Petrol Prices: నాడు విరుచుకుపడ్డారు.. ఇప్పుడేమంటారు?

నాలుగేళ్లలో పెట్రోలు, డీజిల్‌పై లీటరుకు ఆరేడు రూపాయలు చొప్పున పెంచడం ద్వారా చంద్రబాబు బాదుడే బాదుడు.. తమిళనాడు, తెలంగాణ, కర్ణాటకల్లో మన రాష్ట్రం కంటే లీటరుకు రూ.7 తక్కువకే

Updated : 06 May 2022 05:38 IST

పెట్రోలు, డీజిల్‌పై భారీగా పన్నుల బాదుడు

ధరల్లో దేశంలోనే మొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్‌

కేంద్ర ఎక్సైజ్‌ సుంకాన్ని మించి రాష్ట్ర పన్నులు

ఏడాది రాబడి.. 2021-22 తొలి 9 నెలల్లోనే

రాష్ట్ర ఖజానాకు రూ.11వేల కోట్లు

ఈనాడు - అమరావతి

నాలుగేళ్లలో పెట్రోలు, డీజిల్‌పై లీటరుకు ఆరేడు రూపాయలు చొప్పున పెంచడం ద్వారా చంద్రబాబు బాదుడే బాదుడు.. తమిళనాడు, తెలంగాణ, కర్ణాటకల్లో మన రాష్ట్రం కంటే లీటరుకు రూ.7 తక్కువకే దొరుకుతోంది. దేశంలో ఎక్కడా లేని రేట్లు ఆంధ్రప్రదేశ్‌లోనే కనిపిస్తున్నాయి.

- నాడు ప్రజా సంకల్ప యాత్రలో ప్రతిపక్ష నేతగా జగన్‌ చెప్పిన మాటలు

2019 మే నెలలో జగన్‌ సీఎం అయ్యే నాటికి తాడేపల్లిలో లీటరు పెట్రోలు ధర రూ.76.89 ఉండగా.. ఇప్పుడు రూ.120.95 అయింది. లీటరుపై రూ.44.08 (57.33%) పెరిగింది. అప్పట్లో రూ.71.50 చొప్పున ఉన్న డీజిల్‌ ధర ప్రస్తుతం రూ.106.58 అయింది. అంటే లీటరుకు రూ.35.10 (49.09%) పెరిగింది. ప్రతిపక్షనేతగా ఉన్న సమయంలో పెట్రోలు, డీజిల్‌ రేట్లపై బాదుడే బాదుడంటూ ప్రభుత్వంపై విరుచుకుపడిన జగన్‌.. తాను అధికారం చేపట్టాక వాటి ధరల్ని తగ్గించేందుకు తీసుకున్న చర్యలే లేవు సరికదా మరింత భారం వేశారు. సీఎంగా ప్రమాణస్వీకారం చేసే నాటికి పెట్రోలు, డీజిల్‌పై అదనపు వ్యాట్‌ లీటరుకు రూ.2 మాత్రమే ఉండగా.. దాన్ని రూ.4 చేశారు. రహదారి అభివృద్ధి నిధి పేరుతో లీటరుకు రూపాయి, దానిపై వ్యాట్‌ అదనమంటూ మరింత వడ్డించారు.

గతేడాది నవంబరులో కేంద్రం పెట్రోలుపై లీటరుకు రూ.5, డీజిల్‌పై రూ.10 చొప్పున తగ్గించింది. దీంతో అధిక శాతం రాష్ట్రాలు వ్యాట్‌ తగ్గించాయి. అయినా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వినియోగదారులపై ఇసుమంత కనికరం కూడా చూపలేదు. పైగా కేంద్ర చర్యలతో రాష్ట్ర ఆదాయం పడిపోతోందని ముఖ్యమంత్రి జగన్‌ విమర్శలకు దిగారు.

అప్పులపైనే ఆధారపడుతున్న రాష్ట్ర సర్కారు.. పెట్రో ఉత్పత్తుల అమ్మకాల ద్వారా ఆదాయాన్ని అంతకంతకూ పెంచుకుంటోంది. ప్రత్యక్ష పన్నుల బాదుడులో కేంద్రాన్ని మించిపోయింది. పెట్రోలు, డీజిల్‌ అమ్మకాలపై పన్నుల ద్వారా 2020-21లో 12 నెలల్లో వచ్చిన రాబడిని.. 2021-22లో తొలి తొమ్మిది నెలల్లోనే రాబట్టింది. పన్నుల రూపంలో వినియోగదారుల్ని పిండేయడంలో 45% వృద్ధి నమోదు చేసింది. పెట్రోలు, డీజిల్‌పై వ్యాట్‌, అదనపు వ్యాట్‌, రోడ్డు సుంకం, దానిపై వ్యాట్‌ రూపంలో రూ.10,920 కోట్లను వసూలు చేసింది. కేంద్రం పెట్రో ఉత్పత్తులపై ఎంత ధర పెంచితే అందుకు అనుగుణంగా పన్ను రూపంలో రాష్ట్రానికి వచ్చే ఆదాయం పెరుగుతోంది.

పన్ను బాదుడు అధికమే
వ్యాట్‌తోపాటు అదనపు వ్యాట్‌, రహదారి సుంకం అంటూ అధిక మొత్తంలో బాదుతుండటమే ధరల పెరుగుదలకు ప్రధాన కారణం. కేంద్రం వసూలు చేసే ఎక్సైజ్‌ సుంకాన్ని మించి పన్నులు విధిస్తోంది.

* రాష్ట్ర విభజన తర్వాత తెదేపా ప్రభుత్వ హయాంలో 2015 ఫిబ్రవరి 5న పెట్రోలు, డీజిల్‌పై లీటరుకు రూ.4 చొప్పున అదనపు వ్యాట్‌ విధించారు. 2018లో దేశవ్యాప్తంగా పెట్రోలు, డీజిల్‌ ధరలు పెరిగాయి. ఈ నేపథ్యంలో అదనపు వ్యాట్‌ను లీటరుకు రూ.4 నుంచి రూ.2కి తగ్గిస్తూ 2018 సెప్టెంబరులో ఉత్తర్వులు జారీ అయ్యాయి.

* వైకాపా ప్రభుత్వం వచ్చాక మళ్లీ అదనపు వ్యాట్‌ను పెంచింది. లీటరు పెట్రోలుపై 31% వ్యాట్‌, రూ.4 అదనపు వ్యాట్‌, రూ.1 రోడ్డు అభివృద్ధి సుంకం (దీనిపై వ్యాట్‌ అదనం)గా పిండుతోంది. పొరుగునున్న కర్ణాటకలో 25.92% వ్యాట్‌ మాత్రమే ఉంది. తమిళనాడులో 13% వ్యాట్‌తోపాటు లీటరుకు రూ.11.52 చొప్పున అదనపు వ్యాట్‌ తీసుకుంటోంది.

* డీజిల్‌పై లీటరుకు ఆంధ్రప్రదేశ్‌లో 22.25% వ్యాట్‌, లీటరుకు రూ.4 అదనపు వ్యాట్‌, రోడ్డు అభివృద్ధి సుంకం రూ.1 (దీనిపై వ్యాట్‌ అదనం) చొప్పున పిండేస్తున్నారు. కర్ణాటకలో 14.34% వ్యాట్‌ మాత్రమే వసూలు చేస్తున్నారు. తమిళనాడులో 11% వ్యాట్‌తోపాటు లీటరుకు రూ.9.62 అదనపు వ్యాట్‌గా వసూలు చేస్తోంది.

కేంద్రాన్ని మించి బాదేస్తున్న రాష్ట్రం
లీటరు పెట్రోలు అమ్మకంపై ఎక్సైజ్‌ సుంకం ద్వారా కేంద్రం రూ.27.90 వసూలు చేస్తుంటే.. రాష్ట్ర ప్రభుత్వం అంతకు మించి అన్నట్లు రూ.31.30 వరకు పిండుకుంటోంది. డీజిల్‌పైనా కేంద్రం కంటే లీటరుకు ఎక్కువే దండుకుంటోంది. ఈ బాదుడులో గతంలో కేంద్రం ముందుండగా.. నవంబరు నుంచి ఒక అడుగు వెనక్కేసింది. ఇప్పుడు అందరికంటే నేనే ముందు అంటూ ఆంధ్రప్రదేశ్‌ ఇంధన వినియోగదారుల నడ్డి విరుస్తోంది.


ఏడాదికి రూ.15 వేల కోట్ల వరకు ఆదాయం

పెట్రోలు, డీజిల్‌ ధరలు పెరిగేకొద్దీ.. వాటిపై రాష్ట్ర పన్నుల ద్వారా ఆదాయమూ పెరుగుతుంది. అందుకే 2020-21లో రూ.11 వేల కోట్లకు పెరిగింది. 2021-22లో తొలి తొమ్మిది నెలల్లోనే ఏకంగా 10,920 కోట్లకు చేరింది.

* గతేడాది నవంబరులో చాలా రాష్ట్రాలు తమ వ్యాట్‌ను తగ్గించుకున్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్‌ మాత్రం పన్నుభారం తగ్గించకపోవడంతో వాటి కంటే ఆదాయం పెరగనుంది. రాష్ట్రానికి దీనిపై రూ.15 వేల కోట్ల వరకు రాబడి ఉంటుందని అంచనా.


ఎవరి బాదుడు వారిదే

పెట్రోలుపై పన్నుల బాదుడులో కేంద్ర, రాష్ట్రాలు పోటీపడుతున్నాయి. పెట్రోలు, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకం రూపంలో కేంద్రం.. వ్యాట్‌, అదనపు వ్యాట్‌, రోడ్డు సుంకాల ద్వారా రాష్ట్రాలు వేసే భారమే అత్యధికంగా ఉంటుంది. ఎక్సైజ్‌ సుంకాన్ని భారీగా పెంచడం ద్వారా గతేడాది నవంబరు వరకు కేంద్ర ఖజానాకు కాసుల వర్షమే కురిసింది. గతేడాది నవంబరులో లీటరు పెట్రోలుపై రూ.5, డీజిల్‌పై రూ.10 చొప్పున ఎక్సైజ్‌ సుంకం తగ్గించడంతో.. దాని రాబడి స్వల్పంగా తగ్గింది.


మేమేమీ పెంచలేదంటూనే.. ఇంత బాదేశారే!

ఒకరేమో ధర ఇబ్బడిముబ్బడిగా పెంచి, అరకొరగా తగ్గించి, ధర్నాలు చేస్తున్నారని.. మరొకరు తమ హయాంలో ఎంత పెంచామనేది మరచి రాజకీయాలు చేస్తున్నారని ఏకంగా రాష్ట్ర ప్రభుత్వమే ప్రకటనలు ఇచ్చింది. గత ప్రభుత్వం విధించిన వాటి కంటే.. తమ ప్రభుత్వం రోడ్ల అభివృద్ధి కోసం లీటరుకు రూపాయి మాత్రమే సుంకంగా విధించామని అందులో చెప్పింది. అవన్నీ అవాస్తవాలేనని, వివిధ రాష్ట్రాల్లో పన్నుల వివరాలపై కేంద్రం మార్చి 24న లోక్‌సభకు ఇచ్చిన సమాధానమే స్పష్టం చేస్తోంది. పెట్రోలు, డీజిల్‌నే కాదు, సహజవాయువునూ వదల్లేదని పన్నుల వివరాలు వెల్లడిస్తున్నాయి.


దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ఏపీలోనే ఎక్కువ

పెట్రోలు, డీజిల్‌ రేట్లు ఆంధ్రప్రదేశ్‌లోనే అత్యధికంగా ఉన్నాయని నాడు ప్రతిపక్ష నేతగా జగన్‌మోహన్‌రెడ్డి అసెంబ్లీలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్ణాటక, తమిళనాడుల్లో ఏ రేట్లున్నాయో చూడమని పత్రాలు కూడా చూపించారు. ఇప్పుడు కూడా తమిళనాడు, కర్ణాటకలో ఆంధ్రప్రదేశ్‌ కంటే తక్కువ ధరలకే పెట్రోలు, డీజిల్‌ లభిస్తోంది. అయినా జగన్‌ గతంలో తాను చేసిన వ్యాఖ్యలను మరిచినట్లున్నారు. సరిహద్దు ప్రాంతాల్లోని ప్రజలు పొరుగు రాష్ట్రాల్లోని బంకుల నుంచి ఇంధనం తెచ్చుకునే పరిస్థితులున్నా బాదుడు నుంచి వెనక్కి తగ్గడం లేదు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని