Viveka Murder Case: ఎవరిపై ఎందుకు అనుమానం?
వై.ఎస్.వివేకానందరెడ్డితో వైకాపా ఎంపీ అవినాష్రెడ్డి తండ్రి భాస్కర్రెడ్డికి అటు రాజకీయంగా, ఇటు బంధుత్వ పరంగా శత్రుత్వం ఉందని సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత పేర్కొన్నారు. 2009లో వై.ఎస్.రాజశేఖరరెడ్డి మరణం తర్వాత పులివెందుల శాసనసభ స్థానం ఉప ఎన్నికలో భాస్కర్రెడ్డి పోటీ
సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో వివేకా కుమార్తె సునీత ఏం చెప్పారు?
ఈనాడు, అమరావతి: వై.ఎస్.వివేకానందరెడ్డితో వైకాపా ఎంపీ అవినాష్రెడ్డి తండ్రి భాస్కర్రెడ్డికి అటు రాజకీయంగా, ఇటు బంధుత్వ పరంగా శత్రుత్వం ఉందని సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత పేర్కొన్నారు. 2009లో వై.ఎస్.రాజశేఖరరెడ్డి మరణం తర్వాత పులివెందుల శాసనసభ స్థానం ఉప ఎన్నికలో భాస్కర్రెడ్డి పోటీ చేయాలనుకున్నారని, కానీ విజయమ్మ.. లేదా షర్మిల పోటీచేయాలని వివేకా సూచించారని ఆమె తెలిపారు. వివేకానందరెడ్డి హత్య ఘటనలో ప్రమేయానికి సంబంధించి అవినాష్రెడ్డి, భాస్కర్రెడ్డి సహా ఎవరెవరిపై తనకు ఎలాంటి అనుమానాలున్నాయో, దానికి కారణాలేంటో సీబీఐకి ఆమె తెలియజేశారు. వివేకా చనిపోయాక హత్యాస్థలంలో ఆధారాల్ని తుడిచేయాలని భాస్కర్రెడ్డి తనను ఆదేశించినట్టు ఎర్ర గంగిరెడ్డి చెప్పడం కూడా ఆయనపై తన అనుమానానికి కారణంగా పేర్కొన్నారు. ‘ఎంపీ అవినాష్రెడ్డికి దేవిరెడ్డి శివశంకర్రెడ్డి అత్యంత సన్నిహితుడు. అతన్ని అవినాష్రెడ్డి కాపాడుతున్నారు. శివశంకర్రెడ్డి, ఈసీ సురేంద్రరెడ్డిలను తీసుకుని 2019 ఆగస్టు 31న అవినాష్రెడ్డి డీజీపీని కలవాల్సిన అవసరమేంటి?’ అని ఆమె ప్రశ్నించారు. వివేకా హత్యకు ముందు రోజు (2019 మార్చి 14) మధ్యాహ్నం నుంచి చోటుచేసుకున్న పరిణామాల్ని, ఎవరు ఎవరెవరికి ఫోన్లు చేశారన్న వివరాల్నీ ఆమె సీబీఐకి అందజేశారు. వై.ఎస్.మనోహర్రెడ్డి ప్రమేయంపైనా అనుమానాలున్నాయని, ఆధారాలు తుడిచేయాలని తనకు మనోహర్రెడ్డి సూచించినట్టుగా ఎర్ర గంగిరెడ్డి పోలీసుల విచారణలో చెప్పారని ఆమె పేర్కొన్నారు. ఎర్ర గంగిరెడ్డి ఒక్కోసారి ఒక్కొక్కరి పేరు చెప్పారన్నారు. ఇంకా ఆమె అనుమానితులుగా పేర్కొన్నవారిలో కొందరి వివరాలు.. వారిని అనుమానించడానికి ఆమె చెప్పిన కారణాలు ఇవీ..!
దేవిరెడ్డి శివశంకర్రెడ్డి
(అవినాష్రెడ్డి కుటుంబానికి సన్నిహితుడు)
వివేకానందరెడ్డి అంటే శివశంకర్రెడ్డికి భయం. ఆయనకు ఎదుటపడేవారు కాదు. వివేకా ఇంట్లోకి ఆయన అడుగుపెట్టేవారే కాదు. అలాంటి శివశంకర్రెడ్డి... మార్చి 15న ఉదయం వివేకా హత్య జరిగిన ప్రదేశం నుంచి అవినాష్రెడ్డి వెళ్లిపోయాక కూడా అక్కడే ఉన్నారు. శివశంకర్రెడ్డిపై గతంలో చాలా నేరారోపణలు ఉన్నాయి. 2017లో వివేకా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోవడానికి ఆయన కారకుడు. సంఘటన జరగడానికి ముందురోజు రాత్రి 8 గంటలకు ఎర్ర గంగిరెడ్డికి ఆయన ఫోన్ చేశారు. వివేకా మృతదేహాన్ని చూడటానికి ముందు ఒకసారి, చూసిన తర్వాత ఒకసారి సాక్షి విలేకరికి శివశంకర్రెడ్డి ఫోన్ చేశారు. ఉదయం 6.24కి 141 సెకన్లు, ఉదయం 6.46కి 17 సెకన్లు ఆయనతో మాట్లాడారు. వివేకా గుండెపోటుతో చనిపోయారన్న నిర్ధారణకు శివశంకర్రెడ్డి ఎలా వచ్చారు? ఆ విషయాన్ని విలేకరికి ఎప్పుడు చెప్పారు. వివేకా గుండెపోటుతో చనిపోయారని విలేకరికి తానే చెప్పినట్టు ఆ తర్వాత పోలీసుల విచారణలో శివశంకర్రెడ్డి అంగీకరించారు. హత్యాస్థలంలో ఫొటోలు తీయడానికి శివశంకర్రెడ్డి ఎవర్నీ ఎందుకు అనుమతించలేదు? అది నేరం జరిగిన ప్రదేశం (క్రైమ్ సీన్) అని ఆయనకు ముందే తెలియడం వల్లేనా? మరి ఆధారాలు ఎందుకు చెరిపేశారు? వివేకా మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించినంత సేపూ ప్రతి విషయాన్నీ శివశంకర్రెడ్డికి డాక్టర్ సతీష్ ఎందుకు చెబుతూ వచ్చారు?
ఉదయ్కుమార్రెడ్డి
(తుమ్మలపల్లెలోని యురేనియం కర్మాగారంలో ఉద్యోగి. అవినాష్రెడ్డికి సన్నిహితుడు. ఈసీ గంగిరెడ్డి ఆస్పత్రిలో కాంపౌండర్ ప్రకాష్రెడ్డి కొడుకు. వివేకా శరీరంపై గాయాలకు బ్యాండేజి కట్టినవారిలో ప్రకాష్రెడ్డి ఉన్నారు)
ఉదయ్కుమార్రెడ్డి ఫోన్కి 14వ తేదీ అర్ధరాత్రి దాటాక ఒంటిగంట సమయంలో బస్టాండ్ దగ్గరున్న టవర్ పరిధి నుంచి మెసేజ్ వచ్చింది. తెల్లవారుజామున 3.30కి ఇంటినుంచి బయటకు వెళ్లారు. సీబీఐ విచారణ కోరుతూ నేను కోర్టులో పిటిషన్ వేశాక... తన కుమారుడు ఇబ్బందుల్లో పడ్డాడని ఉదయ్ తండ్రి వ్యాఖ్యానించినట్టు తెలిసింది. ఉదయ్, ఈసీ సురేందర్రెడ్డితో వెళ్లి, దేవిరెడ్డి శివశంకర్రెడ్డిని 15వ తేదీ తెల్లవారుజామున కలిశారు. డాక్టర్ను తీసుకురమ్మని అవినాష్రెడ్డి పీఏ రమణారెడ్డి ఉదయం 6.30కి ఉదయ్కి ఫోన్ చేశారు. వెంటనే డాక్టర్ సతీష్రెడ్డికి ఉదయ్ ఫోన్ చేసి వివేకా ఇంటికి రమ్మని చెప్పారు. అప్పటికి నంద్యాలలో ఉన్న సతీష్... డాక్టర్ మధుసూదన్రెడ్డికి ఫోన్ చేసి వివేకా ఇంటికి వెళ్లాలని చెప్పారు. మధుసూదన్రెడ్డి మందులు తీసుకుని బయల్దేరారు. మధు మందులు ఎందుకు తీసుకెళ్లారు? సతీష్రెడ్డి ఆయనకు ఏం చెప్పారు? వివేకా చనిపోయారనా? అనారోగ్యంతో ఉన్నారనా? వివేకా చనిపోయారని డాక్టర్లయిన సతీష్, మధులకు తెలియదా? ఉదయ్ స్కార్పియోలో వెళ్లి మధుని తీసుకురావడం, అప్పటికే చనిపోయిన వ్యక్తి కోసం మందులు తేవడం, ఈ కేసు విషయంలో భాస్కర్రెడ్డి, మనోహర్రెడ్డిలను డిసెంబరు 3న డీటీసీలో పోలీసులు ప్రశ్నిస్తున్నప్పుడు... రూ.2-3 కోట్లు ఇచ్చి సెటిల్ చేసుకుంటే పోతుంది కదా? అని శివశంకర్రెడ్డితో ఉదయ్ వ్యాఖ్యానించడం. అవినాష్ అరెస్టవుతారని ఉదయ్ తన మిత్రులు కొందరితో చెప్పడం వంటివి ఆయనపై అనుమానాలకు కారణాలు.
ఈసీ సురేందర్రెడ్డి
(జగన్ సతీమణి వై.ఎస్. భారతి చిన్నాన్న కుమారుడు)
2019 మార్చి 15 ఉదయం... సాక్షి అడ్మిన్ విభాగంలో పనిచేస్తున్న తన భార్యతో సురేందర్రెడ్డి మాట్లాడారు. వివేకా గుండెపోటుతో చనిపోయారన్న కథనాన్ని సాక్షి టీవీలో ఉదయం 10.30 వరకు ఆమే నడిపించారు. అలా ఎందుకు చేశారు?
ఎర్ర గంగిరెడ్డి
(వివేకాకు చిరకాల పరిచయస్తుడు)
వివేకానందరెడ్డికి బాగా తెలిసిన వ్యక్తి. 40 ఏళ్ల నుంచి వివేకా కుటుంబంతో అనుబంధం ఉంది. వివేకాతోనే ఎక్కువ సమయం గడిపేవారు. 2019 మార్చి 14న వివేకా ఒంటరిగానే ఉన్నారని, కుటుంబసభ్యులు, అల్లుడు రాజశేఖర్ ఆయనతో లేరని ఎర్ర గంగిరెడ్డికి తెలుసు. హైదరాబాద్లో ఒక ఫంక్షన్కి వెళ్లాల్సి ఉన్నా గంగిరెడ్డి వెళ్లలేదు. 14న రాత్రి 8 గంటల కంటే ముందు శివశంకర్రెడ్డితో గంగిరెడ్డి మాట్లాడారు. 15న ఉదయం ఘటనాస్థలంలో... మృతదేహాన్ని ముట్టుకోవద్దని రాజశేఖర్కు గంగిరెడ్డి సూచించారు. అంటే అక్కడ నేరం జరిగిందని ఆయనకు ముందే తెలుసు. ఆ ప్రాంతాన్ని శుభ్రం చేయాలని తొందరపెట్టారు. వివేకా హత్య విషయం తెలిశాక... వివరాలు కనుక్కుందామని మేం ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆయన ఎత్తలేదు. వివేకా హత్య గురించి కుటుంబసభ్యులకు సమాచారం ఇవ్వలేదు. వివేకా చనిపోయిన రోజే ఖననం జరగాలని పట్టుబట్టారు. కేసు పెట్టవద్దని చెప్పిందీ ఆయనే. పోస్ట్మార్టం పూర్తయ్యేవరకు కూడా అది హత్య కాదని అక్కడున్నవారికి పదే పదే చెబుతూ వచ్చారు. అది హత్య కానేకాదని కొందరితో వాదనకూ దిగారు. ఆధారాలు తుడిచేయాలని తనకు చెప్పింది.. మనోహర్రెడ్డి అని ఒకసారి, భాస్కర్రెడ్డి అని ఒకసారి, సీఐ అని మరోసారి చెప్పారు. పోలీసు కస్టడీలో ఉండగా వారితో... ‘మీరు మహా అయితే నన్ను కొడతారేమో, నోరు తెరిస్తే నన్ను చంపేస్తారు’ అని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ భక్త ఐపీఎస్లపై వేటు
అధికార వైకాపాతో అంటకాగుతూ... గత ఐదేళ్లుగా ఆ పార్టీ అరాచకాలకు అడుగడుగునా కొమ్ముకాస్తూ వచ్చిన ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు బదిలీ వేటు వేసింది. -
ఊరూరా మాదక ద్రవ్యాలతో మత్తెక్కిన ఆంధ్రా!
ఆంధ్రప్రదేశ్ను గంజాయి ఉపద్రవం కమ్మేసింది. దీని వినియోగం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరింది. విశాఖ మన్యం నుంచి ఏటా రూ.10 వేల కోట్ల విలువైన గంజాయి మన రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు దేశ, విదేశాలకు తరలుతోంది. -
ఈసారైనా ఒకటో తేదీన.. ఇంటి దగ్గరే పింఛన్లిస్తారా?
రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకు పైగా చేరాయి. ఇలాంటి కఠిన పరిస్థితుల్లోనూ.. వృద్ధుల్ని సచివాలయాలకు నడిపించి వారి ప్రాణాలతో చెలగాటం ఆడేందుకు వైకాపా ప్రభుత్వం సిద్ధమైంది. -
అవునా.. స్టీల్ప్లాంటు నష్టాల్లో ఉందా?
విశాఖ ఉక్కుకు జగన్ మళ్లీ మొండిచేయి చూపించారు. ‘స్టీలుప్లాంటు నష్టాల్లో ఉందా?’ అంటూ ఏమీ తెలియనట్లు ఆయన కార్మికసంఘాల నేతలను ప్రశ్నించడం చర్చనీయాంశమైంది. -
ఆస్తులు వేల కోట్లు.. చూపింది వందల కోట్లు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తన అఫిడవిట్లో ఆస్తుల విలువ తక్కువగా చూపించారు. -
హామీలకు శిలువ!
గత ఎన్నికలకు ముందు.. మ్యానిఫెస్టో అనే పదానికి తానే తొలిసారిగా అర్థం కనిపెట్టినట్లు చెప్పారు జగన్. దాన్ని బైబిల్తో పోల్చి ప్రచారం చేశారు. క్రైస్తవుల ఓట్లు దండుకుని గద్దెనెక్కారు. తీరా చూస్తే.. ఈ ఐదేళ్ల పాలనలో అదే బైబిల్ను దైవసమానంగా చూసే క్రైస్తవులను జగన్ వంచించారు. -
అక్రమాల కిరణం!
అవినీతి, అరాచకం కలగలిసిన అక్రమాల ‘కిరణం’ ఆయన. కొండల్ని కొల్లగొట్టారు.. ప్రభుత్వ భూముల్ని చెరబట్టారు.. ఇసుకలో దోచేశారు.. రియల్ ఎస్టేట్ దందాల్లో ఆరితేరారు.. ఒకప్పుడు రోజువారీ ఖర్చులకూ కటకటలాడిన ఆయన.. గత ఐదేళ్లలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని రూ.వందల కోట్లకు పడగలెత్తారు. -
గుంతల దారులు.. బూతు మాటలు!
కృష్ణా జిల్లాలోని గుడివాడ నియోజకవర్గం రాజకీయ చైతన్యానికి ప్రతీక. ఎన్నికల్లో అక్కడి ప్రజలు ఇచ్చే తీర్పుపై తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి ఉంటుంది. -
జలభగ్నం
‘‘పోలవరం సహా గాలేరు-నగరి, హంద్రీనీవా, వంశధార, వెలిగొండ తదితర అన్ని ప్రాజెక్టులను జలయజ్ఞంలో భాగంగా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తాం. రక్షిత తాగు, సాగునీటి కలలను నిజం చేస్తాం. చెరువులను పునరుద్ధరిస్తాం. -
జాతీయ రహదారిని.. జగన్కు రాసిచ్చేశారా?
నా దారి రహదారి.. అడ్డం రాకు.. ఇది నరసింహ సినిమాలో రజనీకాంత్ డైలాగ్. సీఎం జగన్ కూడా చెన్నై- కోల్కతా జాతీయ రహదారి తనదే అంటున్నారు. అందుకు ఎవరూ అడ్డు చెప్పకూడదంటున్నారు. -
ఓటుతోనే ప్రజాస్వామ్య పరిరక్షణ
ఓటు హక్కుపై అవగాహన పెంచడానికి చేస్తున్న ప్రయత్నాలు అభినందనీయమని విశ్రాంత ఐఏఎస్ అధికారి, సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ (సీఎఫ్డీ) ప్రధాన కార్యదర్శి నిమ్మగడ్డ రమేశ్కుమార్ పేర్కొన్నారు. -
అయిదేళ్లు చాల్లేదా..జగన్?
మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని పదే పదే చెబుతున్న వైకాపా ప్రభుత్వం.. వారి పిల్లల కోసం నిర్మించిన గురుకుల పాఠశాల భవనాన్ని మాత్రం పట్టించుకోలేదు. -
ఇదీ సంగతి!
ఆదాయంలోనే కాదు సార్.. కేసుల్లో కూడా ఏ సీఎం మీ దరిదాపుల్లోకి రాలేరు సార్! -
అయినవాళ్లకే భద్రత
ఏ ప్రభుత్వమైనా సరే ప్రజాప్రతినిధులు, రాజకీయ ప్రముఖులకు వారికున్న ముప్పు ఆధారంగా భద్రత కల్పిస్తుంది. కానీ వ్యవస్థల విధ్వంసానికి తెగబడుతున్న జగన్ ప్రభుత్వం మాత్రం ఆ భద్రతనూ తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటోంది.