APSRTC: ప్రైవేటువైపు ఆర్టీసీ!

ఏపీఎస్‌ఆర్టీసీ ప్రైవేటు వైపు వడివడిగా అడుగులు వేస్తోంది. ఉద్యోగుల జీతాలు ప్రభుత్వమే చెల్లిస్తున్న తరుణంలో.. సొంత బస్సుల సంఖ్యను మరింత పెంచి, ఆర్థికంగా నిలదొక్కుకోవాల్సి ఉన్నా.. అద్దె బస్సుల సంఖ్యను పెంచేస్తోంది.

Updated : 04 May 2022 04:19 IST

కొత్తగా 998 అద్దె బస్సులకు టెండర్లు

ఇప్పటికే సంస్థలో 25% అద్దె బస్సులు

35 శాతానికి పెరిగే అవకాశం

2 వేల డ్రైవరు పోస్టుల భర్తీకి మంగళం

ఈనాడు, అమరావతి: ఏపీఎస్‌ఆర్టీసీ ప్రైవేటు వైపు వడివడిగా అడుగులు వేస్తోంది. ఉద్యోగుల జీతాలు ప్రభుత్వమే చెల్లిస్తున్న తరుణంలో.. సొంత బస్సుల సంఖ్యను మరింత పెంచి, ఆర్థికంగా నిలదొక్కుకోవాల్సి ఉన్నా.. అద్దె బస్సుల సంఖ్యను పెంచేస్తోంది. ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వంలోని ప్రజా రవాణాశాఖ (పీటీడీ) ఉద్యోగులుగా మారడంతో.. ఖాళీలను ప్రభుత్వమే భర్తీచేయాలి. అద్దె బస్సులు తీసుకుంటే నియామకాలు అవసరం ఉండవు. ఒకేసారి 998 అద్దె బస్సులకు టెండర్లు పిలవడం సంస్థలో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఆర్టీసీలో 11,236 బస్సులు ఉన్నాయి. వీటిలో సొంత బస్సులు 8,972, అద్దెవి 2,264. మొత్తం బస్సుల్లో 3వేలు కాలం చెల్లిపోయాయి. వీటి స్థానంలో కొత్తవి తీసుకోవాలి. అయితే యాజమాన్యం అద్దె బస్సుల బాట పడుతోంది. ఇటీవల ఎన్ని బస్సులు అవసరమనే వివరాలను జిల్లాల నుంచి ఉన్నతాధికారులు తెప్పించుకున్నారు. దాదాపు 1,633 బస్సులు అవసరమని నివేదిక వచ్చింది. వీటిలో 998 బస్సులను అద్దెకు తీసుకోడానికి ఇటీవలే టెండర్లు పిలిచారు. ఈనెల 5 వరకు టెండర్ల దాఖలుకు గడువుంది. 10, 11 తేదీల్లో రివర్స్‌ వేలం నిర్వహించి.. వాటికి కిలోమీటరుకు చెల్లించే ధరలను ఖరారు చేస్తారు. ఈ అద్దె బస్సులకు తోడు.. ఇప్పటికే టెండర్లు ఖరారుచేసి, ఆర్డర్‌ ఇచ్చిన 100 విద్యుత్‌ ఏసీ అద్దె బస్సులూ త్వరలో రానున్నాయి. అద్దె బస్సుల్లో పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు కలిపి 617 బస్సులు ఉన్నాయి.

ప్రైవేటు వాటా పెంచేలా తీర్మానం

ఆర్టీసీలో 25% మాత్రమే అద్దె బస్సులు తీసుకోవాలని, మిగిలినవి సొంతవే ఉండాలనే నిబంధన ఉండేది. కొంతకాలం క్రితం పాలకవర్గ సమావేశంలో అద్దె బస్సుల వాటాను 35%కు పెంచుతూ తీర్మానించి, దాన్ని బయటపడకుండా జాగ్రత్త పడ్డారు. ఇప్పుడు 998 అద్దె బస్సులు ఎలా తీసుకుంటున్నారని ఆరా తీయగా.. తీర్మానం విషయం బయటకు వచ్చింది. 2020 మార్చిలో 250 బస్సులు కొన్నారు. తర్వాత కొత్త బస్సులపై దృష్టి పెట్టలేదు. బీఎస్‌-6 వాహనాలు అందుబాటులోకి వచ్చాక ఆర్టీసీ సొంత బస్సులు తీసుకోలేదు.

ఖాళీల భర్తీ లేనట్లే

ఆర్టీసీలో కొంతకాలంగా ఖాళీ పోస్టుల భర్తీ జరగట్లేదు. 2వేల డ్రైవర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. డ్రైవర్ల కొరతను అధిగమించేందుకు ప్రతి డిపో పరిధిలో ఆన్‌కాల్‌ డ్రైవర్లను అందుబాటులో ఉంచుకున్నారు. అంటే డ్రైవర్ల కొరత ఉన్నపుడు ప్రైవేటు డ్రైవర్లకు రోజువారీగా విధులు కేటాయిస్తున్నారు. ఇందుకు వారికి రోజుకు రూ.800 చెల్లిస్తున్నారు. ఆర్టీసీ నిబంధనల ప్రకారం ఒక్కో బస్సుకు సగటున 2.6 మంది డ్రైవర్లు అవసరం. కనీసం ఇద్దరైనా ఉండాలి. కొత్తగా తీసుకునే 998 అద్దె బస్సుల్లో డ్రైవర్లు బయటివారే ఉంటారు. అంటే దాదాపు 2వేల మంది ప్రైవేటు డ్రైవర్లు రానున్నారు. దీనివల్ల ఆర్టీసీలో 2వేల డ్రైవర్ల పోస్టుల భర్తీ ఉండదని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి.


మనకూ లండన్‌ విధానం

బ్రిటన్‌ రాజధాని లండన్‌లో ట్రాన్స్‌పోర్ట్‌ ఫర్‌ లండన్‌ (టీఎఫ్‌ఎల్‌) విధానం ఉండగా, దీన్ని మన రాష్ట్రంలో అమలుచేయాలని భావిస్తున్నట్లు ఆర్టీసీ వర్గాలు చెబుతున్నాయి. టీఎఫ్‌ఎల్‌లో దాదాపు అన్నీ ప్రైవేటు బస్సులే ఉంటాయి. రూట్ల వారీగా ప్రైవేటు బస్సులకు అవకాశం కల్పించి, ప్రజారవాణా అందుబాటులో ఉంచుతారని, వాటిలో ఛార్జీలు.. ఎప్పుడు, ఎక్కడ తిరగాలనేది టీఎఫ్‌ఎల్‌ అథారిటీ నిర్ణయిస్తుంది. వేల బస్సులను 200-300 సిబ్బందితో పర్యవేక్షిస్తుంటారు. ఈ విధానం ఇక్కడ అమలు చేయాలంటే రెగ్యులర్‌ సిబ్బందిని క్రమంగా తగ్గించి, సొంత బస్సులకు బదులు అద్దె బస్సులు పెంచుకుంటూ పోతారని ఉద్యోగ సంఘాలు    చెబుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని