Andhra News: ఆ జిల్లా కేంద్రాలకు నేరుగా బస్సులు లేవు

రాష్ట్రంలో ఏర్పడిన పలు కొత్త జిల్లా కేంద్రాలకు.. అదే జిల్లా పరిధిలోని పలు నియోజకవర్గాలు, వివిధ మండలాల నుంచి నేరుగా చేరుకునేందుకు బస్‌ సర్వీసులు లేవు. వారంతా రెండు, మూడు బస్సులు మారి జిల్లా కేంద్రానికి చేరుకోవాల్సి ఉంటుంది. కొన్ని మండలాలకు.

Updated : 05 Apr 2022 07:27 IST

వారు బస్సు మారి వెళ్లాల్సిందే

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో ఏర్పడిన పలు కొత్త జిల్లా కేంద్రాలకు.. అదే జిల్లా పరిధిలోని పలు నియోజకవర్గాలు, వివిధ మండలాల నుంచి నేరుగా చేరుకునేందుకు బస్‌ సర్వీసులు లేవు. వారంతా రెండు, మూడు బస్సులు మారి జిల్లా కేంద్రానికి చేరుకోవాల్సి ఉంటుంది. కొన్ని మండలాలకు.. కొత్త జిల్లా కేంద్రానికి ఒకటి, రెండు బస్సులు మాత్రమే ఉన్నాయి. ఇపుడు వీటిని కూడా పెంచాల్సిన అవసరం ఏర్పడనుంది.

* కొత్తగా ఏర్పడిన అన్నమయ్య జిల్లాకు రాయచోటి కేంద్రం. రైల్వేకోడూరు నుంచి ఈ మండలానికి నేరుగా చేరుకోవడానికి బస్సులు లేవు. ఇంతకాలం రైల్వేకోడూరు, కడప జిల్లాలో ఉండగా.. తిరుపతి-కడప మధ్య తిరిగే బస్సులన్నీ అందుబాటులో ఉండేవి. ఇప్పుడు రైల్వేకోడూరు నుంచి రాజంపేట వెళ్లి, అక్కడి నుంచి రాయచోటికి మరో బస్సులో వెళ్లాల్సి ఉంటుంది.
* సత్యసాయి జిల్లా కేంద్రమైన పుట్టపర్తికి  మడకశిర నియోజకవర్గం నుంచి నేరుగా బస్సులు లేవు. పెనుకొండ చేరుకొని అక్కడి నుంచి పుట్టపర్తికి రావాలి. రాప్తాడు పరిధిలోని మండలాలైన రామగిరి, కనగానపల్లె, సీకే పల్లి మండలాలకు చెందిన వారు ధర్మవరం వెళ్లి, అక్కడి నుంచి పుట్టపర్తికి చేరుకోవాలి.
* గతంలో ప్రకాశం జిల్లాలో ఉన్న అద్దంకి, మార్టూరు, చీరాల మండలాలు బాపట్ల జిల్లాలోకి వచ్చాయి. అద్దంకి, మార్టూరుకు చెందినవారు చీరాలకు వచ్చి అక్కడి నుంచి బాపట్లకు రావాల్సి ఉంటుంది. సంతమాగులూరు మండలానికి చెందినవారు చిలకలూరిపేట, చీరాల్లో బస్సులు మారి బాపట్లకు చేరుకోవాల్సి ఉంటుంది. గతంలో గుంటూరు జిల్లాలో ఉన్న వేమూరు మండలానికి చెందిన వారికి కూడా బాపట్లకు చేరేందుకు నేరుగా బస్సులు లేవు.
* తూర్పుగోదావరి జిల్లా పరిధిలో ఉన్న చింతూరు, ఏటపాక వంటి మండలాలు మన్యం జిల్లాలో చేరాయి. ఈ జిల్లా కేంద్రమైన పాడేరుకు నేరుగా బస్సులు లేవు. చింతూరు నుంచి పాడేరు 230 కి.మీ. ఉండగా సీలేరు, చింతపల్లి చేరుకొని, అక్కడి నుంచి పాడేరుకు మరో బస్సులో వెళ్లాలి. ఏటపాక మండల వాసులకు పాడేరు 310 కి.మీ. దూరంలో ఉంది. వీళ్లది కూడా అదే పరిస్థితి.

త్వరలో బస్‌ సర్వీసులు
జిల్లా కేంద్రానికి చేరేందుకు బస్‌ సర్వీసులు లేని మార్గాల్లో.. ప్రయాణికుల అవసరాన్ని, స్థానికంగా వచ్చిన అభ్యర్థనలను దృష్టిలో పెట్టుకొని త్వరలో బస్‌ సర్వీసులు తీసుకొస్తామని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. పాత జిల్లా కేంద్రానికి బదులు, ఇపుడు కొత్త జిల్లా కేంద్రానికి వెళ్లేవారు పెరిగితే.. ఆయా రూట్లలో బస్సులను సర్దుబాటు చేస్తామని పేర్కొంటున్నారు.
* కొత్త జిల్లాలకు చివర్లో కొన్ని మండలాల మార్పులు, చేర్పులు జరిగిన నేపథ్యంలో.. ఏయే జిల్లాలో పరిధిలోకి ఎన్ని డిపోలు వచ్చాయనే వివరాలను అధికారులు సోమవారం  ఖరారు చేశారు. అత్యధికంగా తిరుపతి జిల్లాలోకి 10 డిపోలు వచ్చాయి. ఎన్టీఆర్‌ జిల్లాలో 8, విశాఖపట్నం, నెల్లూరు, అనంతపురం, నంద్యాల జిల్లాల్లో ఏడేసి డిపోలు చొప్పున వచ్చాయి. అతి తక్కువగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో పాడేరు ఒక్కటే డిపో ఉంది. అదే విజయనగరం, అనకాపల్లి జిల్లాల్లో రెండు డిపోలు ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని