Chandrababu: ఇష్టం వచ్చినట్లు చేస్తామంటే ఎలా?

‘రాష్ట్రంలో మళ్లీ మూడు ముక్కలాట ఆడుతున్నారు. రాష్ట్ర భవిష్యత్తుపై విషం చిమ్ముతున్నారు. అమరావతి రాజధానిపై హైకోర్టు స్పష్టంగా తీర్పు చెప్పిన తర్వాత అసెంబ్లీలో నాలుగున్నర గంటల పాటు సుదీర్ఘ చర్చ జరిపారు. రాజ్యాంగం

Updated : 25 Mar 2022 09:29 IST

వితండవాదం కాదు... విధానం పాటించండి

న్యాయస్థానాల పవిత్రత కాపాడకుండా ఇలాంటి మాటలా?

నేరచరితులు ఇంతకన్నా ఏం మాట్లాడతారు?

సుప్రీంకోర్టుకు వెళ్లండి... వారి తీర్పే ఎవరికైనా శిరోధార్యం

కోర్టు తీర్పులతో రాజీనామాలు చేసిన ముఖ్యమంత్రులున్నారు

3 రాజధానులపై మాట్లాడే నైతిక హక్కు జగన్‌కు ఉందా?

అమరావతిని ఆ రోజు శాసనసభలో సమర్ధించలేదా?

రాజీనామా చేసి ప్రజాభిప్రాయం కోరండి

తెదేపా అధినేత చంద్రబాబు

ఈనాడు - అమరావతి

రాష్ట్రంలో మళ్లీ మూడు ముక్కలాట ఆడుతున్నారు. రాష్ట్ర భవిష్యత్తుపై విషం చిమ్ముతున్నారు. అమరావతి రాజధానిపై హైకోర్టు స్పష్టంగా తీర్పు చెప్పిన తర్వాత అసెంబ్లీలో నాలుగున్నర గంటల పాటు సుదీర్ఘ చర్చ జరిపారు. రాజ్యాంగం ప్రకారం ఏ వ్యవస్థ స్వతంత్రత వారిదే. ఎక్కడ ఎవరు ఏది అతిక్రమించినా, రాజ్యాంగాన్ని ఎవరు ఉల్లంఘించినా సరిచేసే బాధ్యత న్యాయవ్యవస్థదే. హైకోర్టు తీర్పుతో ఏకీభవించకపోతే సుప్రీంకోర్టుకు వెళ్లవచ్చు. అక్కడ ఏది చెబితే అదే ఫైనల్‌. ఎవరైనా అది అనుసరించాల్సిందే. అలాంటి విధానం ఉండగా ఇలా వితండవాదం చేయకూడదు. కోర్టు తీర్పులతో రాజీనామా చేసిన ముఖ్యమంత్రులున్నారు. న్యాయస్థానాల పవిత్రతనూ లెక్కపెట్టకుండా ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. నేరచరిత్ర ఉన్న వ్యక్తులు ఇంతకన్నా ఏం మాట్లాడతారు?’ అని తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాజధాని అమరావతి అంశంలో నమ్మక ద్రోహం చేసిన ముఖ్యమంత్రి జగన్‌కు పాలించే అర్హత లేదని, రాజీనామా చేసి మళ్లీ ప్రజాభిప్రాయం కోరాలని డిమాండు చేశారు. రాజ్యాంగ వ్యవస్థలు, స్వతంత్రతపై మాట్లాడుతున్న సీఎం ఎన్నికల సంఘం, సీబీఐ, శాసనమండలి విషయంలో ఏం చేశారు? ఏం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాష్ట్ర హైకోర్టు తీర్పుపై శాసనసభలో చర్చ జరిగిన నేపథ్యంలో చంద్రబాబు గురువారం రాత్రి విలేకరులతో మాట్లాడారు. ‘ఈ దేశంలో ఎవరైనా గుర్తు పెట్టుకోవాల్సింది రాజ్యాంగం. ప్రాథమిక హక్కులు, ప్రాథమిక బాధ్యతలు. ప్రభుత్వాలు ఎలా వ్యవహరించాలి? ఎవరు ఏ చట్టాలు చేయాలి? రాజకీయ పార్టీలు ఎలా ఉండాలి? శాసనసభ, పార్లమెంటు, కార్యనిర్వాహకవర్గం ఏం చేయాలి? అన్నీ స్పష్టంగా ఉన్నాయి. నాలుగో స్తంభం మీడియా. తప్పులు చేస్తే నిలదీసి వారధిలా పని చేస్తుంది. ఇక్కడ ఇందులో ఎవరు తమ పరిధిని అతిక్రమించినా సరిచేసే బాధ్యత న్యాయవ్యవస్థదే. కింది కోర్టు తీర్పులమీద పై కోర్టుకు వెళ్లండి. మీ వాదన వినిపించండి. వారి నిర్ణయం శిరోధార్యం కావాలి. అలా కాకుండా మీ ఇష్టమొచ్చినట్లు చేస్తానంటే ఎలా? ఎవ్వరూ మాట్లాడకూడదంటే ఎలా? చట్టసభల్లో ఉన్న మనం గౌరవంగా వ్యవహరించాలి. ఒక వ్యవస్థను మరో వ్యవస్థ గౌరవించుకుంటే తప్ప రాజ్యాంగం సక్రమంగా నడవదు. మీ పరిధిలో మీరు వ్యవహరించాలి. గౌరవాన్ని కాపాడుకోవాలని సీఎంను, ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా.

రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లండి

అసలు మూడు రాజధానుల గురించి మాట్లాడే నైతిక హక్కు జగన్‌కు ఉందా? 2016లో శాసనసభలో ఏం చెప్పారు? గుంటూరు, విజయవాడ మధ్య రాజధాని అని ప్రకటించిన రోజు శాసనసభలో జగన్‌ ఉన్నారు కదా? 30వేల ఎకరాల భూమి సరిపోదు.. ఇంకా ఎక్కువ కావాలన్నారు కదా? ఆ రోజు మూడు రాజధానుల గురించి ఎందుకు చెప్పలేదు? అప్పుడు ఓట్లపై ప్రేమ. ఆయన ఇక్కడే కాదు.. బెంగళూరు, హైదరాబాద్‌లోనూ ఇళ్లు కట్టుకున్నారు. విశాఖలో కట్టుకుంటున్నారు. ఇడుపులపాయలో ఇల్లు ఉంది. అలాగని ఇడుపులపాయకు రాజధాని తీసుకువెళ్లగలరా? ఆ రోజు మీ ఎమ్మెల్యేలు ఏం చెప్పారు? తమ నాయకుడు ఇక్కడే ఇల్లు కట్టుకుంటున్నారని, రాజధాని ఎక్కడికి వెళ్లదని చెప్పలేదా?  ఇప్పుడు మళ్లీ మూడు ముక్కలు అంటున్నారు. కావాల్సింది అభివృద్ధి వికేంద్రీకరణ, పాలన వికేంద్రీకరణ కాదు. మోసాలు చేయడంలో జగన్‌ దిట్ట. రాష్ట్రానికి నమ్మక ద్రోహం చేసిన ఈయనకు పాలించే హక్కు ఉందా? రాజీనామా చేయండి. అసెంబ్లీ రద్దుచేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లండి.

ఇష్ట ప్రకారం చట్టాలు చేస్తారా?

ప్రజల హక్కులు కాపాడేందుకు శాసనాలు చేసే హక్కును రాజ్యాంగం ఇచ్చింది. రాజ్యాంగబద్ధంగా వచ్చినవే శాసన, కార్యనిర్వహక, న్యాయవ్యవస్థలు. రాజ్యాంగబద్ధంగా వచ్చిందే సీబీఐ. శాసనమండలి, శాసనసభ ఇవన్నీ స్వతంత్రమైనవే. ప్రజలు ప్రతి ఒక్కరికీ నిర్దిష్ట హక్కులు ఇచ్చారు. మీకు అధికారం ఇచ్చింది రాజ్యాంగబద్ధంగా చట్టం చేయడానికే తప్ప.. మీ ఇష్టప్రకారం చట్టాలు చేయడానికి కాదు. అదే అసెంబ్లీలో అమరావతిపై చట్టం చేశాం. ఆ చట్టాన్ని ఉల్లంఘించడానికి జగన్‌ ఎవరు? శివరామకృష్ణన్‌ గుంటూరు, విజయవాడ రెండూ ప్రతిపాదించారు. ఆ రెండింటి మధ్య రాజధాని పెట్టాం. అప్పుడు అంగీకరించిన జగన్‌ ఇప్పుడు మార్చడమేంటి? సమాధానం చెప్పాలి. దేశంలో అన్ని రాష్ట్రాలవారూ ఇష్టప్రకారం చేస్తారా? రాజ్యాంగాన్ని, కోర్టులు చెప్పినదాన్ని అనుసరించరా? న్యాయవ్యవస్థ స్వతంత్రమైనది. దీనిపై చాలా చర్చలు జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం న్యాయవ్యవస్థను గుప్పిట్లో పెట్టుకోవాలనుకుంటే న్యాయం జరగదు.

రాజ్యాంగ వ్యవస్థలను నాశనం చేయలేదా?

రాష్ట్రంలో మూడేళ్లుగా రాజ్యాంగ వ్యవస్థలను నాశనం చేశారు. ఎన్నికల సంఘం స్వతంత్ర వ్యవస్థ. ఆ సంస్థ మీద మీరు చర్యలు తీసుకున్నప్పుడు రాజ్యాంగం ఏమైంది? అలాంటి పరిస్థితుల్లో రాజ్యాంగాన్ని రక్షించడం కోర్టుల బాధ్యత కాదా? శాసనమండలిని రద్దుచేస్తామని చెప్పారు. మండలిలో అమరావతి విషయం చర్చకు వస్తే కమిటీకి పంపాలని నిర్ణయించారు. దీంతో మండలినే రద్దు చేస్తూ తీర్మానం చేసి దిల్లీకి పంపించారు. మళ్లీ మండలిలో మెజారిటీ వచ్చిందని అది ఉంటుందని చెబుతున్నారు. ఇంతకన్నా నీతిమాలిన చర్య ఏముంటుంది? ఇది మండలిపై దాడి కాదా? సీబీఐపై మీరు కేసు పెడతారా? అలా పెడితే హైకోర్టు మిమ్మల్ని వదిలిపెట్టాలా? మరి ఎవరు కాపాడాలి? న్యాయమూర్తులపై సామాజిక మాధ్యమాల్లో అసభ్య పోస్టులు పెడుతుంటే ఏం చెప్పాలి? ఒక ఎంపీని జ్యుడిషియల్‌ కస్టడీలో చంపే ప్రయత్నం చేస్తారా? ఇలాంటి పరిస్థితుల్లోనూ న్యాయస్థానాలు జోక్యం చేసుకోకూడదా? రాజ్యాంగం ప్రాథమిక హక్కులు ఇచ్చింది. మాట్లాడే హక్కు, ఆస్తి హక్కు ఇచ్చింది. స్వేచ్ఛగా తిరిగే హక్కు ఉంది. అలాంటి హక్కులు కాలరాసి, తప్పుడు కేసులు పెట్టి వేధిస్తామంటే కోర్టులు మాట్లాడకూడదా? అసెంబ్లీయే సుప్రీం అంటూ అందరికీ మరణశిక్షలు వేస్తారా? జైలు సూపరింటెండెంట్లను పెట్టుకుని మనుషులు లేకుండా చేస్తారా? పరిటాల రవీంద్ర కేసులో సాక్షులను ఎక్కడికక్కడ తప్పించే పరిస్థితికి వచ్చారు. టెర్రరిస్టు పాలన జరిగింది. ప్రజావేదిక కూల్చారు. మీకు ఆ అధికారం ఎవరిచ్చారు? ఒక విధానం పాటించక్కర్లేదా? ప్రజలు మెజారిటీ ఇస్తే చట్టాలు చేయవచ్చు. విధ్వంస చట్టాలు చేయకూడదు.

రాజధానికి లక్షల కోట్లు కావాలన్నది తప్పు

అమరావతి రాజధాని సొంతంగా వనరులు సమకూర్చుకునే ప్రాజెక్టు. రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చే ప్రాజెక్టుకు, సెల్ప్‌ ఫైనాన్సు ప్రాజెక్టుకు మధ్య తేడా తెలియని వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండటం మన దౌర్భాగ్యం. అలాంటి వ్యక్తి రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తుంటే ఏం చెప్పాలి. తొలిదశలో రూ.55,303 కోట్లు, రెండోదశలో రూ.54వేల కోట్లు మొత్తం కలిపి 1,09,303 కోట్లు. దేనికి ఎప్పుడు ఎలా ఖర్చు పెట్టాలనేది ప్రాజెక్టు నివేదిక ఉంది. ఒక అభివృద్ధి జరిగిందంటే అందులో నుంచి 30-40% ఆదాయం వస్తుంది. అది అభివృద్ధి అంటే. మరోవైపు 2025, 2026 నాటికి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయాల్సింది రూ.12 వేల కోట్లే. ఇదంతా పూర్తయ్యాక 10 వేల ఎకరాలు మిగులుతుంది. ఒకప్పుడు కోకాపేటలో ఎకరం రూ.లక్ష ఉంటే  ఇప్పుడు రూ.60 కోట్లు అయింది. అది సంపద సృష్టి. ఇక్కడ ఆ రోజే ఎకరం రూ.10 కోట్లు ఉంది. ఈ రోజు పెరిగిన ధర లెక్కిస్తే 3 లక్షల కోట్లు. ఒక్క రూపాయి కూడా పెట్టక్కర్లేదు. పదే పదే జగన్‌ అదే మాట్లాడుతున్నారు. రాజధాని నిర్మాణానికి రూ. లక్షల కోట్లు ఇంట్లో నుంచి తీసుకువచ్చి పెట్టాలని చెబుతున్నారు. ఇది మోసం తప్ప మరొకటి కాదు. ఈయన జగన్‌మోహన్‌ రెడ్డి కాదు.. జగన్‌ మోసం రెడ్డి.

కౌరవులూ 100 మందే...

ప్రజలు మాకు అధికారం ఇచ్చారు. 151 మంది ఎమ్మెల్యేలం ఉన్నాం. చట్టాలు ఏదైనా చేస్తామంటే కుదురుతుందా? కౌరవులూ 100 మంది ఉన్నారు. పెద్ద సైన్యం ఉంది. పెద్ద సామ్రాజ్యం ఉందనుకున్నారు. చివరికి ఏమయింది? ధర్మం గెలిచింది. ప్రజలు తలుచుకుంటే సున్నా మిగులుతుంది. ఎప్పటికైనా ధర్మానిదే గెలుపు’ అని చంద్రబాబు పేర్కొన్నారు.


హైకోర్టు తీర్పులో తప్పేముంది?

అమల్లో లేని చట్టంపై తీర్పు ఎలా ఇస్తారని ప్రభుత్వం అంటోంది. సీఆర్‌డీఏ, ప్రభుత్వం తమతో చేసుకున్న ఒప్పందం అమలు చేయాలని రైతులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఇన్నేళ్లయినా ఒప్పందం అమలు చేయకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నామని న్యాయస్థానాన్ని ఆశ్రయించే హక్కు రైతులకు లేదా? ఆ ఒప్పందం అమలు చేయాలని హైకోర్టు తీర్పు ఇవ్వడంలో తప్పేముంది? ఇద్దరు ఒప్పందం చేసుకుంటే ఏకపక్షంగా ఏ ఒక్కరూ వెనక్కి వెళ్లడానికి లేదు. రాజధాని ఇక్కడే ఉంటుందని, అన్ని సంస్థలూ వస్తాయని సీఆర్‌డీఏ మాట ఇచ్చింది. రైతులు భూములు ఇచ్చేందుకు అంగీకరించి ఒప్పందం చేసుకున్నారు. రైతులు భూములు ఇవ్వబోమని ఇప్పుడు ఏకపక్షంగా అంటే అంగీకరించగలమా? అలాగే సీఆర్‌డీఏ, ప్రభుత్వమూ ఆ ఒప్పందం నుంచి వెనక్కి వెళ్లగలవా? ఒప్పందం ఉల్లంఘించి రాష్ట్ర ప్రభుత్వమే విశ్వసనీయతను పోగొట్టుకుంది. పైగా తమపైౖ దాడులు చేసి  హక్కులు కాలరాసిందని రైతులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఆర్టికల్‌ 226 కింద న్యాయస్థానాలు జోక్యం చేసుకునే హక్కు ఉందని హైకోర్టు చెప్పింది. అందులో తప్పేముంది? రైతులకు ప్రాథమిక హక్కు లేదా? ఎవరి హక్కులకు భంగం కలిగినా న్యాయస్థానానికి వెళ్లమా? ఒప్పందంలోని 9.1 నిబంధన ప్రకారం నిర్దిష్ట కాలపరిమితిలో ప్లాట్లు అభివృద్ధి చేసి ఇవ్వాలని కోర్టు చెప్పింది. కోర్టు తీర్పు చెప్పాకైనా ప్రభుత్వం పనులు చేయడానికి ముందుకు వెళ్లిందా?

ఆర్టికల్‌ 258 (3) ప్రకారం ఒక రాజధానిని నెలకొల్పేందుకు శాసనసభకు పార్లమెంటు ఇచ్చిన అధికారాన్ని ఏపీ శాసనసభ వినియోగించుకుని అమరావతిని ఏపీ రాజధానిగా ఏకగ్రీవంగా ఎంచుకుంది. మళ్లీ చట్టం చేయడానికి, మార్చడానికి, విభజించడానికి శాసనసభకు అధికారం లేదు. ఆర్టికల్‌ 4 కింద ఈ విషయంలో సర్వ హక్కులూ పార్లమెంటుకు ఉన్నాయి. చట్టం చేసే హక్కు శాసనసభకు ఉంటుంది. అది ఒకసారి వినియోగించుకున్నాం. అందులో జగన్‌ కూడా భాగస్వామే. 258(2) కింద అది ఒకసారి సంక్రమించే అధికారమని రాజ్యాంగంలో స్పష్టంగా ఉంది. అదే విషయం హైకోర్టు చెప్పింది. ఈ రాష్ట్ర ప్రజలపై అభిమానం ఉంటే, విచక్షణ ఉంటే మాట మాట్లాడకుండా ఒప్పందం ప్రకారం పనులు చేసి ఉండాలి. కానీ, మూర్ఖత్వంతో వ్యవహరిస్తున్నారు. తాము ఏం చేసినా చెల్లుతుందని అనుకుంటున్నారు. అమరావతి 5 కోట్ల ప్రజల సమస్య.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని