Urdu Medium: ప్రమాదంలో ఉర్దూ మాధ్యమం

రాష్ట్రంలో ఉర్దూ మాధ్యమం ప్రమాదంలో పడబోతోంది. నూతన విద్యా విధానంలో భాగంగా అధికారులు చేస్తున్న మ్యాపింగ్‌ అమల్లోకి వస్తే ఈ మాధ్యమంలో చదివే విద్యార్థులకు ఇబ్బందులు ఏర్పడనున్నాయి. ఉర్దూ ప్రాథమిక పాఠశాలల్లోని 3,4,5

Updated : 18 Feb 2022 05:43 IST

ఇతర మాధ్యమ ఉన్నత పాఠశాలలకు అనుసంధానం
మ్యాపింగ్‌ చేస్తున్న క్షేత్రస్థాయి అధికారులు
వ్యతిరేకిస్తున్న ఉపాధ్యాయులు

ఈనాడు, అమరావతి

రాష్ట్రంలో ఉర్దూ మాధ్యమం ప్రమాదంలో పడబోతోంది. నూతన విద్యా విధానంలో భాగంగా అధికారులు చేస్తున్న మ్యాపింగ్‌ అమల్లోకి వస్తే ఈ మాధ్యమంలో చదివే విద్యార్థులకు ఇబ్బందులు ఏర్పడనున్నాయి. ఉర్దూ ప్రాథమిక పాఠశాలల్లోని 3,4,5 తరగతులను ఇతర మాధ్యమ ఉన్నత పాఠశాలలకు తరలించేందుకు మ్యాపింగ్‌ చేస్తున్నారు. మూడు కిలోమీటర్ల దూరంలో అవి లేకపోతే ఇతర మాధ్యమ ఉన్నత పాఠశాలలకు మ్యాపింగ్‌ చేస్తున్నారు. ఆయా విద్యార్థులు ఇతర మాధ్యమ పాఠశాలలకు వెళ్లాల్సి ఉంటుంది. దీని వల్ల ఉర్దూ భాషకు ప్రమాదం ఏర్పడనుందని ఆ మాధ్యమ ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో మ్యాపింగ్‌ చేపట్టారు. మిగతా జిల్లాల్లో కసరత్తు కొనసాగుతోంది.

కొన్ని జిల్లాల్లో పాఠశాలలే లేవు

రాష్ట్రంలో కొన్ని తెలుగు మాధ్యమ ప్రాథమిక పాఠశాలల్లో ముస్లిం విద్యార్థులకు అదనంగా ఉర్దూ సబ్జెక్టును బోధిస్తున్నారు. ఇవి కాకుండా పూర్తిగా ఉర్దూ మాధ్యమం బోధించేవి ఉన్నాయి. మూడు కిలోమీటర్ల పరిధిలో చాలా చోట్ల ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు లేవు. ఇతర మాధ్యమ బడులకు అనుసంధానం చేస్తున్నారు. రాయలసీమ జిల్లాల్లో 92 ఉన్నత పాఠశాలలు ఉండగా.. మిగతా జిల్లాల్లో 17మాత్రమే ఉన్నాయి. ఇవి కాకుండా ప్రాథమికోన్నత పాఠశాలలు 330 ఉండగా.. వీటిల్లో 220 చోట్ల అధ్యాపకులు, గదుల కొరత తీవ్రంగా ఉంది. ప్రాథమిక పాఠశాలలను ప్రాథమికోన్నత స్థాయికి ఉన్నతీకరించినా ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టలేదు. ఎస్జీటీలే బోధన సాగిస్తున్నారు.

తెలుగు మాధ్యమ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న 3,4,5 తరగతుల విద్యార్థులకు ఒకటి, రెండు, మూడు తరగతుల స్థాయి కలిగిన ఉర్దూను బోధిస్తారు. వీరందరూ ఉన్నత పాఠశాలలకు వెళ్లిపోతే వీరికి బోధన ఏట్లా? అని ఉర్దూ ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు. ఉర్దూ బోధిస్తున్న వారిలో చాలా మందికి బీఈడీ అర్హత లేదు. 1,2 తరగతులకు ఉర్దూ బోధించడం లేదు. వీరిని ఎక్కడ నియమిస్తారు? అనేది ప్రశ్నార్థకంగా మారింది.

కొన్ని చోట్ల పూర్తిగా ఉర్దూలోనే బోధించే పాఠశాలలు ఉన్నాయి. ఒకటి, రెండు తరగతుల్లో ఉర్దూ చదువుకున్న వారిని ఇతర పాఠశాలలకు తీసుకువెళ్లి ఏ మాధ్యమంలో బోధన చేస్తారనే దానిపై స్పష్టత లేదు. ఒకవేళ ప్రత్యేకంగా ఉర్దూ మాధ్యమాన్ని ప్రారంభిస్తే ఉపాధ్యాయులను ఎక్కడి నుంచి సర్దుబాటు చేస్తారనేది తేలాల్సి ఉంది.

ప్రాథమిక పాఠశాలల నుంచి 3,4,5 తరగతులను తరలిస్తే 1,2 తరగతులే మిగులుతాయి. ఉర్దూ అంగన్‌వాడీలు లేనందున వీటికి అనుసంధానం చేసే పరిస్థితి ఉండదు. భవిష్యత్తులో 1,2 తరగతులకు మాత్రమే ఉర్దూ మాధ్యమం పరిమితమవుతుంది.

ఉర్దూ మాధ్యమ బడుల తరలింపును ఎవరైనా ప్రశ్నిస్తే కేవలం రికార్డుల్లోనే ఈ మ్యాపింగ్‌ చేస్తున్నామని అధికారులు సమాధానమిస్తున్నారు.

ఉర్దూ విద్యార్థుల కోసం ప్రత్యేక ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలను ఏర్పాటు చేసి విద్యార్థులను అక్కడికి పంపిస్తే ఈ మాధ్యమానికి ఎలాంటి ఇబ్బంది ఉండదని ఏపీ ఉర్దూ ఉపాధ్యాయుల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు షబీర్‌ హుస్సేన్‌, అబ్దుల్‌ అజీజ్‌ వెల్లడించారు.


ప్రస్తుత విధానం ప్రకారమే విలీనం
- సురేష్‌ కుమార్‌, కమిషనర్‌, పాఠశాల విద్యాశాఖ

‘‘చాలా జిల్లాల్లో ఉర్దూ ఉన్నత పాఠశాలలు చాలా తక్కువగా ఉన్నాయి. ఐదో తరగతి వరకు ఉర్దూ మాధ్యమంలో చదివిన వారు ఆ తర్వాత ఆరో తరగతిలో తెలుగు లేదా ఆంగ్ల మాధ్యమంలో చేరుతున్నారు. దీని ప్రకారమే పాఠశాలలను మ్యాపింగ్‌ చేస్తున్నాం’’


ఉర్దూ పాఠశాలలను మినహాయించాలి
-అబ్దుల్‌ వారిస్‌, సయ్య ఇక్బాల్‌, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర ఉర్దూ టీచర్స్‌ అసోసియేషన్‌

‘‘రాష్ట్రంలో ఒక్క ఉర్దూ అంగన్‌వాడీ కేంద్రం లేనప్పుడు మాధ్యమ పాఠశాలలను విలీనం ఎలా చేస్తారు? ఇష్టమొచ్చినట్లు విలీనం చేస్తే ఉర్దూలో చదువు ఎవరు చెబుతారు. విలీన ప్రక్రియను నిలిపి వేసి ఉర్దూ పాఠశాలలను కాపాడాలి’’


ఉర్దూ మాధ్యమంలోనే విలీనం చేయాలి
-షేక్‌ ఖలీమ్‌, అధ్యక్షుడు, మైనారిటీ టీచర్స్‌ అసోసియేషన్‌

‘‘ఉర్దూ మాధ్యమం చదువుతున్న 3,4,5 తరగతులను ఉర్దూ పాఠశాలల్లోనే విలీనం చేయాలి. ఇతర మాధ్యమ బడులకు పంపిస్తే ఇబ్బందులు వస్తాయి. ఉన్నతీకరించిన 220 ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయులు, వసతులు లేవు. వీటన్నింటినీ పరిష్కరించాలి’’

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని