Housing Expenses: ఇంటిఖర్చు ఇంతింత కాదయా

ఉప్పు.. పప్పు.. వంటనూనెలు.. కరెంటు బిల్లులు.. పెట్రోలు బాదుడు.. అబ్బో తలుచుకుంటేనే మధ్యతరగతి ప్రజలు వణికిపోతున్నారు. మూడేళ్ల నాటితో పోలిస్తే.. ఇంటి ఖర్చు సగటున నెలకు రూ.5,200కు పైగా పెరిగింది. అద్దె జీవులైతే ఏటా 5-10% పెంపుతో

Updated : 03 May 2022 15:42 IST

నానాటికీ పెరుగుతున్న ధరల భారం
నూనెల రూపంలో నెలకు రూ.270కి పైగా ఖర్చు
టీపొడి, సబ్బు, పేస్టు.. అన్నీ బరువే
పెట్రోలు, వంటగ్యాస్‌పైనా భారీ బాదుడు
ఈనాడు - అమరావతి

ప్పు.. పప్పు.. వంటనూనెలు.. కరెంటు బిల్లులు.. పెట్రోలు బాదుడు.. అబ్బో తలుచుకుంటేనే మధ్యతరగతి ప్రజలు వణికిపోతున్నారు. మూడేళ్ల నాటితో పోలిస్తే.. ఇంటి ఖర్చు సగటున నెలకు రూ.5,200కు పైగా పెరిగింది. అద్దె జీవులైతే ఏటా 5-10% పెంపుతో అదనపు భారం తప్పదు. వంటనూనెల మంటలు అంతా ఇంతా కాదు. లీటరు రూ.60 లోపు ఉండే పామోలిన్‌ ధర గతేడాది రూ.120కి చేరగా.. ఇప్పుడు ఏకంగా రూ.165 దాటేస్తోంది. పొద్దుతిరుగుడు నూనెదీ అదే దారి. ఏడాది కిందట పచారీ దుకాణానికి ఇచ్చే సొమ్ముతో పోలిస్తే రూ.1,000 నుంచి రూ.1,500 వరకు పెరుగుదల కనిపిస్తోంది. కరోనా ప్రభావంతో పట్టణాల్లో, పంటలు దెబ్బతిని గ్రామాల్లో ఉపాధి కరవైంది. అటు పనుల్లేక, ఇటు ఖర్చులు పెరిగి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

కందిపప్పు, మినప్పప్పు, పెసరపప్పుల ధరల్లో పెరుగుదల అధికంగా ఉంది. కరోనా సమయంలో ధరలు భారీగానే పెరిగినా.. తర్వాత కాస్త నెమ్మదించాయి. కొంతకాలంగా నిలకడగా సాగుతున్నాయి. ఈ ఏడాది కంది, సెనగల దిగుబడి తగ్గడంతో ఈ ప్రభావం ధరలపై పడొచ్చు. సగటున చూస్తే నెలకు కిలో చొప్పున కుటుంబంపై నెలకు రూ.65 చొప్పున భారం పెరిగింది. 5కిలోల గోధుమపిండి ప్యాకెట్‌ ధర 2019లో రూ.205 ఉండగా.. ప్రస్తుతం రూ.270 చొప్పున అమ్ముతున్నారు.

ఫోనే కాదు.. బిల్లూ మోగుతోంది

ఫోన్‌ బిల్లు మనకు తెలియకుండానే పెరిగిపోతోంది. గతంలో మూడు నెలలకు రూ.333 చొప్పున ఉండేది. అదే రీఛార్జి ఇప్పుడు రూ.666కి చేరింది. అంటే రెట్టింపైంది. దీనికి తోడు వై-ఫై రూపంలో రూ.500 వరకు తప్పదు. కేబుల్‌టీవీ ఖర్చు రూ.250 వరకు అదనం. ఒక్కో ఓటీటీ ఛానెల్‌కు సగటున రూ.500 చొప్పున నాలుగు తీసుకున్నా ఏడాదికి రూ.2వేలు. అంటే నెలకు రూ.166 చొప్పున ఖర్చవుతుంది. ఒక్కో కుటుంబంపైనా మొబైల్‌, కేబుల్‌ బిల్లుల రూపంలోనే రూ.600 వరకు అవుతున్నాయి. వై-ఫై, ఓటీటీ తీసుకున్న కుటుంబాలకు మొత్తంగా నెలకు రూ.1,000 చొప్పున తప్పట్లేదు.

బండి భారం నెలకు రూ.1,200 అధికం

చిరువ్యాపారులు, ప్రైవేటు ఉద్యోగులకు.. ద్విచక్ర వాహనం భారమైపోయింది. నెలకు సగటున 25 లీటర్ల పెట్రోలు లెక్కన చూసినా.. రూ.1,100 వరకు ఖర్చు పెరిగింది. 2019లో రూ.75లోపు ఉన్న పెట్రోలు ధర ప్రస్తుతం రూ.121 వరకు చేరింది. అంటే లీటరుకు రూ.45పైనే పెరిగింది. ఇంజిన్‌ ఆయిల్‌ ధర రూ.300 నుంచి రూ.500 వరకు చేరింది. సగటున రెండు నెలలకోసారి ఇంజిన్‌ ఆయిల్‌ మార్చినా.. నెల ఖర్చు రూ.100 చొప్పున పెరిగినట్లే. మొత్తంగా చూస్తే.. బండి భారం నెలకు రూ.1,200 పైనే పెరిగింది.


నూనెల మంటలతో.. మధ్యతరగతి వర్గాల జేబుకు చిల్లు

ఏడాది కిందటి నుంచి మండుతున్న వంటనూనెలు.. ఇప్పుడు రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధంతో మరింత ఎగిశాయి. పామోలిన్‌ను పెద్దమొత్తంలో సరఫరా చేసే ఇండోనేషియా ఎగుమతులపై నిషేధం విధించడంతో.. రాబోయే రోజుల్లో మరింత పెరుగుతుందనే ఆందోళన నెలకొంది. సగటున నెలకు మూడు లీటర్ల వంటనూనె వినియోగించే కుటుంబానికి మూడేళ్ల క్రితం రూ.270 మాత్రమే ఖర్చవగా.. ఇప్పుడు రూ.541 చొప్పున వెచ్చించాల్సి వస్తోంది. అంటే సగటున 100% పెరిగింది.


టీ తాగలేం

బ్రాండెడ్‌ టీపొడి ధర గతంలో కిలో రూ.540 వరకు ఉండేది. ప్రస్తుతం రూ.780 చొప్పున విక్రయిస్తున్నారు. అంటే ఏకంగా 44% పెంచేశారు. అల్లం, యాలకలు, తులసి, అశ్వగంధ తదితర ఉత్పత్తులతో తయారయ్యే ఒక సంస్థ టీపొడి ధర 2019లో కిలో రూ.380 ఉండేది. ఇప్పుడు రూ.560కి చేరింది. అంటే 47% పెరిగింది.


* పాల ధరలూ పెరిగాయి. గతంలో లీటరు రూ.55 నుంచి రూ.58 మధ్యన ఉండేవి. ఇప్పుడు సగటున రూ.64 నుంచి రూ.68 వరకు చేరింది. అంటే లీటరుకు రూ.10 చొప్పున పెరిగింది. నెలకు 30 లీటర్లకు రూ.300 అదనంగా ఖర్చవుతోంది.


* సబ్బులు, దుస్తులు ఉతకడానికి వాడే డిటర్జెంట్‌ ఉత్పత్తుల ధరలు 30% వరకు పెరిగినట్లు అంచనా. ఫేస్‌క్రీమ్‌, షాంపూ ధరలు రెట్టింపయ్యాయి.

* పాత్రలు కడిగే సబ్బు (700గ్రా) ధర మూడేళ్ల కిందట రూ.45 ఉంటే.. ఇప్పుడు రూ.68 అయింది. అంటే 51% పైగా  పెరిగింది.


* టూత్‌పేస్ట్‌ (ఆయుర్వేదిక్‌ 200గ్రా) ధర 2019లో రూ.79 ఉంటే.. ఇప్పుడు రూ.96పైనే ఉంది. ఇదీ 31%పైనే ఎగసింది. షాంపూల ధరలు 40%పైనే పెరిగాయి.


62% పెరిగిన వంటగ్యాస్‌

2019 మధ్యలో వంటగ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.600 వరకు ఉంది. ప్రస్తుతం సిలిండర్‌ ధర రూ.972 అయింది. అంటే మూడేళ్లలో 62% పెరిగింది. అప్పటితో పోలిస్తే రాయితీ కూడా తగ్గిపోయింది. రూ.15 చొప్పునే నామమాత్రంగా ఇస్తున్నారు. నెలకు ఒక సిలిండర్‌ లెక్కన చూస్తే.. ఒక్కో కుటుంబంపై రూ.372 చొప్పున భారం పడుతోంది.


30% మేర విద్యుత్తు బిల్లుల బాదుడు

పేద, మధ్యతరగతిపై కరెంటు బిల్లుల భారమూ అధికమైంది. గతంలో సగటున రూ.500 చొప్పున బిల్లు వచ్చే కుటుంబానికి ఇప్పుడు రూ.650 వరకు చేరింది. అంటే సగటున 30% వరకు పెరిగాయి. వీటి రూపంలో ఒక్కో కుటుంబానికి రూ.150 చొప్పున అదనపు ఖర్చు తప్పడం లేదు. ఏడాదికి రూ.1,800 వరకు ప్రభుత్వం బాదేస్తోంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని