Loans: రాష్ట్రాల అప్పులపై కేంద్రం దృష్టి!

అనేక రాష్ట్రాలు అర్హతకు మించి అప్పులు చేయడంతో పాటు, కొన్ని రాష్ట్రాలు వినూత్న మార్గాల్లో రూ.వేల కోట్ల రుణాలు సమీకరిస్తున్న పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం వీటికి ముకుతాడు వేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది.

Updated : 20 Apr 2022 04:42 IST

అన్ని వివరాలూ పంపాలి
రాష్ట్రాలకూ కేంద్ర వ్యయ విభాగం లేఖ
ఆ తర్వాతే రుణాలకు అనుమతి ఇస్తామని స్పష్టీకరణ!

మీ రాష్ట్రానికి ఇంతవరకు ఉన్న మొత్తం ప్రజారుణం ఎంత? బహిరంగ మార్కెట్‌ నుంచి తీసుకున్న రుణం, కేంద్రసంస్థల నుంచి తీసుకున్న రుణం, పీఎఫ్‌, ఇతర డిపాజిట్ల రూపంలో తీసుకున్న మొత్తాలు, చిన్న మొత్తాల పొదుపు ద్వారా వాడుకున్నది కలిపి మొత్తం రుణం ఎంత?

- ఇవీ కేంద్ర ప్రభుత్వం అడిగిన ప్రశ్నలు


ఈనాడు, అమరావతి: అనేక రాష్ట్రాలు అర్హతకు మించి అప్పులు చేయడంతో పాటు, కొన్ని రాష్ట్రాలు వినూత్న మార్గాల్లో రూ.వేల కోట్ల రుణాలు సమీకరిస్తున్న పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం వీటికి ముకుతాడు వేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ప్రతి రాష్ట్రం తన అప్పులకు సంబంధించిన సమగ్ర సమాచారం పంపాలని, ఇంతవరకు ఎంత మొత్తం అప్పు ఉంది? వాటి చెల్లింపులకు ఉన్న ప్రణాళికలు ఏంటన్న సమగ్ర సమాచారమూ తమకు తెలియజేయాలని కేంద్రం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకూ తాఖీదులు పంపింది. కేంద్ర వ్యయవిభాగం మొత్తం 26 పేజీల్లో రాష్ట్రాల అప్పులకు సంబంధించిన సమగ్ర సమాచారం కోరింది. దాన్ని సేకరించేందుకు రాష్ట్ర ఆర్థికశాఖ ఉన్నతాధికారులు స్వయంగానే కసరత్తు సాగిస్తున్నారని సమాచారం. ఈ వివరాలు అందించేవరకూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బహిరంగ మార్కెట్‌ రుణాలు తీసుకునేందుకు అనుమతులు ఇవ్వబోమని కూడా కేంద్రం షరతు విధించినట్లు తెలిసింది. కేంద్ర వ్యయవిభాగం అనుమతిస్తే తప్ప రిజర్వుబ్యాంకు బహిరంగ మార్కెట్‌ రుణాల విషయంలో ముందుకు వెళ్లే అవకాశం లేనందున ఈ మంగళవారం అలాంటి వేలం ప్రక్రియ సాగలేదని ఆర్థిక నిపుణుల అంచనా. ఏప్రిల్‌లో కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే కొంత బహిరంగ మార్కెట్‌ రుణం తీసుకున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ రూ.4,000 కోట్లు ఇలా తీసుకుంది. ఇవి అడ్‌హాక్‌ అనుమతులేనని అంచనా వేస్తున్నారు. ప్రధానమంత్రి ఇటీవల కేంద్ర ఉన్నతాధికారులతో నిర్వహించిన సమావేశంలో కొన్ని రాష్ట్రాలు ఆర్థిక క్రమశిక్షణను ఉల్లంఘిస్తున్న విషయం ప్రస్తావించారు. ఏపీ కన్సాలిడేటెడ్‌ ఫండ్‌కు వచ్చే ఆదాయాన్ని వివిధ రకాలుగా మళ్లించి ఆ ఆదాయాన్ని ఎస్క్రో చేసి రూ.వేల కోట్లు అప్పులు యేటా తీసుకుంటున్న విషయంపైనా కేంద్రానికి ఫిర్యాదులు వెళ్లాయి. ఏపీఎస్‌డీసీ తరహా రుణవిధానాన్ని ఇప్పటికే కేంద్రం తప్పుబట్టింది. ఇప్పుడు బెవరేజస్‌ కార్పొరేషన్‌ రుణాల అంశమూ కేంద్రం దృష్టికి వెళ్లింది. ఇంతకాలం రాష్ట్రాలు దొడ్డిదోవన చేస్తున్న అప్పులపై పూర్తి దృష్టిసారించని కేంద్రం ఇప్పుడు తాజా పరిణామాల నేపథ్యంలో ఆ వివరాలన్నీ కోరింది. సాధారణంగా ప్రతి ఆర్థిక సంవత్సరం చివర్లో ఇలా అప్పుల వివరాలు కోరుతారు. కానీ ఏపీలో రుణాలు చాలా ఎక్కువ స్థాయిలో తీసుకుంటోందన్న ఫిర్యాదులు రావడంతో కేంద్రం మరింతగా దృష్టి సారించింది. అందుకే ఈసారి గతంలో ఎన్నడూ లేనంత ఎక్కువ వివరాలు కోరిందన్నది ఆర్థికశాఖ వర్గాల కథనం. కార్పొరేషన్ల పేరుతో, ఇతర మార్గాల్లో రుణాలు తీసుకుంటున్న వైనం ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే ఉందా.. అనే అనుమానంతోనే అన్ని రాష్ట్రాలకూ ఈ లేఖ పంపినట్లు తెలుస్తోంది.

కేంద్రం కోరిన సమాచారం:

ఈ రుణాలు తీర్చేందుకు ఏటా ఎంత అసలు, ఎంత వడ్డీ చెల్లిస్తున్నారు?

మొత్తం రుణం తీర్చేందుకు రాష్ట్రానికి ఉన్న చెల్లింపుల ప్రణాళికలేంటి? మొత్తం అప్పు ఎప్పటికి తీరుతుంది?

ఇది కాకుండా రాష్ట్ర కన్సాలిడేటెడ్‌ ఫండ్‌కు వచ్చే ఆదాయం ఎస్క్రో చేసి తీసుకున్న రుణాలు ఎన్ని?

కార్పొరేషన్ల ద్వారా ఎంత మొత్తం రుణాలు తీసుకున్నారు?

వేర్వేరు సంస్థల నుంచి డిపాజిట్ల రూపంలో తీసుకున్న మొత్తాలు ఎంత?

ఈ నిధులను ఎంతమేర పీడీ ఖాతాలకు మళ్లించారు? పీడీ ఖాతాల్లో ఉన్న మొత్తాలు ఎంత? ఈ అంశాలపై రాష్ట్ర ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వివరణ కోరేందుకు ప్రయత్నించినా ఫోన్లో అందుబాటులోకి రాలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని