Andhra News: వైద్యం ఇక్కడ.. పరీక్షలు ఎక్కడ?
కడుపునొప్పితో విలవిల్లాడుతూ ప్రభుత్వాస్పత్రికి వెళ్తే.. స్కానింగ్ యంత్రం పనిచేయదు. చెయ్యో.. కాలో విరిగితే ఎక్స్రే గదికి తాళం వెక్కిరిస్తుంది. మెదడులో ఏదో సమస్య ఉందని డాక్టర్ ఎంఆర్ఐ పరీక్ష రాస్తే.. ఆ యంత్రం మూలపడి ఉంటుంది. సీటీ స్కాన్ పరిస్థితీ అంతే. ప్రభుత్వాస్పత్రుల్లో పలుచోట్ల వైద్యులున్నా, వ్యాధి నిర్ధారణ యంత్రాలు పనిచేయడం లేదు. ఎంతో డబ్బుపోసి ఏర్పాటుచేసినా కాలం చెల్లి మొరాయిస్తున్నవి కొన్ని.. నిపుణులు లేక వృథాగా పడి ఉన్నవి మరికొన్ని. ఖరీదైన ఎంఆర్ఐ, సీటీ స్కాన్లే కాదు.. ఎక్కువమందికి అవసరమయ్యే ఎక్స్రేలు, అల్ట్రాసౌండ్ పరీక్షలకూ చాలాచోట్ల దిక్కు ఉండట్లేదు.
ప్రభుత్వాస్పత్రుల్లో మూలపడిన యంత్రాలు
ఖరీదైన ఎంఆర్ఐ నుంచి సాధారణ ఎక్స్రే వరకూ అన్నీ ఇంతే
పలుచోట్ల గదులకు తాళాలు
వైద్య పరీక్షలు అందక.. సామాన్యులకు తంటాలు
ఇది కాకినాడ జీజీహెచ్లోని ఎంఆర్ఐ యంత్రం గది. 15 ఏళ్ల క్రితం ఏర్పాటుచేసిన ఈ యంత్రం 8 నెలలుగా పని చేయకపోవడంతో అక్కడకు వెళ్లేవారిని తాళమే పలకరిస్తోంది. ఒకప్పుడు దీనిపై రోజుకు 30 పరీక్షలు చేసేవారు. ఇది అందుబాటులో లేకపోవడంతో రోగులు బయట ఒక్కో స్కానింగ్కి రూ.5వేల వరకూ ఖర్చు పెట్టుకోవాల్సి వస్తోంది.
తెనాలిలోని జిల్లా ఆస్పత్రిలో 2008లో ఏర్పాటుచేసిన సీటీస్కాన్ పరికరం ఇది. దాదాపు రెండేళ్లుగా పనిచేయట్లేదు. రోజుకు 20 మంది రోగులకు ఇక్కడ పరీక్ష చేసేవారు. ప్రైవేటు సెంటర్లో రూ.3-4వేల మధ్య వసూలు చేస్తున్నారు.
కడుపునొప్పితో విలవిల్లాడుతూ ప్రభుత్వాస్పత్రికి వెళ్తే.. స్కానింగ్ యంత్రం పనిచేయదు. చెయ్యో.. కాలో విరిగితే ఎక్స్రే గదికి తాళం వెక్కిరిస్తుంది. మెదడులో ఏదో సమస్య ఉందని డాక్టర్ ఎంఆర్ఐ పరీక్ష రాస్తే.. ఆ యంత్రం మూలపడి ఉంటుంది. సీటీ స్కాన్ పరిస్థితీ అంతే. ప్రభుత్వాస్పత్రుల్లో పలుచోట్ల వైద్యులున్నా, వ్యాధి నిర్ధారణ యంత్రాలు పనిచేయడం లేదు. ఎంతో డబ్బుపోసి ఏర్పాటుచేసినా కాలం చెల్లి మొరాయిస్తున్నవి కొన్ని.. నిపుణులు లేక వృథాగా పడి ఉన్నవి మరికొన్ని. ఖరీదైన ఎంఆర్ఐ, సీటీ స్కాన్లే కాదు.. ఎక్కువమందికి అవసరమయ్యే ఎక్స్రేలు, అల్ట్రాసౌండ్ పరీక్షలకూ చాలాచోట్ల దిక్కు ఉండట్లేదు. దీంతో అప్పో సొప్పో చేసి.. ప్రైవేటు కేంద్రాల్లోనే పరీక్షలు చేయించుకోవాల్సిన అగత్యం ఏర్పడుతోంది. ఆ స్థోమత లేనివారికి సరైన వైద్యం అందక.. ప్రాణాల మీదకు వస్తోంది.
ఈనాడు-అమరావతి, యంత్రాంగం
రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రభుత్వాస్పత్రుల్లో వ్యాధి నిర్ధారణ గగన కుసుమంగా మారుతోంది. చాలా చోట్ల పరికరాలు మూలనపడి మొరాయిస్తున్నాయి. చికిత్స చేసేందుకు వైద్యులున్నా, వ్యాధి ఇదీ అని తేల్చిచెప్పే యంత్రాలు పనిచేయట్లేదు. కొన్నిచోట్ల యంత్రాలున్నా.. వాటిని పనిచేయించే సాంకేతిక నిపుణులు, పరీక్షల ఫలితాలను విశ్లేషించే రేడియాలజిస్టులు లేరు. కొత్త ఎంఆర్ఐ యంత్రం వస్తుందని కాకినాడ జీజీహెచ్ సూపరింటెండెంట్ చెబుతున్నా.. ఇదే మాట చెప్పి ఇప్పటికి ఇద్దరు సూపరింటెండెంట్లు మారారు. విశాఖ కేజీహెచ్లో ఎమ్మారై స్కాన్ కాలం చెల్లి తుక్కు అయిపోయింది. మూత్రపిండాల రోగులకు రక్తశుద్ధి చేసేందుకు అవసరమైన నీటిని అందించే ఆర్వో ప్లాంటు నెల్లూరు జీజీహెచ్లో పనిచేయడంలేదు. కొన్నిచోట్ల వైద్యులే చొరవ చూపి అందుబాటులో ఉన్న యంత్రాలతోనే అరకొరగా పరీక్షలు ముగిస్తున్నారు.
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం జిల్లా ఆస్పత్రిలో 2018లో ఏర్పాటు చేసిన సీటీ స్కాన్ యంత్రం రెండేళ్ల నుంచి పనిచేయట్లేదు. బాగుచేసే సాంకేతిక నిపుణులు లేకపోవడంతో ఆ గదికి ఇలా తాళాలు వేసేశారు. ప్రైవేటులో ఒక్కో స్కాన్కు రోగులకు రూ.2వేలు అవుతుంది. దీనిపై రోజుకు 50 స్కాన్లు తీసేవారు.
కాకినాడ జీజీహెచ్ ఓపీ విభాగంలోని 6 (ఎ) గదిలోని ఎక్స్రే యంత్రమిది. ఇది రెండేళ్ల నుంచి పనిచేయట్లేదు. 6బి, 8(3) గదుల్లో యంత్రాలున్నా.. అవీ రెండు నెలల నుంచి పనిచేయట్లేదు. మరమ్మతులు చేయకపోవడమే వీటి సమస్య. వీటిపై రోజుకు 120 ఎక్స్రేలు తీసేవారు. ఒక్కో ఎక్స్రేకు బయట రూ.500-600 వరకు ఖర్చవుతుంది.
అనకాపల్లి జిల్లా ఆస్పత్రిలో 2007లో ఏర్పాటుచేసిన సీటీ స్కానింగ్ పరికరం మరమ్మతులకు గురవ్వడం, విడిభాగాలు అందుబాటులో లేకపోవడంతో మూడేళ్లుగా పనిచేయట్లేదు. ఒక్కో స్కాన్కి ప్రైవేటు కేంద్రాల్లో రూ.1000 నుంచి 1,500 వరకు వసూలు చేస్తున్నారు.
ఒంగోలు సర్వజన ఆస్పత్రిలో పనిచేయని 800 ఎంఏ ఎక్స్రే యంత్రమిది. 2021లోనే పెట్టినా.. 6నెలల నుంచి పనిచేయట్లేదు. ఎందుకని అడిగితే.. మరమ్మతులు చేసే టెక్నీషియన్ రాలేదని చెబుతున్నారు. దీనిపై రోజుకు 70 ఎక్స్రేలు తీసేవారు.
కడప సర్వజన ఆస్పత్రిలోని 3 ఎక్స్రే యంత్రాలు కాలం చెల్లి ఏడాది నుంచి పనిచేయక ఆ గదికి ఇలా తాళం వేసేశారు. మిగిలిన రెండు యంత్రాలే దిక్కవడంతో.. రోగులు భారీగా ఎదురుచూడక తప్పట్లేదు.
భీమిలి సీహెచ్సీలో 2019లో ఏర్పాటు చేసిన అల్ట్రాసౌండ్ స్కాన్ పరికరం 9 నెలలుగా మొరాయిస్తోంది. దీంతో గర్భిణులు ప్రైవేటు సెంటర్ల మీదే ఆధారపడాల్సి వస్తోంది. అందుకు రూ.800 అవుతోంది.
నెల్లూరు బోధనాస్పత్రిలో ఆర్వో ప్లాంటు ఇలా పాడైపోయింది. ఫలితంగా డయాలసిస్ కేంద్రానికి తాళం పడింది. గత ఆరు నెలలుగా ఇదే పరిస్థితి. అంతకుముందు ఈ కేంద్రంలో రోజుకు 40 మందికి డయాలసిస్ చేసేవారు.
తిరుపతి జిల్లా పుత్తూరు సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఎక్స్రే యంత్రం ఆరు నెలలుగా పని చేయకపోవడంతో ఆ విభాగం ఇలా మూతపడింది. గతేడాది నవంబరులో కురిసిన భారీ వర్షాలకు యంత్రం తడిసిపోయి మరమ్మతులకు గురైంది. నిధుల లేమి కారణంగా అప్పటి నుంచి మరమ్మతు చేయలేదు. ఫలితంగా రోగులపై రూ.300-600 వరకు భారం పడుతోంది.
విశాఖ నగరానికే తలమానికమైన కేజీహెచ్లో 2010లో ఏర్పాటుచేసిన ఎంఆర్ఐ పరికరం పాడైంది. దాంతో అది ఆరు నెలలుగా పనిచేయడం లేదు. స్కానింగ్ అవసరమైన రోగులు ప్రైవేటు సెంటర్లలో చేయించుకుంటున్నారు. దీనికి పరీక్షను బట్టి రూ.2500 నుంచి రూ.8వేల వరకు ఖర్చవుతుంది.
ఏలూరు జిల్లా కేంద్రం ఆస్పత్రికి వచ్చిన గర్భిణులు పరీక్షల కోసం ఇలా వేచి ఉండాల్సి వస్తోంది. ఇక్కడ 2012లో అల్ట్రాసౌండ్ స్కానింగ్ యంత్రం ఏర్పాటుచేశారు. కానీ, రేడియాలజిస్టు అందుబాటులో లేక ఏడాదిన్నర నుంచి అది నిరుపయోగంగా మారిపోయింది.
ఒంగోలు సర్వజన ఆస్పత్రిలో చిత్రం ఇది. ఆమె కూర్చున్నది 500 ఎంఏ ఎక్స్రే యంత్రం. కానీ అది పనిచేయదు. అందుకని ఆమెను దానిపై కూర్చోబెట్టి.. పక్కనుంచి మరో పోర్టబుల్ యంత్రం ద్వారా ఇలా ఎక్స్రేలు తీస్తున్నారు. 500 ఎంఏ యంత్రాన్ని 2017లో ఏర్పాటుచేశారు. ఏడాది నుంచి అది తరచూ మొరాయిస్తూనే ఉంది.
పశ్చిమగోదావరి జిల్లా కేంద్రమైన భీమవరం ఏరియా ఆస్పత్రిలోని బయోకెమిస్ట్రీ ఎనలైజర్ చెడిపోయి రెండేళ్లయింది. దీన్ని బాగుచేయించేవారు లేరు. దీంతో రోగులు రక్తపరీక్షలన్నీ బయట చేయించుకోవాల్సి వస్తోంది. ఒక్కొక్కరికి రూ.300 నుంచి రూ.1000కి పైగా భారం పడుతోంది.
మచిలీపట్నం జిల్లా ఆస్పత్రిలోని 2డి ఎకో పరికరమిది. 2018లోనే ఇది ఆస్పత్రిలోకి వచ్చింది. కానీ, దీన్ని పనిచేయించే సాంకేతిక నిపుణులు గానీ, హృద్రోగనిపుణులు గానీ ఆస్పత్రిలో లేరు. దీంతో అప్పటినుంచీ ఇదిలా కవరు కూడా తీయకుండానే ఉండిపోయింది. రోగులు ప్రైవేటు కేంద్రాల్లో ఎకో చేయించుకోవాలంటే కనీసం రూ.1500 అవుతుంది.
టెండరు ద్వారా నిర్వహణ సంస్థను ఎంపిక చేస్తాం
ఆస్పత్రుల్లోని యంత్రాలు, పరికరాల పర్యవేక్షణ, మరమ్మతుల కోసం టెండర్ ద్వారా సంస్థను రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ఎంపిక చేయనుందని వైద్యవిధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ వినోద్కుమార్ తెలిపారు. ఆ సంస్థను ఎంపిక చేసిన ఒకటి, రెండు నెలల్లోనే ఆస్పత్రుల్లోని పరిస్థితులు సర్దుకుంటాయని, సాంకేతిక నిపుణుల కొరత కూడా తీరుతుందని వెల్లడించారు. విశాఖ కేజీహెచ్, కాకినాడ జీజీహెచ్లో ఎంఆర్ఐలకు సమస్యలు ఉన్నాయని, అవి పాతవి కావడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ప్రొఫెసర్ రాఘవేంద్రరావు తెలిపారు. కొత్తవాటిని సమకూర్చేందుకు ప్రతిపాదనలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!