వైద్య అనుబంధ కోర్సుల మండలి ఏర్పాటు

వైద్య ఆరోగ్య శాఖలో కీలక మండలి (కౌన్సిల్‌) రాబోతుంది. వైద్యులకు ఉన్న మాదిరిగా అనుబంధ కోర్సులు పూర్తి చేసిన వారి కోసం ప్రత్యేకంగా మండలి (కౌన్సిల్‌) ఏర్పాటు చేస్తూ వైద్య ఆరోగ్య శాఖ సోమవారం

Updated : 19 Apr 2022 06:58 IST

ఇక్కడే అభ్యర్థుల రిజిస్ట్రేషన్లు  
విద్యా సంస్థలకు గుర్తింపు జారీ
పారా మెడికల్‌ బోర్డు రద్దు

ఈనాడు-అమరావతి: వైద్య ఆరోగ్య శాఖలో కీలక మండలి (కౌన్సిల్‌) రాబోతుంది. వైద్యులకు ఉన్న మాదిరిగా అనుబంధ కోర్సులు పూర్తి చేసిన వారి కోసం ప్రత్యేకంగా మండలి (కౌన్సిల్‌) ఏర్పాటు చేస్తూ వైద్య ఆరోగ్య శాఖ సోమవారం గెజిట్‌ను విడుదల చేసింది. స్టేట్‌ అలైడ్‌ అండ్‌ హెల్త్‌ కేర్‌ కౌన్సిల్‌ (ఎస్‌ఏహెచ్‌సీ) ద్వారానే పారా మెడికల్‌ కోర్సులు నిర్వహించే సంస్థల గుర్తింపునకు తనిఖీలు జరుగుతాయి. ఈ మండలి ఏర్పడిన తర్వాత ప్రస్తుత ఏపీ పారా మెడికల్‌ బోర్డు రద్దయిపోతుందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మండలి ఏర్పాటుకు తక్షణమే చర్యలు మొదలుకానున్నాయి. వైద్యులు ఏపీ మెడికల్‌ కౌన్సిల్‌లో పేర్లు నమోదు చేసుకునే మాదిరిగా బయోటెక్నాలజిస్ట్‌, బయోకెమిస్ట్రీ (నాన్‌-క్లినికల్‌), మైక్రోబయాలజిస్ట్‌ (నాన్‌-క్లినికల్‌), మాలిక్యులర్‌ జెనిటిక్స్‌, సైటోటెక్నాలజీ, ఫోరెన్సిక్‌ సైన్స్‌ టెక్నాలజీ, హెమటో టెక్నాలజిస్ట్‌, మెడికల్‌ ల్యాబ్‌ టెక్నాలజిస్ట్‌, ఇతర డిప్లొమా, డిగ్రీ, పీజీ కోర్సులు పూర్తి చేసిన వారు కొత్తగా ఏర్పడే మండలిలో పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. విద్యార్థుల వయసు, కోర్సుల కాలపరిమితి ఇతర అంశాలను గెజిట్‌లో పేర్కొన్నారు. అభ్యర్థుల పేర్ల నమోదుకు రూ.200 చెల్లించాలి. అదనపు అర్హతలు ఉంటే మరో రూ.200 చెల్లించాలి. జాతీయ వైద్య కమిషన్‌ మార్గదర్శకాలు అనుసరించి ఏర్పడే మండలిలో వైద్య రంగానికి సంబంధించిన వారిని సభ్యులుగా ప్రభుత్వం నియమిస్తుంది. ఛైర్మన్‌ హోదాలో ఉన్న వారికి రూ.90 వేలు వేతనం కింద అందచేస్తారు. కార్యదర్శిగా జాయింట్‌ సెక్రటరీ హోదాలో ఉద్యోగ విరమణ చేసిన వ్యక్తిని నియమిస్తారు. వీరి నియామకాలకు ఉండాల్సిన అర్హతల గురించి గెజిట్‌లో పేర్కొన్నారు. కోర్సులు పూర్తి చేసిన ఈ మండలి ద్వారానే ధృవీకరణ పత్రాలు జారీ చేస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు