉపసంహరించుకొందని గుర్తుచేశారు. ఇప్పుడు మాత్రం అమరావతే రాజధానిగా ఏపీ ప్రభుత్వం తెలియజేసిందని బుధవారం రాజ్యసభలో వివరించారు. భాజపా సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు మాట్లాడుతూ ‘మూడు రాజధానుల పేరిట ఏపీ ప్రభుత్వం అయోమయం సృష్టించింది. కేంద్రం కొన్నిసార్లు ఏపీకి సంబంధించిన వర్తమానాలను హైదరాబాద్‌ చిరునామాకు పంపుతోంది. ఏపీ రాజధానిపై స్పష్టత ఇవ్వాలి. రాజధాని నిర్ణయాధికారం ఎవరిదో చెప్పాలి’ అని ప్రశ్నించారు. మంత్రి నిత్యానందరాయ్‌ బదులిస్తూ ‘రాజధానిపై నిర్ణయాధికారం రాష్ట్రానిదే. 2015 ఏప్రిల్‌ 23న ఏపీ ప్రభుత్వం అమరావతిని తమ రాజధానిగా ప్రకటించింది. 2020 జులైలో ఒక చట్టం ద్వారా అమరావతిని శాసన రాజధానిగా, విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా, కర్నూలును న్యాయరాజధానిగా పేర్కొంది. ఆ చట్టాన్ని ఉపసంహరించుకున్నట్లు మాకు మీడియా ద్వారా తెలిసింది. సమీక్ష తర్వాత మూడు రాజధానులా? ఒక రాజధానా? అన్నది తేల్చుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్లు విన్నాం. ప్రస్తుతం అమరావతే ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అని ఆ రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది’ అని స్పష్టంచేశారు.

సీఎంలు చర్చించుకుంటే మంచిదే: ‘ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మంచి మిత్రులు. విభజన సమస్యలపై వారిద్దరు మాట్లాడుకొని పరిష్కరించుకొనే ప్రయత్నం చేయడంలేదు. కేంద్రం కార్యదర్శి స్థాయి అధికారులను పిలవడానికి బదులు సీఎంలతోనే ఎందుకు చర్చించడం లేద’ని భాజపా ఎంపీ సీఎం రమేశ్‌ ప్రశ్నించారు. కేంద్ర మంత్రి బదులిస్తూ ‘విభజన అంశాలను ఏకాభిప్రాయంతో పరిష్కరించుకోవాలని తిరుపతిలో జరిగిన దక్షిణాది రాష్ట్రాల మండలి సమావేశంలో హోంమంత్రి అమిత్‌ షా సూచించారు. ముఖ్యమంత్రులిద్దరూ కలిసి చర్చిస్తే మంచిదే. మేమూ అదే కోరుకుంటున్నాం. హోంశాఖ తరఫున ప్రయత్నించాం. 24 సమావేశాలు నిర్వహించామ’ని గుర్తుచేశారు. ఏపీకి తెలంగాణ విద్యుత్తు బకాయిలు చెల్లించడం లేదని, శ్రీశైలం నుంచి అక్రమంగా నీటిని వాడుకుంటోందని, దీనిపై కేంద్రం ఏం చర్యలు తీసుకుంటుందని ఎంపీ టీజీ వెంకటేశ్‌ ప్రశ్నించారు. ‘విద్యుత్తు బకాయిల చెల్లింపు రెండు రాష్ట్రాల మధ్యా ఉంది. దీనిపై కేంద్రం అవగతం చేసుకొని ఏం చేయాలో చూస్తాం. సమన్వయం చేయగలం తప్ప, నిర్ణయం తీసుకోలేం. మా సూచనలు రాష్ట్రాలకు పంపుతాం. శ్రీశైలం నీటి విడుదల వివాదాన్ని జల్‌శక్తి శాఖ పరిశీలిస్తుంద’ని నిత్యానందరాయ్‌ వివరించారు.


ఇరు రాష్ట్రాల భిన్న వాదనలు

విభజన సమస్యలపై వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి, భాజపా ఎంపీలు సీఎం రమేశ్‌, టీజీ వెంకటేశ్‌ పలు ప్రశ్నలు వేశారు. ‘షెడ్యూల్‌ 9, 10లోని సంస్థల విలువను రూ.1,42,601 కోట్లుగా లెక్కించినప్పటికీ, కేంద్రం వాటిని విభజించలేదు. ఏపీపై తీవ్రప్రభావం చూపుతోంది. ఆస్తుల విభజన వేగవంతానికి ఏం చర్యలు తీసుకుంటున్నార’ని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. నిత్యానందరాయ్‌ సమాధానమిస్తూ.. ‘విభజన చట్టం అమలులో కేంద్రం సమన్వయకర్త మాత్రమే. మేమెలాంటి నిర్ణయాలు తీసుకోలేం. ఆదేశాలివ్వలేం. ఏదైనా ఇరురాష్ట్రాల అంగీకారంతోనే జరగాలి. 9వ షెడ్యూల్‌లోని సంస్థల విభజనపై షీలా బేడీ కమిటీ వేశాం. 90 సంస్థల విభజనకు కమిటీ సిఫార్సు చేయగా, 68 సంస్థలపై తెలంగాణ అంగీకరించింది. ఏపీ ఈ 68లో 33 సంస్థల విభజనకు మాత్రమే సమ్మతించింది. ఏపీ సర్కారు అన్నింటినీ ఒకేసారి పరిష్కరించాలని కోరగా, తెలంగాణ ఒక్కోదాన్ని ప్రత్యేకంగా చూడాలంటోంది. పదో షెడ్యూల్‌లోని 112 శిక్షణ కేంద్రాలను సెక్షన్‌ 75 ప్రకారం విభజించలేం. జనాభా ఆధారంగా ఆస్తులు పంచాలని ఏపీ కోరుతుంటే, అవి ఉన్న ప్రదేశాన్ని బట్టి విభజించాలని తెలంగాణ అంటోంది. అటార్నీ జనరల్‌ అభిప్రాయం ప్రకారం అసలు వీటి విభజనకే వీల్లేదు. 9, 10 షెడ్యూల్‌లోని సంస్థలతోపాటు, మిగతా వాటిపైనా మీరు అంగీకారానికి వస్తే, మేం నిర్ణయం తీసుకోగలమని హోంశాఖ పలుమార్లు రెండు రాష్ట్రాలకు లేఖలు రాసింది’ అని గుర్తుచేశారు. విభజన చట్టం ప్రకారం కేంద్రం ఏపీకి ఇప్పటివరకు రూ.65,730 కోట్లు విడుదల చేయగా, తెలంగాణకు రూ.2,385 కోట్లు ఇచ్చిందని చెప్పారు. వెనుకబడిన ప్రాంతాలకు ఏటా నిధులు ఇస్తున్నట్లు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని