CM Jagan: వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లకుత్వరలోనే మీటర్లు

రాష్ట్రవ్యాప్తంగా అన్ని వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లకు త్వరలోనే మీటర్లను ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. మీటర్ల ఏర్పాటు ద్వారా రైతులకు నాణ్యమైన విద్యుత్తు అందడంతోపాటు సేవలు మరింత మెరుగుపడతాయని వివరించారు.

Updated : 07 May 2022 05:37 IST

శ్రీకాకుళం జిల్లాలో పైలట్‌ ప్రాజెక్టు విజయవంతమైంది
మే 11న మత్స్యకార భరోసా, 16న రైతు భరోసా
వ్యవసాయ సమీక్షలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి

ఈనాడు, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా అన్ని వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లకు త్వరలోనే మీటర్లను ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. మీటర్ల ఏర్పాటు ద్వారా రైతులకు నాణ్యమైన విద్యుత్తు అందడంతోపాటు సేవలు మరింత మెరుగుపడతాయని వివరించారు. ఈ విషయమై రాజకీయ లబ్ధి కోసం కొందరు చేసే దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని, ఆర్‌బీకేల ద్వారా రైతుల్లో అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. ‘వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లకు మీటర్ల ఏర్పాటుపై శ్రీకాకుళం జిల్లాలో చేపట్టిన పైలట్‌ ప్రాజెక్టు విజయవంతమైంది. సుమారు 30% విద్యుత్తు ఆదా అయింది. కనెక్షన్లు పెరిగినా 33.75 మిలియన్‌ యూనిట్ల కరెంటు ఆదా అయింది’ అని చెప్పారు. రైతు భరోసా, పంటల బీమా చెల్లింపు, రాయితీపై వ్యవసాయ ఉపకరణాలు, ఖరీఫ్‌ సన్నద్ధత తదితర అంశాలపై శుక్రవారం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ సమీక్షించారు. ఈ సందర్భంగా వెదురుతో తయారు చేసిన ఉత్పత్తులను వ్యవసాయ మిషన్‌ వైస్‌ఛైర్మన్‌ నాగిరెడ్డి సీఎంకు చూపించారు. తోటబడి కార్యక్రమంలో భాగంగా మామిడి, అరటిపై రూపొందించిన కరదీపికలను ముఖ్యమంత్రి విడుదల చేశారు. మే 11న మత్స్యకార భరోసా, 16న రైతు భరోసా, జూన్‌ 15 లోగా రైతులకు పంటల బీమా చెల్లించాలని చెప్పారు. జూన్‌ మొదటి వారంలో రైతులకు 3వేల ట్రాక్టర్లు, 402 వరికోత యంత్రాలను సామాజిక అద్దె యంత్రాల కేంద్రాలకు అందజేయనున్నట్లు వివరించారు.

పంట సాగుదారు హక్కు పత్రాలపై ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి జగన్‌ అధికారులకు చెప్పారు. దీని వల్ల రైతు హక్కులకు ఎలాంటి భంగం కలగదనే విషయాన్ని తెలియజేయాలని, తన తరపున లేఖను కూడా వారికి పంపాలని సూచించారు. ‘ఆర్‌బీకేల్లో ఆరు నెలల ఇంటర్న్‌షిప్‌ కోర్సులను విశ్వవిద్యాలయాల ద్వారా రూపొందించాలి. వారి పరిశీలన, సలహాలతో వ్యవస్థ మరింత మెరుగుపడుతుంది. నిరంతర పరిశోధనలూ ఉంటాయి’ అని తెలిపారు. ‘చిన్న, సన్నకారు రైతులకు రాయితీపై వ్యవసాయ ఉపకరణాల పంపిణీపై ప్రణాళిక రూపొందించండి. ప్రతి ఆర్‌బీకే పరిధిలో పరికరాలు అందేలా చూడాలి’ అని ఆదేశించారు. ‘కిసాన్‌ డ్రోన్ల నిర్వహణ, వినియోగంపై ప్రత్యేకంగా డ్రోన్‌ కమ్యూనిటీ హైరింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసి.. వారికి శిక్షణ ఇవ్వాలి. అనంతరం ధ్రువీకరణ పత్రాలూ అందించాలి. డ్రోన్‌తో పురుగుమందులు, ఎరువులు ఎలా వేయాలో రైతులకు వీడియోల ద్వారా అవగాహన కల్పించాలి. ఈ ఏడాదే డ్రోన్లను వినియోగించే పరిస్థితి రావాలి’ అని సూచించారు. ‘చిరు ధాన్యాలు సాగు చేసే రైతుల్ని ప్రోత్సహించాలి. ఉత్పత్తులకు అదనపు విలువ జోడించాలి. వినియోగం పెరిగేలా చూడాలి. అరకొర నీటి వసతులు ఉన్న ప్రాంతాల్లో పంటల మార్పిడిపై ప్రణాళిక రూపొందించండి’ అని సీఎం చెప్పారు. ఆర్‌బీకే నుంచి జిల్లాస్థాయి వరకు వ్యవసాయ సలహా మండళ్ల సమావేశాల నిర్వహణకు షెడ్యూలు రూపొందించుకోవాలని సూచించారు. ఎఫ్‌ఏఓ ఛాంపియన్‌ అవార్డుకు రైతు భరోసా కేంద్రాలను నామినేట్‌ చేయడాన్ని ఈ సందర్భంగా సీఎం అభినందించారు.

4% అధికంగా వ్యవసాయ ఉత్పత్తి

2020-21తో పోలిస్తే 2021-22 సంవత్సరంలో వ్యవసాయ ఉత్పత్తి 4% పెరిగిందని అధికారులు సీఎంకు వివరించారు. ‘171.7 లక్షల టన్నుల ఉత్పత్తి లభించింది. 66,803 హెక్టార్లలో మూడో పంటసాగు చేయడం రికార్డు. ఇది లక్ష హెక్టార్లు దాటే అవకాశం ఉంది. గతేడాదితో పోలిస్తే.. 477% పెరిగింది’ అని చెప్పారు. ‘వచ్చే ఖరీఫ్‌ సాగుకు కావాల్సిన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉన్నాయి. 6 లక్షల టన్నుల ఎరువుల్ని  సిద్ధం చేశాం. సాగునీటిని సకాలంలో విడుదల చేసేలా చర్యలు తీసుకుంటున్నాం’ అని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని