CM Jagan: రాజధానులపై నిర్ణయం మా హక్కు

‘పరిపాలన వికేంద్రీకరణ మా విధానం.. రాజధానులపై నిర్ణయం మా హక్కు. అది మా బాధ్యత. వికేంద్రీకరణ విషయంలో వెనకడుగు వేయబోం’ అని ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. ‘అన్ని ప్రాంతాలూ అభివృద్ధి చెందేలా పరిపాలన,

Updated : 25 Mar 2022 10:45 IST

పరిపాలన వికేంద్రీకరణ మా విధానం

ఈ విషయంలో వెనకడుగు వేయబోం

హైకోర్టు పరిధి దాటినట్లు అనిపిస్తోంది

సీఆర్‌డీఏ, రాజధానిపై ఇచ్చిన తీర్పు శాసనసభ అధికారాల్ని  ప్రశ్నించేలా ఉంది

రాజధాని నిర్ణయం రాష్ట్రానిదేనని కేంద్రం చెబుతుంటే.. ఆ అధికారం లేదని హైకోర్టు ఎలా అంటుంది?

నెల రోజుల్లో మౌలిక వసతులు, 6 నెలల్లో రాజధాని నిర్మించేయాలని న్యాయ స్థానాలు నిర్దేశించలేవు

ఫలానా చట్టం చేయొద్దని చట్టసభల్ని నియంత్రించలేవు

శాసనసభలో ముఖ్యమంత్రి జగన్‌ వ్యాఖ్యలు

ఈనాడు - అమరావతి

రిపాలన వికేంద్రీకరణ మా విధానం.. రాజధానులపై నిర్ణయం మా హక్కు. అది మా బాధ్యత. వికేంద్రీకరణ విషయంలో వెనకడుగు వేయబోం’ అని ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. ‘అన్ని ప్రాంతాలూ అభివృద్ధి చెందేలా పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణ ప్రక్రియను కొలిక్కి తీసుకురావడంతోపాటు రాజధానికి భూములిచ్చిన రైతుల ప్రయోజనాల్ని కాపాడతాం. వారికి అండగా నిలుస్తాం. అసాధ్యమైనవి సాధ్యం చేయాలని ఏ వ్యవస్థలు, న్యాయస్థానాలు నిర్దేశించలేవు. ఈ వ్యవహారంపై న్యాయ సలహా తీసుకుంటున్నాం. రాజ్యాంగం ప్రకారం ప్రత్యామ్నాయ మార్గాలను ఆలోచిస్తున్నాం. ప్రస్తుతం మూడు రాజధానుల చట్టమే లేదు. దాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకుంది. అయినా ఆ అంశంపై హైకోర్టు తీర్పు ఎలా ఇచ్చింది?’ అని జగన్‌ ప్రశ్నించారు. మూడు రాజధానులపై భవిష్యత్తులో మరింత మెరుగైన చట్టాన్ని తీసుకొస్తామని.. అది రాకూడదంటూ ముందే నిరోధిస్తూ న్యాయస్థానాలు ఆదేశించజాలవని, శాసన వ్యవస్థను నియంత్రించలేవని పేర్కొన్నారు. ఫలానా చట్టం చేయొద్దని చట్ట సభలను న్యాయస్థానాలు నియంత్రించలేవని చెప్పారు. శాసనసభలో గురువారం పరిపాలన వికేంద్రీకరణ అంశంపై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడారు.

‘రాష్ట్ర రాజధాని, సీఆర్‌డీఏ చట్టానికి సంబంధించి ఇటీవల హైకోర్టు ఇచ్చిన తీర్పు.. శాసనసభ అధికారాలను ప్రశ్నించేలా, వాటిని హరించేలా ఉంది. ఈ తీర్పు దేశ సమాఖ్య స్ఫూర్తికి, శాసనసభ అధికారాలకు పూర్తి విరుద్ధం.

* రాజ్యాంగం ప్రకారం చూసినా రాజధాని వ్యవహారంలో కేంద్రానికి ఎలాంటి పాత్ర లేదు. రాజధాని ఎక్కడ ఉండాలనేది సంపూర్ణంగా రాష్ట్ర ప్రభుత్వ అధికారమేనని అధికరణ-3ను ప్రస్తావిస్తూ కేంద్రమే హైకోర్టులో అఫిడవిట్‌ వేసింది. హైకోర్టు ఎక్కడ ఉంటే అక్కడే రాజధాని అనే వాదనను తిరస్కరిస్తూ గతంలో అదనపు అఫిడవిట్‌ దాఖలు చేసింది. రాజధాని నగరాల్ని ఆయా రాష్ట్రాలే నిర్ణయిస్తాయని, కేంద్రానికి అందులో ఎలాంటి పాత్ర లేదని తెదేపా ఎంపీ కేశినేని నాని అడిగిన ప్రశ్నకు పార్లమెంటులో కేంద్రం సమాధానం ఇచ్చింది.

* రాజధాని నిర్ణయాధికారం రాష్ట్ర ప్రభుత్వానిదేనని కేంద్రం స్పష్టంగా చెబుతున్నప్పుడు ఆ అధికారం రాష్ట్రానికి లేదని హైకోర్టు అనడం ఎంతవరకు సమంజసమో ఆలోచించాలి.

అవాంఛనీయ సంఘర్షణే

రాజధాని వికేంద్రీకరణ విషయంలో చట్టసభకు తీర్మానం చేసే అధికారం లేదని హైకోర్టు తీర్పులో చెప్పారు. ఇలా అనడం గౌరవ న్యాయస్థానం తన పరిధి దాటి శాసన వ్యవస్థ వ్యవహారాల్లోకి ప్రవేశించడమే. ఇది అవాంఛనీయమైన సంఘర్షణే.

* ప్రజాస్వామ్యంలో శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలు వాటి పరిధిలో వాటి అధికారాలకు లోబడి పని చేయాలి. మరో వ్యవస్థలో జోక్యం చేసుకోకుండా, మరో వ్యవస్థపై పెత్తనం చేయకుండా పని చేయాలని రాజ్యాంగంలో ఉంది. అయితే రాష్ట్ర హైకోర్టు పరిధి దాటినట్లు అనిపిస్తోంది. అందుకే ఆ అంశంపై సభలో చర్చిస్తున్నాం.

హైకోర్టును, దాని అధికారాల్ని అగౌరవపరచడానికి ఈ చర్చ పెట్టలేదు. మాకు హైకోర్టు పట్ల చాలా గౌరవం ఉంది. అదే సమయంలో రాష్ట్ర అసెంబ్లీకి ఉన్న గౌరవాన్ని, అధికారాలను కాపాడుకోవాల్సిన బాధ్యత శాసన వ్యవస్థపై ఉంది. శాసన వ్యవస్థ కొన్ని దశాబ్దాలుగా ఉంది. ఇది మనతో ఆగిపోయేది కాదు. ఎవరో అనుకూలంగా వ్యవహరిస్తే మనం ఇక్కడికి రాలేదు. ప్రజలు ఓటు ద్వారా ఎన్నుకుంటే మనమంతా ఇక్కడికి వచ్చాం. ఈ గౌరవాన్ని, ఈ అధికారాలను మనం కాపాడుకోలేకపోతే మనం ప్రశ్నించకపోతే ఆ తర్వాత.. శాసన వ్యవస్థకు అర్థమే లేకుండా పోయే పరిస్థితి తలెత్తుతుంది. ఇప్పుడు ఈ అంశంపై మనం చర్చించకపోతే చట్టాలు ఎవరు చేస్తారు? శాసన వ్యవస్థ చేస్తుందా? న్యాయ వ్యవస్థ చేస్తుందా? అనేది చరిత్రలో ప్రశ్నార్థకంగా మిగిలిపోతుంది.

చట్టాలు చేసే అధికారం శాసన వ్యవస్థది. అది కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థ పని కాదు. మంచి చట్టాలు తీసుకొస్తే ప్రజలు మళ్లీ అదే ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు. అవి వారికి నచ్చకపోతే అయిదేళ్లకోసారి ఓటు హక్కును వినియోగించుకుని ఇంటికి పంపేస్తారు. గత ప్రభుత్వం చేసిన విధానాలు, చట్టాలు ప్రజలకు నచ్చలేదు కాబట్టే.. మాకు మొత్తం 175కు గానూ 151 సీట్లు వచ్చాయి.

ఆచరణ సాధ్యం కాని తీర్పులిస్తారా?

రాజధానిలో నెల రోజుల్లోగా కనీస మౌలిక వసతులు, ఆరు నెలల్లోగా మిగతా నిర్మాణాలు పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశాలిచ్చింది. ఇది సాధ్యమేనా? ఆచరణ సాధ్యం కాని విధంగా తీర్పు ఉండకూడదని గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. అందుకు విరుద్ధంగా హైకోర్టు తీర్పు ఇచ్చింది.

రాజధాని నగర బృహత్‌ ప్రణాళికను రూపొందించి ఆరేళ్లైంది. అందులోని అంశాలన్నీ గ్రాఫిక్స్‌ రూపంలో కాగితాలపైనే ఉన్నాయి. 2016 ఫిబ్రవరిలో 20 ఏళ్ల కాలపరిమితితో ఈ బృహత్‌ ప్రణాళికను నోటిఫై చేశారు. ప్రతి అయిదేళ్లకోసారి సమీక్షించాలని అందులో రాశారు. 20 ఏళ్లలో అది అమలు కాదనే విషయం అందరికీ తెలుసు. బృహత్‌ ప్రణాళిక ప్రకారం రాజధానిలో రోడ్లు, డ్రైనేజీలు, నీళ్లు, విద్యుత్తు వంటి కనీస మౌలిక సదుపాయాల కల్పనకు ఎకరాకు రూ.2 కోట్ల చొప్పున 54 వేల ఎకరాలకు రూ.1.09 లక్షల కోట్లు కావాలని అప్పట్లో వారు అంచనా వేశారు. ఈ ఆరేళ్లలో అది గణనీయంగా పెరిగింది.

పెరుగుతున్న ధరల్ని పరిగణనలోకి తీసుకుంటే రాజధాని నిర్మాణానికి కనీసం 40 ఏళ్లు పడుతుంది. హైదరాబాద్‌ సహా ఏ రాజధాని నగరాన్ని తీసుకున్నా ప్రస్తుతమున్న స్థితికి అవి చేరడం వెనుక శతాబ్దాల కృషి ఉంది.

వికేంద్రీకరణ మినహా మరో మార్గం లేదు..

వికేంద్రీకరణకు కట్టుబడి ఉన్నాం. అన్ని ప్రాంతాల అభివృద్ధి, అందరి ఆత్మగౌరవం అందులో ఉంది. అడ్డంకులు ఎదురైనా అదే సరైన మార్గం. అందరికీ మంచి చేసేందుకే ప్రభుత్వం ఉంది. ఈ చట్టసభకు సర్వాధికారాలతోపాటు రాబోయే తరాల గురించి ఆలోచించాల్సిన బాధ్యత ఉంది కాబట్టే వికేంద్రీకరణకు కట్టుబడి ఉన్నాం. వికేంద్రీకరణ బాటలో సాగటం మినహా మరో మార్గం లేదు.

అభివృద్ధి లేకపోవడంవల్ల తొలి దశ తెలంగాణ ఉద్యమం రాగా.. రాష్ట్ర విభజనకు దారితీసిన రెండోదశ ఉద్యమం అభివృద్ధి అంతా ఒకేచోట కేంద్రీకృతం కావడం వల్లే వచ్చిందని జస్టిస్‌ శ్రీకృష్ణ కమిటీ పేర్కొంది. వికేంద్రీకరణతోనే ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రాంతాలకూ న్యాయం జరుగుతుందని శివరామకృష్ణన్‌ కమిటీ చెప్పింది. గతంలో మూడు రాజధానుల బిల్లులు ప్రవేశపెట్టినప్పుడు మా ప్రభుత్వం చెప్పిన మాటకు ఇప్పటికీ కట్టుబడే ఉన్నాం.

న్యాయస్థానాలు ఈ డొమైన్‌లోకి రాకూడదు

చట్టసభల్లో ఉన్న ప్రతి ఒక్కరూ అయిదేళ్లకోసారి స్క్రూటినికీ వెళ్లాలి. ధర్మాన ప్రసాదరావు అన్నట్లు గత ప్రభుత్వం చేసిన విధానాలు, చట్టాలు ప్రజలకు నచ్చలేదు కాబట్టే ఈ రోజు మాకు 151 అంటే 86% సీట్లు ఇచ్చారు. శాసనసభలో ఉన్నవారిని, పార్లమెంటులో ఉన్నవారిని అయిదేళ్లకోసారి ప్రజలు పరీక్షిస్తారు. వారు అర్హత సాధించారా.. లేదా అన్న విషయంలో మార్కులిస్తారు. ఇది ప్రజాస్వామ్యం గొప్పతనం. న్యాయస్థానాలు ఈ డొమైన్‌లోకి రాకూడదు’ అని జగన్‌ వ్యాఖ్యానించారు.


రాజధాని వ్యవహారంలో కేంద్రానికి ఎలాంటి పాత్ర లేదు. తనకు పాత్ర ఉందని, అది తన అధికారమని కేంద్రం ఎప్పుడూ చెప్పలేదు. ఏ కోర్టులోనూ అలా వాదించలేదు. రాజధాని ఎక్కడ ఉండాలనేది సంపూర్ణంగా రాష్ట్ర ప్రభుత్వ అధికారమేనని పలు సందర్భాల్లో స్పష్టం చేసింది.

అమరావతిలో నెల రోజుల్లోగా రూ.లక్ష కోట్లు ఖర్చు చేసి రోడ్లు, డ్రెయిన్లు, విద్యుత్తు, నీరు వంటి మౌలిక సదుపాయాలను కల్పించాలని, 6 నెలల్లోగా అయిదారు లక్షల కోట్లు ఖర్చు చేసి రాజధాని కట్టేయాలని న్యాయస్థానాలు చెప్పలేవు. ఇలా అసాధ్యమైన కాల వ్యవధుల్ని ఏ న్యాయస్థానాలూ నిర్దేశించలేవు.

శాసనసభలో ముఖ్యమంత్రి జగన్‌


రాజధాని ప్రాంతం రాష్ట్రంలో 0.000001 శాతమే

2016 నుంచి 2019 మధ్య చంద్రబాబు అమరావతి కోసం కేవలం రూ.5వేల కోట్లే ఖర్చు చేశారు. ఏ ప్రభుత్వానికైనా అంతకంటే ఎక్కువ ఖర్చుపెట్టడం సాధ్యం కాని పని.

* రాజధాని ప్రాంతం రాష్ట్రం మొత్తంలో  0.000001 శాతమే. 99.999999 శాతం మిగతా ప్రాంతం ఉంది. అభివృద్ధి, సంక్షేమం పనులు చూసుకుంటూ రాజధానిపై భారీగా ఖర్చు పెట్టడం ఏ ప్రభుత్వానికైనా ఎంతవరకు సాధ్యం? మిగతా రాష్ట్రమంతా సంక్షేమం, అభివృద్ధి వైపు చూస్తోంది. వాటికి డబ్బులు ఖర్చు పెట్టాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. అది రాష్ట్ర ప్రభుత్వ ఎజెండా కూడా. ఇది రాజధాని అని చెప్పి.. ఈ ఒక్కచోటే డబ్బులు పెట్టటం సరికాదు.


విజయవాడలోనో, గుంటూరులోనో రాజధాని కట్టేసుంటే దానంతట అదే పెరిగేది

ఇక్కడ కూర్చుని భావోద్వేగ నిర్ణయాలు తీసుకోవడం కాదు. ఓట్ల కోసం ఊహాజనితమైన గ్రాఫిక్స్‌ చూపించో.. భావోద్వేగాల్ని రెచ్చగొట్టడం వల్లో రాజకీయ నాయకుడు ఎప్పుడూ నాయకుడు కాలేడు. విజన్‌ ఉండాలి. అది ప్రజలకు వివరించగలగాలి. నిజంగా నాకు సాధ్యపడితే ఎందుకు చేయను? కానీ సాధ్యమయ్యే పరిస్థితి ఉందా?

చంద్రబాబుకు నిజంగా అమరావతి ప్రాంతంపై ప్రేమ లేదు. ఆయనకు ప్రేమ ఉంటే విజయవాడలోనో, గుంటూరులోనో రాజధాని వచ్చేది. ఆ నగరాల్లో 500 ఎకరాల్లోనో, వెయ్యి ఎకరాల్లోనో కట్టాల్సినవి కట్టేసి ఉంటే రాజధాని దానంతట అదే పెరిగేది. కానీ చంద్రబాబు అలా చేయలేదు. తాను, తన బినామీలు భూములు ముందుగానే కొనుక్కుని ఆయా నగరాలకు 40కి.మీ. దూరంలోని ప్రాంతాన్ని రాజధాని అంటున్నారు. అక్కడ కనీస మౌలిక సదుపాయాలు లేవు.

* నాకు ఈ ప్రాంతంపై నిజంగా ప్రేమ ఉంది. అందుకే ఇక్కడే ఇల్లు కట్టుకున్నా. ఇక్కడే శాసన రాజధాని కొనసాగుతుందని చెబుతున్నా. నాకు ఈ ప్రాంతంపై ప్రేమ లేకపోతే శాసన రాజధాని ఇక్కడే ఉండాలని ఎందుకు తాపత్రయపడతాను?


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని