Viveka Murder Case: వివేకాను అవినాష్‌ రెడ్డే హత్య చేయించారా?

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బాబాయ్‌, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డిని కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి.. తన అనుచరుడైన దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి ద్వారా హత్య చేయించారన్న అనుమానం ఉందని సీబీఐ పేర్కొంది. ఆ

Updated : 15 Feb 2022 07:36 IST

ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నాం
కడప ఎంపీ టికెట్‌ను వివేకా ఆశించినందుకే కక్ష
అభియోగపత్రాల్లో సీబీఐ వెల్లడి

ఈనాడు, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బాబాయ్‌, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డిని కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి.. తన అనుచరుడైన దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి ద్వారా హత్య చేయించారన్న అనుమానం ఉందని సీబీఐ పేర్కొంది. ఆ కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు వెల్లడించింది. కడప లోక్‌సభ నియోజకవర్గం టికెట్టు అవినాష్‌రెడ్డికి కాకుండా తనకు లేదా వైఎస్‌ షర్మిల, విజయమ్మల్లో ఎవరికైనా ఒకరికి రావాలని వివేకానందరెడ్డి ఆకాంక్షించారని, ఈ నేపథ్యంలోనే అవినాష్‌రెడ్డి ఆయన్ను హత్య చేయించి ఉంటారనే అనుమానం ఉందని వివరించింది. తమ దర్యాప్తులో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయని పేర్కొంది. హత్య వెనుక ఉన్న భారీ కుట్రను వెలికితీసే దిశగా దర్యాప్తు సాగిస్తున్నామని వెల్లడించింది. ఈ కేసులో నిందితులైన ఎర్ర గంగిరెడ్డి, దేవిరెడ్డి  శివశంకర్‌రెడ్డి, యాదటి సునీల్‌ యాదవ్‌, గజ్జల ఉమాశంకర్‌రెడ్డి, షేక్‌ దస్తగిరిల ప్రమేయంపై పులివెందుల కోర్టులో సీబీఐ గతంలో దాఖలు చేసిన అభియోగపత్రాలు సోమవారం వెలుగు చూశాయి. ఇప్పటివరకూ దర్యాప్తులో గుర్తించిన అంశాలను సీబీఐ అందులో ప్రస్తావించింది. ప్రధానాంశాలివీ.

వివేకాను చంపినట్లు అంగీకరిస్తే రూ.10 కోట్లు

వివేకానందరెడ్డి హత్య నేరాన్ని నీపై వేసుకుని, అతణ్ని నువ్వే చంపినట్లు అంగీకరిస్తే రూ.10 కోట్లు ఇస్తా.. అంటూ కె.గంగాధరరెడ్డి అనే వ్యక్తికి దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి ఆఫర్‌ చేశారు. నిందితుల్లో ఒకరైన దస్తగిరిని సీబీఐ అధికారులు విచారణ కోసం దిల్లీకి పిలిపించారని శివశంకర్‌రెడ్డికి తెలిసింది. సీబీఐకి తమ పేర్లు చెప్పకుండా ఉంటే జీవితం సెటిల్‌ చేస్తానంటూ ఆయన దస్తగిరికి హామీ ఇచ్చారు. దిల్లీలో దస్తగిరి కదలికలు కనిపెట్టేందుకు, సీబీఐ ఆయన్ను ఏం ప్రశ్నిస్తుందో తెలుసుకునేందుకు భరత్‌యాదవ్‌ను అక్కడికి పంపించారు. 2019 ఫిబ్రవరి 10నే వివేకా హత్యకు ప్రణాళిక సిద్ధమైంది. ఎర్ర గంగిరెడ్డి ఇంట్లో జరిగిన ఈ కుట్రలో దస్తగిరి, సునీల్‌ యాదవ్‌, ఉమాశంకర్‌రెడ్డి భాగస్వాములయ్యారు.

ఎమ్మెల్సీగా పోటీకి అడ్డుతగిలారని..

వివేకా హత్యకు కుట్ర, హత్య తర్వాత ఆధారాల ధ్వంసంలో పాల్గొన్న దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి కడప జిల్లా వైకాపాలో కీలక నేత. 2017లో కడప స్థానిక సంస్థల నుంచి వైకాపా ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేయాలని భావించారు. దీంతో ఆ స్థానంలో పోటీ చేసిన వివేకాకు మద్దతివ్వలేదు. ఓటమి పాలైన వివేకా.. శివశంకర్‌రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతకు ముందు వివేకా వైకాపాలో చేరితే రాయలసీమలో తమ ప్రాబల్యానికి ఇబ్బందవుతుందని భావించిన శివశంకర్‌రెడ్డి.. ఆయన చేరికపైనా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.  


హత్య ప్రణాళికలో అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి

‘వివేకాను హత్య చేస్తే శివశంకర్‌రెడ్డి రూ.40 కోట్లు ఇస్తారు. అందులో నీకు రూ.5 కోట్లు ఇస్తాం. ఈ హత్య చేస్తే నీ జీవితం సెటిల్‌ అయిపోతుంది. వైఎస్‌ అవినాష్‌రెడ్డి, వైఎస్‌ భాస్కర్‌రెడ్డి, వైఎస్‌ మనోహర్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డి వంటి పెద్దలు ఈ హత్య ప్రణాళికలో ఉన్నారు’ అని ఎర్ర గంగిరెడ్డి దస్తగిరితో చెప్పారు. వివేకా మృతి వార్త వెలుగుచూసిన తర్వాత 2019 మార్చి 15న ఉదయం 6.25 గంటలకు కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి.. దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, ఇతర సన్నిహితులతో కలిసి ఘటనాస్థలానికి చేరుకున్నారు. వైఎస్‌ భాస్కర్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి, వైఎస్‌ ప్రతాప్‌రెడ్డి, ఎర్ర గంగిరెడ్డికి కూడా అక్కడికి చేరారు. వివేకా మృతదేహం రక్తపు మడుగులో ఉన్నా.. ఆయన గుండెపోటుతో మరణించారంటూ అవినాష్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిలు ప్రచారం మొదలుపెట్టారు. ఇదే మాటను శివశంకర్‌రెడ్డి.. సాక్షి టీవీకి తొలిసారి చెప్పారు. వివేకా కుమార్తె, అల్లుడు రాకుండానే ఆయన అంత్యక్రియలు నిర్వహించేందుకు ప్రయత్నించారు.

వ్యక్తిగత కక్షలతో హత్య కుట్రలోకి..

గంగిరెడ్డి, షేక్‌ దస్తగిరి, సునీల్‌ యాదవ్‌, ఉమాశంకర్‌రెడ్డిలు వ్యక్తిగత కక్షలతోనే వివేకా హత్య కుట్రలో భాగస్వాములయ్యారు. 2017లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో నా ఓటమికి పని చేశావంటూ వివేకా తరచూ ఎర్రగంగిరెడ్డిని తిట్టేవారు. బెంగళూరులో ఓ భూవివాదాన్ని సెటిల్‌ చేసినందుకు వివేకా రూ.8 కోట్లు ఆశించారు. దానిలో తనకూ వాటా ఇవ్వాలని గంగిరెడ్డి అడిగినా వివేకా ఇవ్వలేదు. వివేకా ఆస్తులకు బినామీగా, ఆయన వెన్నంటే ఉన్నా పంచాయతీ ఎన్నికల్లో తమ కుటుంబానికి అవకాశమివ్వలేదని గజ్జల ఉమాశంకర్‌రెడ్డి, డ్రైవర్‌గా తీసేశారని షేక్‌ దస్తగిరి ఆయనపై కక్ష పెంచుకున్నారు.

హత్య సమయంలో.. సునీల్‌ యాదవ్‌ అక్కడే

2019 మార్చి 15వ తేదీ తెల్లవారుజామున 2.42 గంటల సమయంలో సునీల్‌ యాదవ్‌ వివేకా ఇంట్లో ఉన్నట్లు ఆయన జీమెయిల్‌ ఖాతాకు సంబంధించిన గూగుల్‌ కోఆర్డినేట్స్‌ ద్వారా వెల్లడైంది. హత్య జరిగిన  రోజు, మర్నాడు సునీల్‌, దస్తగిరిల మధ్య పెద్ద ఎత్తున ఫోన్‌ కాల్స్‌, ఎస్‌ఎంఎస్‌లు నడిచాయి.

హత్య జరిగిన రోజు రాత్రి వివేకా ఇంటి ముందు నుంచి ఉమాశంకర్‌రెడ్డి పారిపోతున్న దృశ్యాలు  సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

ఎర్ర గంగిరెడ్డి దిశా నిర్దేశంతో సునీల్‌ యాదవ్‌, ఉమాశంకర్‌రెడ్డి, దస్తగిరిలు హత్య ప్రణాళిక అమలు చేశారు. హత్యకు కుట్ర రూపొందించిన నాలుగైదు రోజుల తర్వాత సునీల్‌ దస్తగిరికి రూ.కోటి ఇచ్చారు.  ఉమాశంకర్‌రెడ్డి, సునీల్‌ కూడా రూ.కోటి చొప్పున పొందారు. దస్తగిరి తనకు వచ్చిన డబ్బుల్లో రూ.46.70 లక్షలు మున్నా అనే స్నేహితుడి వద్ద ఉంచగా సీబీఐ స్వాధీనం చేసుకుంది.

పోలీసులకు మా పేర్లు చెబితే నిన్ను చంపేస్తాం.. అంటూ వాచ్‌మెన్‌ రంగన్నను గంగిరెడ్డి బెదిరించారు.

దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి.. వివేకా హత్య విషయాన్ని దాచిపెడుతూ ఆయన పీఏ కృష్ణారెడ్డితో పులివెందుల పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయించారు. మృతదేహంపై తీవ్ర గాయాలున్నాయని, పడకగదిలోనూ, స్నానాలగదిలోనూ రక్తపు మడుగు ఉందనే విషయాలేవి ఫిర్యాదులో ప్రస్తావించకుండా దాచిపెట్టారు. దాని ఆధారంగానే కేసు నమోదు చేయాలని సీఐ శంకరయ్యపై ఒత్తిడి తీసుకొచ్చారు. ‘సార్‌... శివశంకర్‌రెడ్డి, గంగిరెడ్డిలు ఘటనాస్థలాన్ని ఎందుకు శుభ్రపరుస్తున్నారు? వారు ఆధారాలు ధ్వంసం చేస్తే కేసు సంక్లిష్టమవుతుంది’ అని సీఐ శంకరయ్య.. అక్కడున్న వైఎస్‌ ప్రతాప్‌రెడ్డితో అన్నారు.

ఘటనాస్థలంలోని రక్తపు మరకలన్నింటినీ శివశంకర్‌రెడ్డి, గంగిరెడ్డి శుభ్రం చేయించారు. వివేకా తలకు గాయాలైనచోట్ల బ్యాండేజీ చుట్టించి కట్లు వేయించారు. శివశంకర్‌రెడ్డి ఆదేశాలతోనే పనిమనిషి లక్ష్మి ఈ రక్తపుమరకల్ని శుభ్రం చేశారు.

నార్కో అనాలసిస్‌ పరీక్షకు శివశంకర్‌రెడ్డి, సునీల్‌ యాదవ్‌, ఉమాశంకర్‌రెడ్డిలు ఒప్పుకోలేదు.

వివేకా తల, నుదురు, అరచేతిపై ఏడు గాయాలున్నట్లు పోస్టుమార్టం నివేదికలో తేలింది. హెమరేజిక్‌ షాక్‌తో పాటు, మెదడుకు తీవ్ర గాయాలవటం వల్ల చనిపోయారని నివేదికలో వెల్లడైంది. గొడ్డలితో వివేకాను హత్య చేసి ఉండొచ్చని శవపరీక్ష చేసిన వైద్యులు వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని