DGP Goutam Sawang: మాదకద్రవ్య రహిత రాష్ట్రమే లక్ష్యం

మాదకద్రవ్య రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ని తీర్చిదిద్దాలన్న దృఢసంకల్పంతో అన్ని శాఖలను కలుపుకొని పోలీస్‌శాఖ పనిచేస్తోందని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌

Updated : 13 Feb 2022 05:33 IST

డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌

2లక్షల కిలోల గంజాయి దహనం

అనకాపల్లి పట్టణం, అనకాపల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: మాదకద్రవ్య రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ని తీర్చిదిద్దాలన్న దృఢసంకల్పంతో అన్ని శాఖలను కలుపుకొని పోలీస్‌శాఖ పనిచేస్తోందని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ తెలిపారు. ఉత్తరాంధ్ర, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో స్వాధీనం చేసుకున్న సుమారు రూ.9వేల కోట్ల విలువైన రెండు లక్షల కేజీల గంజాయిని విశాఖ జిల్లా అనకాపల్లి మండలం కోడూరులో శనివారం డీజీపీ చేతులమీదుగా దహనం చేశారు. అనంతరం డీజీపీ విలేకరులతో మాట్లాడుతూ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పోలీస్‌శాఖ 2021 నవంబరులో ఆపరేషన్‌ పరివర్తన కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ఒడిశాలోని 23 జిల్లాలు, విశాఖపట్నం గ్రామీణంలోని 11 మండలాల్లో గంజాయి సాగు అధికంగా ఉందని గుర్తించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ప్రారంభించిన కొద్దిరోజుల్లోనే ఏజెన్సీలోని 11 మండలాల పరిధిలోని 313 గ్రామాల్లో 7552 ఎకరాల్లోని రూ.9,251 కోట్ల విలువైన గంజాయి సాగును పోలీసులు ధ్వంసం చేసినట్లు వివరించారు. గంజాయి నష్టాలను గిరిజనులకు తెలియజేయడంతో వారే స్వచ్ఛందంగా 400 ఎకరాల్లో తోటలు ధ్వంసం చేశారని వెల్లడించారు. ఏజెన్సీలో మావోయిస్టులు మధ్యవర్తులుగా ఉండి గంజాయి సాగును ప్రోత్సహిస్తున్నారని..రక్తపాతం, హింస సృష్టిస్తున్నారని డీజీపీ ఆరోపించారు. ఇప్పుడు గిరిజనుల్లో చైతన్యం రావడంతో మార్పు వచ్చిందని అన్నారు. కార్యక్రమంలో అదనపు డీజీపీలు రవిశంకర్‌, ఆర్‌కే మీనా, ఎస్‌ఈబీ కమిషనర్‌ వినీత్‌ బ్రిజ్‌లాల్‌, డీఐజీ రంగారావు, జిల్లా ఎస్పీ కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.
విశాఖ శారదా పీఠం వద్ద ఇటీవల మంత్రి  అప్పలరాజు సీఐని దూషించిన విషయంపై విలేకరులు ప్రశ్నించగా దీనిపై విచారణ జరుగుతోందని, ఆ విషయంపై స్పందించేందుకు ఇది సందర్భం కాదని డీజీపీ అన్నారు.

ఉత్తరాంధ్ర, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో స్వాధీనం చేసుకున్న సుమారు రూ.9వేల కోట్ల విలువైన రెండు లక్షల కిలోల గంజాయిని విశాఖ జిల్లా అనకాపల్లి మండలం కోడూరులో శనివారం డీజీపీ చేతులమీదుగా దహనం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని