‘నా స్థలాన్నీ కాజేయాలని చూస్తున్నారు’: విశాఖ ఎంపీపై ఇంటెలిజెన్స్‌ ఎస్పీ మధు ఆరోపణ

విశాఖ నగరం మధురవాడ బక్కన్నపాలెం ప్రాంతంలో గాయత్రి నగర్‌ నుంచి సాయిప్రియ లేఅవుట్‌కు వెళ్లే మార్గంలోని రోడ్డును మూసేసి, దాని మధ్యలో ఇనుప రేకులతో ప్రహరీ నిర్మించడం వివాదాస్పదమవుతోంది. ఈ రోడ్డుకు బదులుగా

Updated : 28 Mar 2022 09:17 IST

 మురుగునీటి కాలువపై అనుమతి లేకుండానే కల్వర్టు నిర్మాణం

  పోలీసులకు ఫిర్యాదు

ఈనాడు-విశాఖపట్నం, పీఎంపాలెం-న్యూస్‌టుడే: విశాఖ నగరం మధురవాడ బక్కన్నపాలెం ప్రాంతంలో గాయత్రి నగర్‌ నుంచి సాయిప్రియ లేఅవుట్‌కు వెళ్లే మార్గంలోని రోడ్డును మూసేసి, దాని మధ్యలో ఇనుప రేకులతో ప్రహరీ నిర్మించడం వివాదాస్పదమవుతోంది. ఈ రోడ్డుకు బదులుగా మురుగు కాలువపై అనుమతి లేకుండానే కల్వర్టు నిర్మించారు. దానికి ఆనుకుని ఉన్న తన స్థలంలో నిర్మాణ పనులు చేపట్టగా ఎంవీవీ వెంచర్స్‌కు చెందిన మనుషులు అడ్డుకుని బెదిరింపులకు పాల్పడ్డారంటూ ఇంటెలిజెన్స్‌ ఎస్పీ మధు ఆరోపిస్తున్నారు. ఐపీఎస్‌ అధికారినైన తన స్థలానికే దిక్కు లేకపోతే సామాన్యుల పరిస్థితేంటని ప్రశ్నించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పిన మధు.. ఆదివారం ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. ‘గాయత్రినగర్‌ రోడ్డు నంబరు 9లో మా కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి గతంలో 168 గజాల స్థలం కొన్నాం. చాలాకాలంగా ఖాళీగా ఉంది. ఇటీవలే ఇంటి నిర్మాణం కోసం జీవీఎంసీ అనుమతి తీసుకున్నాం. అందులో కొంత స్థలం ప్రభుత్వానిది ఉంటే మిగిలిన ప్రాంతంలోనే పనులు ప్రారంభించాం. పునాదులు తవ్వేందుకు మట్టి పనులు మొదలుపెట్టగా ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు చెందిన సిబ్బంది వచ్చి కార్మికులపై బెదిరింపులకు దిగారు. కష్టార్జితంతో కొనుగోలు చేసిన స్థిరాస్తిలో నా ప్రమేయం లేకుండానే రోడ్డు వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. పైగా ఎలాంటి పనులూ చేయొద్దని హెచ్చరించారు. గతంలోనే ఈ లేఅవుట్‌లో ప్రజల అవసరాలకు కోసం వేసిన రోడ్డును కబ్జా చేశారు. జీవీఎంసీ నిర్మించిన మురుగు కాలువలనూ ఆక్రమించారు. వెంచర్‌కు నైరుతి వైపున మురుగు కాలువపై అనధికారికంగా వంతెన నిర్మించారు. అక్కడి నుంచి మా స్థలం మీదుగా రోడ్డు వేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఎంవీవీ మనుషులమంటూ వచ్చిన వారి కారణంగా నా ఇంటి నిర్మాణం నిలిచిపోయింది. నాకు న్యాయం చేయాలి’ అని ఎస్పీ కోరారు. ఎంపీ తన వెంచర్‌ కోసం అన్యాయంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.


స్థానికులు ఫోన్‌ చేస్తే పోలీసులతో చెప్పించా..

అప్రూవ్డ్‌ లేఅవుట్‌ రోడ్డులో గోడ కడుతున్నారని స్థానిక ప్రజల నుంచి రాత్రి సమయంలో నాకు ఫోన్‌ వస్తే పోలీసులకు చెప్పా. వారు వెళ్లి కార్మికులతో మాట్లాడారు. స్థానికులు ఫిర్యాదు చేస్తే స్పందించకుంటే ఎలా? మా మనుషులెవరూ బెదిరించలేదు. జీవీఎంసీ నుంచి నిర్మాణానికి అనుమతి ఉంటే దర్జాగా నిర్మించుకోవచ్చు. రోడ్డు మూసేశానని ఆరోపిస్తున్న స్థలాన్ని గతంలోనే కొనుగోలు చేశా. జీవీఎంసీ, వీఎంఆర్‌డీఏ ప్రతిపాదించిన రోడ్లు అధికారికంగా అక్కడ లేవు. నా స్థలం మీదుగా ఏదైనా మాస్టర్‌ ప్లాన్‌ రోడ్డు వెళ్లినట్లు ఆధారాలు చూపిస్తే వెంటనే అప్పగిస్తా. అన్నీ తనిఖీ చేసుకునే ప్రహరీ నిర్మించాం.

- ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని