Vaccination: 18 ఏళ్లు పైబడినవారికి రేపటి నుంచి మూడో డోసు

దేశంలో 18 ఏళ్లు దాటిన వారంతా ఇక కొవిడ్‌ టీకా ముందుజాగ్రత్త (మూడో) డోసు తీసుకోవచ్చు. ఈనెల 10వ తేదీ (ఆదివారం) నుంచి ప్రైవేటు వ్యాక్సినేషన్‌ కేంద్రాల్లో వారంతా టీకాలు పొందవచ్చని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ శుక్రవారం ప్రకటించింది. రెండో డోసు తీసుకుని 9 నెలలు పూర్తయిన

Updated : 09 Apr 2022 06:37 IST

ప్రైవేటు కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ కేంద్రాల్లో అందుబాటులోకి..

దిల్లీ: దేశంలో 18 ఏళ్లు దాటిన వారంతా ఇక కొవిడ్‌ టీకా ముందుజాగ్రత్త (మూడో) డోసు తీసుకోవచ్చు. ఈనెల 10వ తేదీ (ఆదివారం) నుంచి ప్రైవేటు వ్యాక్సినేషన్‌ కేంద్రాల్లో వారంతా టీకాలు పొందవచ్చని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ శుక్రవారం ప్రకటించింది. రెండో డోసు తీసుకుని 9 నెలలు పూర్తయిన తర్వాత ముందుజాగ్రత్త డోసు తీసుకోవడానికి అర్హులవుతారని తెలిపింది. అన్ని ప్రైవేటు టీకా కేంద్రాల్లోనూ మూడో డోసు అందుబాటులో ఉంటుందని వెల్లడించింది. ఇది అదనపు రక్షణ కవచంలా ఉంటుందని సంబంధిత శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ ట్వీట్‌ చేశారు. తొలి రెండు డోసుల కింద ఏ వ్యాక్సిన్‌ను పొందారో మూడో డోసుగా కూడా దాన్నే తీసుకోవాల్సి ఉంటుందని అధికార వర్గాలు తెలిపాయి. కాగా 18 ఏళ్లు పైబడిన వారికి ముందుజాగ్రత్త డోసు వ్యాక్సినేషన్‌కు సంబంధించి తుది మార్గదర్శకాలు వెలువడాల్సి ఉంది.దేశంలో 15 ఏళ్లు దాటినవారిలో ఇంతవరకు 96% మంది కనీసం ఒక డోసు తీసుకున్నట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటనలో పేర్కొంది. 83% మంది రెండు డోసులూ పొందినట్లు తెలిపింది. అలాగే ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు, 60 ఏళ్లు పైబడిన వారికి 2.4 కోట్లకు పైగా ముందుజాగ్రత్త డోసులు అందించినట్లు వెల్లడించింది. 12-14 ఏళ్ల వారిలో 45 శాతం మంది తొలి డోసు తీసుకున్నట్లు పేర్కొంది. ప్రభుత్వ టీకా కేంద్రాల్లో.. మొదటి, రెండో డోసులు; ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు, 60 ఏళ్లు పైబడిన వారికి ముందుజాగ్రత్త డోసులు వేసే కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయనున్నట్లు వెల్లడించింది.

కొవిషీల్డ్‌ ధర రూ. 600
కొవిషీల్డ్‌ ముందుజాగ్రత్త డోసు ధరను రూ. 600గా సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా శుక్రవారం వెల్లడించింది. టీకా తీసుకునేవారు ఈ ధర చెల్లించాల్సి ఉంటుందని, ఆసుపత్రులకు రాయితీ ధరకు అందజేస్తామని ఎస్‌ఐఐ సీఈవో అదార్‌ పూనావాలా ఓ ప్రకటనలో తెలిపారు.

స్వల్పంగా పెరిగిన కేసులు
దిల్లీ: దేశంలో కొవిడ్‌ రోజువారీ కేసుల సంఖ్య శుక్రవారం స్వల్పంగా పెరిగింది. గత 24 గంటల్లో (గురువారం ఉదయం 8 నుంచి శుక్రవారం ఉ. 8గంటల వరకు) కొత్తగా 1,109 మంది కొవిడ్‌ బారిన పడగా.. 43 మరణాలు నమోదయ్యాయి. క్రితం రోజుతో పోలిస్తే 76 కేసులు పెరిగాయి. క్రియాశీలక కేసుల సంఖ్య 11,492 (0.03%)కి చేరింది. దేశవ్యాప్తంగా గురువారం 4,53,582 కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.

రాష్ట్రంలో కొత్తగా 35 కొవిడ్‌ కేసులు
ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో కొత్తగా 35 కొవిడ్‌ కేసులు నమోదు కాగా.. మొత్తం బాధితుల సంఖ్య 7,91,461కి పెరిగింది. తాజాగా మరో 36 మంది కోలుకున్నారు. ఈ నెల 8 సాయంత్రం 5.30 గంటల వరకూ నమోదైన కరోనా సమాచారాన్ని డీహెచ్‌ డాక్టర్‌ శ్రీనివాసరావు శుక్రవారం వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని