మత్స్యకారుల పొట్టకొట్టే జీవో 217ను చించేస్తున్నా.. జైలుకైనా వెళ్తా

ప్రజాసమస్యలు తీర్చేందుకు వైకాపాకు అధికారమిచ్చారే తప్ప వారిని మరిన్ని సమస్యల్లో నెట్టడానికి కాదని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ధ్వజమెత్తారు. వారు చేపలు, మటన్‌, చికెన్‌ దుకాణాలు నడపడానికి అధికారం కాదని మండిపడ్డారు. ఇందుకోసమే పాదయాత్ర చేశారా?

Published : 21 Feb 2022 03:11 IST

వైకాపాకు అధికారం ఇచ్చింది.. ప్రజల్ని కష్టాల్లో నెట్టటానికి కాదు
చేపలు అమ్ముకోవడానికి, చికెన్‌, మటన్‌ దుకాణాలు పెట్టటానికే పాదయాత్ర చేశారా?
మత్స్యకార అభ్యున్నతి సభలో జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌

ఎంత పెద్దవారైనా సరే.. జగన్‌గారూ మీరు పెద్దలు.. మాకు సాయం చేయాలి సార్‌ అని ఆయన వద్దకు వెళ్లాలి. అప్పుడే ఆయన అహం సంతృప్తి చెందుతుంది. అందరూ తన వద్ద తగ్గారనే తృప్తి కలుగుతుంది. ఎవరి వద్ద డబ్బులు ఉండకూడదు.. అందరూ దేహీ అనాలనేదే వైకాపావారి ఆలోచన విధానం. వారు రాచరికంతో వ్యవహరిస్తుంటే ఎలా ఊరుకుంటాం?

- జగన్‌పై పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్య


ఈనాడు డిజిటల్‌-ఏలూరు, న్యూస్‌టుడే-నరసాపురం: ప్రజాసమస్యలు తీర్చేందుకు వైకాపాకు అధికారమిచ్చారే తప్ప వారిని మరిన్ని సమస్యల్లో నెట్టడానికి కాదని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ధ్వజమెత్తారు. వారు చేపలు, మటన్‌, చికెన్‌ దుకాణాలు నడపడానికి అధికారం కాదని మండిపడ్డారు. ఇందుకోసమే పాదయాత్ర చేశారా? అని నిలదీశారు. పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురంలో ఆదివారం జనసేన మత్స్యకార వికాస విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ‘మత్స్యకార అభ్యున్నతి సభ’లో ఆయన మాట్లాడారు. లేని సమస్య సృష్టించటంలో వైకాపా నాయకులు మహాఉద్దండులని, దాన్ని వారే పరిష్కరించినట్లు చేస్తారని వివరించారు. ఎదురుతిరిగితే పింఛను రాదని, ఇల్లు కూల్చేస్తామని, రేషన్‌ నిలిపేస్తామని బెదిరిస్తారని పేర్కొన్నారు. అలా బెదిరింపుల బారినపడి అలసిన వారికి జనసేన అండగా ఉంటుందని భరోసానిచ్చారు.

జీవో 217పై ఉద్యమిద్దాం

‘లక్షలాది మత్స్యకారుల పొట్టకొట్టేలా, కష్టాన్ని దోచుకునేలా ఉన్న జీవో 217కు వ్యతిరేకంగా పోరాడాలి. చెరువులు, కుంటలు ఆన్‌లైన్‌ చేసి 25 శాతం ముందస్తు చెల్లింపులు చేయాలంటున్నారు. మత్స్యకారులకు అంత డబ్బులెక్కడినుంచి వస్తాయి? వారికి ఇబ్బంది కలిగించే ఈ జీవో ప్రతుల్ని చించేస్తున్నా. చట్టాలను పాటించడం ఎంత ముఖ్యమో.. కష్టాన్ని దోచుకునే చట్టాలపై ఎదురుతిరగడం అంతే అవసరం. వాటిని ఉల్లంఘించడంలో ఏ తప్పూ లేదు. ప్రభుత్వం కేసులు పెడితే జైలుకెళ్లడానికైనా సిద్ధమే. ఈ జీవోను ఉపసంహరించుకునేలా క్షేత్రస్థాయిలో పోరాడతా. ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే 2024లో జనసేన ప్రభుత్వం ఏర్పడిన వారంలోనే ఈ జీవో రద్దు చేస్తాం. జనసేనకు పది మంది ఎమ్మెల్యేలు ఉండుంటే ఈ జీవోనిచ్చేందుకు ఇప్పుడే ప్రభుత్వం ధైర్యం చేసేది కాదు. దీని రద్దు పోరాటానికి మీరు ప్రణాళిక చెప్పండి. నేను రోడ్డుపైకి వస్తా. మహా అయితే కేసులు పెడతారు. ఒకరికి గుండె ధైర్యం వస్తే ప్రతి ఒక్కరికీ వస్తుంది. ఇక్కడ తప్ప దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి జీవో లేదు. మటన్‌ దుకాణాలు పెట్టుకోవటానికి, చేపలు అమ్ముకోవటానికి ప్రభుత్వం ఉందా? వైకాపా నాయకులు మద్యం దుకాణాల వద్ద చీకుల దుకాణాన్నీ పెట్టుకోవచ్చు.

హామీల అమలుకు నిలదీయండి

జనసేన తరఫున మత్స్యకారుల అభ్యున్నతికి ప్రత్యేక మేనిఫెస్టో విడుదల చేస్తాం. వారికి అండగా నిలుస్తాం. ఈ ఒక్క ఎన్నికల్లో మాకు భరోసాగా నిలవండి. నేను చేతల మనిషిని. మీ తరఫున నేనుంటా. మీరు అండగా నిలబడకపోతే నేనేం చేయలేను. చావటానికైనా సిద్ధం కానీ తలవంచను. ఒంగి ఒంగి దండాలు పెట్టటానికి రాజకీయాల్లోకి రాలేదు. పది మంది మంచి కోరే మహానుభావుల పాదాలకు వందనం చేస్తా. అహంకారంతో ఉండేవారికి మాత్రం తలవంచను. తల ఎగిరిపోతే పోనీ. వైకాపా నాయకులకు భయపడొద్దు. వారికి భయం లేకుండా పోయింది. పోరాటాల ద్వారానే భయమేంటో వారికి చూపిద్దాం. ఎందరిపై కేసులు పెట్టుకుంటారో పెట్టుకోనీ. ఎన్నికలకు ముందు వైకాపా నాయకులు మత్స్యకారులకు ఎన్నెన్నో హామీలిచ్చారు. వాటిని ఎందుకు అమలు చేయలేదని నిలదీయాలి. అమలు చేయలేని హామీలు ఎందుకిచ్చారని ప్రశ్నించాలి. మీకు చట్టాలు వర్తించవా? మేం మాత్రమే పాటించాలా? అని ప్రశ్నించాలి. ఆంధ్రప్రదేశ్‌లో 8 జెట్టీలు నిర్మించేందుకు గతేడాది ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. వాటిలో రెండింటిలో మాత్రమే నామమాత్రంగా పనులు ప్రారంభమయ్యాయి.

కష్టాల్లోకి నెట్టేలా ప్రభుత్వం తీరు

రాష్ట్రం నుంచి వేలాది మత్స్యకారులు ఏటా గుజరాత్‌కు వలస వెళ్తున్నారు. కొన్ని సందర్భాల్లో పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, శ్రీలంక సరిహద్దుల్లోకి తెలియకుండా వెళ్లి అక్కడ చిక్కుతున్నారు. మత్స్యకార గ్రామాల్లో తాగునీరు లేదు. పడవలకు బీమా కల్పించట్లేదు. గంగవరం పోర్టులో జెట్టీ నిర్మిస్తామని చెప్పి అక్కడ మత్స్యకారుల్ని నిరాశ్రయుల్ని చేశారు. గతంలో తీరప్రాంతాల్లో మత్స్యకారులు ఇల్లు కట్టుకోవడానికి అదనంగా రూ.70 వేలు సాయం చేసేవారు. ఇప్పుడు దాన్ని తీసేశారు. సముద్రంలో వేటకు వెళ్లి ప్రమాదవశాత్తూ మరణిస్తే మత్స్యకారులకు రూ.10 లక్షల బీమా ఇస్తామన్నారు. మూడేళ్లలో కేవలం 63 కుటుంబాలకే ఇచ్చారు. అది కూడా కేంద్రం నుంచి వచ్చిన రూ.5 లక్షల పరిహారం అందించారు. రూ.లక్షల కోట్లు పెట్టుకుని 63 మందికే పరిహారమిస్తారా? జనసైనికులు మరణిస్తే ఏడాదిలోనే 45 కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున మేం పరిహారమిచ్చాం. ఒక పార్టీగా మేం ఇన్ని చేయగలుగుతుంటే రూ.లక్షల కోట్ల ఆదాయమున్న ప్రభుత్వం ఎందుకు చేయలేకపోతోంది. డబ్బంతా ఏం చేస్తోంది?

ముందు దెబ్బ నాపై పడాలి..

జీవో 217 ప్రకారం వంద హెక్టార్ల పైబడిన ఏ చెరువులో అయినా చేపల పెంపకానికి ఆన్‌లైన్‌లో వేలం వేస్తారు. తొలుత నెల్లూరు జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తామంటున్నా.. అన్ని జిల్లాలకు వర్తింపజేస్తారు. దీనికి ఎక్కడో ఒకచోట అడ్డుకోవాలి. అందుకే మీరు నిలబడితే మీకు అండగా నేనుంటా. దెబ్బపడితే ముందు నాపై పడేలా చూస్తా. గతంలో కుంటలు, చెరువుల్లో చేపల పెంపకానికి మత్స్యకార సంఘాలు వేలం పాడుకునేవి. 10 నుంచి 15 శాతం సొమ్ము పంచాయతీలకు కట్టి మిగిలిన డబ్బులు అందరూ పంచుకునేవారు. తాజా జీవోతో వారికి ఇబ్బంది ఎదురవుతోంది.

రాష్ట్రం గుంతలు, గోతులమయం

వైకాపా ప్రభుత్వం రాష్ట్రాన్ని గోతులు, గుంతలమయం చేసింది. నేను వచ్చిన దారి పొడవునా గోతులే. రోడ్డుపై కారులో వస్తుంటే పడవలో ప్రయాణిస్తున్నట్లే అనిపించింది. మత్స్యకారులు సాహస వీరులు. అలాంటి 65 లక్షల మంది సాహసవీరుల గుంపు స్ఫూర్తితో రాజకీయ ప్రయాణం ప్రారంభించా. రాచరికం చూపుతున్న వైకాపావారికే అంత తెగింపు ఉంటే స్వాతంత్య్రయోధుల స్ఫూర్తితో పనిచేస్తున్న మాలో ఎంత తెగింపు ఉండాలి? వైకాపా వారిని మేము భయంతో భరించట్లేదు. సహనంతో వ్యవహరిస్తున్నాం. వార్డు సభ్యులుగా గెలిచిన జనసేన నాయకుల ఇళ్లను వైకాపా నాయకులు కూల్చేశారు. సంయమనం మా బలం. బలహీనత కాదు.

* రాష్ట్రంలో 32 మత్స్యకార తెగలకు చెందిన 60-75 లక్షల మంది మత్స్యకారులున్నారు. వారికి ఇప్పటికీ ఎందుకు ఆర్థిక ప్రగతి లేదు? సముద్ర లోతుల్లోకెళ్లి ఈదగలిగే సామర్థ్యమున్న మత్స్యకారుల్లో ఎంతమంది ఒలింపిక్‌ స్విమ్మర్లుంటారు? ప్రభుత్వం ఈ దిశగా ఎందుకు ఆలోచించదు?

* మార్చి 14న జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మళ్లీ కలుద్దాం. రాష్ట్ర భవిష్యత్తు ఎలా ఉండాలి? సమస్యను ఎలా ఎదుర్కోవాలి? ఎలా యుద్ధం చేయాలనే దానిపై మాట్లాడుకుందాం’ అని పవన్‌ పేర్కొన్నారు. కార్యక్రమంలో జనసేన పీఏసీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌, రాష్ట్ర నాయకుడు నాగబాబు, రాష్ట్ర మత్స్యకార వికాస విభాగం ఛైర్మన్‌ బొమ్మిడి నాయకర్‌, సంఘం కార్యదర్శి మోగి శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శి ఘంటసాల వెంకటలక్ష్మి, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి జిల్లాల అధ్యక్షులు కె.గోవిందరావు, కె.దుర్గేశ్‌ తదితరులు మాట్లాడారు.


అభిమాని అత్యుత్సాహం.. కిందపడిన పవన్‌

అభిమాని అత్యుత్సాహంతో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ కారు మీద పడిపోయారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో ఆదివారం ఏర్పాటు చేసిన మత్స్యకార అభ్యున్నతి సభలో పాల్గొనేందుకు పవన్‌ వచ్చారు. పెనుగొండ మండలం సిద్ధాంతంలో కారుపైకి ఎక్కి ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగుతుండగా హఠాత్తుగా ఓ అభిమాని పైకి వచ్చి ఆలింగనం చేసుకునేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో అభిమానితో పాటు పవన్‌ కారుపై పడిపోయారు. పవన్‌ అంగరక్షకులు అభిమానిని కిందకు లాగారు. పవన్‌ వెంటనే లేచి నిల్చుని ప్రజలకు అభివాదం చేశారు.

- న్యూస్‌టుడే, పెనుగొండ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని