ap news:ప్రధాన డ్యాం డిజైన్ల ఖరారుకు మరో కమిటీ

గోదావరి వరద ఉద్ధృతికి నదీ గర్భంలో ఏర్పడ్డ కోత వల్ల పోలవరం ప్రధాన డ్యాం నిర్మాణానికి ఎదురైన సమస్య పరిష్కారానికి కేంద్రం మరో కమిటీని నియమించింది. దిల్లీ ఐఐటీ విశ్రాంత డైరక్టర్‌ ప్రొఫెసర్‌ వి.ఎస్‌.రాజు

Updated : 17 Mar 2022 06:32 IST

25లోగా చర్చించి మెథడాలజీ తేల్చాలి

వరద కోతవల్ల అదనపు పనులకు మేమే నిధులిస్తాం

పోలవరం ప్రాజెక్టుపై కేంద్రమంత్రి షెకావత్‌ స్పష్టీకరణ

దిగువ కాఫర్‌ డ్యాం డిజైన్ల ఖరారు

ఈనాడు, అమరావతి: గోదావరి వరద ఉద్ధృతికి నదీ గర్భంలో ఏర్పడ్డ కోత వల్ల పోలవరం ప్రధాన డ్యాం నిర్మాణానికి ఎదురైన సమస్య పరిష్కారానికి కేంద్రం మరో కమిటీని నియమించింది. దిల్లీ ఐఐటీ విశ్రాంత డైరక్టర్‌ ప్రొఫెసర్‌ వి.ఎస్‌.రాజు నేతృత్వంలో ఈ కమిటీ అధ్యయనం చేసి, మెథడాలజీ విషయంలో ఒక అభిప్రాయానికి రావాలని కేంద్రమంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ వద్ద నిర్వహించిన సమావేశం బుధవారం నిర్ణయించింది. వారి అధ్యయనం తర్వాత మార్చి 27, 29 తేదీల మధ్య మరోసారి సమావేశం నిర్వహిస్తానని, తానే స్వయంగా హాజరవుతానని కేంద్రమంత్రి వెల్లడించారు. వరద కోత వల్ల పోలవరం ప్రాజెక్టుకు అదనంగా చేయాల్సిన పనులకు అయ్యే అదనపు వ్యయాన్ని కేంద్రమే భరిస్తుందనీ మంత్రి భరోసా ఇచ్చారు. అదనపు పనులు చేయాలని.. ఆకృతులు మార్చాలని కేంద్ర కమిటీలే చెబుతున్నాయని, మళ్లీ ఆ నిధులు అడిగితే అభ్యంతరాలు చెబుతున్నారని రాష్ట్ర జలవనరులశాఖ కార్యదర్శి శశిభూషణ్‌ మంత్రి దృష్టికి తీసుకువెళ్లగా ఆయన ఈ హామీ ఇచ్చినట్లు తెలిసింది. గోదావరి గర్భంలో ఇసుక కోత సమస్యను ఎలా ఎదుర్కోవాలి? ప్రధాన డ్యాం నిర్మాణానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏ డిజైన్ల ప్రకారం ముందుకు సాగాలనే అంశాలను పై కమిటీతో పాటు ఆకృతులకు సంబంధించిన నిపుణులంతా కలిసి చర్చించి ఒక నిర్ణయానికి రావాల్సి ఉంటుంది.

పోలవరం ప్రాజెక్టులో డిజైన్లు, నిధుల కొరత సమస్య పరిష్కారానికి కేంద్రమంత్రి హామీతో దిల్లీలో బుధవారం రెండు సమావేశాలు నిర్వహించారు. తొలుత కేంద్రమంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్‌, కేంద్ర జలసంఘం ఛైర్మన్‌ ఆర్‌.కె.గుప్తా, ఏపీ జలవనరులశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌, కేంద్ర సలహాదారు వెదిరె శ్రీరాం, పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈవో చంద్రశేఖర్‌ అయ్యర్‌, డీడీఆర్‌సీ ఛైర్మన్‌ పాండ్యా, ఈఎన్‌సీ నారాయణరెడ్డి, చీఫ్‌ ఇంజినీరు సుధాకర్‌బాబు, సలహాదారు ఎం.గిరిధర్‌రెడ్డి, నిర్మాణ సంస్థ మేఘా డైరెక్టర్‌ సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.ఈ సమావేశానికి ముందు మార్చి 10న దిల్లీలో పోలవరం ఆకృతులపై ఓ సమావేశం నిర్వహించారు. అందులో దిగువ కాఫర్‌ డ్యాం ఆకృతులపై సుదీర్ఘ చర్చ జరిగిందని తెలిసింది. ఇప్పటికే దిగువ కాఫర్‌ డ్యాం నిర్మాణానికి ఆకృతుల కమిటీ ప్రతిపాదించిన అంశాల మేరకు డిజైన్లు ఖరారు చేయాలని కేంద్ర మంత్రి నిర్దేశించడంతో వాటికి ఆమోదం లభించింది. ప్రధాన డ్యాం నిర్మాణంలో గ్యాప్‌ 2, గ్యాప్‌ 1 ప్రాంతంలో ఇసుక కోత ఏర్పడటంతో అక్కడ పనులు ఎలా చేపట్టాలనే అంశంలో అనేక ప్రతిపాదనలు ఉన్నాయి. ఈ అంశాన్ని వి.ఎస్‌.రాజు కమిటీతో పాటు డీడీఆర్‌పీ సభ్యులు, ఇతరులు కలిసి కొలిక్కి తేవాలని నిర్దేశించారు. పోలవరం స్పిల్‌ వే వద్ద ఎడమ గట్టు పటిష్ఠం పనులకూ డిజైన్లు ఖరారు చేయాలని సూచించారు. కేంద్రమంత్రితో సమావేశం అనంతరం సాయంత్రం మరోసారి పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈవో చంద్రశేఖర్‌ అయ్యర్‌ ఆధ్వర్యంలో మరో సమావేశం నిర్వహించారు. పోలవరం ఆకృతులపై తుది నిర్ణయానికి రావడానికి ఎలా ముందుకు వెళ్లాలో షెడ్యూలు సిద్ధం చేసినట్లు సమాచారం.

మరిన్ని వివరాలు https://epaper.eenadu.net లో..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని