AP TELANGANA: 2 అంశాలపై న్యాయ సలహాకు!

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజన నాటి నుంచి రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పరిష్కారం కాకుండా ఉన్న వివిధ వివాదాస్పద అంశాల్లో రెండు అంశాలపై న్యాయసలహా తీసుకోవాలని కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఉప సంఘం

Updated : 18 Feb 2022 06:11 IST

కేంద్ర హోంశాఖ ఉప కమిటీ నిర్ణయం
రాష్ట్ర ఫైనాన్సు కార్పొరేషన్‌ విభజన అంశం లీగల్‌ కౌన్సిల్‌కు
ఏపీ, తెలంగాణ ఎవరి వాదనలు వారివే

ఈనాడు, అమరావతి: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజన నాటి నుంచి రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పరిష్కారం కాకుండా ఉన్న వివిధ వివాదాస్పద అంశాల్లో రెండు అంశాలపై న్యాయసలహా తీసుకోవాలని కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఉప సంఘం నిర్ణయించింది. రాష్ట్ర ఫైనాన్సు కార్పొరేషన్‌ విభజన అంశాన్ని కేంద్ర లీగల్‌ కౌన్సిల్‌కు నివేదించనున్నారు. రెండోది.. విద్యుత్తు బకాయిల అంశంలో ఆంధ్రప్రదేశ్‌ కోర్టుకు వెళ్లినందున ఇందులో కేంద్ర హోంశాఖ జోక్యానికి ఎంతవరకు ఆస్కారం ఉందో చర్చించి తేల్చాలని కమిటీ సభ్యులు పేర్కొన్నారు. రెండు రాష్ట్రాల మధ్య విభజన సమస్యలపై కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి ఆశిష్‌కుమార్‌ అధ్యక్షతన ఉప సంఘం తొలి సమావేశం గురువారం దృశ్య మాధ్యమంలో జరిగింది. పై రెండు అంశాలూ కాక.. మిగిలిన అన్ని విషయాల్లో సాంకేతిక అంశాలను అధ్యయనం చేసి మరో నెల రోజుల్లోగా ఇంకో సమావేశం ఏర్పాటుచేయనున్నట్లు కమిటీ హామీ ఇచ్చింది. ఉపసంఘం గురువారం అయిదు అంశాలపై రెండు  రాష్ట్రాల అధికారులతో చర్చించింది. అయితే, విభజన నాటి నుంచి పెండింగులో ఉన్న అంశాలపై రెండు తెలుగు రాష్ట్రాలూ ఎప్పటి నుంచో వినిపిస్తున్న వాదనలు, అభిప్రాయాలనే మళ్లీ కమిటీ ముందు కూడా వినిపించినట్లు తెలిసింది. రెండు రాష్ట్రాల పౌరసరఫరాల కార్పొరేషన్ల మధ్య నిధుల పంపిణీ, తెలంగాణ చెల్లించాల్సిన విద్యుత్తు బకాయిలు, రాష్ట్ర ఫైనాన్సు కార్పొరేషన్‌ విభజన, పన్నుల అంశాల్లో సందిగ్ధత తొలగింపు, బ్యాంకుల్లో నగదు నిల్వలు, డిపాజిట్ల విభజన తదితర అంశాలు చర్చకు వచ్చాయి. సుదీర్ఘకాలంగా పెండింగులో ఉన్న ఈ విషయాల వల్ల రాష్ట్రానికి తలెత్తుతున్న ఇబ్బందులేంటో ఆంధ్రప్రదేశ్‌ అధికారులు ఉపసంఘానికి వివరించారు. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్‌ నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్‌ హాజరయ్యారు. తెలంగాణ నుంచి ఆ రాష్ట్ర సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు తదితరులు హాజరయ్యారు.


కేసులు వాపస్‌ తీసుకుంటేనే పరిష్కారం: తెలంగాణ

ఈనాడు, హైదరాబాద్‌: కేసులను ఉపసంహరించుకుంటే చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకునేందుకు సానుకూలత ఏర్పడుతుందని తెలంగాణ రాష్ట్రం ఏపీకి స్పష్టం చేసింది. ‘పన్ను వివాదాల అంశం పరిష్కారానికి ఏపీ కోరుతున్నట్లు పునర్విభజన చట్టం సవరణ ఇప్పుడు అవసరం లేదు. చట్టం అమల్లోకి వచ్చిన ఏడున్నరేళ్ల తర్వాత సవరణ ఆమోదయోగ్యం కాదు. పైగా కొత్త వివాదాలకూ దారి తీస్తుంది. ఏపీ నష్టపోయిన మొత్తాన్ని కేంద్రం ఇస్తే సరిపోతుంది’ అని తెలంగాణ స్పష్టం చేయగా... ఈ అంశం రెండు రాష్ట్రాలకు సంబంధించింది కాదంటూ హోంశాఖ దీన్ని ఎజెండా నుంచి తొలగించింది. ఈ వివరాలను తెలంగాణ ఒకప్రకటనలో తెలియజేసింది.

విద్యుత్‌ బకాయిలు: ఏపీజెన్‌కో నుంచి మాకు రూ.12,532 కోట్లు రావాలి. కానీ ఏపీ తమకే రూ.3,442 కోట్లే రావాల్సి ఉందని అంటోంది. పైగా తెలంగాణ జెన్‌కోపై విద్యుత్‌ బకాయిల కోసం హైకోర్టులో కేసు వేసింది. కేసును ఉపసహరించుకుంటే చర్చల ద్వారా ఈ అంశాన్ని పరిష్కరించుకునేందుకు మేం సిద్ధం. బకాయిలను వేర్వేరుగా కాకుండా ఒకే అంశంగా గుర్తించి పరిష్కరించుకోవాల్సి ఉంది.

ఏపీఎస్‌ఎఫ్‌సీ: దీనిపై ఏపీ ప్రభుత్వం డీమెర్జర్‌ ప్రతిపాదనలను ఏకపక్షంగా కేంద్రానికి పంపింది. తెలంగాణ ప్రతినిధులు బోర్డులో లేకుండానే తీర్మానం చేసి పంపింది. దాన్ని అమలు చేయకూడదని కేంద్రానికి వివరించాం. ఏపీ ప్రభుత్వం ఎస్‌ఎఫ్‌సీకి చెందిన 235.34 ఎకరాలపై కోర్టు స్టే తెచ్చింది. ఎస్‌ఎఫ్‌సీ ప్రధాన కార్యాలయం కాని నానక్‌రాంగూడలోని భవనంలో వాటా అడగడం సరికాదు. ఆంధ్రప్రదేశ్‌ కోర్టు కేసులను ఉపసంహరించుకుంటే తప్ప ఎస్‌ఎఫ్‌సీ విభజన అంశం పరిష్కారం కాదు.

ఏపీ ఇవ్వాల్సిన మొత్తంపై: ఏపీ నుంచి మాకు రావాల్సిన కేంద్ర పథకాల బకాయిలు రూ.495.21 కోట్లు ఏడేళ్లుగా పెండింగ్‌లోనే ఉన్నాయి. ఉమ్మడిగా ఉన్న హైకోర్టు, రాజ్‌భవన్‌ వంటి వాటికి మేం ఖర్చుచేసిన రూ.315.76 కోట్లను వెంటనే ఇవ్వాలి.
ఏపీ పౌరసరఫరాల సంస్థ వ్యవహారాలు: ఈ సంస్థకు పెట్టుబడి మొత్తం రూ.354.08 కోట్లు ఇవ్వడానికి తెలంగాణ సిద్ధంగా ఉంది. అంతకుముందు కేంద్రం నుంచి మా పౌరసరఫరాల సంస్థకు రావాల్సిన సబ్సిడీని బదిలీ చేస్తామని ఏపీ అండర్‌టేకింగ్‌ ఇవ్వాలి. ఏపీ ఇవ్వడానికి తాజాగా అంగీకరించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని