AP HIGH COURT: న్యాయవ్యవస్థ ప్రతిష్ఠను మీరే దిగజారుస్తారా?

న్యాయవ్యవస్థ హుందాతనాన్ని కాపాడాల్సిన న్యాయవాదులే ప్రతిష్ఠను దిగజార్చేలా వ్యాఖ్యలు చేయడమేంటని హైకోర్టు ప్రశ్నించింది. ఎవరు పడితే వారు ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం, సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టడం,

Updated : 18 Feb 2022 05:47 IST

అభ్యంతరకర వ్యాఖ్యలు, పోస్టులను సహించం
పిటిషనర్లకు హైకోర్టు న్యాయమూర్తి స్పష్టీకరణ
బెయిలు కోరిన నిందితులు.. విచారణ వాయిదా

ఈనాడు, అమరావతి: న్యాయవ్యవస్థ హుందాతనాన్ని కాపాడాల్సిన న్యాయవాదులే ప్రతిష్ఠను దిగజార్చేలా వ్యాఖ్యలు చేయడమేంటని హైకోర్టు ప్రశ్నించింది. ఎవరు పడితే వారు ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం, సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టడం, వీడియోలు అప్‌లోడ్‌ చేయడాన్ని అంగీకరించేది లేదని తేల్చిచెప్పింది. న్యాయవ్యవస్థపై, న్యాయమూర్తులపై అభ్యంతరకర వ్యాఖ్యలు, పోస్టులను అసలు సహించబోమని హెచ్చరించింది. సీబీఐ నమోదు చేసిన కేసులో బెయిలు మంజూరుచేయాలని కోరుతూ ఏపీ అసెంబ్లీ స్టాండింగ్‌ కౌన్సెల్‌, హైకోర్టు న్యాయవాది మెట్టా చంద్రశేఖరరావు, మరో న్యాయవాది గోపాలకృష్ణ కళానిధి, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ జి.రమేశ్‌కుమార్‌ వేసిన పిటిషన్లపై హైకోర్టు గురువారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా న్యాయస్థానాల ప్రతిష్ఠను దిగజార్చేలా న్యాయవాదులే మాట్లాడటంపై అభ్యంతరం తెలిపింది. నిందితులను దిగువ కోర్టు రెండు రోజుల పోలీసు కస్టడీకి ఇవ్వడంతో విచారణను సోమవారానికి వాయిదా వేసింది. నిందితుల పోలీసు కస్టడీ పూర్తయ్యాక కూడా జ్యుడిషియల్‌ రిమాండులో ఉండాల్సిన అవసరం ఏమిటో చెప్పాలని సీబీఐని ఆదేశించింది. మూడు వ్యాజ్యాలపై విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సీహెచ్‌ మానవేంద్రనాథ్‌రాయ్‌ గురువారం ఈ మేరకు ఆదేశాలిచ్చారు.  

హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయవ్యవస్థను అపకీర్తిపాలు చేసేలా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టడం, వీడియోలు అప్‌లోడ్‌ చేయడంపై నమోదు చేసిన కేసులో న్యాయవాదులు మెట్టా చంద్రశేఖరరావు, గోపాలకృష్ణ కళానిధి, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ రమేశ్‌కుమార్‌లను సీబీఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. బెయిలు కోసం వారు హైకోర్టులో పిటిషన్లు వేశారు. సీనియర్‌ న్యాయవాదులు కేజీ కృష్ణమూర్తి, హేమేంద్రనాథ్‌రెడ్డి, న్యాయవాది డి.కోదండరామిరెడ్డి నిందితుల తరఫున వాదనలు వినిపించారు. న్యాయవాదులపై సుమోటోగా నమోదు చేసిన కోర్టుధిక్కరణ కేసులో క్షమాపణలు కోరారని, భవిష్యత్తులో అలాంటి వ్యాఖ్యలు చేయబోమని హామీ ఇచ్చారని తెలిపారు. దీంతో వారిరువురిపై ధర్మాసనం కోర్టుధిక్కరణ కేసును మూసేసిందన్నారు. సీబీఐ నమోదు చేసిన పలు సెక్షన్లు పిటిషనర్ల వ్యాఖ్యలకు వర్తించవన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్నారని, బెయిలు మంజూరు చేయాలని కోరారు.

సీబీఐ తరఫు న్యాయవాది చెన్నకేశవులు వాదనలు వినిపిస్తూ.. హైకోర్టు న్యాయమూర్తులపై పిటిషనర్లు తీవ్ర వ్యాఖ్యలు చేశారన్నారు. దిగువ కోర్టు రెండు రోజుల పోలీసు కస్టడీకి ఇచ్చిందని, ఈ దశలో బెయిలు మంజూరు చేయవద్దన్నారు. విచారణ ప్రక్రియ జరుగుతున్నప్పుడు హైకోర్టు బెయిలు మంజూరు చేయడం న్యాయపరమైన చిక్కులకు దారితీస్తుందని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. దీంతో విచారణను సోమవారానికి వాయిదా వేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని