APPSC: కొలువుల ప్రకటనకు ఇంకెన్నాళ్లో!

ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఎప్పుడు వెలువడతాయో తెలియక నిరుద్యోగులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. కొలువుల కోసం ఎన్నాళ్లు శిక్షణ పొందుతూ గడపాలని

Updated : 09 Feb 2022 03:10 IST

గ్రూపు-1, 2, పోలీసు ఉద్యోగాల నోటిఫికేషన్లకు ఇంకా నిరీక్షణే

జాబ్‌ క్యాలెండర్‌ ప్రకారం రాక నిరుద్యోగుల ఆందోళన

ఈనాడు, అమరావతి: ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఎప్పుడు వెలువడతాయో తెలియక నిరుద్యోగులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. కొలువుల కోసం ఎన్నాళ్లు శిక్షణ పొందుతూ గడపాలని ప్రశ్నిస్తున్నారు. ప్రత్యేకించి గ్రూప్‌-1, 2, పోలీసు ఉద్యోగాల భర్తీకి విడుదల చేసే ప్రకటనల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. జాబ్‌ క్యాలెండర్‌లో పేర్కొన్న ప్రకారం ఈ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ల జారీకి రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన గడువు దాటి నెలలు గడిచిపోతున్నా..ఫలితం కనిపించకపోవడంతో లక్షల మంది నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు. జాబ్‌ క్యాలెండర్‌లో పేర్కొన్న 10,143 ఉద్యోగాల నియామకానికి 2022 మార్చి నాటికి ప్రకటనలు రావాల్సి ఉంది. వైద్య ఆరోగ్య శాఖ కింద ద్వారా 6,143 పోస్టుల భర్తీ జరుగుతోంది. అలాగే బ్యాక్‌లాగ్‌ వేకెన్సీల (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు) కింద పేర్కొన్న 1,238 పోస్టుల భర్తీ ఏపీపీఎస్సీ, ఇతర శాఖల ద్వారా జరుగుతోంది. జాబ్‌ క్యాలెండరులో పేర్కొన్న ప్రకారం మరో 2,000 ఉద్యోగాల నియామక ప్రకటన వచ్చేందుకు ఈ నెలాఖరు వరకు, మరో 36 ఉద్యోగాలకు సంబంధించిన ప్రకటన వెలువడేందుకు వచ్చే నెలాఖరు వరకు సమయం ఉంది.

గ్రూపు-1, 2 ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్లు ఆగస్టులో రావాల్సి ఉండగా...!

జాబ్‌ క్యాలెండర్‌లో గ్రూపు-1, 2 కింద 36 పోస్టులు మాత్రమే భర్తీ చేస్తున్నట్లు ప్రకటించారు. గ్రూపు-1 కింద 31, గ్రూపు-2 కింద 5 పోస్టులు మాత్రమే చూపించారని తెలిసింది. ఈ ఉద్యోగాల భర్తీకి గత ఆగస్టులోనే నోటిఫికేషన్‌ రావల్సి ఉంది. ఈ పోస్టులు మరీ తక్కువగా ఉండడంతో నిరుద్యోగ సంఘాలు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాయి. అయినా ఇప్పటివరకూ ఈ సంఖ్య పెరగలేదు. పోలీసు, ఇతర ఉద్యోగాల భర్తీకి ప్రకటనలు ఎంతకీ రాకపోతుండటంతో కొందరు నిరుద్యోగులు దరఖాస్తు చేసేందుకు వయోపరిమితి రీత్యా అర్హత కోల్పోతున్నారు. అన్ని కేటగిరీల్లో కలిపి భర్తీచేస్తామని పేర్కొన్న పోస్టుల సంఖ్యే చాలా తక్కువని.. వాటికి కూడా ముందుగా ప్రకటించిన ప్రకారం నోటిఫికేషన్‌ ఇవ్వకపోవటం ఏమిటని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఉద్యోగ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు ప్రభుత్వం పెంచింది. దీనివల్ల ఖాళీ అయ్యే పోస్టులు మరింత తగ్గినట్లు నిరుద్యోగ జేఏసీ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పోలీసు ఉద్యోగాలు ఎక్కడ

గతేడాది జూన్‌ 18న సీఎం విడుదల చేసిన ఉద్యోగాల భర్తీ క్యాలెండర్‌లో పేర్కొన్న ప్రకారం పోలీసు శాఖలో 450 పోస్టుల భర్తీకి గతేడాది సెప్టెంబరులో నోటిఫికేషన్‌ రావాల్సి ఉండగా ఇప్పటికీ జారీ కాలేదు. రాష్ట్రంలో చివరిసారిగా 2018 డిసెంబరులో పోలీసు ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్‌ విడుదలైంది. చివరిసారిగా ప్రకటన విడుదలైనప్పుడు దాదాపు 5 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పుడూ అదే స్థాయిలో ఆశావాహులు ఉన్నారు.

లెక్చరర్ల భర్తీ ఎప్పుడు?

ఉన్నత విద్యాశాఖ తరపున ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో 240 లెక్చరర్‌ పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ ద్వారా గత నెలలోనే నోటిఫికేషన్‌ వెలువడాల్సి ఉంది. పోస్టుల భర్తీ వివరాలను ప్రభుత్వానికి పంపబోతున్నట్లు కళాశాల విద్యా శాఖ అధికారులు తెలిపారు. విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్ల పోస్టుల భర్తీకి కసరత్తు జరుగుతోంది. జాబ్‌ క్యాలెండర్‌లో పేర్కొన్న ప్రకారం ఈ నెలాఖరులోగా ప్రకటన రావాల్సి ఉంది. ఆయా శాఖల నుంచి వివరాలు అందితేనే ఏపీపీఎస్సీ ఉద్యోగ ప్రకటనలు ఇవ్వడానికి వీలవుతుంది.

రాత పరీక్షల తేదీలు లేకుండా సన్నద్ధమెలా?

ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ జారీచేసిన నోటిఫికేషన్లలో ఒకటి, రెండింటికి మినహా మిగిలిన వాటికి రాత పరీక్షల తేదీలు ప్రకటించనందున ప్రణాళికాబద్ధంగా సన్నద్ధమయ్యేందుకు నిరుద్యోగులకు అవకాశం లేకుండాపోతోంది. పరీక్షా కేంద్రాల గుర్తింపు, కేంద్ర, బ్యాంకు, ఇతర నియామక రాత పరీక్షల షెడ్యూల్‌కు అనుగుణంగా తేదీలు ఖరారు చేయాల్సి ఉన్నందున జాప్యం జరుగుతోంది.


‘ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ ఎప్పుడు వస్తుందోనని చదువుకున్న పిల్లలు ఎదురుచూస్తారు. శిక్షణకు ఎంత సమయం కేటాయించాలా అని ఆలోచిస్తారు. జిల్లా కేంద్రాలు, నగరాల్లో ఇళ్లు అద్దెకు తీసుకొని శిక్షణ పొందుతూ.. నెలల తరబడి నోటిఫికేషన్లు రాక..మనోధైర్యం కోల్పోయేవారు. ఈ పరిస్థితిని మారుస్తున్నాం. రాబోయే తొమ్మిది నెలల్లో అంటే.. జులై నుంచి 2022 మార్చి వరకూ ఏయే ఉద్యోగాల భర్తీకి ఏ నెలలో నోటిఫికేషన్‌ ఇస్తామో వివరిస్తూ జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తున్నాం’

- ఇది ముఖ్యమంత్రి జగన్‌ గత ఏడాది జూన్‌ 18న చేసిన ప్రకటన


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని