AP Cabinet: అంబటితో మొదలై.. రజనితో ముగింపు

కొత్తగా మంత్రి పదవులు దక్కించుకున్న నాయకుల ముఖాల్లో మెరుపులు... ఆప్తులు, ఆత్మీయుల అభినందనలు... అభిమానులు, కార్యకర్తల కేరింతలు... పదవి కోల్పోయిన మాజీ మంత్రుల ముఖాల్లో కొరవడిన కాంతులు... తప్పనిసరై ఆలింగనాలు..

Updated : 12 Apr 2022 05:56 IST

అక్షర క్రమంలో సాగిన మంత్రుల ప్రమాణ స్వీకారం
వెలిగిన కొత్త ముఖాలు
తాజా మాజీల్లో కొరవడిన కాంతులు

ఈనాడు, అమరావతి: కొత్తగా మంత్రి పదవులు దక్కించుకున్న నాయకుల ముఖాల్లో మెరుపులు... ఆప్తులు, ఆత్మీయుల అభినందనలు... అభిమానులు, కార్యకర్తల కేరింతలు... పదవి కోల్పోయిన మాజీ మంత్రుల ముఖాల్లో కొరవడిన కాంతులు... తప్పనిసరై ఆలింగనాలు... ముక్తసరి పలకరింపులు... ఇవి కొత్త మంత్రివర్గ ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా కనిపించిన దృశ్యాలు. రాజధాని అమరావతిలో సచివాలయం పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో ప్రత్యేకంగా తీర్చిదిద్దిన వేదికపై కొత్త మంత్రులతో గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ సోమవారం ఉదయం ప్రమాణ స్వీకారం చేయించారు. నిర్ణయించుకున్న ముహూర్తానికి కార్యక్రమం మొదలైంది. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఉదయం 11.22కి సభా ప్రాంగణానికి చేరుకొని.. 11.27కి గవర్నర్‌తో కలసి వేదికపైకి వచ్చారు. అక్షర క్రమంలో అంబటి రాంబాబుతో మొదలై... విడదల రజనితో ప్రమాణ స్వీకారోత్సవం ముగిసింది. అంజాద్‌ బాషా అల్లా సాక్షిగా ప్రమాణం చేయగా, మిగతా వారు దైవసాక్షిగా ప్రమాణం చేశారు. ఆదిమూలపు సురేష్‌, ఉషశ్రీ చరణ్‌, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆంగ్లంలో, మిగతా వారంతా తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమం ముగిశాక గవర్నర్‌, ముఖ్యమంత్రి, మంత్రులు ఫొటో దిగారు. ఆ తర్వాత తేనీటి విందులో పాల్గొన్నారు.

తడబాట్లు... పొరపాట్లు!
తెలుగులో ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ‘సార్వభౌమాధికారం’, ‘అంతఃకరణశుద్ధి’ పదాలు పలికేటప్పుడు తడబడటం గతంలో చాలా సార్లు జరిగింది. ఈసారి ఒక్క బొత్స సత్యనారాయణ ఆ రెండు పదాలు పలికేటప్పుడు కొంచెం తొట్రుపడ్డారు తప్ప, మిగతావారంతా ఆ పదాల్ని జాగ్రత్తగానే పలికారు. కారుమూరి నాగేశ్వరరావు... శాసనము ద్వారా నిర్మితమైన అని కాకుండా.. ‘నిర్మాతమైన’ అని పలికారు. ‘ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మంత్రిగా’ అనకుండా... ‘ఆంధ్ర రాష్ట్ర మంత్రిగా’ అని చెప్పారు. ఆర్కే రోజా, విడదల రజని ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు కొంత భావోద్వేగానికి గురైనట్లు కనిపించారు. ‘ప్రమాణం చేస్తున్నాను’ అని చెప్పాల్సిన చోట... ‘ప్రమాణ స్వీకారం చేసి చెబుతున్నాను’ అని రోజా చదివారు. ‘కర్తవ్యాన్ని’ అని చదివేటప్పుడు విశ్వరూప్‌ కొంత తొట్రుపడ్డారు. ప్రమాణ స్వీకారం చేసేందుకు కొత్త మంత్రుల పేర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ పిలిచారు. ‘తానేటి వనిత’ పేరుని ‘తేనేటి వనిత’ అని పిలిచారు.

పిలిచింది రామలింగేశ్వరరావు అని... ప్రమాణం చేసింది రాజా అని..!
మంత్రి దాడిశెట్టి రాజా పేరు విషయంలో కొంత గందరగోళం నెలకొంది. ప్రభుత్వం విడుదల చేసిన కొత్త మంత్రుల జాబితాలో ఆయన పేరు దాడిశెట్టి రామలింగేశ్వరరావు అని ఉంది. వేదికపైకి పిలిచేటప్పుడు సీఎస్‌ సమీర్‌శర్మ ఆయన పేరుని... దాడిశెట్టి రామలింగేశ్వరరావు అనే పలికారు. కానీ ఆయన మాత్రం ‘దాడిశెట్టి రాజా అనే నేను’.. అని ప్రమాణ స్వీకారం చేశారు. రికార్డులో ఒక పేరు ఉంటే... ఆయన మరో పేరుతో ప్రమాణ స్వీకారం చేయడం సాంకేతికంగా సమస్య కావొచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

‘సాక్షి’కే ప్రత్యేకం..!
మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవం కవరేజికి మీడియా ప్రతినిధుల్ని ఆహ్వానించే విషయంలో సమాచార పౌర సంబంధాల శాఖ వివక్ష ప్రదర్శించింది. ఒక్కో సంస్థ నుంచి ఇద్దరు రిపోర్టర్లకు మాత్రమే పాస్‌లు ఇస్తామని, ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లకు ప్రవేశం లేదని, ఫొటోలు, వీడియోలు తామే ఇస్తామని మీడియా సంస్థలకు ఆదివారం సందేశాలు పంపింది. అదనంగా మరో పాస్‌ ఇవ్వమని అడిగినా ఇవ్వలేదు. కానీ ప్రమాణ స్వీకారోత్సవానికి ‘సాక్షి’ ఛానల్‌, సాక్షి పత్రిక ఫొటోగ్రాఫర్‌లు, వీడియోగ్రాఫర్లలతో పాటు, మరికొన్ని ఛానళ్లకూ కెమెరామెన్లు, రిపోర్టర్లకు ప్రత్యేక ప్రవేశం కల్పించింది. ఒక సంస్థకు రెండే పాస్‌లు అన్న నిబంధన పక్కన పెట్టి ‘సాక్షి’ పత్రిక, ఛానళ్లకు ఎక్కువ పాస్‌లు జారీ చేశారు. గతంలోనూ పలు సందర్భాల్లో ఇలాగే జరిగింది.


తాజా మాజీల్లో హాజరైంది కొందరే..

కొత్త మంత్రివర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి తాజా మాజీ మంత్రుల్లో కొందరు హాజరుకాలేదు. మాజీ మంత్రులు ధర్మాన కృష్ణదాస్‌, శంకరనారాయణ, పేర్ని నాని, కొడాలి నాని, కన్నబాబు, వెలంపల్లి శ్రీనివాస్‌, అవంతి శ్రీనివాస్‌, పుష్పశ్రీవాణి హాజరయ్యారు. మంత్రివర్గంలోకి తీసుకోకపోవడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి, సుచరితలతో పాటు, అనిల్‌కుమార్‌ యాదవ్‌, శ్రీరంగనాథరాజు హాజరుకాలేదు. హాజరైన తాజా మాజీ మంత్రుల ముఖాలు కూడా దిగాలుగా ఉన్నాయి. మంత్రి పదవులు ఆశించి నిరాశ చెందిన ఎమ్మెల్యేలు కూడా రాలేదు. ప్రమాణ స్వీకారోత్సవానికి వారి కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం చేసి వచ్చాక రోజా... తన కుమార్తెను దగ్గరకు పిలిచి, ఆలింగనం చేసుకుని ఆనందం పంచుకున్నారు. రోజా ప్రమాణ స్వీకారం చేసి వచ్చాక... కరచాలనం చేసేందుకు సహచర మంత్రుల దగ్గరకు వెళ్లగా అంబటి రాంబాబు లేచి సరదాగా సెల్యూట్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని