జంగారెడ్డిగూడెంలో మిస్టరీ మరణాలు

రెండు రోజుల్లో (బుధ, గురువారాల్లో) 15 మంది మృతి చెందడం పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలో కలకలం సృష్టిస్తోంది. అప్పటివరకు ఆరోగ్యంగా ఉన్నవారు ఒక్కసారిగా అస్వస్థతకు గురై మృత్యువాత పడటం మిస్టరీగా మారింది.

Published : 11 Mar 2022 04:14 IST

రెండ్రోజుల వ్యవధిలో 15 మంది మృతి

కల్తీ సారానే కారణమంటున్న కుటుంబసభ్యులు

ఈనాడు డిజిటల్‌- ఏలూరు, జంగారెడ్డిగూడెం, న్యూస్‌టుడే: రెండు రోజుల్లో (బుధ, గురువారాల్లో) 15 మంది మృతి చెందడం పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలో కలకలం సృష్టిస్తోంది. అప్పటివరకు ఆరోగ్యంగా ఉన్నవారు ఒక్కసారిగా అస్వస్థతకు గురై మృత్యువాత పడటం మిస్టరీగా మారింది. కొందరిలో వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి వంటి లక్షణాలతో ఆస్పత్రుల్లో చేరడం.. గంటల వ్యవధిలో మృతి చెందడం విషాదం మిగుల్చుతోంది. వీరిలో ఎక్కువ మందికి మద్యం అలవాటు ఉందని, కల్తీ సారా తాగి చనిపోయారని కొందరు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మృతుల్లో ఒకరిద్దరు 60 నుంచి 70 ఏళ్లవారు కాగా.. మిగిలినవారు 40 నుంచి 55 సంవత్సరాల మధ్య వయస్కులు. వీరంతా కూలి పనులు, చిన్న వృత్తులు చేసుకునేవారు. వీరిలో కొందరికి కుటుంబ సభ్యులు ఆర్‌ఎంపీలు, పీఎంపీల వద్ద, మరికొందరిని ప్రాంతీయ ఆసుపత్రి, ప్రైవేటు ఆసుపత్రులలో చేర్చి వైద్యం అందించారు. బుట్టాయగూడెం రోడ్డులోని గాంధీబొమ్మ సెంటర్‌లోని ఒకే వీధిలో ఇద్దరు చనిపోయారు. ‘మా నాన్న ముడిచెర్ల అప్పారావు (45) కడుపునొప్పి.. అంటే ఆర్‌ఎంపీ వద్ద చూపించాం. తరువాత పట్టణంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లాం.కొద్దిసేపటికే మా నాన్న చనిపోయారు’ అని ప్రకాష్‌ ఆవేదన వ్యక్తం చేశారు. తాపీ పనులు చేసే బండారు శ్రీనివాసరావు (45) కడుపునొప్పితో బాధపడితే గురువారం ఉదయం ప్రాంతీయ ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు ఆయన మేనల్లుడు వెంకట్‌ తెలిపారు. ‘వాంతులు, విరేచనాలు అయ్యాయి. ఐసీయూలో పెట్టారు. కొద్దిసేపటికే మామయ్య చనిపోయారని చెప్పారు’ అని అన్నారు. అత్యధిక మరణాలు ఇదే తీరులో సంభవించినట్లు చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని